Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహారాష్ట్రలోని ధూలె జిల్లాలో ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన ఆధారంగా తీసిన సినిమా ''పాష్ బంధ్''. ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్లు లేకుండా తీసిన సినిమా ఇది. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ప్లే అందించిన వారు ఆనంద్రాం. వీరే ఈ సినిమా దర్శకులు కూడా. చాలా చిన్న బడ్జెట్తో తీసిన సినిమా అని అర్థం అవుతుంది. అయితే ఇది ఒక నిజ జీవిత కథ అన్నది సినిమా చూసే ప్రేక్షకులు గుర్తుంచు కోవలసిన విషయం. ఒక మధ్యతరగతి స్త్రీ, ముగ్గురు పిల్లల తల్లి నిరంతరం భర్త దురహంకారానికి బలవుతూ ఎలా సమాజంలో బతుకుతూ తన భాద్యతలను నెరవేర్చుకోవాలని ప్రయత్నించిందో చెప్పే కథ ఇది. ఇందులో టెక్నికల్ పరంగా కొన్ని లోపాలు కనిపిస్తాయి. కాని స్త్రీ కోణంతో సినిమాలను ఎన్నుకునే ప్రయత్నంలో నాకు నచ్చిన చిత్రంగా దీన్ని తీసుకుంటాను. మరాఠీలో లోబడ్జెట్ సినిమాలు చాలా క్రమ శిక్షణతో తీస్తారు. ఎటువంటి హంగులు లేకుండా చిత్ర కథను నడిపిస్తారు. మరాఠీ చిత్ర నిర్మాణంలో ఒక నిజాయితీ ఉంటుంది. అందుకే ఫక్తు కమర్షియల్ సినిమాల మీద రోత పుట్టినప్పుడల్లా వెతుక్కుని మరాఠీ సినిమాలు చూడడం నాకు అలవాటు.
సునంద ఒక మధ్య తరగతి స్త్రీ. భవానీ జాదవ్ అనే వ్యక్తి భార్య. ఆమెకు ఇద్దరు మగపిల్లలు, ఒక అమ్మాయి. పిల్లలు ముగ్గురు పెద్దవాళ్ళే. భవాని అహంకారి. తనకు అనుకూలంగా అందరూ ఉండాలని కుటుంబంలోని వ్యక్తులందరూ తన తరువాతే అని అనుకునే సగటు మగాడు. భార్య అతని దష్టిలో కేవలం తన అవసరాలు తీర్చే వస్తువు. పిల్లలను కూడా అదే అహంకారంతో పెంచుతుంటూ ఉంటాడు. ఇంటి చాకిరి ఎంత చేసినా సునందకు భర్త దగ్గర తన్నులు, తిట్లు తప్పవు. సహజం గానే ఆమె కొడుకులు తండ్రిని ఇంటి పెద్దగా గౌరవిస్తూ అతని పట్ల భయభక్తులతో మెలుగుతుంటారు. వారి చిన్న చిన్న తప్పిదాలకు తండ్రి చేతిలో శిక్ష అనుభవిస్తూ కూడా తండ్రి అధికారం పట్ల వారికి గౌరవం ఉంటుంది. కూతురు మాత్రం తల్లికి సహాయం చేయాలని అది ఎలాగో తెలీక బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో పని కోసం ఒక అమ్మాయిని పెట్టుకుంటుంది సునంద. అయితే భర్త ఆ పనిపిల్ల పట్ల ఆకర్షితుడవుతాడు. సునందకు అనుమానం వచ్చినా ఏం చేయలేని స్థితి. మొదటి సారి వారిద్దరిని దగ్గరగా చూసి భర్తను ప్రశ్నిస్తే అతను ఆమెను దగ్గరకు తీసుకుని ఆమెది కేవలం అనుమానమని చెప్తూ ఆమెతో చాలా రోజుల తరువాత పడక పంచుకుంటాడు. సునంద భర్తను విపరీతంగా ప్రేమిస్తుంది, నమ్ముతుంది. పనికి చేరిన ఆ అమ్మాయి ఇంటి యజమాని బలహీనతలను ఆసరా చేసుకుని ఆ ఇంటి మీద, పిల్లల మీద కూడా పెత్తనం మొదలెడుతుంది. ఇంటికి సంబంధించిన ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం, తానే యజమానిగా ప్రవర్తించడం మొదలెడుతుంది. ఆమెకు భవాని మద్దతు పూర్తిగా లభిస్తుంది. తనింట్లోనే దిగజారుతున్న తన స్థితి తన బిడ్డల స్థితి చూసి తట్టుకోలేక ఆవేశంతో ఒక రోజు సునంద భర్తను ప్రశ్నిస్తే అతను ఆమెను విపరీతంగా కొడతాడు. దెబ్బలకు తాళలేక, అవమానంతో తన అన్న దగ్గరకు వెళ్ళిపోతానని బైలుదేరిన ఆమెను భర్త పిల్లలను తీసుకుని వెళ్ళే హక్కు తనకు లేదని, పిల్లలు తన ఆస్థి అని చెబుతాడు. ఆమె కోపంతో అన్న దగ్గరకు వెళ్ళిపోతుంది. తల్లితండ్రి లేని సునందకు పుట్టింటిలో ఉన్నది అన్నా వదిన మాత్రమే. అన్న ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. కాని చెల్లెలికి ఆసరా ఇస్తాడు. అన్న ఇంట్లో సునందకు తాను గర్భవతిని అని తెలుస్తుంది. ఈ పరిస్థితిలో భర్తకు దూరంగా ఉండడం మర్యాద కాదని ఆమె అనుకుంటుంది. సునంద అన్న ఇంటికి వచ్చేసాక ఆమె భర్త ఆ పని పిల్లతో బాహాటంగా ఉంటున్నాడని భార్య పట్ల చాలా కోపంగా ఉన్నాడని అన్నకు తెలుసు. అతను సునందను భర్త వద్దకు తిరిగి వెళ్ళనీయకుండా ఆపాలనుకుంటాడు. భర్త కబురు చేస్తాడని ఆశతో ఎదురు చూస్తు, తన స్థితి తెలుసుకుని ఇక తాను మొండిపట్టు పట్టడం తప్పని సునంద నిశ్చయించు కుని అన్నను కాదని భర్త వద్దకు వెళుతుంది.
ఆమెను చూసాక మగపిల్లలిద్దరూ కోపంతో చీదరించు కుంటారు. తండ్రి వారికి తల్లి ఇల్లు వదిలి వెళ్ళడం తప్పని నూరి పోస్తాడు. కూతురు తల్లిని చూసి కన్నీళ్ళూ పెట్టుకుంటుంది. భర్త ఇంటికి తిరిగి వచ్చిన సునందపై చేయి చేసుకుంటాడు. తాను గర్భవతిని అని ఆమె చెప్తుంది. కాని ఆ గర్భంలో బిడ్డ తనది కాదని అసలు తన ద్వారా సునంద తల్లి అయ్యే అవకాశమే లేదని, ఎవరి సంతానంతోనో తన ఇంటికి వచ్చిన ఆమెతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని భవాని ఆమెను ఇంటి నుండి నెట్టేస్తాడు. ఏమీ చేయలేక ఆమె వీధిలోకి నడుస్తుంది. ఇరుగుపొరుగు వ్యక్తులందరూ మరో ఇంటి విషయంలో జోక్యం చేసుకోవడం మర్యాద కాదనుకునే సగటు మర్యాదస్తులు. పైగా భవాని నోరన్నా అతని ప్రవర్తన పట్ల చుట్టూ పట్ల ఉన్నవారికి భయం. అందుకని వారెవ్వరూ సునంద విషయంలో జోక్యం చేసుకోరు. సునంద భర్తకిష్టం లేకుండా పుట్టింటికి వెళ్ళడం కూడా కొందరికి తప్పులాగే కనపడి ఉండవచ్చు.
భవాని ఆమెను తిరిగి ఇంటిలోకి రానివ్వడు. కడుపులో బిడ్డను ఆమె చంపుకోలేదు. నడుచుకుంటూ వెళ్ళి అదే ఊరిలో ఒక మధ్యతరగతి బస్తీలో ఒక చెట్టూ అరుగుపై పడుకుంటుంది ఆమె. ఆ వీధిలో స్త్రీలందరికీ ఆమె కథ తెలుసు. కాని ఏమీ చేయలేని అసక్తులు. వారి ఇంట్లో వారికి కావల్సిన పనులు చేస్తూ ఆ వీధి అరుగుపై పడుకుంటూ ఆమె బిడ్డను కంటుంది. ఆ వీధిలో స్త్రీలే ఆమెను ఆమె బిడ్డను కాపాడుకుంటారు. వారి ఇంట చిన్న చిన్న పనులు అప్పజెప్పుతూ ఆమె కొంత డబ్బు సంపాదించు కోవడానికి తోడ్పడతారు. ఆ చంటి బిడ్డను అందులో ఆడబిడ్డను ఆమె పెంచుకోవడానికి సహాయ పడతారు. సునంద మధ్యలో తన భర్త ఇంటికి వెళ్తే అతను ఎవరికీ చెప్పకుండా పిల్లలతో వెళ్ళిపోయాడని తెలుస్తుంది. కాని దాని కన్నా ముందు పెద్ద కూతురు ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది. తను గర్భవతినని తెలిసి తన కొడుకులు కూడా వారి తండ్రితో పాటు తనను అసహ్యించుకుంటున్నారనీ తెలుసుకుంటుంది. మిగిలిన చిన్న బిడ్డ జ్యోతిని పెంచడానికి మరో ఆధారం లేక ఆమె ఆ వీధిలోని స్త్రీల ఇళ్లల్లో పని చేసుకుంటూ ఉండిపోతుంది. బిడ్డ జ్యోతిని పెంచి పెద్ద చేస్తుంది.
ఆ వీధిలో అన్ని మతాల కులాల స్త్రీలు ఉంటారు. సునంద కన్నా తక్కువ జాతి స్త్రీలు వారంతా. కాని తమకు చేతనైన పద్ధతిలో ఆమెకు సహకరిస్తూ ఉంటారు. పెళ్ళీడుకొచ్చిన జ్యోతి వివాహం కోసం వాళ్ళే తాపత్రయపడుతుంటారు. ఆకతాయుల నుండి తన బిడ్డను రక్షించుకోవడం ఇప్పుడు సునందకు పెద్ద సమస్య అయిపోతుంది. నిద్రపోయేటప్పుడు ఆ బిడ్డ కొంగు తన కొంగుకు ముడివేసుకుని రాత్రుల్లు జాగారం చేస్తుంది. ఆమెకు సహాయపడాలని ఆ వీధిలోని స్త్రీలు జ్యోతికి పెళ్ళి సంబంధం చూస్తారు. కాని అప్పటికే కొంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన సునంద బాధ్యత తీసుకుని మరీ జ్యోతితో పెళ్ళికి సిద్ధపడే వారెవ్వరూ కనిపించరు. జ్యోతికి ఒక చదువుకున్న వ్యక్తితో పెళ్ళి చూపులు ఏర్పాటు చేస్తారు. వారు పెళ్ళికి ఒప్పుకున్నా సునంద భాధ్యత తీసుకోవడానికి ఒప్పుకోరు. సునందను ఒప్పించి మానసిక చికిత్సాలయంలో చేరుస్తారు ఆ వీధిలోని కొందరు భాద్యత గలవారు. తరువాత జ్యోతిని తమ బిడ్డలా భావించి వివాహం జరిపిస్తారు. కూతురు పెళ్ళి కోసం పోలీసులతో వెళ్ళి పోతుంది సునంద. తరువాత చికిత్సాలయం నుండి విడుదలయినాక కూడా ఆమెను ఇంటికి తీసుకెళ్ళడానికి ఆమె ఇద్దరు కొడుకులు, కూతురు సిద్ధపడకపోతే పోలీసులు ఆమెను శరణాలయానికి చేరుస్తారు. ఆమె అక్కడే కొన్ని సంవత్సరాలు ఉండి మరణిస్తుంది.
ఈ నిజ జీవిత కథలో ఒక భార్యగా ఏ హక్కులు లేకుండా జీవించిన కొన్ని కోట్ల మంది స్త్రీల కథ కనిపిస్తుంది. భర్త ఇంట్లో చాకిరి, అతని వంశాభివద్ది కోసం పిల్లలు, ఇన్ని సమకూర్చినా ఒక చిన్న అనుమానంతో భర్త ఆమెను ఇంటి నుండి గెంటివేస్తే అతన్ని నిలదీసి అడిగే వ్యక్తులు కనపడరు. భర్తకు భార్య పట్ల ఉండే ఆ అధికారం సామాన్యమైనదే అన్న నానుడి సమాజంలో ఉన్నదే కదా. పుట్టింట సాయం అందక బిడ్డ కోసం అరుగుల మీద పడుకుని బతికే సునందలు చాలా మంది ఇప్పటికీ కనిపిస్తూ ఉంటారు. కాని కొన్ని సంవత్సరాల ఆమె కష్టం త్యాగం కొందరి స్త్రీలను కదిలించి ఆమె కూతురు భాధ్యత వారు తీసుకునేలా చేస్తుంది. కాని ఆఖరికి తన కొడుకులను తననింటికి తీసుకెళ్ళమని తనకింత నీడను ప్రసాదించమని అడుక్కునే స్థితిలోనే సునంద మిగిలిపోతుంది. ఆమె కొడుకులు తమ తండ్రిలాగానే తల్లిని చీదరించుకుని వదిలించుకుంటారు. ఒక సమయంలో తండ్రి, మరో సమయంలో భర్త, మరో సమయంలో కొడుకుల ముందు చేయి చాచుతూ బతికే స్థితిలో ఎందరో స్త్రీలు తమ జీవితాలను ముగించారు. వారి నీడలో తమ జీవితాలను నిర్మించుకున్న సంతానం కూడా స్త్రీల పట్ల భాధ్యతగా ప్రవర్తించకుండా ఉండడం చూస్తున్నాం. కుటుంబం లో చాలా సార్లు స్త్రీల జీవితాలు, శ్రమ, విలువలేనివిగా మిగిలి పోతున్నాయి. స్త్రీల పట్ల అది తల్లి అయినా, భార్య అయినా, కూతురయినా కోడలయినా పురుష దష్టికోణం పెద్దగా మారట్లేదు. కొంత ఆర్థికంగా ఒక స్థాయికి చేరిన స్త్రీల జీవితాలు ఇంత దారుణంగా లేకపోవచ్చు, లేదా చాలా ఉన్నతమైన స్థితిలో అతి కొద్ది మంది ఉండవచ్చు. కాని ఇప్పటికీ వారి సంఖ్య దేశ జనాభాలోని స్త్రీలతో పోలిస్తే చాలా తక్కువ. స్త్రీ హక్కుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఇప్పుడు చాలా హేళనగా, మాట్లాడే వర్గం ఒకటి తయారయింది. కేవలం కొంత మంది స్త్రీలను, ఆర్థికంగా ఉన్నతంగా బతుకుతూ దోపిడి పక్షాన చేరిన కొందరు స్త్రీవాదులను చూపించి స్త్రీ హక్కులు అనవసరం అని వాదించే వారు ఇప్పుడు మనకు కనిపిస్తూనే ఉన్నారు. అసలు స్త్రీ హక్కులనే చర్చ ఎందుకు మొదలయ్యిందో ఎటువంటి బానిసత్వం నుండి స్త్రీలు ప్రయాణించారో, ప్రయాణిస్తున్నారో, ఇంకా ఎంత మంది సునంద లాంటి జీవితాలు గడుపుతున్నారో తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఏ మాత్రం ఓపిక ప్రదర్శించ లేని వర్గాలు పెరిగిపోతున్న సమయంలో 2015 లో ఇలాంటి చిత్రం అదీ ఒక జరిగిన కథ ఆధారంగా తీయడం హర్షించదగ్గ విషయం. సినిమాలో స్క్రీన్ ప్లే, పాత్రల నటనలో కూడా కొన్ని లోపాలు కనిపిస్తూనే ఉన్నా, దీన్ని మంచి చిత్రంగానే నేను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. సునంద పాత్రలో నందితా ధురీ బాగా నటించింది. ఆమె స్థాయిలో ఇతర నటీనటులు లేకపోయినా కథ మాత్రం బాగా సాగుతుంది. ఎన్ని అన్యాయాలు సహించినా చివరి దాకా భవాని కోసం ఎదురుచూసే సునంద, బిడ్డల కోసం ఆక్రోశించే సునంద పట్ల జాలి కలుగుతుంది.
- పి.జ్యోతి,
9885384740