Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళలు పాయలుగా విడిపోతేనే ఇంద్ర ధనస్సులు పూస్తాయి. కవిత్వం కూడా అంతా ఒకే రుచిలో ఉంటే వైవిధ్య రహితమవుతుంది. తీగ కదిలికలో చైతన్యం కనగలిగే, పక్షి రెక్కల చప్పుడులా మేలుకొలుపు వినగలిగే హృదయం పలికే కవన గానం సున్నితంగా, సుతారంగా ఉంటుంది. నిజానికి సామాజిక సమస్యపై కవిత్వ భాషలో స్పందించడం కన్నా మానసిక సంఘర్షణను కవిత్వీకరించడమే క్లిష్టమైన పని. అందరికీ సాధారణమనిపించే విషయాల్లో అసాధారణత గోచరించిన కవి అంతర్ముఖుడవుతాడు. హృదయం కవితల కర్మాగారమవుతుంది. ఉత్పత్తులకు ఎవరెంత వెలకట్టినా హృదయ భారం తగ్గడమే కవికి స్వాంతన. ఈ అంశతో కవిత్వం రాస్తున్న వారి కోవలోకి విజయ్ కోగంటి చేరిపోతారు.
ఎండాకాలపు సాయంత్రం వీచే నులివెచ్చని పిల్ల తెమ్మెరలా ఈ కవి అక్షరాలు మనసుకు తాకుతూ సాగిపోతాయి. చదువరిని ఉన్న స్థానంలోంచి కొంచెమైనా అటూ ఇటూ కదిలించనిది కవిత్వం అనలేము. ఆ కదిలించే గుణం విజరు కొనంటి కవిత్వానికుంది. మనిషిగా సాటి మనిషిలోతుల్లోకి వెళ్ళి చూసి గుణగణాలను అంచనా వేయడం ఈ కవి విధుల్లో ఒకటి. మనిషికి ప్రకృతికీ, మనిషి ప్రకృతిలోని వికృతికీ మధ్య ఉన్న వైరుధ్యాలు, వైపరీత్యాలు కవికి నచ్చని అంశాలు. గంభీరమైన విషయాల్లోకి వెళ్ళకుండా నేలపై నుంచే సాము చేయడం ఈ కవి బలం.
కవిత్వమంతా రూఫ్ గార్డెన్ లో విహరించినట్లు ఏకరూపతను ప్రదర్శించినా ఇంపును కోల్పోదు. కవి జీవితానుభవాలు, అనుభూతులు, వేదనలు నిర్వేదాలు ఎలా ఉన్నా అవి మొగ్గ తొడిగి పుష్పించడమే కవిత్వ గుణం. ఆ గుబాళింపు విజరు సొంతం.
కవి 'ఈ సాయంత్రపు వేళ'లో చెప్పినట్లు
తిరిగి తిరిగి ఒడ్డుకు చేరి
కాసింత విరామానికై
ఎడాపెడా నిలిచిన
ఆలోచన పడవలు' ఈ కవితలు. కవి తలపులే అక్షర తోరణాలవుతాయి. 'నిరీక్షణ' కవితలో-
ఈ వేసవి సాయంలోపు గాలీ
నన్ను పరీక్షిస్తున్నట్లే ఉంది
ఒక్క ఆకూ కదలదు
ఒక్క రెమ్మా బదులీయదు
విరిసి గుబాళించాల్సిన ఈ సంపెంగ కూడా
ఇంకా దేని కోసమో ఎదురు చూస్తోంది
అనే దృశ్యం మానసిక స్థితికి చిత్రం వేసినట్లుంది.
భూమ్మీది జీవుల్లో ఇన్ని వైషమ్యాలకు కారణాలు వెతుకుతూ కవి
'పశువులోనూ పక్షులలోనూ
మనుషులమనే మనలోనూ మానుల్లోనూ
ప్రవహించే ప్రాణానికి అసలు రంగేది' అని ప్రశ్నిస్తాడు.
'ఆమె'కున్న మహతాయన్ని
'మాటై తాకితే చాలు
నీకై ఇన్ని నవ్వులు కన్నీరూ రాల్చే
పూల చెట్టు'తో ముడిపెడతాడు. ఇంకాస్త ముందుకెళ్లి ఏకంగా 'మిత్రమా
ఇంకా కన్ను తెరిచి చూడగలిగితే
ఆమె నీ అస్తిత్వపు చిరునామా' అని కన్ను తెరిచే పనిలో ఉండండని సూచిస్తాడు.
యుద్ధానికి ఆయుధమే అక్కరలేదు-
'ద్రోహం తలయెత్తినపుడల్లా
కదపాల్సిన పెదవీ యుద్ధమే
నిద్దురోతున్న గాయాన్ని
లేపడమూ యుద్ధమే' అంటారు కవి కోగంటి.
ఒంటరితనమంటే ఏకాకిగా బతకడం కాదు. అదో కార్య గుణం.
'తిరుగాడే గాలీ ఒంటరే
సహనమై నిలిచిన కొండా
ప్రశాంతమై నిదురించే కోనా
పనిలేకున్నా పరుగులెత్తే నదీ
పండి పులకించే నేలా
రెండు పొద్దుల్ని మోసే నింగీ
అన్నీ వొంటరొంటివే' అయినా గానీ, అవి
'పంచ భూతాలై
జతపడుతూ
దేనికి దానిగా విడివడుతూ' ఓ గొప్ప సందేశాన్నిస్తాయి. ఆ సందేశమే కవి అక్షరాల్లో నిగూఢంగా విస్తరించి ఉంటుంది. చదువరి దాని ధ్వనిని ఈ కవిత్వంలో పసిగట్టవచ్చు.
ముందు మాటలో పాపినేని శివశంకర అన్నట్లు 'సామాజిక సమస్యలు- వాటి పరిష్కార మార్గాలు' అనే మామూలు మూస పద్ధతికి భిన్నంగా ఆత్మ కేంద్రంగా ఆత్మాశ్రయంగా' సాగుతుంది విజయ్ కవిత.
(ఒక ఆదివారం సాయంత్రం (కవిత్వం), కవి : విజయ్ కోగంటి, పేజీలు : 96, వెల : రూ.130/-, ప్రతులకు : డా. కోగంటి విజరుబాబు, గుంటూరు. ఫోన్ : 8801823244)
- బి.నర్సన్,
9440128169