Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చందమామ ఇచ్చే వెన్నెల్ని ఇష్టపడని వారుంటారా? చందమామకు వెన్నెల ఎంతో ప్రత్యేకం. అలాగే చిన్నారుల మనసులో చందమామ మాసపత్రికదీ ప్రత్యేక స్థానమే! అందులోని కమ్మని కథలు చదివే వారిదీ వెన్నెల్లో స్నానమాడిన అనుభూతే !
చందమామ పత్రిక ద్వారా ''ఆబాల గోపాలాన్ని తన రేఖలతో వర్ణాలతో మెరిపించి మురిపించిన'' ఓ కుంచె ఇక సెలవంటూ ఈకళా జగత్తును వీడి, వర్ణాలను సైతం కంటతడి పెట్టించిన వైనం హదయ విదారకం. ఆ సప్తవర్ణ తూలిక పేరే ''చందమామ శంకర్'' గా సుపరిచితులైన ''శ్రీ శంకర్''.
చిత్రకారులు శంకర్ అసలు పేరు కరతోలూరు చంద్రశేఖరన్ శివశంకర్. ఈయన తమిళనాడులోని కరథొలువు గ్రామంలో 1924 జులై 19 న జన్మించారు. తండ్రి స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. తల్లి గహిణి. తనతోపాటు నలుగురు సోదరులున్న ''శంకర్ మనసు బాల్యం నుంచే బొమ్మలు వేయడంపై నిమగమైంది. తన ఆలోచనలకు చిత్రరూపం ఇచ్చే ప్రయత్నంలో తన పుస్తకాల్ని ఏవేవో గీతలతో నింపేసేవారు. ''ఆ గీతలే తన బతుకు గీతను మార్చి తననో ప్రత్యేక వ్యక్తిగా ప్రపంచంముందు నిలబెడతాయని'' ఆ చిన్నారి శంకర్ కి బహుశా అప్పుడు తెలిసి ఉండకపోవచ్చు.
గీతలనే ప్రేమిస్తూ, గీతల్లోనే ఆకారాల్ని వెతుక్కుంటూ తనజీవితం చిత్రలేఖనంతో పెనవేసుకుందని గమనించి పన్నెండవ తరగతి పూర్తిచేసిన అనంతరం మద్రాస్ ప్రభుత్వ చిత్ర కళాశాలలో శంకర్ విద్యార్థిగా చేరి తనలోని చిత్రకారునికి మెరుగులు దిద్దుకున్నారు. తనపై తనకు నమ్మకం కుదిరాక 1946లో తొలిసారి ''కలైమాగల్'' అనే పత్రికకు చిత్రకారునిగా జీవితం ప్రారంభించారు. ఆపిమ్మట శ్రీ.చక్రపాణి నాగిరెడ్డిలచే 1956లో వచ్చిన చందమామలో చిత్రకారునిగా చేరి దాదాపు 2013 లో ఆపత్రిక మూత పడేవరకు చందమామను తన చిత్రకళతో అలరించారు. తాను ఆర్టిస్టుగా చేరే సరికే చందమామలో ఉన్న లబ్ధ ప్రతిష్టులైన మరో ఇద్దరు చిత్రకారులు '' చిత్రా రాఘవులు, వడ్డాది పాపయ్య '' గార్లతో కలిసి కళాత్రయంగా మారి చందమామలో వేలాది చిత్రాలకు ప్రాణం పోశారు. కథ చదివే పాఠకుని మనసుకు ఆపాత్రల్ని కళ్ళకు కట్టించారు. ఎన్నో కథలు, సీరియళ్లకు, పురాణ పాత్రలకు శంకర్ ఔరా... ! అనిపించే అద్భుత చిత్రాలను వేశారు. రాజమహళ్లు, నెమళ్లు, జింకలు, ఉద్యానవనాలు రాజకుమార్తెల రూప సుకుమార సోయగాలు, రాజకుమారుల కత్తి యుద్ధ విన్యాసాలు ఎంత అందంగా వేశారో ''రాక్షసుల దేహాల్ని, భూతాల్నీ పిచాచాల్నీ'' అంతే గొప్పగా వేసి తనశైలిని ప్రత్యేకంగా నిరూపించుకున్న శంకర్ ''పాఠకులు తన బొమ్మలేని చందమామను ఊహించుకోలేనంతగా'' తన ముద్రను వేయగలిగిన గొప్ప చిత్రకారులు. శంకర్ చిత్రాలు ఎన్నో అవార్డులు, రివార్డులూ గెలుచుకున్నాయి.
చిత్రకారునిగా సుమారు 700 పైగా కథలకు బొమ్మలు వేసిన శంకర్ బేతాళ కథలకు వేసినబొమ్మలకు ప్రత్యేక గుర్తింపు పొందారు.
అందులోనూ ''విక్రమార్కుడు ఒకచేతిలో కరవాలాన్ని ధరించి శవాన్ని మోసుకుంటూ వెళ్లే'' శీర్షికా చిత్రం శంకర్ కు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. అంతేకాక శంకర్ తన చిత్రాల్లో వేసిన భవనాలు, ఆభరణాలు, పాత్రల ఆహార్యం ఎందరో సినీ కళాదర్శకులకు ప్రేరణను ఇచ్ఛి, వారికి మార్గదర్శనం చేశాయనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.
దాదాపు 60 సంవత్సరాలపాటు చందమామకు చిత్రాలు వేసిన శంకర్ ఆ పత్రిక మూతపడిన తర్వాత ''రామకష్ణ విజయం'' అనే మరో పత్రికతోపాటూ, అనేక తమిళ పత్రికలకూ చిత్రాలు వేశారు. అటుపిమ్మట వయోభారంతో శరీరం చిత్ర రచనకు సహకరించకపోవడంతో బొమ్మ వేయలేక పోతున్నందుకు ఎంతో ఇబ్బంది పడ్డారు. చందమామ పత్రికతో ఉన్న అనుబంధంతో ఆ పత్రిక ఆగిపోవడాన్ని జీర్ణించుకోలేక పోయిన శంకర్ బొమ్మలపై బెంగతో మనో వ్యాధితో ''ఎప్పుడూ చందమామ గురించీ అందులో తాను వేసిన చిత్రాల గురించీ'' ఆలోచిస్తూ ఏదో లోకంలో ఉండేవారని చివరిరోజుల్లో శంకర్ మతిస్థిమితం కోల్పోగా మానసిక నిపుణులు 20 రోజులుగా శంకర్ ను మామూలు స్థితికి తేవడానికి ఎంతో శ్రమించారని .... ఈకాలంలో శంకర్ కేవలం మంచినీరు మాత్రమే తాగి జీవించారని వారి కుటుంబ సభ్యులు తెలపడం తన అభిమానుల్ని ఎంతగానో బాధించే విషయం .
చందమామ మాసపత్రిక ఎన్నో భారతీయ భాషల్లో రావడంతో పుట్టుకతో తమిళుడైన శంకర్ చిత్రానికి భాష లేదనే విషయాన్ని నిజం చేసి, ఎందరో భారతీయ పాఠకుల మనసుదోచుకుని తన జీవితమంతా బొమ్మలకై శ్రమించి ''చిత్రకళకే తన జీవితాన్ని అంకితం చేసిన శంకర్ తన 97వ ఏట సెప్టెంబర్ 29 న'' చెన్నైలో తుదిశ్వాస విడిచి.... చందమామ చిత్రకారుల చివరి శకాన్ని కూడా తనతో ముగించారు.
చిత్రకారులు శంకర్ మరణంతో రంగులన్నీ చిన్నబోయి... హరివిల్లు సైతం మూర్ఛిల్లింది. పిల్లల నుంచీ పెద్దలవరకూ తన చిత్రాలతో సమ్మోహనపరచిన శంకర్ చిత్రం అజరామరం.
ఈ రోజు చందమామ పత్రికలేదు. శంకర్ కూడా లేరు. కానీ చందమామ పాఠకుల మనోఫలకాల మీద శంకర్ చేసిన కధల తాలూకూ చిత్రానువాదం మాత్ర్రం ఎప్పటికీ సుస్థిరం. ''శంకర్ చిత్రాల రస సౌందర్యాన్ని తన అభిమానులు ఎప్పటికీ స్వప్నిస్తూనే ఉంటారు''. ఇంతకంటే అభిమానూలు తనకు నివాళి ఏమివ్వగలరు ? ఇదే ఓ మహాచిత్రకారునికి మన అందరి తుది కన్నీటి వీడ్కోలు.
- శ్రీనివాస్ బీర,
8247027265