Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి మనిషిగా జీవించలేనప్పుడు, కోరికలను చంపుకొని జీవిస్తున్నప్పుడు, తన భూమిని, అస్తిత్వాన్ని పరాయిలకు ధారాదత్తం చేసినపుడు ఆ మనిషి ఉనికి ప్రశ్నార్థకం. కొన్ని వేల ప్రశ్నలు ఉధ్భవించిన సందర్భమది. సమాధానం దొరకని చోట ప్రశ్నలే పుట్టుకొస్తాయి. అలా పుట్టుకొచ్చిన ప్రశ్నల గొంతుకే 'వానొస్తదా'.
ఫలితం కోసం పడిగాపులు కాసి, కళ్ళల్లో ఒత్తులేసుకొని కూర్చున్న సందర్భాలు ఈ తెలంగాణం నిండా ఎన్నో ఉన్నాయి. వలసవాదుల రాజకీయ కుటిలనీతి, పదవీ వ్యామోహం తమ ప్రాంత రక్షణ, వనరుల తరలింపు ఇవన్నీ అనేక సందర్భాల్లో మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టివేసిన పరిస్థితులు. మన అస్తిత్వాన్ని మనం నిలబెట్టుకుంటామా, మన రాతలు మార్చుకోక పోతామా అన్న ప్రజల ఆశావాహ ధక్పథ ప్రశ్నల పరంపర ''వానొస్తదా''.
ప్రముఖ ఆంగ్ల రచయిత్రి ఎమిలీ డికిన్ సన్ ''ఆశ అనేది రెక్కలను తొడుక్కున్నదై ఆత్మను సంతరించుకుంటుంది. ఎలాంటి పదాలతో నిమిత్తం లేకుండా కొత్త రాగాల నెత్తుకుంటుంది. దానిని ఎవరు ఆపలేరు'' అన్నట్టుగా ఇక్కడ కవి ఆశ కూడా బలమైనదే.
ఇతని కవిత్వ బలమంత తెలంగాణ భాష,యాస.తన కవితల్లో తెలంగాణ భాష నుడికారపు సొంపును ప్రదర్శిస్తాడు. ఇందులో నారాయణ స్వామి ప్రయోగించిన పదజాల మంత తెలంగాణమే. స్పష్టంగా పాఠకునికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా తన దైనందిన భాషనుపయోగించి రాశాడు.ఈ కవితా సంపుటిలో చాలా కవితల్లో తెలంగాణ పదజాలం ఉన్నది. ''ఈ పారన్న, అర్ర, జరజర, ఏండ్ల సంది, వస్తవో, విరగపండినయి'' ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి.
వెంటాడే వాక్యాల్లోకి...
1. రాజ్యం ఏర్పడ్డ నాటి నుండీ / కొయ్యా,తాడూ / యిట్లా వొకరికొకరు వినపడకుండా / మాట్లాడుకుంటనే ఉన్నాయి
ఉరికొయ్య, తాడు మాట్లాడుకునే సంభాషణరీతిలో సాగిన కవిత ''నా చేతులు విరిగినా బాగుండు''. రాజద్రోహులుగా పిలువబడుతున్న పోరాటయోధులను, ఉద్యమకారులను అణచి వేస్తున్నారని వాళ్ళని ఉరితీయడానికి ఉపయోగించే తాడు తెగిపోవాలన్న అంతరార్థంతో ఈ కవితను రాశారు. ఇది విభిన్న పార్శ్వాలను చూపే కవిత. పాఠకుడి మదిని అనేక ప్రశ్నలతో ముంచెత్తుతూ జరుగుతున్న కాలమాన పరిస్థితుల పట్ల జాగురుకతను నేర్పే వాక్యాలివి.
2. ''చేప కళ్ళల్లో మిగిలిన / కన్నీళ్ళను దోసిళ్ళలో పట్టుకొని/ పగిలిన రాళ్ళ కోరలమీద నాట్యం చేస్తూ / వొళ్ళు చితికిపోయిన కెరటాల / నెత్తుటి నురగల ముద్దులు'' (వొంటరిగా)
ఒంటరితనాన్ని మనం ఎక్కువగా కాల్పనికం లో చూస్తుంటాము. ప్రేయసి, ప్రియుని కోసమో, ప్రియుడు, ప్రేయసి కోసమో పాడుకున్న గీతాలు మనకు తెలుసు. నారాయణ స్వామి 'వొంటరిగా' అనే కవితలో పూర్తి భిన్నంగా ఒంటరిదైన సమూహాన్ని, గుండె మెలిపెడుతున్న క్షణాలను, ఆ నొప్పిని భరించలేని ఒకానొక వ్యవస్థను సూక్ష్మాతి సూక్ష్మంగాఈ వాక్యాల్లో పట్టి చూపించాడు.ఈ కవితా పంక్తుల్లో తీసుకున్న ఉపమానాలన్ని ఒంటరితనాన్ని చూపించటం కోసం చేసిన గొప్ప ప్రయోగం.
3. ''బాపు నీ యాది / తల్లి రొమ్ము తెలువని / నా పెదవుల మీద / తడి ఆరని చనుబాల చారిక'' (మళ్ళ వస్తవా)
ఒకానొక సందర్భం మనల్ని కొన్నిసార్లు ఉద్వేగానికి గురి చేస్తుంది. కొన్నిసార్లు ఆనందాన్ని పంచుతుంది. కొన్నిసార్లు పరీక్ష పెడుతుంది.కొన్ని సార్లు ఫలితాన్నిస్తుంది. అలాంటి సందర్భోచిత ఉద్వేగ ప్రకటనా భావజాలం కొన్ని కవితల్లో దర్శనమిస్తుంది. ఈ వాక్యాల్లో నాన్నను గుర్తు చేసుకుంటూ ప్రకటించే భావోద్వేగం తడితడిగా తాకుతుంది. నాన్నను గుర్తు చేసుకోవడమంటే నడిచొచ్చిన దారిని తడిమి చూసుకోవడమే కదా
4.యింత ప్రేమనో / కాకుంటే / కించిత్తు ద్వేషాన్నో / తడివెచ్చగా తొలకరించు (రాహిత్యం లోంచి)
కవి తప్పనిసరిగా అన్వేషణ సాగిస్తేనే కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాడు. అన్వేషణ మూలాలు సకారాత్మక దక్పథాన్ని సంతరించుకోవచ్చు. నకారాత్మక దక్పథాన్ని సంతరించుకోవచ్చు. ఈ కవి అన్వేషణ రాహిత్యం లోంచి మొదలవుతుంది.చివరాఖరకు ఇంత ప్రేమనివ్వకున్న పర్లేదు కానీ కొంత ద్వేషాన్నైనా కురిపించిపో అంటాడు. ఖాళీతనం నుండి ఏదో ఒక భావాన్ని కలుపుకోని పోవాలనే ''అన్వేషణా దక్పథం'' నారాయణ స్వామి కవిత్వాన్ని భర్తీ చేస్తుంది.నటించే మనుషులున్న ఈ కాలంలో ప్రేమలేనితనంలో ద్వేషాన్ని వెలిబుచ్చటం ఒక రకమైన ప్రేమనే అని చెప్పే ఈ వాక్యాలు ఆలోచనాత్మకం.
నారాయణస్వామి కవిత్వంలో ఎక్కడ అతిశయం చోటు చేసుకోలేదు. ఆడంబరతతో కూడిన వాక్యాలు ఎక్కడ కన్పిం చవు. ఇతనిది నల్లని మబ్బులాంటి నిరసన గళం ఎప్పుడు చైత న్యాన్ని కురిపిస్తుంది. ఈ కవి కవిత్వం రాయ టంలోనే కాదు, వ్యాసాలు రాయటంలోను తనదైన శైలిని సంతరించుకున్నాడు.
- తండ హరీష్ గౌడ్, 8978439551