Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హీరో పాత్రలు ధరించే ప్రముఖ నటుడు జగపతిబాబు ఇప్పుడు 'నెగిటివ్' ధోరణి పాత్రలకు ఎందుకు మారాల్సి వచ్చింది?' అంటే మనం ఒకసారి 'ఫ్లాష్ బాక్'లోకి వెళ్లాలి. ప్రసిద్ధ దర్శక నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారుడు జగపతిబాబు. నటించిన మొదటి చిత్రం 'సింహ స్వప్నం' (ద్విపాత్రాభినయం) ప్రేక్షకుల నిరాదరణకు గురైంది. 'ఈ హీరో సినిమాలకే పనికిరాడు' అని కొందరన్నారని తెలిసి, జగపతిబాబు కోపంతో ఆ సినిమా షీల్డ్నే పగలగొట్టేశాడు. 'పెద్దరికం' చిత్రం హిట్ అయ్యాకే, ఆయన స్థాయి మారిపోయింది. హీరోగా వరస హిట్స్ వచ్చాయి. కానీ 'మనోహరం' తర్వాత వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. తన పరిస్థితి ఏమిటి? మనసులో నిరాశా నిస్పృహలు, సంఘర్షణ! ఆ స్థితిలో ఒక రోజు ఎక్కడికో వెళ్ళినపుడు లిఫ్ట్లో ఓ తల్లి, చిన్న పాప ఉన్నారు. ఆ పాప ముద్దుగా ఉంది కానీ అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. 'పాపకు ఏమైందమ్మా' అని ఆమెను అడిగాడు జగపతిబాబు. 'కేన్సర్' అంది ఆ తల్లి. జగపతిబాబు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆ తల్లి సమస్య ముందు తన సమస్య ఏ పాటిదని అనుకున్నాడు. పెద్దగీత పక్కన చిన్న గీతలా అనిపించింది. సమస్య ఎదురైనప్పుడు డీలా పడిపోయి క్రుంగిపోవడం సమస్యకు పరిష్కారం కాదని, సవాల్ను ఎదుర్కోవడంలోనే 'థ్రిల్' ఉందనీ అనిపించింది. అప్పుడే తన ధోరణి మార్చుకోవాలనుకున్నాడు. 'లెజెండ్' చిత్రంలో 'నెగటివ్' తరహా రోల్తో జగపతిబాబు కొత్త జీవితం మొదలైంది. ఇప్పుడాయన ప్రతినాయక పాత్రల్లోను, కేరెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్లోనూ యమ బిజీ. 'జీవితానికి డబ్బు కావాలి కానీ డబ్బే జీవితం కాదు' అని 'శుభలగం' చిత్రంలో ఓ డైలాగ్ ఉంది. ఆ మాటల్ని ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నాడు జగపతిబాబు!