Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సరోగసి' పై మన దేశంలో ఇప్పటికే చాలా మంది కొన్ని అభిప్రాయాలు ఏర్పరుచుకు న్నారు. ఈ విషయంపై మాట్లాడ టానికి సంకోచించే రోజుల్లోనే తెలుగులో సరోగసిపై ''9 నెలలు'' అనే మంచి చిత్రం వచ్చింది. క్రాంతికుమార్ దర్శకత్వంలో సౌందర్య, విక్రమ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో సరోగసిపై మంచి చర్చ జరిగింది. ఈ విషయం మీద ఒకటి రెండు సినిమాలు హిందీలో వచ్చినా అవి మెలోడ్రామాతో కొట్టుకుపోయాయి. కానీ చాలా గంభీరమైన చర్చ ఈ తెలుగు సినిమాలో విపులంగా జరిగింది. సాంకేతిక పరంగా గొప్ప సినిమా అనలేకపోయినా స్త్రీ గర్భం, మాతత్వం చుట్టూ అల్లుకుని ఉన్న విభిన్నమైన సామాజిక అంశాలను ఈ సినిమా స్పశిస్తుంది. ఈ సినిమాలో తన పాత్రకు సౌందర్య తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.
సినిమాలో ప్రధాన పాత్ర పేరు సావిత్రి. ఆనాటి సావిత్రి సత్యవంతుడిని యముడి నుండి రక్షించుకున్న విషయాన్ని సింబాలిక్గా ఈ సినిమాలో సౌందర్య పాత్రకు ఆ పేరు పెట్టి రచయిత ఒక కనెక్టీవిటి ఏర్పరిచారు. ఆమె ఒక అనాధ. బంధువుల ఇంట్లో ఉంటుంది. తన చుట్టూ ఉన్న ఫ్లాట్లలోని వారికి తోచిన విధంగా సహాయపడుతూ ఉంటుంది. ఎవరికీ నో అని చెప్పని స్వభావం ఆమెది. ఆమెను వదిలించుకోవడానికి ఆమె బంధువులు ఒక వ్యసనపరుడితో పెళ్ళి ఖరారు చేస్తారు. ఆమెను రక్షించడానికి సురేంద్ర ఆ పెళ్ళి చెడగొడతాడు. ఆమెను తానే వివాహం చేసుకుంటానని ఒప్పుకుంటాడు. పెళ్ళి చేసుకుని కొంత కాలం ఆనందంగా గడుపుతుంది ఆ జంట. తన వత్తికి సంబంధించిన కొన్ని చికాకులలో పడి ఒక అక్సిడెంట్ చేస్తాడు సురేంద్ర. తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చావు బతుకులతో కొట్టుకుంటూ ఉంటాడు. అతని తలకు ఆపరేషన్ చేయాలంటారు డాక్టర్లు. సావిత్రి వద్ద డబ్బు ఉండదు. ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రారు. ఆమె అత్త మామలు కూడా డబ్బు సర్ధలేకపోతారు. ఆమె అవస్థ చూస్తున్న ఒక లేడీ డాక్టర్ సంతానం లేని ఒక జంటకు బిడ్డను సరొగసి పద్ధతిలో కనివ్వమని అడుగుతుంది. దీనికి బదులుగా సురేంద్ర ఆపరేషన్ ఖర్చులు ఆ జంట భరిస్తుందని చెబుతుంది. భర్త కోసం సావిత్రి ఆ పనికి ఒప్పుకుంటుంది. ఆపరేషన్ జరిగి సురేంద్ర బైటకు వస్తాడు.
ఇంటికి వచ్చిన సురేంద్రకు గర్భంతో ఉన్న భార్యను ఎలా స్వీకరించాలో తెలీదు. పైగా చుట్టూ పక్కల వారి సూటిపోటీ మాటలు. తన భార్య మరొకరి సంతానాన్ని తొమ్మిది నెలను మోయవలసి రావడం, అది తాను చూస్తూ ఉండిపోవడం ఇలాంటి పరిస్థితిలో సురేంద్ర తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతాడు. తన కోసమే తన భార్య ఈ పని చేసిందని తెలిసినా ఆపరేషన్ తరువాత తాను ఎదుర్కొంటున్న స్థితి కన్నా మరణమే మంచిదనే ఆలోచనకు వస్తాడు. తన భార్యను ఎలా స్వీకరించాలో, ఎలా ఆమెతో ఇంతకు ముందులా ఉండగలడో అతనికే అర్థం కాని పెద్ద సమస్య. ఈ మానసిన నరకం నుండి బైటపడడానికి అతనికున్న ఏదైక మార్గం భార్యతో విడిపోవడం. చివరకు ఇదే విషయం కోర్టుకు చేరడం, కోర్టు ఇరు వాదనలు వినడం చివరకు ప్రజా కోర్టు పద్ధతిలో ప్రజలు ఈ సరోగసిపై సావిత్రి నైతికతపై తమ అభిప్రాయాలు చెప్పడంతో సినిమా ముగుస్తుంది.
భార్యా పిల్లలను నా అనే ఆస్తిగా భావించే పురుష భావ జాలాలున్న సమాజం మనది. మరొకరికి బిడ్డను కని ఇవ్వడానికి భార్య సిద్ధపడ్డా, దానిని అంత సులువుగా స్వీకరించే భర్తలు దొరకడం కష్టం. ఇక్కడ నైతికత ప్రశ్న లేదు. మరో పురుషుడితో శారీరకంగా కలవలేదు కాబట్టి ఆమె నీతి మంతురాలు అని చెప్పడం పురుషుడికి మింగుడు పడడు. అయితే సావిత్రి ఈ పరిస్థితులలో చేసింది తప్పా అన్నప్పుడు కాదు అనే చాలా మంది అనాల్సి వస్తుంది. కానీ ఆ తరువాత సమాజం ఆమెను చూసే దష్టిలో భేదం వస్తుంది. దానితోనే ఇబ్బంది మొదలవుతుంది. దీనివల్ల కలిగే ఎన్నో రకాల అభిప్రాయాలు ఈ సినిమాలో కనిపిస్తాయి. నిష్పక్షపాతంగా ఆ అభిప్రాయాలను వినిపించే ప్రయత్నం చేసారు దర్శకులు.
సినిమాలో సావిత్రి ఎందుకు గర్భాన్ని ధరించడానికి ఒప్పుకుంది అన్నప్పుడు భర్త సెంటిమెంట్ చూపించారు కాని నిజ జీవితంలో సరోగసి పక్కా వ్యాపారం అయిపోయిందని మనకెన్నో ఆధారాలు కనిపిస్తాయి. సమాజంలో ఎటువంటి మార్పులు కలిగినా స్త్రీల జీవితాలపై వాటి ప్రభావాలు విపరీతంగా ఉంటాయి. సరోగసి విధానం వల్ల లాభ పడుతుంది ఎవరు అంటే డబ్బు ఉన్నవారు. గర్భాలను కొనుక్కోవడం ఇప్పుడు చాలా నార్మల్ అయిపోయింది. పిల్లలను వద్దనుకున్న వారు, వివాహం వద్దనుకున్నవారు, స్వలింగ సంపర్కులు అద్దె గర్భంతో తల్లులు తండ్రులు అవుతున్నారు కేవలం డబ్బు మహిమతో. ఆఖరికి గర్భం కూడా వ్యాపార వస్తువు అయిపోయిన తరువాత లాభపడుతుంది ఏ వర్గం? మగవారు లేదా డబ్బున్న స్త్రీలు. పేద మధ్య తరగతి స్త్రీలు వస్తువులుగానే మిగిలిపోతున్నారు. నా అంశతోనే బిడ్డను కనాలి అనే అలోచనలోనే ఒక లోపం ఉంది. ఆ 'నా' అనే దాని కోసం మరొకరి గర్భాన్ని అద్దెకు సంపాదిస్తుంది ఒక వర్గం. ఇప్పుడు 'నా భార్య గర్బం', 'నా పిల్లలు' అనే మరో 'నా' అనే భర్త అధికారం దాన్ని ఎలా సహిస్తుంది? నాది అన్న స్వార్ధం లేనప్పుడు సరోగసి అక్కరలేదు. అనాధలను పెంచుకోవచ్చు. కాని అలా జరగదు. ఒక పక్క 'నా' అనే వాదంతో మొదలయిన సరోగసి మరో పక్క 'నా' అనే స్వార్థాన్ని వదిలించుకొమ్మని ఆ స్త్రీ ని, స్త్రీ తరుపు కుటుంబాన్ని కోరుతుంది. బదులుగా వారికి డబ్బు ఇస్తుంది. ఆఖరికి స్త్రీ పై కొత్త దక్కోణంలో వ్యాపారం మొదలవుతుంది. 2001లో వచ్చిన ఈ సినిమాకి ఇప్పటి ప్రేక్షకుల భావజాలనలో చాలా తేడా వచ్చింది. కాని తల్లి గర్భం వ్యాపారం చేస్తూ స్త్రీని మరో కోణంలో వ్యాపార వస్తువుగా చూసే సమాజ దష్టిలో మార్పు లేదు. ఒకప్పటి స్త్రి శరీర వ్యాపారం కన్నా మించిన లాభాలను ఈ వ్యాపారం తెచ్చిపెడుతుంది భవిష్యత్తులో.
సినిమాలో సావిత్రి చేసింది తప్పు అనలేం. కానీ సరోగసి విధానంలో, దాన్ని చూసే దష్టికోణంలో సమాజంలో వచ్చిన మార్పులు కలవర పెడుతున్నాయి. ఆర్థిక విషయాలు మన జీవితాలపై పెత్తనం చేస్తున్నంత కాలం స్త్రీ జీవితాలలో పెద్ద మార్పులు ఉండవు. స్త్రీ శ్రమ, శరీరం, సాంగత్యం, ఆఖరికి గర్భం అన్నీ అంగట్లో దొరికే సరుకులయిపోయాయి. నా భార్య నా బిడ్డ అనే భావాలు సురేంద్ర లాంటి వ్యక్తులలో పోవాలంటే అసలు 'నా' అనే భావజాలంలో మార్పు రావాలి. అలా అందరిలో వచ్చిన రోజు, నా అంశతో పుట్టిన బిడ్డ అనే ఆలోచనలూ మాసిపోతాయి. అప్పుడు సరోగసి అవసరమే రాకపోవచ్చు. ఒకపక్క నా అనే స్వార్థానికి ప్రాణం పోయడానికి మరో పక్క నా అనే స్వార్థాన్ని వదలమని బోధించడంలో ఎంత హిపోక్రసి ఉంది? డబ్బు ఉన్న వాళ్ళూ దేన్ని అయినా కొనుక్కోవడం కోసమా సైన్సు ఇంత ప్రగతి సాధిస్తుంది? ఇలాంటి ప్రశ్నలన్నిటికి పునాదిగా ఈ సినిమాను చూడవచ్చు. సురేంద్ర మంచివాడు. కాని నా అనే పురుష భావజాలం నుండి బైటపడలేడు. సావిత్రి గర్భాన్ని అద్దెకు తీసుకున్న జంట కూడా నా వారసత్వం అన్న భావజాలం ప్రభావంతోనే కదా సరోగసి ని కోరుకుంది? అప్పుడు సురేంద్ర ప్రవర్తనలో తప్పు కనిపించదు. సురేంద్రలో ఉన్నదీ అదే పొసెసివ్నెస్. డబ్బున్న వారి పొసెసివ్నెస్ను ఎదుర్కోలేక సతమతమయ్యే మధ్య తరగతి పొసెసివ్నెస్ అది.
ఈ సినిమా ద్వారా అన్ని రకాల ఆలోచనలలకు తెర తీసారు రచయిత. సినిమా ఆఖరున ఒక డాక్యుమెంటరీ ఎఫిక్ట్ లా కొందరి
అభిప్రాయాలను సేకరిం చారు. ఎవరికి అర్థం అయిన విధంగా వారు విశ్లేషించారు. కానీ సరోగసిపై ఇప్పటికీ చాలా మందికి సరైన అవగాహన లేదు. డబ్బు కోసం తల్లి అయ్యే ఆ స్త్రీలలో మాతృత్వపు భావాలుండవా? అలా బిడ్డను తొమ్మిది నెలలు మోసి కని ఆ బిడ్డను మరొకరికి ఇవ్వడం ద్వారా స్త్రీ తన మాతత్వపు భావాలను హత్య చేసుకుంటుంది. ఆ తరువాత ఆమె భర్త కోసం పిల్లలను కని ఇస్తుంది. వారసత్వం అన్న భావజాలం పట్ల అభిప్రాయాలు మారితే తప్ప సరోగసి దోపిడీ ఆగదు.
ఈ సినిమాలో సావిత్రి తన భర్త కోసం ఒక నిర్ణయం తీసుకుంటుంది. దానికి కట్టుబడి ఉంటుంది. ఇప్పుడు సరోగసి విషయంలో ఆ అద్దె తల్లి పేరును ఈ సినిమాలో లా బాహాటంగా ప్రకటించట్లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఏమైనా మానసికంగా చాలా మధనపెట్టే సమస్య సరోగసి మదర్ది. ఆ విషయాలని ఇంతలా విపులంగా కాదు కానీ నిష్పక్షపాతంగా చూపించి చేర్చిన సినిమాగా ఈ సినిమా నాకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఆ రోజుల్లో ఏ విషయాలను సరోగసి శాసిస్తుందని అనుకున్నారో వాటన్నిటిపై అభిప్రాయాలను సేకరించారు దర్శకులు. సరోగసి పై చాలా నిజాయితీగా వచ్చిన చిత్రం ఇది.
సినిమాలో పాత్రలన్నీ సహజంగా ప్రవర్తిస్తాయి. అత్త పాత్రలో సుధ నటన కూడా బావుంటుంది. వారు బాగా నటించిన చిత్రాలలో ఇది ఒకటి. తన బిడ్డ ప్రాణం తప్ప మరో కోణంలోంచి ఆమె ఈ సమస్యను చూడదు. అందుకే బిడ్డకే నచ్చచెప్పాలని అనుకుంటుంది. చాలా మెచ్యూర్డ్ వ్యక్తిత్వం ఉన్న పాత్ర ఇది. చాలా చిన్న బడ్జెట్తో తీసిన సినిమా. ఆ రోజుల్లో పెద్దగా ఆర్థిక పరంగా సక్సెస్ అయిన సినిమా కాదు ఇది. కానీ సరి అయిన సమయంలో వచ్చిన ఆలోచింపజేసే సినిమా.
- పి.జ్యోతి,
9885384740