Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసామీ సినిమాను అత్యుత్తమ స్థాయిలో నిలబెట్టిన గొప్ప దర్శకుడు జహ్ను బారువా. భారతీయ సినిమా గర్వించదగ్గ దర్శకులలో ఒకరు. వీరు తీసిన సినిమాలన్నీ అసామీ నేటీవిటికి దగ్గరగా ఉండి ప్రస్తుత సమాజం భరిస్తున్న సహిస్తున్న ఎన్నో విషయాలను చర్చకు పెడతాయి. వీరు తీసిన ప్రతీ సినిమా గొప్పదే. అయితే ''ఫిరిన్గొతీ'' ప్రత్యేకంగా గుర్తించుకోవలసిన సినిమా ఇందులో రీతు పాత్ర భారతీయ సినిమాలోని ఒక గొప్ప మహిళా పాత్రగా చెప్పుకోవచ్చు. ఈ పాత్ర పోషించిన అసామీ నటి మొలయా గోస్వామీకి ఈ సినిమా జాతీయ పురస్కారం తెచ్చిపెట్టింది. 1992లో వచ్చిన ఈ సినిమాకు రెండు జాతీయ పురస్కారాలు లభించాయి. జాతీయ ఉత్తమ నటి, రెండవ జాతీయ ఉత్తమచిత్రంగా ఈ సినిమాకు రెండు అవార్డులు వచ్చాయి. ఒక మామూలు స్త్రీ అధ్యాపకురాలిగా ఒక మారు మూల పల్లెటూరికి వచ్చి ఆ గ్రామంలో విద్య అనే అగ్నికణాన్ని ప్రజల మనసుల్లో ఎలా ప్రవేశపెట్టిందో చెప్పే కథ ఇది.
స్వాతంత్య్రం వచ్చి అప్పటికి పన్నెండు సంవత్సరాలు. కొరొంగా అనే ఒక మారుమూల పల్లెటూరు. ఆ ఊరికి చుట్టు పక్కల ఊర్ల నుండి రవాణా సౌకర్యం కూడా సరిగ్గా లేదు. ఏ వాహనం ఊర్లోకి రాదు. ఊరి బైట దిగి పన్నేండు మైళ్ళూ నడుచుకుంటూ ఆ ఊరిలోకి వెళ్ళాలి. అక్కడ ఒకప్పుడు ఓ పాఠశాల ఉండేది. కాని పన్నేండు సంవత్సరాల క్రితం ఆ పాఠశాల తగలబడిపోయింది. అందులో పనిచేసే టీచర్ ఊరు వదిలి వెళ్ళిపోయాడు. కాని ఆ స్కూలు తగలబడిపోయింది అన్న సంగతి బైటి ప్రపంచానికి తెలీదు. పన్నెండు సంవత్సరాల దాకా అతను జీతం తీసుకుంటూనే ఉన్నాడు. అతను ఐదు నెలల క్రీతం రిటైర్ అయితే ఆ ఉద్యోగాన్ని రీతు అనే ఒక స్త్రీకి ఇస్తుంది ప్రభుత్వం. ఆమె ముందు ఆ ఊరి పెద్దకు ఒక ఉత్తరం రాసి ఆ ఊరికి ఒంటరిగా ప్రయాణమవుతుంది. ఎన్నో కష్టాలకు ఓర్చి ఆ ఊరు చేరుకుంటుంది. కాని ఆ ఊరి పెద్దకు ఆ ఉత్తరం అందని కారణంగా ఆమెను ఆశ్చర్యంగా ఆహ్వానిస్తాడు. స్కూలు కాలిపోయాక ఎన్నో అర్జీలు పెట్టుకున్నా ఆ ఊరిని ఎవ్వరూ పట్టించుకోలేదని ఆమెకు చెబుతాడు. అప్పుడే ఇన్ని సంవత్సరాలు లేని ఆ స్కూలులో పని చేస్తున్నట్ళు ఆ ఊరి వదిలి వేసిన ఆ టిచర్ జీతం అందుకుంటూనే ఉన్నాడని రీతుకీ ఆ ఊరి పెద్దకు అర్థం అవుతుంది.
ఆ గ్రామంలో ఒక పెద్ద చెట్టు ఊరి మధ్య ఉంటుంది. ఆ చెట్టు క్రింద పాఠశాల మొదలెడుతుంది రీతు. ఆ ఊరిలో ఒంటరిగా నివసించే ఒక వితంతువు ఇంట్లో ఆమె ఉంటూ ఆ ఊరి పిల్లల తల్లి తండ్రులను స్వయంగా కలిసి పిల్లలను బడికి పంపమని చెప్పి చెట్టు కింద చదువు మొదలెడుతుంది. పిల్లల తల్లిదండ్రులు ముందు అయిష్టంగా పిల్లలను బడికి పంపు తారు. ఊరి పెద్ద కూడా వారందరికి చదువు గొప్పదనం చెప్పి ఇన్ని సంవత్సరాల తరువాత వచ్చిన అవకాశాన్ని వదులు కోవద్దని పిల్లలను రోజూ బడికి పంపమని చెబుతాడు. పనీ పాటల మధ్య సమయం ఉన్నప్పుడు ఆ స్కూలుకు వచ్చే పిల్లలు క్రమంగా ప్రతిరోజు రావడం మొదలెడతాడు. ఆ ఊరి మధ్య ఒక పెద్ద నది పారుతూ ఉంటుంది. దాని మీద కట్టెలతో కట్టిన వంతెన దాటి ప్రతిరోజు ఊరిలోకి వెళ్తూ తల్లి దండ్రులను కలిసి పిల్లలను స్కూలుకు తీసుకువస్తూ ఉంటుంది రీతు.
ఆ ఊరిలో తల్లి తండ్రులు లేని ఒక అనాథ అమ్మాయి మేనమామ ఇంట పెరుగుతూ ఉంటుంది. ఆమె అన్న హత్యా నేరం కింద జైలులో ఉంటాడు. ఆ అమ్మాయికి చదువుకోవాలని ఆశ. రీతుకి తాను కూడా స్కూలుకు వస్తానని కాని తన మేనత్త ఒప్పుకోవట్లేదని చెబుతుంది. అమ్మాయి శ్రద్ధ గమనించిన రీతు ఆ స్కూలు నడపడానికి తనకో తోడు కావాలని వారానికి రెండు రోజులు ఆ అమ్మాయిని తన వద్దకు పనికి పంపమని నెలకు ఇరవై రూపాయలు ఇస్తానని ఆమె మేనత్తకు చెబుతుంది. ఆమె సంతోషించి ఆ అమ్మాయిని రీతు వద్దకు పంపుతుంది. రీతుకు సహాయపడుతూ తీరిక సమయంలో చదువు నేర్చుకుంటూ ఉంటుంది ఆ అమ్మాయి. తన జీతంలో కొంత ఆ అమ్మాయికి ఇచ్చి ఆమెకు చదువుకునే అవకాశం కల్పిస్తుంది రీతు. మెల్లగా ఆ ఊరి వారందరూ ఆమెలోని నిజాయితీకి ఆకర్షితులవుతారు. పనిలేక పేకాట ఆడుకునే వద్ధులు కూడా ఆమెను తమకు తెలీయని విషయాలు చెప్పమని పిలిచి ప్రపంచ విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. చదువు అంటే క్లాస్రూమ్కే పరి మితం కాదని నమ్మే రీతు తనను సమాచారం కోసం చేరి అడిగే వారందరికీ వయోపరిమితి చూడకుండా తనకు తెలిసిన విష యాలు చెబుతూ ఉంటుంది. ఊరందరికీ చేరువ అవుతుంది.
ఒక రోజు రీతు ఊరి పెద్ద వద్దకు వచ్చి రెండు వెదురు కర్రలు కావాలని అడుగుతుంది. కారణం అడిగిన ఊరి పెద్దకు వచ్చే వర్షాకాలానికి చెట్టు కింద చదువు కుదరదు కాబట్టి ఒక గది నిర్మించాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. ఆ గదికి కావలసిన సామాను మొత్తం ఇంటినుండి తీసుకెళ్ళమని ఆ ఊరి పెద్ద భార్య అడిగితే అలా అయితే ఊరందరిని ఈ పనిలో నిమగం చేయడం కుదరదని, ప్రతి ఇంటి నుండి రెందు వెదురు కట్టెలు తెచ్చి ఒక స్కూలు నిర్మిస్తే అది అందరిదీ అన్న భావం కలుగుతుందని చెబుతుంది. అలా ప్రతి ఒక్క కుటుంబం సహకారంతో ఊరి ప్రజలే కలిసి రీతు పర్యవేక్షణలో స్కూలు నిర్మించుకుంటారు. వర్షాకాలం వచ్చినా పాఠశాల నడుస్తూం టుంది. పిల్లలు ప్రతి రోజు ఆ పాఠశాలకు వస్తూనే ఉంటారు.
రీతు తల్లి చిన్నతనంలోనే చనిపోతే తండ్రి సంరక్షణలో పెరుగుతుంది. అయితే అనుకోకుండా ఒక ప్రమాదంలో ఆమె వివాహం అయిన కొన్ని రోజులకే ఆమె భర్త మరణిస్తాడు. అత్తగారింట్లో నిరాదరణతో దారుణంగా బతుకుతున్న ఆమెను ఆమె తండ్రి తనతో తీసుకుని వస్తాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఈ ఊరిలో ఆమెకు అనుకోకుండా ఉద్యోగం వస్తుంది. ఒక విధవగా బతకక్కరలేదని ఆమెను మాములు పెళ్ళి కాని స్త్రీగానే జీవించమని తండ్రి ఆమెను ఎవ్వరూ గుర్తించని ఈ ఊరికి వెళ్ళి కొత్త జీవితం మొదలెట్టమని పంపిస్తాడు. తండ్రికి ఉత్తరాలు రాస్తూ ఈ స్కూలు వివరాలు చెబుతూ ఉంటుంది రీతు. ఆమె ఒక్కదానికి మాత్రమే వచ్చే ఆ ఒక్క ఉత్తరం కోసం పోస్ట్మాన్ పన్నేండు మైళ్ళూ సైకిల్ తొక్కుకుంటూ ఉత్తరం ఇచ్చి వెళుతూ ఉంటాడు. బదులుగా ఆ ఊరి జనం అతను వచ్చిన ప్రతిసారి తమ ఇంట్లో పండిన కాయగూరలను నింపి పంపుతుంటారు. అంతగా ఆ ఊరి మనిషిగా మారిపోతుంది రీతు. కాని ఆమె గతం అక్కడ ఎవరికీ తెలీదు.
ఆ ఊరిలో ఒక చదువుకున్న వ్యక్తి ఉంటాడు. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే అతను ఎవరికీ అర్థం కాడు. రీతుకు అతనో పెద్ద రచయిత అని, చదువు రాని ఆ ఊరి ప్రజలు అతని గొప్ప తనాన్ని అర్థం చేసుకునే స్థితిలో లేరని, కాని పుట్టిన ఊరి మీద అభిమానంతో అతను కొంత సమయం ఆ ఊరిలో గడపడానికి వస్తూ ఉంటాడని అర్థం చెసుకుంటుంది. తన ఊరివారికి అక్షరాలు నేర్పడానికి వచ్చిన ఆమె అంటే అతనికి గౌరవం. తనను తన ఊరికి పరిచయం చేయడానికి చదువు అనే వారధిని నిర్మించడానికి ప్రయత్నించే ఆమెపై అతనికి గొప్ప నమ్మకం ఏర్పడుతుంది. అలాగే ఆ ఊరిలో తాగుబోతుగా తిరుగుతూ ఉండే ఒక భాధ్యలేని ఒక తండ్రి కూడా ముందు తన బిడ్డను స్కూలుకు పంపడానికి ఇష్టపడకపోయినా క్రమంగా చదువు విలువ గ్రహించి రీతును గౌరవించడం మొదలెడతాడు.
ఆ ఊరిలో పోరంబోకుగా తిరిగే చందు ఎక్కడా నిలకడగా ఉద్యోగం చేయడు. ఉద్యోగం వదిలి ఊరు చేరిన అతనికి పెళ్ళి చేస్తే కుదురుకుంటాడని తలచి అతని తల్లి తండ్రులు అనాథ అయిన అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటారు. రీతు దగ్గర చదువుకుంటున్న అమ్మాయితో అతని పెళ్ళి నిశ్చయం చేస్తారు. కాని ఆమె ఆ వివాహాన్ని తిరస్కరిస్తుంది. తన మేనమామకు ఎదురు తిరుగుతుంది. ఆమెకు రీతు అండ ఉందని నమ్మిన చందు తన తాగుబోతు స్నేహితులతో కలిసి రీతును ఆ ఊరు నుండి పంపాలని నిశ్చయించుకుంటాడు. ఆమె వితంతువని ఆమె గతం తెలుసుకుని ఊరి వారికి చెబుతాడు. కాని ఊరి వారు దానికి చలించరు. రీతు ఏ బెదిరింపులకు లొంగదు. ఊరి పెద్ద కూడా ఆమెకు మద్దతు ఇస్తాడు. అందుకని ఒక రోజు తాగి వచ్చి ఆమె ఇంటిపై దాడికి దిగుతారు. జైలులో ఉన్న ఆ ఊరి వ్యక్తి తన చెల్లెలిని కలవడానికి ఆ ఊరు వస్తాడు. అతను రీతు పై దాడి చేస్తున్న ఆ తాగుబోతులను కొడతాడు. వారు ఆగ్రహం తో స్కూలు తగలబెడతారు. తన స్కూలు రక్షించుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తుంది రీతు. కాని ఆమె కళ్ళ ముందే ఆ స్కూలు బూడిదై పోతుంది. నిరాశతో స్పహ తప్పి పడిపోతుంది. కాని మరుసటి రోజు ఆ ఊరి వాళ్ళందరూ వచ్చి తాము మళ్ళి ఆ స్కూలు నిర్మిస్తామని మళ్ళి కాల్చేస్తే మళ్ళీ మళ్ళీ కట్టుకుంటామని ఏ కారణంతోటీ కూడా ఆమెను వదులుకో వడానికి సిద్ధంగా లేమని చెబుతారు. తన ప్రయత్నం ఊరిలో చలనం తీసుకు వచ్చినందుకు తప్తిగా వారిని చూసుకుంటుంది రీతు.
మనుష్యులలో చలనం రావడం అవసరం, తమ బాగు కోసం వారు ఆలోచించడం అవసరం. ఆ చలనాన్ని, ఆ స్పార్క్ని రగిలించగలగడమే నిజమైన ప్రగతికి పునాది. రీతు తన చర్యలతో ఆ ఊరి ఆమాయక ప్రజలో ఆ చలనాన్ని తీసుకు రాగ లుగుతుంది. అందువల్లే ఎన్ని కష్టాలు వచ్చినా తాము ఆ పాఠశాలకు అండగా ఉంటామని పిల్లలను చదివించుకూం టామని ఆ ఊరంతా ఒక్కతాటిపై నిలుస్తారు. విద్య గొప్ప తనాన్ని అర్థం చేసుకుంటారు. ఒక నిజాయితీ గల ఉపాధ్యా యురాలి ప్రభావం కేవలం క్లాసురూం వరకే పరిమితం అవదని, పూర్తి సమాజాన్ని ఉత్తేజితం చేయగలిగిన మార్పే ఎక్కువ కాలం నిలుస్తుందని చెప్పే ఈ పాత్ర ను దర్శకులు మలచిన తీరు చాలా బావుంటుంది.
స్కూలు పైకి దాడికి వచ్చిన దుండగుల పై కొడవలి ఎత్తి పెట్టీ పోరాడడానికి సిద్దపడిన ఆ ఉపాద్యాయురాలి నిబద్దతను దాని వెనుక ఆమెకు విద్యపై నున్న నమ్మకాన్ని చూసి చలిస్తారు ప్రేక్షకులు. ఒక అసహాయ వితంతువు తనకు అవకాశం వస్తే ఒక ఊరినంతటికి ఎలా ప్రభావితం చేయగలదో చెప్పిన పాత్ర ఇది. తన జీవితంలో అంధకారం ప్రవేశించినా మరి కొందరి జీవితాలలో వెలుగు నింపడానికి తాపత్రయపడే స్త్రీలోని శక్తికి నిదర్శనం ఈ సినిమా. అత్యంత సహజమైన వాతావరణంలో ఎక్కడా అసహజత్వం లేని చిత్రీకరణతో తీసిన మంచి చిత్రం ఇది. యూ ట్యూబ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో ఉన్నది ఈ సినిమా.. చూసేయండి మరి...
- పి.జ్యోతి,
9885384740