Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శరీరాన్ని కప్పి ఉంచుకొమ్మని సభ్య సమాజం మనిషిని కోరుతుంది. నగత్వాన్ని పశుగుణంగా మానవ సమాజం పరిగణిస్తుంది. సిగ్గు అన్నది మనిషిని జంతువుని వేరు చేసే గుణం. అయితే నగత్వాన్ని ఎంతో అసహ్యించుకోవడానికి అలవాటుపడి మనిషి, తన మనసును కూడా కప్పి పుచ్చి ఉంచుకోవడం నేర్చుకున్నాడు. మనసులోని ఆలోచనలను, తనలోని ఎన్నో ఇతర గుణాలను పరదా చాటుకు నెట్టి శరీరాన్ని నగం చేసుకుంటూ పోతుంది ప్రస్తుత ఆధునిక సమాజం. ఇప్పుడు శారీరిక అర్ధనగత్వం ఒక స్టేటస్ సింబల్. మనసును, మనిషి అసలు స్వరూపాన్ని, కోరికల్ని, స్వభావాన్ని ఎంతగా కప్పిపుచ్చుకుని ఉంటే అంత సభ్యత గల వాళ్లం అనిపించుకుంటున్నాం.
కప్పుకోవలసిన దాన్ని విప్పుకుని, విప్పవలసిన వాటిని కప్పుకుని మనిషి ఒక నాటకీయ జీవితాన్ని గడుపుతున్నాడు. నగత్వాన్ని ఒక పక్క ఆరాధిస్తూ, మరో పక్క అదే స్థాయిలో అసహ్యించుకుంటూ ఒక రకమైన అయోమయ వాతావ రణంలో జీవిస్తున్నాం. ఆర్థికమైన వనరులున్న స్థాయి సమాజంలో నగత్వం ఒక ఫాషన్, దాన్ని ఆస్వాదిస్తుంది సమాజం. కాని దిక్కు లేక, బతకలేక కూటి కోసం వలువలను పక్కన పెట్టే పేద వర్గాన్ని అతి హేయంగా చూస్తుంది ఇదే సమాజం. నగత్వం కూడా డబ్బు ఆధారంగా హౌదాను సంక్రమించుకుంటుంది. మన వత్తిని, నైతిక తను, నీతిని, కేవలం డబ్బు మాత్రమే నియంత్రిస్తూ కనిపిస్తుంది.
భర్త మరో స్త్రీతో తన ఎదుటే తిరుగుతుంటే, ఆ స్త్రీ మత్తులో పడి భార్య నగల నుండి ప్రతి ఒక్కటి ఆమెకే చేరవేస్తుంటే, కనీస అవసరాలు తీరక తాను తన బిడ్డ బాధపడుతుంటే యమున అనే ఒక పేద స్త్రీ, మరో దారి లేక భర్తను ఎదిరిస్తుంది. బిడ్డ భవిష్యత్తు కొసం, అతని చదువు ఆగకుండా సాగడం కోసం అహంకారంతో కొట్టుకుంటున్న ఆ భర్తను నడివీధిలో నిలదీస్తుంది. కాని ఉంచుకున్న్త స్త్రి ముందు, ఊరిజనం ముందు ఆ భర్త ఆమె మొహం మీద ఉమ్మేస్తే ఆ అవమానాన్ని సహించలేక, నీటీలో దూకి చావాలని అనుకుంటుంది. కాని తాను చనిపోతే తన బిడ్డ అనాధ అవుతాడని, తన శరీరాన్ని ఆ నీటితో కడుక్కుని, అవమానాన్ని దిగమింగుకుని ఆ కొడుకు కోసం ఊరు వదిలి, దూరపు చుట్టరికం ఉన్న తన పిన్ని దగ్గరకు ముంబరు చేరుకుంటుంది. పిన్ని ఇంట్లో ఉండి బిడ్డను చదివించుకోవడానికి పని వెతుక్కుంటుంది. కాని పని దొరకదు. పిన్ని ఎక్కడ పని చేస్తుందో తెలుసుకుందాం అని ఆమె వెనుక వెళ్ళిన యమున జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఆమె ఒక న్యూడ్ మాడల్ అని తెలుసుకుంటుంది. ఒక పది మంది విద్యార్థుల ముందు బట్టలు లేకుండా కొన్ని గంటలు కూర్చుని మాడలింగ్ చేస్తున్న పిన్ని జీవితం ఆమెకు అర్థం కాదు. ముందు అసహ్యంతో పిన్నిని నిలదీస్తుంది. కాని తప్పని పరిస్థితులలో తాను ఆ పని గత పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నానని, విద్యార్థుల చదువుకు సహకరిస్తున్నానని, తనను నగంగా చూసే ఆ పిల్లల చూపులో చదువు తప్ప ఆకలి ఉండదని, కాని బైట ఒక పేద స్త్రీని ప్రతివాడు ఆకలితోనే చూస్తాడని చెప్పిన పిన్ని మాటలలోని నిజాన్ని గ్రహిస్తుంది. ఆమె స్వీయ అనుభవాలు కూడా అవే కాబట్టి. బిడ్డను చదివించుకోవాలి, ఎలాగన్నా వాడినో ప్రయోజకుడ్ని చేయాలి అందుకని యమున తాను కూడా న్యూడ్ మాడలింగ్కు ఒప్పుకుంటుంది.
కొన్ని పద్ధతులతో నమ్మకాలతో బతికిన స్త్రీ తన బట్టలు నలు గురి ఎదుట అంత సులువుగా విప్పలేదు. మొదటిసారి న్యూడ్గా క్లాసులో కూర్చువలసి వచ్చినప్పుడు ఆమెపడే ఇబ్బంది ప్రేక్షకులను కలచివేస్తుంది. ఆమె కంటి నుండి కారే ఆ కన్నీటిని ఆ క్లాసులో ఒకే ఒక స్టూడెంట్ చూస్తాడు. ఆమె బాధను అర్థం చేసుకుంటాడు. మిగతా పిల్లలకు ఆమె ఒక వస్తువు మాత్రమే... కాని అందరూ ఆమెను గౌరవిస్తారు. బైట రోడ్డుపై కనిపించే ఆకలి చూపులు ఆ విద్యార్థులలో ఉండవు. అక్కడే ఆమె ఒక రకమైన రక్షణను అనుభవిస్తుంది కూడా.
మెల్లగా డబ్బు సంపాదించడం మొదలెట్టిన తరువాత ఆమె తన కొడుకులో చిత్రకళ పట్ల ఆసక్తిని గమనిస్తుంది. అతనికి ఆర్ట్ స్కూల్ లో చేరడానికి స్క్లాలర్షిప్ కూడా లభించాక అతన్ని బొంబాయిలో ఉంచితే అతను తన కాలేజీలోనే చేరే పరిస్థితి రావచ్చని అతన్ని దూరంగా ఔరంగాబాద్ పంపిస్తుంది. కొడుకు వెళ్ళనని మొండికే స్తాడు. ఆమె పిన్ని బలవంతంగా అతన్ని ఔరంగాబాద్ పంపిస్తుంది. ఆ తరువాత అక్కడ నుండి డబ్బు కోసం తప్ప ఆ కొడుకు తల్లికి ఫోన్ చేయడు. ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించడు. ఇంకా ఇంకా డబ్బు కావాలని, తన అవసరాలు పెరుగుతున్నాయని ఎక్కువ డబ్బు పంప మని అతను అడగడం మొదలవుతుంది. కొడుకు అవసరాలు పెరుగుతున్నాయని డబ్బు ఎక్కువ పంపాలని యమున కాలేజ్ కాకుండా పర్సనల్ పెయింటర్స్కి కూడా మాడల్గా ఉండడానికి ఒప్పుకుంటుంది. ఎక్కువ గంటలు పని చేస్తుంది. ఇళ్ళల్లో పనికి ఒప్పుకుంటుంది. సంపాదించిన ప్రతి పైసా కొడుక్కి పంపిస్తుంది. కొడుకు అవసరాలు పెరుగుతూనే ఉంటాయి. ఆమెని రోజూ పరిశీ లిస్తూ ఆమెను అర్థం చేసుకునే ప్రయత్నం చేసే ఆ స్టూడెంట్ మాత్రం ఆమెను మాడలింగ్ కోసం వెళ్లాల్సిన ప్రతి చోటకు జాగ్రత్తగా తీసుకుని వెళుతూంటాడు. ఆమెను నిత్యం కనిపిట్టుకుని ఉంటాడు.
ఒకసారి ఒక పెద్ద చిత్రకారుడు ఆమెను మాడల్గా ఇంటికి పిలిపించుకుంటాడు. ఈ పాత్ర ఎమ్.ఎఫ్.హుసెన్ను పోలి ఉంటుంది. కాళ్ళకు చెప్పులు లేకుండా నడవడం, న్యూడ్ పెయింటింగ్లో అతని స్టైల్ హుసెన్ గారిని పోలి ఉన్నా సినిమాలో సెన్సార్ కోసం కావచ్చు ఆ పాత్ర పేరు మార్చడం జరిగింది. అతను ఆమెకు ఎక్కువ డబ్బును గౌరవంగా ముట్టజెబుతాడు. ఆమె ఉన్నంతసేపు ఆమెను ఒక వ్యక్తిగా, స్త్రీగా, మనిషిగా గౌరవిస్తాడు. అతను చూపిన ఆదరణ ఆర్టిస్ట్ల పట్ల ఆమెలో గౌరవభావాన్ని నింపుతుంది. తాను చేస్తున్న పని అంత నీచమైనది కాదని ఆమె నమ్మడం మొదలెడుతుంది. అందుకే స్కూల్పై ఒక వర్గం వారు దాడి చేసి న్యూడ్ పెయింటింగ్స్ మనేయాలని విద్యార్థులను గాయ పరిచి, బెదిరించి వెళ్ళిన తరువాత కూడా అందరికన్నా ముందు ఆమే పని మళ్ళీ మొదలెడుతుంది. అందరి గౌరవాన్ని అందుకుంటుంది.
ఆమె కొడుకు డబ్బు సంపాదించడానికి దుబారు వెళ్తానని, చదువు మానేస్తానని కాలేజీ నుండి తిరిగి వచ్చేస్తాడు. తాను అతని చదువు కోసం ఎంతో ఖర్చు పెట్టానని చెప్పే ప్రయత్నం యమున చేస్తే సగటు మగవాడిగా మారిన ఆమె కన్న కొడుకు ఆమె పడుపు వత్తి చేస్తుందని లేకపోతే కేవలం ఇళ్ళల్లో పనిచేస్తూ, రోడ్లు ఊడుస్తూ ఆమె తన ఫీజులు, తాను అడగిన డబ్బులు ఎలా పంపగలిగిందని ఆమెను అసహ్యంగా అవమానిస్తాడు. భర్త ముఖం మీద ఉమ్మేసినా కొడుకు కోసం ఆ గాయాల్ని దిగమింగుకున్న ఆ తల్లి హదయం కన్న బిడ్డ చేసిన ఆ గాయాన్ని తట్టుకోలేకపోతుంది. భర్త నిరాదరణ ఆమెకు బతుకుని ఒక సవాలుగా తీసుకోవడానికి ప్రేరేపిస్తే, బిడ్డ చేసిన ఆవమానం జీవితేచ్చనే పోగొట్టుకునేలా చేస్తుంది. ఆమె మానసికంగా చనిపోతుంది.
తన పిన్ని కూడా ముసలితనంతో మాడలింగ్ చేయలేక ఒంటరిగా మిగిలిపోవడం చూస్తుంది యమున. తన జీవితంపై ఆమెలో ఎన్నో ప్రశ్నలు మొదలవుతాయి. ఆమెను అర్థం చేసుకున్న స్టూడెంట్ మిత్రుడు ఇప్పుడు అదే కాలేజీలో ప్రొపెసర్ అవుతాడు. అతనితో ఆమె చివర్లో చేసే సంభాషణ సినిమాకే హైలైట్. ''నా బిడ్డను చదివించుకోవాలని నా కోరిక. డబ్బుదేముంది అందరూ సంపాదిస్తారు, కాని డబ్బుతో పాటు హౌదాను, సంస్కారాన్ని నా బిడ్డ సంపాదించాలనుకున్నా. దానికోసం వాడ్ని చదివించాలను కున్నా. ఆ చదువు ఇచ్చే సంస్కారంతో నా బిడ్డ మీలా తయారయ్యి, నేను చేసే వత్తిని, అందులో నా త్యాగాన్ని, నేను తన కోసం తీసుకున్న నిర్ణయాన్ని వాడు అర్థం చేసుకుంటాడని అనుకున్నా. కాని వాడు సంస్కారంతో మాత్రం పెరగలేదు. ఈ నగరం నాకు జీవితాన్ని ఎలా చూడాలో నేర్పింది. అందమైన అనుభవాల్నిచ్చింది. కాని నా కొడుకు చేసిన అవమానం ఆ అనుభవాల్నీ మసి చేసింది..'' అంటూ ఆమె వ్యక్తీకరించే ఆ నిస్సహాయత్వాన్ని ఆ నటి చూపిన మెచ్యూరిటిని మర్చిపోలేం. చాలా గొప్ప సీన్ అది. టీ తీసుకు వస్తానని వెళ్ళిన ఆ మిత్రుడిని వదిలి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది యమున.
ఓ తిరుగుబోతు మగాడిగా మారిన ఆమె కొడుకు కొన్ని సంవత్సరాల తరువాత ఆ కాలేజీ ముందునుంచి నడిచి వెళుతూ న్యూడ్ ఎగ్సిబిషన్ అక్కడ జరుగుతుందని తెలుసుకుని ఆకలి చూపుల్తో ఆ గాలరీలోకి వెళ్తాడు. అక్కడ కనిపించే నగ చిత్రాలను కాముక దష్టితో అతను చూస్తూ వెకిలిగా ప్రవర్తిస్తూ ఒక చిత్రంలో తన తల్లి మొహం కనిపించి ఆశ్చర్యపోతాడు. కోపంతో రగిలి పోతాడు. తల్లి న్యూడ్ మాడల్గా కనిపించడం అతనిలోని అహాన్ని గాయపరుస్తుంది. అక్కడ ఉన్న ఆర్టిస్ట్ చెంపపై ఒక దెబ్బ వేస్తాడు. సినిమా ఇక్కడితో ముగిస్తుంది. ఇంతకీ అతను ఆ చెంప దెబ్బ ఎవరిని కొట్టినట్టు, తన అహంకారాన్నా, తనలోని మేల్ పొజెసివ్ నెస్నా అన్నది మనకే వదిలేసాడు దర్శకుడు. ఆ చెంపదెబ్బతో అతను చెప్పాలనుకున్నది చెప్పేసాడు. కొన్ని గంటలు ఒక నగ శరీరం ముందు ఉండి కూడా ఆ శరీరంలోని మనసును చూడగలిగిన ఆ స్టూడెంట్ ఇచ్చిన పాటి గౌరవం కూడా ఇవ్వలేని ఆ రక్తం పంచుకుని పుట్టిన పుత్రరత్నం కొట్టిన అ చెంపదెబ్బ అతనిలో మెల్కోబోతున్న మనస్సాక్షిని మళ్ళీ బెదిరించి పడుకోబెట్టడానికి ఉపయోగపడిందేమో. తల్లి డబ్బును, శ్రమను, బిడ్డ అనే హక్కుతో దోచుకుని ఆమె శరీరాన్ని చూసి అది వ్యభిచారానికే పనికి వస్తుందని నిర్ణయించుకున్న ఆ సగటు మగాడు, స్త్రీ శరీరాన్ని మరో దష్టితో చూడగలగడం చేతనయిన మరో మగాడిని చూసి భరించలేక ఆ చెంపదెబ్బ అక్కసుతో కొట్టి ఉండవచ్చు. కాని ఆ ఇద్దరు మగాళ్ళల్లో ఆ స్త్రీని న్యాయం చేసిన వారి ఎవరు అన్న చర్చ ఇక ఆ చెంపదెబ్బ తరువాత మనకు అర్థమయి తీరుతుంది.
యమున భర్త నిరాదరణను భరించి చావాలా, బతకాలా అనుకున్నప్పుడు బిడ్డ కోసం ఆ అవమానాన్ని దిగమింగి బతకడానికి నిశ్చయించుకుంటుంది. మొదటిసారి న్యూడ్గా నిలబడవలసి వచ్చి నప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చింది, తన మానం, తన సిగ్గు కాదు, బిడ్డ అవసరం, భవిష్యత్తు. ఆ సంపాదించిన డబ్బు లెక్కపెట్టుకున్న ప్రతిసారి ఆమెకు బిడ్డను ఏదో పెద్దవాడిని చేయాలన్న కోరిక తప్ప తన జీవితం, తన జీవితానికో అర్థం ముఖ్యం అనిపించలేదు. అందుకే ఆ బిడ్డ చేసిన అవమానంతో బతకడమే దండగ అనుకునే స్థితికి చేరుకుంది. ఎంతమంది తల్లులు బిడ్డల కోసం భర్తల చేతులో అవమానాలుపడి బిడ్డలేదో ఉద్దరిస్తారని వారి కొసం తమను తాము మర్చిపోయి జీవితాలను ఆ బిడ్డలపరం చేస్తునారు. ప్రేమ అన్నది మనిషిని బానిసగా మార్చకూడదు. వ్యక్తిగా మరల్చగలగాలి. వ్యక్తి త్వాలను చంపుకుని సంపూర్ణంగా మరొకరి అధీనం అయ్యేంతగా స్త్రీలు ప్రేమించిన ప్రతిసారి వారికిలాంటి అనుభవాలే లభిస్తాయి. ఎక్కడో అరకొరగా ప్రేమకు బదులు ప్రేమ పొందగలిగిన మాతమూర్తులు కనిపిస్తారేమో.
తల్లి గర్భంలో ఉన్నంత వరకే ఆ బిడ్డ ఆ స్త్రీ సొంతం. భూమి మీద పడ్డ మరుక్షణం సమాజం ఆ బిడ్డను ప్రభావితం చేస్తూ పోతుంది. ఆవుని మందలో కలుపుకోవడానికి దూడను ఉపయోగిం చుకునే నీతే ఈ సమాజానిది. ఆ దూడ కోసం ఆలోచించకుండా మందలోకి దూరిపోతుంది ఆవు. బందీ అయిపోతుంది. మాతత్వం అన్న ఊబిలో చాలామంది స్త్రీలు అలా కూరుకుపోయినవారే. తమను తాము బలి చేస్తుకునేవారే.. యమునకున్న నమ్మకాలను వమ్ము చేసి, ఆమెలోని ప్రేమను, జీవితేచ్చను ఒలిచి పడేసి ఆమె ఆత్మను నగం చేసి ఒంటరిని చేసి నిస్సహాయురాలిగా మార్చిన ఆమె భర్త, కొడుకు ఆమెను నగంగా నిలబెట్టారు కాని ఆమె చేత వలువలు విప్పించిన ఆమె ఉద్యోగం మాత్రం కాదు. ఆమె మరణించిన తరువాత కూడా ఆమెకొక ఐడెంటిటినీ ఆమె వత్తి, ఇంకా ఆమెను చిత్రించిన ఆ స్టూడెంట్స్ మాత్రమే ఇవ్వగలిగారు. ఫలానా వారి భార్య గానో ఫలానా వారి తల్లిగానో మిగిలిపోవాలని ఆమె తపనపడ్డా ఆమె ఒక న్యూడ్ మాడల్గా సంపాదించుకున్న స్థానం మాత్రమే ఆమె సొంతం కాని, ఆ భార్యా, తల్లి అన్న కితాబులు ఆమెను వ్యక్తిగా కూడా బతకనివ్వలేదు.
ఈ సినిమాను రవి జాదవ్ అనే దర్శకుడు మరాఠిలో తీసారు. న్యూడ్ సినిమా అని ఏదో ఊహిస్తూ వెళ్లవలసిన అవసరం లేకుండా, చాలా నీట్గా బేలెన్స్డ్గా మన భాషలోని ప్రేమకథలలో తప్పకుండా ఉండే స్థాయి నగత్వం ఎక్కడా కనిపించనంత నిండుగా తీయగలిగిన వారి ప్రతిభ సూపర్. కళ్యాణి మూలే యమున పాత్రలో నటిస్తే, ఆమె పిన్నిగా ఛాయా కాదం కూడా గొప్పగా నటించారు. అన్నీ ట్రాజిక్ సీన్లను దర్శకుడు నీటితో ముడిపెట్టడం బావుంది. యమున జీవితంలో ప్రతి అలజడి నీటి మధ్యనే సాగింది, భర్తను మొదటిసారి మరో స్త్రీతో ఆమె నీటిలోనే చూస్తుంది. భర్త చేసిన అవమానాన్ని అదే నీటితో కడుక్కుంటుంది. ముంబాయిలో ఆమె జీవితం అంతా మరుగునీటి పక్కన గడుస్తుంది. చివరకు అదే నీటిలో అంతమవుతుంది. ఎన్ని నీటి బొట్లను కళ్ళలో నింపుకుంటే తప్ప స్త్రీ జీవితం సాగగలదు? ఎన్నీ కన్నీళ్లను కారిస్తే తప్ప ఆమె మనసు మంట ఆరగలదు? భర్త నుండి, బిడ్డల నుండి ప్రేమ కోసం ఎదురుచూస్తూ తమకోసం తాము జీవించవచ్చనే విషయాన్ని మర్చి పోయే తల్లుల కథ న్యూడ్ మరాఠీ సినిమాలోని ఈ యమున పాత్ర.
- పి.జ్యోతి,
9885384740