Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటు బాధ, అటు సంతోషం రెండూ కలగలిపి ఇప్పటికీ కవిలో సజీవ సాక్ష్యంగా మెదిలే బతుకు చిత్రం.
గతాన్ని తడుముతూ అప్పుడ ప్పుడు బరువును దించే జ్ఞాపకం. వెన్నెలను కురిపిస్తూ ఇరగ్గాసిన చందమామ. నలుగురి గొంతుల దాహం తీర్చే గిరకల బావి.ఇవన్నీ 'రేగుపండ్ల చెట్టు' కవితలో కన్పిస్తాయి. కవి గతాన్ని, ప్రస్తుతాన్ని చూసినవాడుగా ఈ కవితను రాశాడు. ప్రపంచీకరణ నేపథ్యంలో రేగుపండ్ల చెట్టు, షాపింగ్ కాంప్లెక్స్గా ఎలా మారిందో వాపోయాడు. ఈ కవితలో కవి జీవిత సంబంధ విషయాలు ఉండడం బలాన్నిచ్చే అంశం. ఈ కవిత పేరునే పుస్తకం పేరుగా పెట్టడంలో కూడా కవి వినూత్నతను చూపించాడు. ఇందులో రేగుపండ్ల తీపినే కాదు వాటిని అంటిపెట్టుకున్న ముండ్లను కూడా కవిత్వంలోకి చేర్చాడు.
వెంటాడే వాక్యాల్లోకి..
1.''నిన్న ఇక్కడ పచ్చని చెట్లు కనిపించేవి
అవి చూపుల్ని శుభ్రం చేసేవి
ఇవాళ ఇక్కడ
ఆకాశాన్ని ముద్దాడే అపార్టుమెంట్లు
మహానగరం పచ్చదనాన్ని
మాయం చేస్తున్నవి'' (మ్యాజిక్ షో)
''మ్యాజిక్ షో'' అనే కవితలో కవి అభివద్ధికి రెండోవైపుగా ఈ అంశాలను చర్చలోకి తీసుకొచ్చాడు.
1. చెట్లు మాయమై అపార్ట్మెంట్లు రావటం
2. పార్కులను కబ్జా చేయటం
3. గుడిసెలు మాయమై వివిధ రకాల భవనాల నిర్మాణం
4. స్మార్ట్ ఫోన్ ప్రేమలు
ఈ కవితలోని ఆరంభవాక్యాలు పర్యావరణ స్పహను కలిగించేవి. పచ్చని చెట్లను గుర్తుకు తెచ్చేవి. పర్యావరణాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నామన్న ఇంగితాన్ని కలిగించేవి.
2. ''శతాబ్దాలుగా కలలు కంటూనే వున్నాను
మీ దాహం తీర్చే నీళ్ళ నదిని
మీకు అన్నం పెట్టే పంటలనదిని
రక్తనదిగా ,క్షతగాత్రులను దేహాలు నదిగా మార్చే
ప్రభువుల యుద్ధం పిపాసలు అంతరించాలనీ
ఎప్పటికైనా సంపద అందరికీ చెందాలన్న
ఆ అపురూపమైన కాలం నిజం కావాలనీ'' (నది చెప్పిన సంగతులు కొన్ని..)
ఏ నాగరికతైనా విలసిల్లింది నదులున్నచోటునే.ఒక్క మాటలో చెప్పాలంటే నదే చరిత్ర.చరిత్రే నది. సంపదకు మూలం నదులేనని, నాగరికతతో మనుషులు సమూహాలుగా, వర్గాలుగా మారి కత్తులు దూసుకున్నారని కవి చరిత్రను గుర్తు చేశాడు. కళింగ యుద్ధం ద్వారా అశోకుడు మారి బౌద్దాన్ని స్వీకరించిన సంఘటనను, సంపద కోసం సింహాసనాలను అధిష్టించి నది పాదాల ప్రాణం లేని దేహాల్లా మారిన వ్యక్తుల చరిత్రను కవితలోకి తీసుకొచ్చాడు.ఇందులో చివరకు సంపద అందరికీ చెందాలన్న ఆశను కనబరుస్తారు.
3. ''మహానగర రహదారులు ఖాళీ అయి
వీధి కుక్కలు, వీధి దీపాలు వెలుగులో
మహానగరాన్ని కాపలా కాసే వేళ
నాలుగు తెల్లకాగితాలను పడవగా చేసుకుని
ఎప్పట్లాగే అన్వేషణ ప్రారంభిస్తాను
ఇన్ని నేనుల నడుము నా నేను ఎవరని?'' (అనేక ''నేను''లు)
కవి ఎప్పుడూ ఒక 'నేను' కాదు.కవిలో అనేక సందర్భాల తాలూకా 'నేను'లు ఉంటారు. కవిలోకి ప్రేమ ప్రవేశిస్తుంది. దయ తట్టిలేపుతుంది. దేశభక్తి నరనరాలను ఉప్పొంగేలా చేస్తుంది. కవినో విప్లవకారునిగా తయారుచేస్తుంది. కవికి బలహీనత ఉంటుంది.కవికి ఆశ ఉంటుందని కవి తనను తాను వెతుక్కుంటూ 'నేను' ఎవరినని ఈ కవితలో ప్రశ్నించుకుంటాడు. కవికి ఏదో రోజయితే సమాధానం దొరుకుతుంది.సమాధానం దొరకకున్న ఒక ప్రశ్న, ఇంకో ప్రశ్నగా సాగిపోతూ జవాబు వైపుకైతే కదులుతుంది.
4. ''ఒక్కొక్క వాక్యాన్నే ఆవాహన చేసుకుంటూ
రాత్రంతా మేల్కొని ఉంటాను
తెల్లవారేసరికి కూడా
చెమ్మ ఉన్న ఒక్క పద్యం కాలేకపోయిన
నా పొడికళ్ళను తెల్లకాగితంలో చూసుకుని
ఒక వెర్రి నవ్వు నవ్వుకుంటాను
మరి మీరు?'' (ఒకే ఒక్క కవితా వాక్యం.)
కవిత్వం గురించే కవితరాసే కవి బాధ్యత వాక్యాల్లో కనిపిస్తుంది.కవి చక్కని కవితా వాక్యం కోసం పరితపిస్తాడు.ఎన్నో రోజులు పదాలను మాగేస్తాడు. నిద్రలేని రాత్రులు గడుపుతాడు.ఈ కవి కూడా ఆ కోవలోని వాడే. ఒక్క అసలుసిసలైన కవితావాక్యం చాలంటాడు. ఈయన కవిత్వమే. ఈయన రాసే వాక్యం కవిత్వమే. వాక్యాల్లో కవిత్వాన్ని నింపే తపన గల ఈ కవి వాక్యాలను చూద్దాం.
ఈ వాక్యాల్లోని చివరిప్రశ్న చాలా సూటిది. ఘాటైనది. ఇంకా కవిత్వ కౌగిలింతలు, కొన్ని కలలు, జీవన సౌరభం, కవి జీవితం, సంస్కతి, కొన్ని రహస్యాలు, కవుల స్మరణ, బాల్యస్మతులు, కొన్ని జీవితాలు, కొంత సందేశం కలగలుపుకొని ఇలా ''రేగుపండ్ల చెట్టయి'' అందరి గుండెల్లో నాటుకుంది. వీలున్నప్పుడు ఈ పండ్ల మాధుర్యాన్ని మీరు తప్పక గ్రోలుతారు కదూ?
- తండ హరీష్ గౌడ్
8978439551