Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతు ఘనతను చాటి చెప్పే, రైతు జీవితాన్ని ప్రతిఫలింపజేసే పాటలు మనకు తెలుగు సినిమాల్లో ఎన్నో ఉన్నాయి. నిరంతర శ్రమతో పనిచేసి, తన జీవితమంతా ధారవోసి మన కడుపు నింపే త్యాగధనుడు రైతు. అలాంటి రైతు వైభవాన్ని ఎలుగెత్తి వినిపించే పాటను 'చిట్టిచెల్లెలు' (1970) సినిమాలో ఆచార్య ఆత్రేయ రాశాడు.
చాలామందికి ఆత్రేయ అనగానే మనసుపాటల రచయితగానే కనిపిస్తాడు. తాత్త్వికానుభూతిని రంగరించి హదయాలను ఎంతో ఆర్ద్రంగా తడిమే కలమతనిది. మనసు పాటలే కాదు వయసుపాటలైనా, కర్షకుల జీవితాలు ప్రతిబింబించే శ్రామిక గీతాలైనా ఆయన ఎంతో అద్భుతంగా రాయగలడు. ఆత్రేయ ఏది రాసినా మనసు పెట్టి రాస్తాడు. అందరి మనసుల్ని ముట్టేలా రాస్తాడు.
'చిట్టిచెల్లెలు'(1970) సినిమాలో 'పట్టాలి అరకా దున్నాలి మెరకా' అనే పాట రైతు వైభవాన్ని, శ్రామిక జీవనాన్ని ఎంతో నిండుగా ప్రతిఫలింపజేస్తుంది. పనినే దైవంగా భావించేవాడు శ్రామికుడు. అందునా రైతు పంటను ప్రాణప్రదంగా భావిస్తాడు. ఎండ, వాన, చలి అంటూ ఏదీ లెక్కచేయడు. పసిబిడ్డలా పంటను చూసుకుంటాడు. నారు వేసిన మొదలు పంట చేతికి వచ్చేదాకా అతని ధ్యాస, శ్వాస అన్నీ పంటపైనే.
నిరంతరశ్రమతో అతని జీవన ప్రయాణం కొనసాగుతుంది. కష్టాల కడగండ్లను ఎదుర్కొంటూ అతని గమనం ముందుకు సాగుతుంది. ఏరులను మళ్ళించి పంటల నోటికి నీటినందించడం, ఎత్తుపల్లాలను సరిచేయడం నిండైన మెండైన ధాన్యపురాశులతో పల్లెలకు సౌభాగ్యాన్నందించడం మాత్రమే అతనికి తెలుసు. తన కడుపునింపుకోవడం ఎరుగడు. అతనికి రాత్రి,పగలూ అంటూ తేడా ఉండదు. పనిలోనే పాట ఉంది. పనికోసమే పాటు పడతాడు. పండుగ పబ్బమూ అంటూ ఏదీ పట్టించుకోడు. అతడు నిస్వార్థజీవి. దేశానికి వెన్నెముక.
ఆకలికి ఎవ్వరూ వారసులు కారు. శ్రమతో జీవితాన్ని సాగించి, ఫలితం అనుభవించాలన్నదే రైతు లక్ష్యం. అదే అతని జీవితసందేశం కూడా. నాగలి పట్టి, నడుం వంచి పొలం దున్నేవాడే రైతు. అతనిదే నేలంతా. నేలలో బంగారం పండించే ప్రతిభ అతనికే ఉంది. బీడుభూమి నుంచి రతనాలను వెలికితీసే విద్య అతనొక్కడికే తెలుసు. మట్టిలో పనిచేసే మహౌన్నతమూర్తి ఆయన. అతనిపై ఆధారపడే సమస్త మానవ ప్రగతి నడుస్తుంది. అందుకే రైతు జీవితం ప్రపంచ ప్రగతికి సోపానమనే సందేశం ఈ పాటలో ఉంది. రైతు యొక్క ఆత్మవిశ్వాసమూ ఈ పాటలో తరగలెత్తి దర్శనమిస్తుంది. దోపిడీ విధానానికి, సోమరితనానికి తెరపడే రోజులొచ్చాయని, మన పసిడిపంటలు దేశసంపదను పెంచుతాయని, దేశసౌభాగ్యాన్ని సాధిస్తాయని రైతు విశ్వాసం.
అన్నదాత ఆనందమే దేశ ప్రగతికి శ్రీరామ రక్ష అన్న గొప్ప సందేశం ఈ పాటలో ధ్వనిస్తుంది. అందరికి అన్నం పెట్టే పరమాత్ముడైన రైతును గూర్చి, అతని వత్తి జీవనాన్ని గూర్చి ఆత్రేయ ఈ పాటలో తెలియజెప్పిన తీరు అత్యద్భుతం. శ్రామిక సౌందర్యం, పల్లె ప్రజల స్వచ్ఛమైన మనసులు అన్నీ ఈ పాటలో కనబడతాయి. ఐకమత్యంగా మెలగడం, ఒకరికొకరు తోడుగా నీడగా కలిసి ముందుకు సాగడం, అంతరాలలో అనురాగాలకే తప్ప, అసూ యలకు,అరమరికలకు అసలే తావులేని వారి జీవనవిధానాలు మనకందరికీ ఆదర్శాలు. ఈ పాట సమస్త జగత్తు పురోగతికి కారకుడైన రైతును ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలన్న మహత్తర సందేశమై సాగుతుంది.
పాట :-
పట్టాలి అరకా దున్నాలి మెరకా
ఏళ్ళన్ని మళ్ళించి తడపగా
ఎత్తుపల్లాలు మాపేసి ఒకటిగా
నిండుగ మెండుగ పండగా
ఈరోజు నాటింది నైరు
రేపటికి అవుతుంది పైరు
ఆకలికి వారసులు కారెవ్వరు
అందరమూ కావాలి శ్రమజీవులు
నాగేలు పడితేనే రైతు
నేలంతా అతగాడి సొత్తు
ఇది దోపిడికి సోమరికి తుదిరోజులు
దేశసంపదను పెంచాలి మన సాగులు
- తిరునగరి శరత్ చంద్ర,
6309873682