Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''చుట్టూ వున్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవటం కన్నా, చిన్నదైన చిరుదీపం వెలిగించటం మిన్న'' అంటాడొక మహానుభావుడు. జీవితమనే కాల ప్రవాహంలో వివిధ మజిలీలను సందర్శించటం, వాటితో ముచ్చటించటం, ఆ ముచ్చట సామూహిక సంఘర్షణలతో ముడిపడటం ఒక అరుదైన సందర్భం. ఇలాంటి అరుదైన సందర్భాన్ని ఈ పుస్తక రచయిత, ఉస్మానియా యూనివర్సిటీ ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నాయకుడు గడ్డం శ్యామ్ వ్యాసాలు, కవితల రూపంలో తీసుకువస్తున్నందుకు ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను.
ఈ పుస్తక సంకలనంలో వున్న వ్యాసాలు శ్యాం యొక్క ఆలోచనా విధానాన్ని, సమాజం పట్ల తనకున్న భాద్యతను, విషయాలను అర్థం చేసుకోవటంలోను, అర్థం చేసుకున్న దానిని వ్యక్తపరిచే విధానం చాలా అర్థవంతంగాను, పూర్తిగా కూర్చిన వాక్యాలతోనూ, తేలికైన పద వ్యక్తీకరణతో, పరిపక్వతతో వున్నాయి. యూనివర్సిటి విద్యార్థి నాయకుడిగా గడ్డం శ్యామ్ అనేక సమస్యల పరిష్కారం కోసం నిజాయితీతో 'కమిటిమెంట్' గా పనిచేస్తున్నాడు. ఈ పని ద్వారా పొందిన అనుభవానికి అక్షర రూపం ఇచ్చాడు. సంక్షోభంలో ఉన్న విద్యారంగాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసాడు. ఆ ప్రయత్నమే ''యూనివర్సిటీ విద్యార్థులకు ఫెలోషిప్స్ ఎందుకు ఇవ్వరు?'' అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే పరిశోధనలను కొనసాగించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపాడు. అసమానత్వపు విత్తనాలను వెదజల్లే భారతీయ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను ప్రశ్నించే క్రమంలో 'చావులోను వెంటాడిన కులం' అంటూ తన భావ వ్యక్తీకరణ జరిపాడు. మతం మాటున సైన్స్ను అవహేళన చేసే మనువాద సంస్కృతిని రచయిత ప్రశ్నించాడు. 'ప్రశ్న' అనే ప్రజాస్వామ్య చోదకశక్తిని రాజ్యం ఎలా అణచివేస్తుందో కూడ రచయిత వివరించే ప్రయత్నం చేసాడు. పెట్టుబడిదారి ఆర్థిక విధానాలకు బలి అయిన క్షేత్రస్థాయి మరణాలను ఉదహరించే క్రమంలో, తేలికైన భాషతో రోజువారి సంఘటనలను మార్క్సిస్టు భావజాలంతో అనుసంధానించే ప్రయత్నం చేయటం గమనించదగ్గ విషయం. అరమరికలు లేని వెన్నెల లాంటి సమాజం కోసం ప్రాణత్యాగం చేసిన జార్జిరెడ్డి, మారోజు వీరన్న, తాజాగా లింగన్న లాంటి విప్లవ వీర కిశోరాల ప్రస్తావన ఒక్కసారి కర్తవ్యాలను తట్టిలేపి కార్మోన్ముఖుల్ని చేస్తుంది.
కరోనా మహమ్మారి మానవ జీవిత గమనాన్ని మార్చివేసిన సందర్భంలో 'ఆన్లైన్ విద్య' ఒక అనివార్యతగా ముందుకు వచ్చిన సందర్భాన్ని కూడ రచయిత గుర్తించటం అభినందిం చదగ్గ విషయం. మరి ముఖ్యంగా ''ఆదివాసిలతో అనుభవాలు'' వాస్తవాలతో సంభాషించటం, ఈ పుస్తక విలువను పెంచుతుంది.
''ప్రపంచ బాధ-శ్రీశ్రీ బాధ, కృష్ణ శాస్త్రి బాధ-ప్రపంచపు బాధ'' అన్న నానుడి మనందరికి సుపరిచతం. ఇరవై ఐదు సంవత్సరాల ఒక నవయువకుడు తన ఆలోచనలు, ఇష్టాలు, నచ్చిన అంశాలు, సామాజిక రుగ్మతలు, భావోద్వేగ పరంపరలు ఈ విధంగా వ్యక్తీకరించటం ఒక అరుదైన విషయం. వ్యక్తిగత ఆలోచనలను వ్యక్తికోసం కాకుండా సామూహిక సామాజిక సంక్లిష్టత వైపు మలచటం కోసం శ్యామ్ చేసే ఈ ప్రయత్నం ఎన్నటికి వృధా కాదు.
మనిషి తననూ తాను అర్థం చేసుకొనే ప్రయత్నం కోసం కాలన్ని వెచ్చించటం మరిచిపోతాడు. మనస్సుతో సంభాషించినపుడు, దాని నుండి వచ్చే శబ్ద, లయలు సామూహిక గానం చేస్తే మనిషి జీవితం ధన్యం అవుతుందనీ నేను భావిస్తాను. ఈ కవితల ద్వారా శ్యామ్ కూడా అలాంటి ప్రయత్నం చేసాడు. నిద్రలేని రాత్రులలో భావోద్వేగాలతో సంభాషించినట్లు ఈ కవితలు మనకు తెలియ చేస్తున్నాయి. 'ఆసిఫా' నుండి 'ఆదివాసిల దాకా' 'రాజ్యంకుట్ర'లను అర్థం చేయించే ప్రయత్నం చేసాడు. రేపటి 'ఉషోదయానికి' 'ప్రేమతో', 'గర్వంతో', 'లాల్సలామ్' పలికాడు, 'రంగవల్లి' నుండి 'రాజద్రోహి' వరకు సాగిన హైందవ పెట్టుబడిదారి పన్నాగాలను తన 'అక్షరాలతో వెంటాడాడు'. 'కాశ్మీర్లో కారిన రక్తాన్ని 'దిగులుగా' తడిపి 'జాతికి సంస్కారం' నేర్పే ప్రయత్నం చేయటం రచయితకున్న హద్దులు లేని 'సమానత్వ' స్వప్నాలకు నిదర్శనం.
యూనివర్సిటి విద్యార్థిగా, ప్రగతిశీల విద్యార్థి నాయకుడిగా వివిధ సమస్యల పట్ల గడ్డం శ్యామ్ పరిపక్వతతో స్పందించటం అభినందించదగ్గ విషయం. ఇలాంటి మంచి ప్రయత్నం చేసినందుకు శ్యాంను మనస్పూర్తిగా అభినందిస్తూ తన ప్రయత్నాలను మున్ముందు కొనసాగించాలని ఆశిస్తున్నాను.
- డా|| కొండా నాగేశ్వర్
ఇంగ్లీష్ డిపార్ట్మెంట్, ఆర్ట్స్ కాలేజి, ఓయూ
జాయింట్ డైరెక్టర్, ఓయుసిఐపి, ఓయూ