Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''Education is important in the development process for two reasons. First, because education can be viewed as an end in itself as it improves the perception of the life of people. Secondly, education leads to formation of human capital and is an important investment for the development process.'' (Gains from Right to Education)
- Prof. Mohd.Saeed Khan
Aligarh Muslim University
ప్రతి ఒక్కరినీ విద్యావంతుడిగా ప్రపంచంతో కలపాలనేది ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సహస్రాబ్ది సుస్థిర అభివృద్ధి (ఎస్డిజి) పదిహేడు లక్ష్యాల్లో ఒకటి. ఇందుకు అనుగుణంగా విద్యావిధానం రూపొందించుకోవడం అన్నిదేశాల ముందున్న కర్తవ్యం. ముఖ్యంగా మన దేశంలో మన రాష్ట్రంలో చూస్తే పెద్ద ఎత్తున గ్రామీణ యువత డిగ్రీ, తదనంతర కోర్సుల్లో ప్రవేశం పొందవలసి ఉండగా, తద్విరుద్ధంగా ఇంటర్మీడియట్ లేదా పన్నెండో తరగతి దగ్గరే ఆగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. యూనివర్సిటీల్లోని ఆయా డిగ్రీ కళాశాలల్లో సగానికి పైచిలుకు సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి. లోతుగా ఆలోచన చేస్తే ఈ డ్రాప్ ఔట్ అతిపెద్ద సామాజిక విషాదం. ఇందుకు ప్రధానంగా నాలుగు కారణాలు మనకు కనిపిస్తున్నాయి.
మొదటిది నిరుద్యోగిత.
రెండోది తల్లిదండ్రుల పరిమితి ఆర్థిక వనరులు.
మూడోది పట్టణీకరణ మూలంగా అందుబాటులోకి వచ్చిన చిన్నాచితకా ఉపాధి వనరులు.
నాల్గోది ఉన్నత విద్య భారీ వ్యయంతో కూడినది కావడం.
ఉన్నత విద్యనందుకుని ద్విగుణీకత ఉత్సాహంతో సమాజా భివద్ధిలో గుణాత్మక వ్యవహర్తలుగా పాత్ర పోషణ చేయాల్సిన గ్రామీణ యువత మధ్యస్థంగానే అరకొర నైపుణ్యాలతో బతికేయడం రాష్ట్రానికి దేశానికే కాదు ప్రపంచానికి కూడా భారీనష్టం. ఈ డ్రాప్ ఔట్ వ్యక్తి 'విద్యా హక్కు'తో పాటు 'అభివద్ధి హక్కు'కు కూడా తీవ్ర అడ్డంకిగా మారింది. పల్లీయ నిమ్న వర్గాల మొదటి తరం పది పన్నెండో తరగతి వద్దనే ఆగిపోవడం ఆ వర్గాలను ఇతర అభివద్ధి వర్గాలతో ఎప్పటికీ సమం చేయలేని ఒక సామాజిక వాస్తవం.
మనుషులను జనాభా (పాపులేషన్) అనడం పాత మాట, మానవ వనరులు (హ్యుమన్ రిసోర్సెస్) అని సంబోధించడం అభివద్ధి కోణం. మానవ మూలధనం (హ్యూమన్ క్యాపిటల్)గా గుర్తించడం అభివద్ధికి సంబంధించిన సామాజిక భావన. ఒక సంస్థ లేదా వ్యవస్థ గొప్పగా నడవడానికి దానికి అవసరమైన 'ఆర్థిక పెట్టుబడి' తో పాటు 'మేధో పెట్టుబడి' నిర్వహణకు మానవ మూలధనం ఎంతో కీలకమైంది. 'హ్యుమన్ కాపిటల్' గ్రంథం కర్త నోబెల్ ఆర్థిక వేత్త గ్యారీ ఎస్. బెకర్ భావించినట్టు ''ప్రతి ఒక్కరికి విద్యను, శిక్షణను, ఆరోగ్యాన్ని అందించి పని శక్తి (వర్క్ ఫోర్స్)గా తయారు చేయడం ద్వారా ఏ దేశ జనాభానైనా ఆ దేశపు హ్యూమన్ క్యాపిటల్గా రూపుదిద్దవచ్చు''. మన దేశ జనాభాలో అరవై శాతం పైన యువశక్తి ఉంది.ఈ యువశక్తిని 'రిజర్వాయర్ ఆఫ్ ఎనర్జీ' తో సామాజిక పండితులు పోలుస్తారు. ఇందులో నాలుగింట మూడోవంతు యువత గ్రామీణ ప్రాంతాలకు చెందినవాళ్లే. అంటే దాదాపు నలభై కోట్ల మంది యువత పల్లెల్లో ఉన్నారు. వీరికి నాణ్యమైన విద్య, ప్రామాణిక శిక్షణ, సదారోగ్యం తక్షణావసరాలు. ఈ మూడూ కొరవడిన కారణంగా యావన్మంది గ్రామీణ యువత వ్యవస్థీకరించబడని (అనార్గనైజ్డ్), నైపుణ్యరహిత (అన్ స్కిల్డ్) సమూహంగా మిగిలి పోతున్నారు. మార్కెట్ పరిభాషలో చెప్పాల్సివస్తే మన సరుకులకు గిరాకీ లేకపోవడానికి ఈ అన్స్కిల్డ్, అనార్గనైజ్డ్ పనిబందాలే కారణం. తత్పర్యవసానంగా మనం అవతలి దేశాల నుండి పెద్ద మొత్తంలో వస్తువులను దిగుమతులు చేసు కుంటున్నాం. ఈ వస్తు పరాధీనస్థితి నుండి మనదేశం విముక్తం కావాలి. ఇది జరగాలంటే 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం నిర్దేశించు కున్నట్టు రూపకల్పనలో ఉత్పాదకతలో భారతదేశం ప్రపంచ కేంద్రంగా వెలుగొందాలి. తదనుగుణంగా ఉత్కష్ట స్థాయి పరిశోధన ఉత్పత్యభివద్ధి కొనసాగాలి. ఇక్కడే ప్రాకతిక సామర్థ్యాలు పుష్కలంగా కలిగిన గ్రామీణ యువత అవసరం ఉన్నత విద్యకూ పరిశోధనా రంగాలకూ ఎంతగానో ఉంది.
జాతీయ గణాంకాల కార్యా లయం (ఎన్.ఎస్.ఓ) నమోదు చేసిన సెప్టెంబర్ -2020 వివరాల ప్రకారం మన దేశంలో ఓవరాల్ డ్రాప్ ఔట్ 12.6% ఉండగా ఉన్నత విద్యలో ఇది 9.6% ఉంది. ఇంటర్మీడియట్ తర్వాత ప్రతి ఎనమండుగురిలో ఒకరు డ్రాప్ ఔట్ అవుతున్నారు. అమ్మాయిలైతే పెళ్లి కారణంగా, అబ్బాయిలు కుటుంబ ఆర్థిక అవసరాల కారణంగా కాలేజీ మానేస్తున్నారు. ఉన్నత విద్యలోని మొత్తం డ్రాప్ అవుట్లో అత్యధికంగా గ్రామీణ యువతే ఉంది. దీనికి నేషనల్ డ్రాప్ ఔట్ నివారణ కేంద్రం (ఎన్.డి.పి.సి) సర్వే వెల్లడించిన వ్యవస్థీభూత కారణాలు విభిన్నంగా ఉన్నాయి.
విద్యార్థిపరంగా చూసినప్పుడు
1. మాదక ద్రవ్యాలు వాడకం
2. ఎక్కువ మంది తోబుట్టువులు
3. వంశికత
4. పరిసరాలకు సంబంధించిన ఇతర విషయాల మూలంగా గ్రామీణ యువత ఉన్నత విద్యకు దూరమవుతున్నారు.
కుటుంబ పరంగా చూసినప్పుడు
1. తల్లిదండ్రులు పెద్దగా చదువుకోక పోవడం
2. ఆర్థిక వెనుకబాటు
3. పెద్ద కుటుంబాలు అవడం
4. ఉన్నత విద్యాశయం లేకపోవడం, ఇతర సాంఘిక అవాంతరాలు కారణాలుగా కనిపిస్తున్నాయి.
విద్యాసంస్థ పరంగా చూసినప్పుడు
1. భవిష్యత్తు పట్ల నిరాశాజనక స్వభావం
2.నిధుల కొరత
3.ఉపాధ్యాయుల స్వల్ప వేతనాలు
4. విద్యార్థుల్లో ఆశయాలు కల్పించలేక పోవడం, పఠనం లేఖన అలవాట్ల లేమి మొదలైనవి హేతువులుగా ఉన్నాయి.
సామాజికంగా చూసినప్పుడు మొత్తం గ్రామీణ సమాజానికి కుటుంబ పోషణే కీలకం కావడం, వత్తులు దెబ్బతిని వలసలు పెరగడం, డిగ్రీ చదివి నిరుద్యోగి అనిపించుకునే కంటే ఏదో ఓ పనికి కుదరడమే మేలనుకునే మధ్యతరగతి భావజాలం మొదలైనవన్నీ గ్రామీణ సమాజం నుంచి ఉన్నత విద్యను గురించి వినిపిస్తున్న ప్రతిస్పందనలు. క్లుప్తంగా మాట్లాడుకుంటే 'పైచదువుల్లో మిగతావాళ్లతో ఇమడలేక పోవడం, తాము తమకు సరిపడేంత చదివాం అనుకోవడం, నిరాసక్తత, గహ సంబంధ బాధ్యతలు, పెళ్లిళ్లు, ఆర్ధిక నిర్బంధాలు, ఆర్ధిక కార్యకలాపాలు' గ్రామీణ యువత విద్యాభివద్ధికి ఆటంకాలుగా మారాయి.
కౌమారదశ నుండి పౌరులుగా ఎదిగే క్రమంలో డిగ్రీ చదవడం జీవితావసరంగా యువతీయువకులు సైతం గుర్తించాలి. ఇటు సమాజం, అటు ప్రభుత్వాలు అవిభాజ్యాత్మక ప్రయత్నాలను గ్రామీణ యువత డిగ్రీ చదివేందుకు ప్రారంభించాలి. ఉన్నత విద్యా రంగానికి సరిపడా నిధులను కేటాయించడం, సాధారణ డిగ్రీ కోర్సులన్నిటిని వత్తివిద్యతో అనుసంధా నించడం, ఉన్నత విద్య కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడటం, సామాజిక అంతరాలను, వెనుకబాటు తనాన్ని రూపుమాపేందుకు సంబంధించినవైన రిజర్వేషన్లను కచ్చితంగా అమలు పరచడం, ప్రతిభావంతులకు ఇచ్చే ప్రోత్సాహకాలను ఇతోధికంగా పెంచడం మొదలైన కార్యక్రమాలు ప్రభుత్వాల వైపు నుంచి జరగాలి. చదువు ఉపాధికి సంబంధించింది మాత్రమే కాదు, సామాజిక హౌదాకు, గౌరవానికి సంబంధించిన అత్యంత ప్రశస్తమైన విషయమని గ్రామసమాజాలకు ప్రేరణాత్మకంగా ఎరుక పరచవలసిన బాధ్యత మీడియాతో పాటు ఎన్జీవోలకూ విద్యాధికులకూ ఉంది. అరకొర వసతుల్లో అడుగడుగునా ఘర్షణతో ఉన్నత విద్యార్జనకు పట్టణాలకు వచ్చిన గ్రామీణ యువత ఆద్యంతం ఆత్మన్యూనతను ఎదుర్కొంటున్నది. గ్రామీణ ప్రతిభనుద్దేశించి మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం ఓ సందర్భంలో ఇట్లా ''Some of the biggest minds in the country can be found on the last benches of the classroom'' అంటారు. ఈ వ్యాఖ్యను గుర్తెరిగి గ్రామీణ యువతను ఆత్మన్యూనతాస్థితికి దూరంగా జ్ఞానోన్నతులు (నాలెడ్జ్ ఎలైట్స్)గా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిరకాల చేయూతనందించాలి. లేని పక్షంలో ఒకే దేశంలో విద్యా పరంగా ఇప్పటికే ఏర్పడ్డ రెండు భిన్న సమాజాల మధ్య అంతరాలు మరింత హెచ్చి అనేక సంక్షోభాలు తలెత్తే అవకాశం ఉంది.రెండువేల ముప్పై నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందన్న ఎకానమిస్టుల కల డిగ్రీ చదువులకు దూరమైన రూరల్ డ్రాప్ ఔట్ మూలాన కల్లగానే మిగల గలదు.నూతన జాతీయ విద్యా విధానం-2020 ప్రకటిత లక్ష్యమైన ''నిష్పక్షపాతమైన, శక్తివంతమైన విజ్ఞాన సమాజ నిర్మాణం'' కూడా ఎండమావి కాగలదు.
- డా.బెల్లి యాదయ్య,
9848392690