Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషికి మనిషికి మధ్య మనసులతో పెనవేసుకుని అల్లుకుపోయిన ఆత్మీయతానుబంధాలను పరస్పరం బలోపేతం చేసుకోవడానికి ఆయా సందర్భాలలో ఒకరికొకరు సుదూర తీరాల్లో ఉన్నా అభివ్యక్తీకరించే శుభాకాంక్షలను అందజేసే మైత్రీ సందేశికలు ''గ్రీటింగ్ కార్డులు''. పదేళ్ల క్రితం వరకు క్రిస్టమస్, నూతన సంవత్సరం వస్తున్నాయంటేనే అందరి దృష్టి గ్రీటింగ్ కార్డుల వైపు మళ్లేది. మొన్ననే కొత్త సంవత్సరం 2021, వారం క్రితం క్రిస్టమస్ పండుగలు వచ్చినవి. కానీ మొన్నమొన్నటి గ్రీటింగ్ కార్డుల సందడి ఎక్కడా కానరాలేదు.
తెరమరుగవుతున్న గ్రీటింగ్ కార్డులకు సుమారు 200 ఏండ్ల చరిత్ర ఉందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. దీనిని మొదటిసారిగా 1800లో రూపొందించిన ఘనత ''వ్యాలెంటేనర్''కి దక్కుతుంది. అయితే తొలి క్రిస్టమస్ కార్డును 1843లో జె.సి. హర్సిలీ తయారు చేశాడు. కానీ వ్యాపార సరళిలో ఈ గ్రీటింగ్ కార్డులు 1847లో మార్కెట్లోకి వచ్చాయి. అంటే నూట యాభై ఏళ్ళ క్రితం అన్నమాట.
క్రిస్మస్, కొత్త సంవత్సరం వచ్చేస్తున్నాయి అంటే గ్రీటింగ్స్ కార్డుల సీజన్ వచ్చేసిందన్న మాటే. పాతకు వీడ్కోలు కొత్తకు స్వాగతం ఈ శుభాకాంక్షల వెనుకనున్న అంతరార్థం. తమ తమ శ్రేయోభిలాషులకు, పెద్దలకు ఈ క్రిస్మస్, ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా పరస్పరం లాభం, శుభం చేకూరాలని కోరుకుంటూ గ్రీటింగ్స్ పంపుకొంటుంటారు. కేవలం ఈ సందర్భాల్లోనే గాక ఇతర శుభ, ఆనంద దాయకమైన సమయాల్లో కూడా గ్రీటింగ్స్ పంపుకునే ఆచారం వచ్చింది. అయితే క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భాలలోనే ఈ గిరాకీ ఎక్కువగా వుండేది.
అసలు ఈ గ్రీటింగ్ కార్డు ఎలా పుట్టింది? ఎవరు శ్రీకారం చుట్టారు? అనే ప్రశ్నలకు సమాధానాలు ఆశ్చర్యకరమైనవి గానూ, ఆసక్తిదాయకంగానూ ఉంటాయి. ఐరోపా దేశస్థులలో క్రైస్తవ మత ప్రారంభం నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకునే ఆచారం ఉంది. అయితే శుభాకాంక్షలు తెలిపే పత్రానికి 'గ్రీటింగ్ కార్డ్' అని పేరు పెట్టి, దానిని తయారు చేసిన వ్యక్తి జరుసలేంకు చెందిన 'జె.సి.హార్స్ల్'. ఆయన 1843లో అట్టపై పశువుల శాలలో పడుకున్న క్రీస్తును చిత్రించి దాని అడుగున 'మెర్రీ క్రిస్టమస్ అండ్ హ్యాపీ న్యూయర్' అని తెలిపే కార్డులను వెయ్యి తయారు చేయించాడు. ఇంకా రెవరండ్ 'ఎడ్వర్డ్ బ్రాడ్లీ' అనే ఫాదర్ గ్రీటింగ్ కార్డును మొదటిసారిగా ప్రింట్ చేయించారంటారు. క్రిస్మస్ సందర్భంగా ముద్రించిన ఈ కార్డులపై బొమ్మ తప్ప మరే సందేశం లేకున్నా అవి అప్పట్లో సంచలనం సృష్టించాయి. అయితే బ్రాడ్లీ గ్రీటింగ్ కార్డును ఎప్పుడు ముద్రించాడో తెలియడం లేదు. కానీ కొందరు 1842లో 'సర్ రోజర్ డీ కవర్ల్' అనే వ్యక్తి మొదట గ్రీటింగ్ కార్డును ముద్రించాడని కూడా అంటారు. దీనిపై కూడా బొమ్మ గ్రీటింగ్ కాప్షన్ను ముద్రించాడని కూడా అంటారు. దీనిపై కూడా బొమ్మ గ్రీటింగ్ కాప్షన్ను ముద్రించాడు. ఈ కార్డు ఇప్పటికీ బ్రిటీష్ మ్యూజియంలో భద్రంగా వుంది. మొత్తం మీద గ్రీటింగ్ కార్డులు ఇంగ్లండ్లోనే పుట్టాయని భావించవచ్చు.
అయితే వ్యాపార సరళిలో ఈ గ్రీటింగ్ కార్డులు అమ్మకానికి మార్కెట్లో 1948లో ప్రవేశించాయి. అలా మార్కెట్లో లభించే కార్డులు తయారయ్యాయి. 60 సంవత్సరాల కాలంలో గ్రీటింగ్ కార్డులు సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక అంశాలను ప్రతిబింబించే విధంగా పలు రకాలైన మార్పులు, చేర్పులు చెందుతూ వచ్చాయి. మతపరమైన భావాలకు బదులుగా సామాజిక స్పృహ, కళాభినివేశం ప్రయోగవాదం చోటుచేసుకున్నాయి.
మన దేశంలో ఈ గ్రీటింగ్ కార్డుల ముద్రణ 50 సంవత్సరాల క్రింద మొదలైంది. 'వకీల్సీ' అనే ముద్రణా సంస్థ వీటి ముద్రణ విషయం లో విశేషమైన కృషి చేసింది. నేడు మన దేశంలో తయారైన గ్రీటింగ్ కార్డులు అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర పలికినవి. ఈ గ్రీటింగ్ కార్డుల నాణ్యత అంతా ముద్రణకు వాడే కాగితంపైనే ఆధారమై ఉంటుంది. ఎక్కువగా 'హ్యాండ్ మేడ్' పేపర్ను వాడుతారు. కొన్ని రంగులను ప్రింట్ చేయడానికి ఆర్ట్ పేపర్ను ఉపయోగించేవారు.
ఇక తెలుగునాట 1978 నుండి గ్రీటింగ్ కార్డుల ముద్రణ మొదలైంది. న్యూ స్టూడెంట్ బుక్ సెంటర్ వారి అభినందన గ్రీటింగ్ కార్డు బహుళ జనాదరణ పొందినవి. ఇతర దేశాలకు సైతం వెళ్లే మన గ్రీటింగ్ కార్డ్సులో మన తెలుగు సంస్కృతి, కళలను ప్రతిబింబించే విధంగా బాపు వంటి ప్రముఖ చిత్రకారుల చిత్రాలను వాడేవారు. ఈ రంగంలో కూడా పోటీ పెరిగింది. ఏదిఏమైనా మైత్రీ శుభ సందేశాలను పరస్పరం అందించే ఈ గ్రీటింగ్ కార్డులకు వెలకట్టలేమనే చెప్పాలి.
30 సంవత్సరాల క్రితం నూతన సంవత్సర గ్రీటింగ్ కార్డ్స్ కొన్ని పుస్తకాల షాపుల్లో ఒక మూల బాక్స్ల్లో వుంచి, అడిగిన వారికి చూపించి అదో పక్క చిన్న వ్యాపారంగా చూసేవారు. కొన్ని కొన్ని పట్టణాల్లో కాస్త పెద్ద ఎత్తున కార్డ్స్ అమ్మకానికి పంచేవారు. అలా ఒక మూలగా వున్న ఈ వ్యాపారం ఆ తరువాత నగరాలు, పట్టణాలు, గ్రామాల వరకు పెరిగిపోయింది. అందర్ని విశేషంగా ఈ గ్రీటింగ్ కార్డులు ఆర్షించేవి.
ప్రపంచ గ్రీటింగ్ కార్డ్స్ చరిత్రలోకి వెళితే మరో రకమైన కొత్త విషయాలు తెలుస్తున్నాయి. 145 సంవత్సరాల క్రితం 1871 ప్రాంతంలో ఇంగ్లండ్లో ఒక చిన్న ప్రింటర్ జర్మనీలోని అతను తెలిసిన ఖైదీలకు ఒక కాగితంపై కొత్త సంవత్సరంలో అయినా మీకు జైలు నుంచి విముక్తి కలుగుతుందని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని ముద్రించి పంపాడట. తరువాత అతనే ప్రతి సంవత్సరం జనవరి ఒకటికి కాగితంపై శుభాకాంక్షలు ముద్రించి పంచేవాడట. అది తరువాత 60 సంవత్సరాల వరకు పెద్దగా ప్రలజను ఆకట్టుకోలేకపోయినా అమెరికాలో 1931లో గ్రీటింగ్ కాగితం, గ్రీటింగ్ కార్డ్ రూపంలోకి వచ్చింది. చైనాలో 15వ శతాబ్దంలోనే హ్యాండ్ మేడ్ పేపర్తో తొలుత గ్రీటింగ్ కార్డులు తయారు చేసారని చెబుతారు. ఆ తరువాత ఈజిప్టు, బ్రిటన్, అమెరికాలలో వీటికి ఆదరణ వచ్చిందనేది గ్రీటింగ్కార్డుల చరిత్ర చెబుతున్నది. పలు దేశాలలో తొలి రోజులలో వీటిని ఆదరించారు. పోస్టల్ శాఖ తన ధరలను తగ్గించింది కూడా. అమెరికాలో గ్రీటింగ్ కార్డ్స్ అసోసియేషన్ ఒకటి ఉండటం గమనార్హం.
మనదేశంలో అవిభక్త భారతదేశంలో 1941లో కరాచీ వి.టి.కంపెనీ అమెరికా నుంచి గ్రీటింగ్ కార్డ్స్ దిగుమతి చేసుకొని దేశంలోని ప్రధాన నగరాలలో విక్రయించడం చేసింది. 1947లో దేశ విభజన అనంతరం వి.టి.కంపెనీ కరాచీ నుంచి బొంబాయికి తన వ్యాపారాన్ని మార్చుకొని గ్రీటింగ్ కార్డ్స్ వ్యాపారం ప్రారంభించింది. ఆ తరువాత వకీల్స్, ఎల్.ఆర్.సుందర్ కంపెనీలు కూడా గ్రీటింగ్స్ వ్యాపారం ప్రారంభించాయి.
ఆ వ్యాపారం 1970 వరకు కేవలం న్యూయార్క్కే పరిమితం కాగా తదుపరి పుట్టిన రోజులకి, వివాహ దినోత్సవానికి, జనరల్ కార్డ్స్ తయారీ ప్రారంభించినా, అవి కొన్ని ప్రాంతాలకే ముఖ్యంగా నగరాలకే పరిమితమయ్యాయి. ఆ విధంగా 1979 వరకు ఈ వ్యాపారం పరిమితంగానే కొన్ని ప్రాంతాలలోనే విస్తరించడం జరిగింది.
గ్రీటింగ్ కార్డ్స్లో విశేషంగా మార్పులు సంభవించింది 1979 ప్రాంతంలోనే. 1979లో ఢిల్లీలోని జన్పథ్లో ఒక ఇంటిలో పోస్టర్స్ గ్రీటింగ్ కార్డ్స్ అమ్ముకుని చిన్న షాపు గ్రీటింగ్స్తో ప్రారంభించి ఇద్దరు సోదరులు 1985లో 'ఆర్చస్' గ్రీటింగ్ కార్డ్స్ కంపెనీ ఏర్పాటు చేసి మార్కెట్లోకి దిగారు. ప్రారంభించిన మూడు సంవత్సరాలలోనే సంవత్సరానికి రూ.12 లక్షల వ్యాపారం చేయగలిగారు. వారు గ్రీటింగ్ కార్డ్స్ రూపాన్ని మార్చి, అంతకు ముందున్న చౌక రకం పేపర్ బోర్డు, పువ్వుల బొమ్మలు కాకుండా నాణ్యమైన బోర్డుపై మేటర్స్తో కార్డులు వేసి మార్కెట్లోకి దింపారు. గ్రీటింగ్ కార్డ్స్తో పాటు పోస్టర్స్ సినిమా నటులవి, క్రికెటర్లవి, హాలీవుడ్ నటులవి, క్రీడాకారులవి వివిధ సైజులలో మార్కెట్లోకి తీసుకువచ్చి మొత్తం వ్యాపారాన్ని మార్చేసి, మిగతా కంపెనీల వారు వీరిని అందుకోలేనంత వేగంతో మార్కెట్లో స్థానం సంపాదించ గలిగారు. ఇది 1987 - 88 నుంచి దాదాపు అన్ని గ్రీటింగ్ కార్డ్స్ కంపెనీలు తమ కార్డ్స్ వివిధ అందమయిన డిజైన్లతో పోటీపడినవి. దేశమంతా తమ స్థానాన్ని పదిలం చేసుకోవడానికి వందలాది మంది రిప్రజెంటేటివ్లను, కమీషన్ ఏజెంట్లను నియమించి, అందమయిన ఆల్బమ్స్ తయారు చేసి సంవత్సరంలో దాదాపు ప్రతి రెండు నెలలకు మార్కెట్లోకి పంపించి అన్ని సందర్భాలకు గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి తమ వ్యాపారాన్ని సుస్థిరం చేసుకొన్నాయి.
1988 ఆర్చస్ కంపెనీ మరొక అడుగు ముందుకు వేసి దేశంలోని ప్రధాన నగరాలలో వారి కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులతో గ్యాలరీలు ప్రారంభించింది. ఒకో గ్యాలరీకి 5 నుంచి 15 లక్షలు కేవలం డెకరేషన్కే ఖర్చు పెట్టింది. అప్పటి నుంచి పక్క వ్యాపారంగా వున్న గ్రీటింగ్ కార్డ్స్ వ్యాపారం షోరూమ్స్ రావడంతో ముఖ్యంగా యువతరాన్ని బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాపితంగా ఆర్చస్ కంపెనీ తమ షోరూమ్లు 200 వరకు ప్రారంభించగా తరువాతి స్థానం హాల్మార్క్ వారు కూడా తమ గ్రీటింగ్ కార్డులతో షోరూమ్లు ప్రారంభించారు. మన రాష్ట్రంలో హైదరాబాద్లో 24 షోరూమ్లు, విజయవాడలో 2, గుంటూరులో ఒకటి, వైజాగ్లో రెండు కేవలం గ్రీటింగ్ కార్డ్స్వే ఉండేవి. అంతేగాక, బుక్స్టాల్స్లో కూడా విరివిగా అమ్మేవారు.
గ్రీటింగ్ కార్డ్స్ నూతన సంవత్సరం నుంచి ప్రారంభమై క్రిస్టమస్, సంక్రాంతి, ఉగాది, రంజాన్, హౌలి. ఈస్టర్, స్వాతంత్య్ర దినోత్సవం, రక్షాబంధన్, ఓనమ్, దీపావళి, గురునానక్ జయంతి పండుగలకు, పుట్టినరోజులు, వివాహానికి, వివాహ వార్షికోత్సవానికి, పిల్లలు పుట్టినందుకు, ఉద్యోగం వచ్చినందుకు, పరీక్ష పాస్ అవ్వాలని, పరీక్ష పాస్ అయినందుకు, నూతన గృహ ప్రవేశానికి, జబ్బుపడిన వారు కోలుకోవాలని, ఎన్నికల్లో గెలిచినందుకు, విదేశీ యాత్ర చేస్తున్నందుకు, విదేశీయాత్ర నుంచి వచ్చేటప్పుడు, రిటైర్ అయినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు, రిటైర్ అయినప్పుడు, సారీ చెబుతూ, వీటన్నింటితో పాటు పైన తెలిపిన సందర్భాలకు రిలేషన్ కూడా తగిలించి అంటే బ్రదర్, సిస్టర్, ఫాదర్, మదర్, ఆంటి, మదర్ఇన్లా, ఫాదర్ఇన్లా వరుసలతో శుభాకాంక్షలు చెబుతూ వేలకు వేల డిజైన్లలో గ్రీటింగ్ కార్డ్స్ మార్కెట్లోకి వస్తుండగా వాటితోపాటు హ్యూమర్తో ఉన్న కార్డ్స్, తమ మనసులోని జవాబు ఎదుటి వారికి చెప్ప డానికి రకరకాల మేటర్స్లో అన్ని సందర్భాల గ్రీటింగ్ కార్డ్స్ మార్కెట్లో నాడు రాజ్యమేలి నవి. ఆర్చస్ వంటి అతికొద్ది కంపెనీలు మాత్రం నేటికీ గ్రీటింగ్ కార్డులను ముద్రిస్తున్నాయి.
మనసులోని భావాలు ఎదుటి వారికి మాటల రూపంలో చెప్ప డానికి, తన అనుకునే వారికి, తాము ఎదురుగా వుండి చెప్పేంత సహజ రూపంలో గ్రీటింగ్ కార్డ్స్ అధిక ప్రాచుర్యం పొందాయి. మిత్రులకు, ఆత్మీయులకు, బంధువులకు, రక్త సంబంధీకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసే పద్ధతిలో గ్రీటింగ్ కార్డ్స్ ఒక విధంగా ప్రతి ఒక్కరికి అలవాలయ్యింది. అందరూ తమ తమ స్థాయిని బట్టి గ్రీటింగ్ కార్డ్స్ పంపేవారు. కానీ గత పదేళ్లుగా ఫేస్బుక్, ట్విట్టర్, ఈ మెయిల్స్, వాట్సప్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల రాక వల్ల సామాన్య ప్రజలకు చేరువైన గ్రీటింగ్ కార్డుల ముద్రణ ఆగిపోయిందనే చెప్పాలి. దీంతో మన దేశంలో 50 ఏళ్లుగా ఒక అభినందనల సంస్కృతికి గుర్తుగా కొనసాగిన గ్రీటింగ్ కార్డుల పరంపర నేడు సామాన్యుడు దాచుకున్న నెమలీకగా దాదాపుగా కాలగర్భంలో కలిసిపోయినది.
- హెచ్.రమేష్బాబు,
7780736386