Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నమస్తే అన్నా! నమస్తే అక్కా! నమస్తే కాకా! నమస్తేనే. అంతా మంచిగున్నరా! ఏంది అలా చూస్తుండ్రు. నేను మీకెల్లే రైతునే. నాలుగు ఎకరాలు సేద్యం చేస్తున్నా...
దినదినగండం.. నూరేళ్ళ ఆయుస్సు.. దీనవ్య జీవితం.. ఎంత కష్టం చేసినా ఎల్తంలేదు. అప్పుల బాధ ఎక్కువై చద్దామనుకున్నాను. గా ఢిల్లీ కిసాన్ ఉద్యమం చూసినాక జర ఆగిన, ఆ ముచ్చటేందో చెప్పమంట్రా!
నరేంద్రమోడి.. మన ప్రధాని. కొత్తగా మూడు చట్టాలు తెచ్చిండు.
ఒక చట్టం ప్రకారం మన పంటను ఎక్కడైనా, ఎవరికైనా స్వేచ్ఛగా అమ్ముకోవచ్చంట. గప్పుడు గీ గంజిలు, మార్కెట్లు ఏమీ ఉండవ్. అంతా ఖుల్లా ఖుల్లా. గీ సర్కారు కూడా మనకు ఏం చేయదు. కనీస మద్దతు ధరలు పంట భీమాలు జాన్తానై.
కొనేటోడు లేకపోతే మరి ఏం చేయాలి సారూ..? అంటే.. ఆన్లైన్లో నీ పంటను చూపించి మార్కెట్ చేస్కో అంటుండ్రు. గప్పుడు ఈ సాదాసీదా మార్కెటోళ్ళే కాదూ, దేశదేశాల నుండి బిజెనెస్ మాగ్నైట్లు, మాన్సంటో వంటి మల్టీ నేషనల్ కంపెనీలు, అంబానీ అదానీ వంటి కార్పోరేట్లు వచ్చి నీ పంటను కొనేందుకు క్యూ కడతరంటా.
నిజమేనా! నమ్మే ముచ్చటేనా! చెవుల్లో పెద్ద పెద్ద కేబేజీ పూలు పెట్టుకున్నంత అమాయకులుగా మన బీద రైతులు కన్పిస్తున్నారు మోడికి.
అంతా ఆన్లైన్లోనే అంటే ఫొటో పెట్టి పెళ్ళి చేసుకోవచ్చు గాని, ఫొటోతో కాపురం ఎట్టా? నాకైతే సమాజ్ అవడం లేదు.
రెండో చట్టం- ఇన్నాళ్ళు మనం మనకు తెల్సిన నాగలితోనో, ఎడ్లతోనో, మా అయితే ట్రాక్టర్ తోనే సేద్యం చేశాం. గిప్పుడిక అవి చెల్లవంట.
ఇది యాంత్రిక యుగం. సెల్ఫోన్లు ఇంటర్నెట్ల కాలం. గీ టైమ్లో నీ ఎడ్లు, ఎవసాయం ంటూ గా పాత పద్ధతిలో పోతే జిందగీ నడుస్తుదా.. కోటు బూటు సూటు ఏస్కుని ఇమానాల్లో యాపారం జరుగుతుంటే, ఇంకా నాగోసి నాగొంగలి బురదా బుక్కి అంటే కుదురుద్దా.
గందుకే దునియా అంతా కార్పొరేట్ సేద్యం అంటుంది. బడాబడా యంత్రాలతోనే సేద్యం పని. మరి మీరు మీ నాలుగైదు ఎకరాల్తో కార్పొరేట్ సేద్యం ఎట్లా చేస్తరు? మీ వల్ల అవుతుందా? గందుకే మీ భూముల్ని రెండో ముచ్చట లేకుండా కార్పోరేట్లకు ఇచ్చేయండి.వాళ్ళు నీకు ఎంతోకొంత ముట్ట చెప్తారు. నిమ్మకు నీరెత్తినట్టు నీవు హాయిగా కాలుమీద కాలేసుకుని కూర్చోవచ్చు. ఏమంటారు.
గందుకే కాంట్రాక్టు ఎవుసాయం చట్టం తెచ్చాం అని చెప్తుండ్రు. మరిది రైతులకు మెడ మీద కత్తి అవుతదా? కాదో? మీరే చెప్పాలి.
ఇక మూడోది - నిత్యావసర వస్తువులకు సంబంధించింది.
మనం మన పిల్లలు బతకాలంటే తిండి తినాలి కదా. బియ్యం, పప్పు, ఉప్పు, ఉల్లిగడ్డ కావాలిగా. ఇప్పుడున్న చట్టం ప్రకారం వాటన్నింటిని వ్యాపారస్తులు ఎవరూ ఎక్కువగా గౌడోన్లో దాచకూడదు. ధరలుపెంచి అమ్మకూడదు. గయినా కొందరు బద్మాష్గాళ్ళు, ఎప్పుడు టైమొస్తే గప్పుడు సరుకులు గప్చిప్గా దాచి, ధరలు పెంచి పేదోళ్ళ కడుపు కొడ్తుండ్రు.
గిప్పుడు గా చట్టంతో గా పాత చట్టాన్ని రద్దు చేసిండు మోడి. గొర్రెలు తినే వాళ్ళను తీసేసి, బర్రెలు తినే వాళ్ళకి స్వాగతం పలుకుతున్నడు.
బంగారు గుడ్లు పెట్టే బాతుల్లాంటి రైల్వే, ఎల్.ఐ.సి. ప్రభుత్వ సంస్థల్ని గా ప్రైవేటోళ్ళకి కట్టబెడ్తున్నాడు.
అది కూడా చాల్దన్నట్లు గిప్పుడు హౌల్ మొత్తంగా భూముల్ని భూములతో పాటు రైతుల్ని బాజాప్తుగా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు బరితెగించాడు మోడి.
ఇంకేం చెప్పాల. గందుకే గా ఢిల్లీలో గా ఉత్తరాది రైతులంతా గీ జాతి గా మతం గీ కులం గా ప్రాంతం అని లేకుండా గంతా ఏకమై కదిలిండ్రు. బేషరతుగా ఆ చట్టాలను వెనక్కి తీసుకపోమని డిమాండు చేస్తుండ్రు. చావో.. రేవో.. అన్న తరీక్ల రోడ్లపై టెంట్లు ఏస్కుని పోరాటం చేస్తుండ్రు. అక్కడే గానా, భజనా పూర జిందగీ అంతా అక్కడే. జబర్దస్త్గా సాగుతుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే అదో జాతర. రైతు పోరాట జాతర. వెళ్లి వచ్చిన వాళ్ళు కథలు కథలుగా ముచ్చట్లుగా చెప్తుండ్రు. పేపర్లో మీడియాల్లో అప్పుడప్పుడు చూపిస్తుండ్రు.
గియన్నీ తెల్సినాక కూడా గిప్పుడు రైతులు బతకలేక చావాల్నా? పోరాడి బతకాల్నా? ఆత్మహత్య అనేది అర్థం లేని పనని అర్థమయింది.
నేనైతే ఒకటే నిర్ణయానికొచ్చినా-
ఈ జిందగీ శాశ్వితం కాదు. ఎప్పుడోప్పుడు చావాల్సిందే. ఆ చావు మన పిల్లల కోసం, నలుగురి మేలు కోసం, గీ భూమి కపోసం, దేశం కోసం చావడంలోనే ఇజ్జత్ ఉంది. పౌరుషం ఉంది. దిల్ ఉంది. మట్టిని ముద్దాడి గట్టిగా శపథంతో చెప్తున్నా. గీ భూమిని, గీ దేశాన్ని, గీ రైతును కార్పొరేట్లకు చచ్చినా కట్టబెట్టను. బలిపెట్టను. గందుకోసం ఎంతకైనా తెగిస్తా.. ఏ పోరాటమైనా చేస్తా. వస్తా. నమస్తే...
- కె.శాంతారావు,
9959745723