Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలసాహిత్యం చాలా తక్కువగా వస్తున్న ఈ కాలంలో ప్రజాశక్తి బుకహేౌస్ వారు చక్కటి బొమ్మలతో మంచి నీతికథలు ఈ పుస్తకం ద్వారా అందించడం అభినందనీయం. ''తాను పుట్టిన నేలనీ, దేశాన్ని ప్రేమించలేని వాడు దేనినీ ప్రేమించలేడు'' అంటాడు కవి భైరవ్. ఆంగ్ల మాధ్యమ మోజులో మన తెలుగు గొప్పతనాన్ని మన పిల్లలు పూర్తిగా మరిచిపోతున్నారు.
''ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్'' పాటను- ఆ పాటపాడిన జానిటేలర్ను గుర్తు పెట్టుకొన్నంతగా... ''చందమామ రావే.. జాబిల్లి రావే'' అంటూ పసితనంలో అమ్మ పాడిన అన్నమయ్య గీతం తెలియని (దు)స్థితి నేడు ఉంది. కృష్ణస్వామి రాజుగారు 250 కి పైగా కథలు రాసారు. ''ముగ్గురాళ్ల మిట్ట'' కథల సంపుటి ఎంతో ప్రసిద్ధమైనది. చిత్తుర్ మాండలికంలో రాసారు. గోతెలుగు.కామ్ అంతర్జాతీయ పత్రిక, ఆంధ్రప్రభ, సాక్షి, విశాలాంధ్ర దినపత్రికల్లో ప్రచురణైన కథలసంపుటి ఇది.
యువతలో ఉప్పొంగే తీవ్రవాద భావాన్ని దారి మళ్ళించే రీతిలో రాసి ''సమయస్ఫూర్తి'' కథలో శంభుడిని- భుజలింగం ఎలా మార్చాడో- తుపాకీతోనే సమాజం మార్చలేమని అర్థం అయ్యే రీతిలో చెప్పిన చక్కటి కథ.
ప్రకృతి - పర్యావరణం - ఆరోగ్యం - ఆహారం ప్రధాన్యతను ''అవ్వబువ్వ'' కథలో రాజుకు అవ్వ చెప్పే అంశాలు అందర్ని ఆలోచింపజేస్తాయి. సింహ బలుడు అనే రాజు కోమలవ్వ ఇంటికి వెళ్లి భోజనం చేయడం- అరిటాకులో ఉండే ప్రాణ వాయువు- ఔషధ గుణాలు - ఇతర పోషకాలు గురించి తెలియజేసిన మంచి కథ.
'చదువు' ప్రాధాన్యత తెలిపే కథ ''మట్టిలో మాణిక్యాలు''- కమ్మరి ఎలా అందమైన పాత్రలు మట్టితో చేస్తున్నాడో రాజుకు మంత్రి చూపించి... విద్య అనేది అందరికీ అందిస్తే ఎంతో ప్రయోజనం అనే మంత్రి మాటలతో సురేంద్ర పురి రాజు విద్యావ్యాప్తికి కృషి చేయడమే కథాంశం. ఇలా దాదాపు 30 కథలు- తేలిక భాషలో బొమ్మలతో సర్వాంగ సుదంరంగా ఈ పుస్తకాన్ని అందించిన 'ప్రజాశక్తి' బుకహేౌస్ వారికి అభినందనలు.
(రాజుగారి కథలు (బాలల బొమ్మల కథలు) రచయిత : ఆర్.సి.కృష్ణస్వామిరాజు, పేజీలు : 112, వెల : రూ.125/-, ప్రతులకు : ప్రజాశక్తి బుకహేౌస్, 27-30-4, ఆకుల వారి వీధి, గవర్నర్ పేట, రాఘవయ్య పార్క్ వద్ద, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ - 520002.)
- తంగిరాల చక్రవర్తి,
9393804472