Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శూన్యం నుంచి సంపూర్ణ ఏకతలోకి సమాజాన్ని తీసుకెళ్లాలనే తపన ఈ కవిది. ద్వంద్వాన్ని గమనిస్తే నేను, నేను కానిది అనే స్వార్థంతో కూడిన రెండంశాలు కనిపిస్తాయి. ''అంతా సమానమే'', ''అంతా ఒక్కటే'' అనే సమానార్థక దష్టికోణం ఏదైతే ఉందో అదే అద్వైతం, అదే అద్వంద్వం. భక్తి ఉద్యమ నేపథ్యపు విప్లవాత్మక మార్పు అద్వైతం.ఆధునికతను సంతరించుకున్న కవితా పంక్తుల విప్లవ చురకగా ఈ ''అద్వంద్వం'' సాహిత్య తెరపైకి వచ్చింది. ఈ పుస్తకాన్ని రచించిన కవి శ్రీరామ్. పుట్టింది తెనాలి. పెరిగింది విజయవాడ. వీరు వచనం రాయటంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు.
అస్తిత్వ ఛాయలు, అభినివేశత, ఆధునికత, ఆత్మగౌరవం స్వేచ్ఛా కాంక్ష, బతుకు వెతలు, విప్లవవాదం, సామాజికన్యాయం, మత సామరస్యం, స్త్రీవాద దక్పథం, నిరసన తత్వం, మానవతా పరిమళాలు ఈ అంశాలతో కూడి జాతీయం నుండి అంతర్జాతీయ సమస్యల వరకు కవి స్పందించారు.
వెంటాడే వాక్యాల్లోకి..
1. ''బిరడా వేసిన గాజుసీసాలోంచి
తూనీగల్ని,సీతాకోక చిలుకల్ని
రెక్కలు తెగ్గోసుకొని స్వేచ్ఛగా ఎగరమంటుంది'' (రెక్కలు తెగిన దారి)
స్వేచ్ఛ అంటే బలప్రయోగం కాదు.అభిప్రాయాల ప్రకటన, హక్కుల ప్రకటన, ఎవరిని ఇబ్బందులకు గురిచేయనిది, హానీ చేయనిదే స్వేచ్ఛ. అలాంటి స్వేచ్ఛాపూరిత వాతావరణం నుండి పిల్లలు దూరమవుతున్నారు. ఇష్టంలేని తనాన్ని బలవంతంగా రుద్దటం, పిల్లల మీద భారం వేయడం, మనస్థాపానికి గురై వారు ఆత్మహత్యలు చేసుకోవడం. ఇలాంటి సమస్యలు తలెత్తకూడదని కవి తన మొదటి కవిత ద్వారా సమాజాన్ని హెచ్చరిస్తున్నాడు.
2. పొలం కాళ్లు నగరానికి వచ్చాయి
పొలం పాదాల్ని కళ్ళకద్దుకోవాలనిపిస్తుంది
రంగు వెలిసిన కన్నీటి వానలు కురుస్తూ
పంట పాదముద్రలు
పట్నం కూడలిలో నిలబడ్డాయి (నాసిక్ -ముంబై)
కవి అంటేనే సమాజం పట్ల బాధ్యత కలిగిన వాడు. దేశానికి అన్నం పెట్టేవాడు రైతు. ఆ రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అన్న నానుడి తెలియనిది కాదు. రైతులు ఎంతో కష్టపడి పంట పండిస్తే గిట్టుబాటు ధర ఉండదు.రైతులు హక్కుల కోసం సమస్యల సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్లో రైతులు ''లాంగ్ మార్చ్'' నిర్వహించిన సందర్భాన్ని తీసుకొని రైతుల నిరసనను తెలియజేస్తూ ఈ కవి రాసిన కవిత గొప్పగా ప్రతిధ్వనించింది. ఈ కవి కూడా రైతు పక్షాన నిలబడ్డవాడే. అందుకు ఉదాహరణగా ఒకసారి ఈ వాక్యాలు పరిశీలించండి. ఈ కవితలో ''రైతు పాదాలు'' నమస్కరించదగినవన్న విషయాన్ని కవి స్పష్టం చేస్తున్నాడు.
3. ''సాయిబులంతా మసీదు వైపు నడుస్తుంటే
తెల్లారి ఆకాశంలో
పొట్ట వరిచేల పై పై ఎగిరే కొంగల బారు
సందులో నేల మీదకు వచ్చి వచ్చి నడుస్తున్నట్టుంది (దేవుడి సందు)
ఏ మతమైనా మంచినే బోధిస్తుంది. భగవద్గీత,ఖురాన్,బైబిల్ అయినా మానవత్వంతో జీవించమని చెబుతుంది. ప్రస్తుత సమాజం దీన్ని గమనిస్తే ఆచరిస్తే ఎటువంటి సమస్య ఉండదు. సుగుణాలు కలిగి ఉంటూ ఒకరి విశ్వాసాలను మరొకరు గౌరవిస్తూ అన్నదమ్ముల లాగా జీవించాల్సిన అవసరం నేటి రోజులకు వర్తిస్తుంది.ఈ కవికి ''మతసామరస్య భావన'' నిండుగా ఉంది. సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు ముస్లిం, క్రైస్తవ సోదరులకు సకినాలు పంచడం, రంజాన్ పర్వదినంరోజు వారు సేమియా పంచడం, క్రైస్తవ సోదరులు మిఠాయిలు పంచడం, ఇలా ఒకరికొకరు కలిసి జీవించే సామరస్యాన్ని మనం చూస్తుంటాం. శ్రీరామ్ ఆ భావాలను చక్కగా ''దేవుడి సందు'' అనే కవితలో పొందుపరిచారు. మతాంతర వివా హాన్ని, కులాంతర వివాహాల్ని సాదరంగా ఆహ్వానిస్తూ సమాజంలో వేళ్ళూనుకున్న వ్యవస్థకు దూరంగా దారులు వేస్తున్నాడు ఈ కవి.
4. ''చనుబాలు చప్పరించిన గుండెల్లో
నీ మూలం పుట్టుమచ్చలు తడిమి చూడు
నువ్వు నేనొక ఆకాశం కాదా?
కరిగి కురిస్తే మనం
మట్టి వాసనలేసిన బతుకు నేల పండుగ కాదా?'' (అమ్మ పేరేంటి?)
''ఇప్పుడో సారన్నా గుళ్లో దేవుణ్ణి తాకితే బావుణ్ణు ఇప్పటికైనా వెట్టి వాడొకడు రాజైతే బావుణ్ణు'' (అట్రాసిటి)
చెల్లని నాణెం లాంటి పేద దేశం ముఖమ్మీద
కనపడని నాల్గోసింహం లా మీసం మెలేరు
సమాన హక్కులడిగి సబ్సిడీలో పనిముట్లు తీస్కో
(పేదరికంపై గెలుపు)
''సమసమాజ స్థాపన'' కోసం కూడా ఈ కవి నడుంబిగించాడు. ఇది అనాదికాలంగా వస్తున్న సమస్యే. ఎక్కువ తక్కువలు, కుల వివక్ష, మత వివక్ష, లింగవివక్ష కొన్ని శతాబ్దాలు దాటినా ఆ బీజాల తాలూకా వాసన ఏ మూలనో నక్కినక్కి కూర్చుంటుందన్న భయం ఇంకా నాలో ఉంది. కవులుగా వీటిపై కలకమెత్తాల్సిన బాధ్యత ఉన్నది. అలా కలమెత్తినకవి శ్రీరామ్ మానవీయ విలువలు, అనురా గాలు, స్నేహానికి సంబంధించిన కవితలు కూడా ఇందులో చోటు చేసుకున్నాయి. ఒంటరి స్త్రీలు పిల్లలను సాదలేక పడుతున్న వేదనా భరిత జీవితాన్ని కవి చూపించిన తీరు చాలా బాగుంది.ఇలా మొత్తం 38 కవితల్లో భావ సాంద్రతతో చిక్కగా, ఆధునికతను మేళవించి అద్వంద్వంను మన ముందుకు తెచ్చాడు. దాదాపు కవితలన్నీ చక్కటి శిల్పంతో పాటుగా, అభివ్యక్తిలో కొత్తగా ,కావల్సిన సమయాల్లో అలంకారాలను కవితల్లో చొప్పిస్తూ మంచి కవితా సంపుటిని పాఠకులకు బహుమతిగా ఇచ్చాడు.
- తండ హరీష్ గౌడ్,
8978439551