Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1987 వేసవిలో ఒకరోజు ఉదయం, భిలారుకి సమీపంలో ఉన్న ఛత్తీస్ఘఢ్ రాష్ట్రంలో రాజ్ నంద్ గావ్ జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా ఎస్పీలు, ఒక సత్నామి దళితుడు హిందూ దేవాలయంలోకి ప్రవేశించి, కులాల మధ్య ఉద్రిక్తతలు సృష్టిస్తున్నాడని అత్యవసర వైర్లెస్ ద్వారా తెలుసుకున్నారు.
ఛత్తీస్ఘడ్కు చెందిన సత్నామి దళితులు కుల, మత పరంగా ప్రత్యేకమైన వర్గంగా ఉన్నారు. గురుఘాసిదాస్ ప్రభావంతో వారు భక్తి సాంప్రదాయంతో, స్వంత మత చిహ్నాల తో, పూజారులతో ఒక మత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆచరణలో వారి పూజా విధానం ఆ ప్రాంతంలోని హిందువుల పూజా విధానాన్ని పోలి ఉండేది. వారు ఒక ఉన్నత సామాజిక స్థితిలో ఉన్నట్లు చెప్పుకుంటారు. కానీ ఇతరులు, వారిని అట్టడుగు కులానికి చెందిన వారిగా చూసేవారు. వీరు హిందూ కులాలకు చెందిన గ్రామాల్లో తీవ్ర కుల వివక్షతకు, అంటరాని తనానికి గురవుతూ ఉన్నారు.
దీనికి రెండు నెలల ముందు, ఆ జిల్లాకు సరిహద్దున ఉన్న ఒక గ్రామంలో సత్నామీలు ఒక హిందూ దేవాలయానికి ప్రద ర్శనగా వెళ్ళాలన్న ప్రయత్నంతో అక్కడ హింస, రక్తపాతం జరి గింది. కాబట్టి జిల్లాకు చెందిన గ్రామంలో సత్నామీలు ఆలయ ప్రవేశం చేస్తున్నారన్న వార్త రావడంతో, జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీలు ఆ గ్రామానికి హుటాహుటిన వెళ్ళడంలో ఆశ్చర్యంలేదు.
వెళ్ళిన ఆ అధికారులు ఆ పోలీస్ స్టేషన్లో ఒక మొండి నేరస్తుడిని కలవాల్సి ఉంటుందని ఊహించారు. కానీ వారికి ఎదురుపడిన ఆ మనిషి, వారు ఊహించిన దానికి విరుద్ధంగా ఉన్నాడు. అతడు బెదిరిపోయిన ఒక నిరుపేద యువకుడు. అతడు ఏడుస్తూ వారి కాళ్ళ మీదపడి ''నేను పెద్ద తప్పు చేశాను కానీ అపాయం తలపెట్టాలన్నది నా ఉద్దేశం కాదని'' అన్నాడు. ఓ భయంకరమైన తప్పు తెలియకచేశానని, తనను క్షమించమని అధికారులను వేడుకుంటే, వారు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అతని మాటలు నమ్మాలో, నమ్మకూడదో వారికి అర్థంకాలేదు. అతడిని మాట్లాడించేందుకు చాలా బుజ్జగించ వలసి వచ్చింది. చివరికి అతని గాథ బయటికి వచ్చింది.
మోహన్ భూమి లేని ఒక నిరుపేద. అతనికి ఎవరూలేరు, ఎంతో ప్రేమించే తన భార్య తప్ప. ఆమె ఒకసారి తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు, ఎలా కోలుకుంటుందోనని దిగులు గా ఉన్నాడు మోహన్. తన భార్య కోలుకుంటే హనుమంతునికి కట్టుబట్టలు కానుకగా ఇస్తానని మొక్కు కున్నాడు.
చివరికి మోహన్ భార్య కోలుకుంటుంది. తన మొక్కు తీర్చు కోడానికి బయలుదేరాడు. అతి కష్టమ్మీద డబ్బు పొదుపు చేసుకొని, ఆచారం ప్రకారం మొక్కుకు అవసరమైన సామగ్రిని కొని, పెద్ద రాగిచెట్టు కింద ఏర్పాటు చేయబడిన హనుమంతుని గుడికి బయల్దేరాడు. స్థానిక ఆచారం ప్రకారం దేవుని విగ్రహానికి సింధూరం, నెయ్యి పూయవలసి వచ్చింది. అతడు విగ్రహానికి సింధూరం, నెయ్యి పూయడం మొదలు పెట్టినప్పుడు, అగ్రకులానికి చెందిన పిల్లవాడు చూశాడు. అంతే, ఒక్కసారిగా అరుపులు, కేకలు, గొడవలతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా తయారైంది.
ఆ పిల్లవాడు తన గ్రామంలోని దేవుడిని మలినం చేసిన అంటరానివాని పట్ల ఉన్న కోపాన్ని, తన స్నేహితులతో పంచు కున్నాడు. అందరు కలిసి మోహన్ను కొట్టారు. అదష్టవశాత్తు, పోలీస్స్టేషన్ ఆ గ్రామంలోనే ఉండడం, వెంటనే పోలీసులు రావడం, మోహన్ను కాపాడడం చకచకా జరిగి పోయాయి.
ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్తత స్పష్టంగా తెలిసి పోయింది. గ్రామంలోని ఉన్నత కులాలకు చెందిన వారి ఆగ్రహం, వారి మౌనంలో స్పష్టమైంది. పోలీసుల రాకతో అగ్ర కులాల పిల్లలు బెదిరిపోయారు. గ్రామంలోని ఇతర సమస్యా త్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించాయి. సత్నామీలు కోపంతో మౌనంగా ఉండిపోయారు. కానీ వారు మోహన్కు బహిరంగంగా మద్దతు తెలిపేందుకు భయపడి, అసంఘటితంగా ఉండి పోయారు. పవిత్రతపై గౌరవం లేకుండా చేపట్టిన క్షమించరాని చర్య పట్ల అతనిపై చర్య తీసుకోవాలని ఉన్నత కులాలకు చెందిన హిందువులు రహస్యంగా ఒత్తిడి చేశారు. సత్నామీలు వారి సామాజిక స్థితిని మర్చిపోతున్నారు. పిల్లలు మాత్రం సత్నామీలను శిక్షించే వరకు విశ్రమించమని ప్రకటించారు. మోహన్ తలపైనే కాక, సత్నామీల మత చిహ్నంపై కూడా మూత్రం పోయడం ద్వారా శిక్షించాలని తీర్మానించారు. పెద్ద దుంగగా ఉన్న, వారి మత చిహ్నాన్ని సత్నామి పేటలో నిలబెట్టారు. గౌరవం లేకుండా సత్నామీల చిహ్నాన్ని అపవిత్రం చేయడం, మోహన్ను శిక్షించడం ద్వారా మాత్రమే కక్ష తీర్చుకున్నట్లు ఉన్నత కులాలకు చెందిన పిల్లలు భావించారు.
గ్రామంలో జిల్లా మెజిస్ట్రేట్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి హిందూ కులాలకు చెందిన పిల్లలు, వారి పెద్దలతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. మోహన్ మీ దేవుళ్ళ పట్ల చూపిన భక్తిని, పిల్లలు సత్నామీల పవిత్ర చిహ్నాన్ని అగౌరవ పరచడానికి చేసిన ప్రయత్నాన్ని ఎలా సమానంగా చూస్తాం? అని ఆయన వాదించాడు. కానీ హేతుబద్ధమైన మాటలను వినేందుకు ఎవ్వరూ ఇష్టపడలేదు. దానితో మెజిస్ట్రేట్, ఎస్పీ పిల్లలను నిర్బంధించాలన్న తీవ్రమైన నిర్ణయానికి వచ్చారు. మోహన్ ఆ ఊరిలో ఉండలేనంతగా భయపడినాడు. పోలీసుల రక్షణతో మోహన్ తన భార్యతో, వేరే జిల్లాకు వెళ్లి దూరపు బంధువుతో కలిసి ఉన్నాడు.
సుదూర ప్రాంతంలోని అంత చిన్న గ్రామంలో పోలీసు క్యాంప్ 40 రోజుల పాటు నడిచింది. కొన్ని నెలల తరువాత, మళ్ళీ తన స్వంత గ్రామానికి తిరిగి వచ్చి అక్కడే జీవించాలని మోహన్ భావించాడు.
- హర్ష మందిర్
తెలుగు : బోడపట్ల రవీందర్