Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్షర(అం)తరంగాలు
డా|| పగడాల నాగేందర్ ఈ కవితా సంపుటికి చక్కటి ముందుమాట రాశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారి ఆర్థిక సహకారంతో ఈ పుస్తకం ముద్రించారు. మనిషి అంతరాంత రాలలో దాగి వున్న భావాలకు అక్షర ప్రతి రూపం 'కవిత్వం' అంటారు. చంద్ర గద్య శతకంలో నండూరి రామచంద్రరావు గారు పాఠకులకు పద్య ప్రియులకు సుపరిచిత కవి.
దాదాపు 166య కవితలున్న ఈ కవితా సంపుటిలో... కొన్ని నానీలు కూడారాశారు. సాంఘిక సమస్యలు.. దు:ఖం- విషాదం - సున్నితమైన భావాలు - మహిళలు గురించి ఈ సంపుటిలో మంచి కవితలు రాసారు కవి.
ఆధునిక జీవితంలో పతనమౌతున్న మానవ సంబంధాలను ఈ కవితా సంపుటిలో శక్తివంతమైన భావాల్తో మంచి కవితలు రాశారు.
తన 'అంతరంగ తరంగం' (పేజీ 10)లో సుస్పష్టంగా రాస్తూ ఇలా రాసారు కవి.
''ఆ తరంగాల ప్రబోధ ప్రభావమే / అంతరంగాలు అనే పేరున ఈ సంకలనానికి చుట్టబడిన శ్రీకారం'' అంటారు.
''ప్రతి అక్షరం మెరిసే నక్షత్రం / ప్రతి పదం వాడిపోని పద్యం / ప్రతి కవనం అందమైన వనం'' (పేజీ 29) అంటారు చిరు కవితలు...
'వద్దు గర్వం' అనే కవితలో
''గానుగెద్దు నడత కానివ్వకు
గడియ గడియకూ నీవు ఎదుగు
గాలి పటం మాట మాని
గళం ఎత్తి సమతబాటు''- అంటారు. 'యెంకి మనస్సు మాట' కవిత- (పేజీ 143) నండూరి వారి ఎంకిని గుర్తు చేస్తుంది. గోపి గారి నానీ గుర్తు చేస్తూ వీరు రాసారు ఓ నాని-
''రక్తం పంచి / ప్రేమించి
కూతురుగా పుట్టి / నీ జన్మకు సార్థకం స్త్రీ నే''- అంటారు. కొన్ని కవితలు తాత్త్విక భావాల్తో నిండి వుంటాయి. కదలిక కవితలో చివరి వాక్యాల్లో కవి ఇలా రాశారు.
''నాటిన బీజం మొలకెత్తడం చూసి నేర్చుకో-/
భూమి మీద వుంటేనేమి. అంబరానికి ఎదుగు ఓ నాడు''- అంటారు. కొన్ని కవితలు భావాలు తాత్త్వికతో నిండి వుండగా మరికొన్ని అస్పష్ట భావాలున్నాయి. బతుకు బరిలో దీర్ఘ కవిత చాలా బాగుంది. ((పేజీ 179). ఓ చక్కటి కవితా సంపుటి ఇది..
((అం)తరంగాలు (కవితా సంకలనం), రచయిత : నండూరి రామచంద్రరావు, పేజీలు : 296, వెల : రూ.250/-, ప్రతులకు : అచ్ఛంగా తెలుగు సంస్థ, ఇ.నెం. 12-5-32/14సి, ఫ్లాట్ నెం. 402, విజయపురి కాలనీ, తార్నాక, సికింద్రాబాద్ - 017)
- తంగిరాల చక్రవర్తి,
9393804472