Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె మదిలోని భావాలు చుట్టూ జరిగే సంఘటనలతో పుట్టుకొచ్చి అనుభూతులకు ఆజ్యం పోస్తాయి... ఓపలేని వేదనా వెతలను ఒడుపుగా బయటపెట్టి ఓదార్పు జోలలు పాడుతాయి... మస్తిష్క మేరు పర్వతం నుండి ఉద్భవించి పాలకడలై పరుగులిడుతూ అమతపు భావ అలలకు అలవాలమవుతాయి. ఆమె కలమే హలమై సేద్యం చేయగా శ్వేత పొలంపై కవితలపంట పండిస్తున్నాయి... అంతర్మథనమునే పెట్టుబడిగా పెట్టి నైతిక విలువలు గల పైరు దిగుబడికి కవనమే అస్త్రంగా కీచక క్రిములను చీల్చి చెండాడుతున్నాయి...
ఆమె ఎవరోకాదు వర్ధమాన కవయిత్రి శ్రీమతి కాసనగొట్టు స్వప్నకృష్ణ.. ''ఎందుకో ఈవేళ'' అంటూ ఎనభై కవితలతో చక్కని సంపుటాన్ని వెలువరించి సాహితీ క్షేత్రంలో తనకంటూ చక్కని స్థానాన్ని సంపాదించుకొని కవితలపంట పండిస్తుంది.. తన కవితా సంపుటిలోని మచ్చుకి కొన్ని కవితలను మీకు రుచిచూపించాలనే నా ఈ చిన్ని ప్రయత్నం.. తన ''జ్ఞాపకాల పుటలు'' అనే కవితలో కవయిత్రి జ్ఞాపకాలను ఎంత కవితాత్మకంగా గుప్పించిందో చూడండి..
'ఒంటరితనపు నెచ్చెలితో సహచర్యం చేసిన వేళ...
మానసపుత్రికలై మనోగతం నుండి పరుగున వచ్చి పంచనచేరతాయి...
లేలేత పరుగుల బాల్యపు తీయని గురుతులు..
యెదను నిలవనీయని యవ్వనపు చిందులు...
మేటవేసిన అనుభవాల కుప్పలన్నీ
విజృంభించిన ఇసుకతుఫానై వీచి
తనువంతా ముంచుతాయి...
ఉరుకులమయమై ఉసూరుమంటున్న ప్రాణానికి
ఉపశమన గుళికలై జీవామతం పోస్తాయి...'
అంటూ చిక్కని భావామతాన్ని వెదజల్లింది...
ఇంకా 'ఏకాకి జీవితం' అనే కవితలో
'అవును నేను ఏకాకినే..
చుట్టూ సంద్రమల్లే జనమున్నా
ఆదరణ బిందువులకు నోచని ఏకాకిని...
స్నేహముసుగులో దాగిన స్వార్థంతో
అంధకారం అలుముకున్న ఒంటరిపక్షిని...' అంటూ చివరలో 'కవనమే స్నేహమై సాగగా
గోడు వెల్లబోసుకుంటూ
అక్కున చేర్చుకునే ఆలింగంనంకై
ఆశావహ దక్పథంతో జీవిస్తున్న ఏకాకిని...' అంటూ ముగింపుపలికిన స్వచ్ఛమైన మనసున్న ఆశాజీవి స్వప్నకష్ణ గారు... ఇలా చూసుకుంటూ పోతే ప్రతికవిత ఓ కలికితురాయే ఎంతో ఆర్ధ్రత నిండిన భావ కవితలేకాక సమాజపు కుళ్ళును తన కలంతో కడగాలనే అభ్యుదయ భావజాలమున్న కవయిత్రి. తన పుస్తక సంపుటికి పెట్టిన 'ఎందుకో ఈవేళ' అనే శీర్షికతో కూడిన కవితను ఎంత అద్భుతంగా ఆవిష్కరించిందంటే...
'మనసెందుకో
జామురాతిరి జాబిలమ్మ ఒడిలో
సేదతీరిన తారకలా
తన ఉనికిని చాటుకుంటూ ఉరకలేస్తున్నదీ వేళ...
తనువెందుకో
తామరాకుపై జలముత్యంలా
దుఃఖపు ధూళిని జారవిడుస్తున్నదీ వేళ...
ఉల్లమెందుకో మరుమల్లై
మధుర పరిమళాల విందులలో విహరిస్తున్నదీ వేళ...
కనులెందుకో కాకరవత్తులై
మిరుమిట్ల చిలకరింతలతో ప్రకాశిస్తున్నవీ వేళ...
గతస్మతుల కవ్వింతలు జ్ఞప్తికి వచ్చి
పదుగురిలో అభినయాల ఆయువు పోసుకున్నందుకేమో...
వందలో పొందికగా తిష్టమేయక
ప్రత్యేకతల సుగంధంతో తేలుతూ
అస్థిత్వపు రాస్తాను సష్టించుకున్నందుకేమో...'
అంటుంది స్వప్నకృష్ణ గారు... నిజమే మరి వందలో పొందికగా తిష్టవేయకుండా తనకంటూ ఓ ప్రత్యేకతను సష్టించుకొని ఎల్లలెరుగని కీర్తిసుమాలను పూయించి కవిత్వ పిపాసకుల మదిని తన కవనపరిమళాలతో నింపాలని ఆశిస్తూ.. మరెన్నో కవితా సంపుటాలు తనకలం నుండి జాలువారాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించుతున్నాను.
(ఎందుకో ఈవేళ (కవితా సంపుటి), వెల: రూ.100/-, సెల్ : 7780493575)
- వకుళ వాసు