Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నటనకు, అభినయానికి, అందానికి ఆమె మారు పేరని చెప్పవచ్చు. గ్లామర్రోల్ అయినా, ట్రాజెడీ రోల్ అయినా.. ఆ పాత్రలో ఇట్టే ఇమిడి పోతుంది. అందుకే ఆమెను భారతీయ సినిమాకు 'వీనస్ క్వీన్' లాంటిదని ప్రశంసలు కురిపించారు. ఆ రోజుల్లోనే హాలీవుడ్ హీరోయిన్ 'మార్లిన్ మన్రో'తో ఆమెను పోల్చడమే కాదు, 'మార్లిన్ మన్రో ఆఫ్ బాలీవుడ్' అని కీర్తించేవారు. అందుకే 1951లో హాలీవుడ్ ఫోటోగ్రాఫర్ 'జేమ్స్ బర్కి' ఇండియా వచ్చినప్పుడు అయన దష్టిని ఆకర్షించింది. ఆయన తీసిన ఫొటో ఆగస్టు 1952లో లైఫ్ పత్రిక కవర్ పేజీగా వచ్చింది. అంతేకాకుండా లైఫ్ సంచికలో ఆమె గురించి రాసిన 'బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ ద వరల్డ్' అనే వ్యాసం ప్రచురితమైంది. అందులో ఆమె దురదష్టవశాత్తు 'బెవర్లీ హిల్స్' లో లేదు అని కూడా రాశారు. అప్పటివరకు ఏ భారతీయ నటీనటుల ఫొటోలు లైఫ్ పత్రిక ప్రచురించలేదు. వ్యాసాలూ రాయలేదు. అంతేకాదు ఆమెను బిగ్గెస్ట్ స్టార్గా అంతర్జాతీయ సినీ పరిశ్రమ పొగిడింది. ఆమే నాటి అందాల తార మధుబాల..
మధుబాలగా 'ముంతాజ్ జెహాన్ బేగం దెహ్లావీ'
మధుబాలగా సినీ ప్రేక్షకులకు పరిచయం ఉన్న ఈ హీరోయిన్ అసలు పేరు 'ముంతాజ్ జెహాన్ బేగం దెహ్లావీ'. ప్రముఖనటి దేవికారాణి మధుబాల నటనకు ముగ్దురాలై, వెండితెర పేరును 'మధుబాల'గా మార్చుకొమ్మని సలహా ఇవ్వడంతో తన పేరును మధుబాలగా మార్చుకుని సినీ పరిశ్రమలో మధుబాల పేరుతో పాపులర్ అయింది. మధుబాల ప్రేమికులరోజు అయిన ఫిబ్రవరి 14వ తేదీ 1933వ సంవత్సరం అతుల్లాహ్ ఖాన్, అయేషా బేగం దంపతులకు పదకొండు మంది సంతానంలో ఐదవ సంతానంగా ఢిల్లీలో జన్మించింది. మధుబాల తండ్రి పెషావర్ ప్రాంతంలో ఉండేవాడు. అక్కడ ఆయన ఉద్యోగాన్ని కోల్పోవటంతో కుటుంబంతో సహ ఢిల్లీ చేరుకుని అక్కడ కొన్నాళ్లు వున్న తర్వాత జీవనోపాధి కోసం బొంబాయి మకాం మార్చాడు. ఎన్నో రకాల ఇబ్బందులతో అతుల్లాహ్ ఖాన్ తన కుటుంబాన్ని పోషించుకొనేవాడు. మధుబాల 11వ ఏట, 1944వ సంవత్సరం ఏప్రిల్ 14న జరిగిన ప్రేలుడు ప్రమాదంలో ఆమె ముగ్గురు సోదరీమణులు, ఇద్దరు సోదరులు చనిపోయారు, మధుబాలతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు సినిమా చూడటానికి వెళ్ళడం వల్ల వారు ఈ ప్రమాదం నుండి బయటపడ్డారు. ప్రమాదంలో ఐదుగురు చనిపోవడంతో పదకొండు మందిలో నలుగురు మాత్రమే మిగిలారు.
'బసంత్' సినిమాతో బాల నటిగా సినిమాల్లోకి
మధుబాల బాల నటిగా 9 ఏళ్ల వయస్సులోనే 1942లో వచ్చిన 'బసంత్' అనే సినిమాతో చలన చిత్రసీమలో అడుగు పెట్టింది. మధుబాల తండ్రి అతుల్లాహ్ ఖాన్కు కుటుంబ పోషణ భారమవ్వడంతో అందంగా ఉన్న తన కూతురిని సినిమాలో బాలనటిగా చేర్చారు. అప్పటికే మధుబాలకు సినిమాల పట్ల ఆసక్తి ఉండటంతో ఉత్సాహంగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. మొదట్లో మధుబాలకు ఉర్దూ బాగా వచ్చినప్పటికీ ఇంట్లో వాళ్ళ సొంత భాష పాష్తో మాట్లాడేది. ఇంగ్లీష్ అసలు వచ్చేది కాదు. కానీ తరువాత ఇంగ్లీష్ క్లాసులు తీసుకొని బాగా నేర్చుకొని ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడేది. అలాగే 12 ఏళ్ల వయస్సులోనే డ్రైవింగ్ నేర్చుకున్న మధుబాలకు లాంగ్డ్రైవ్లంటే ఇష్టం. 1947 నుండి కథానాయకిగా కెరీర్ మొదలైంది. 14 ఏళ్ల వయస్సులోనే రాజ్ కపూర్తో నీల్, కమల్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. 22 ఏళ్ల సినీ జీవితములో 73 హిందీ సినిమాలలో నటించింది. అందములోనే కాకుండా, చాలా విషయాల్లో మధుబాలకు 'మార్లిన్ మన్రో'కు చాలా దగ్గర పోలికలు ఉండేవి. కెరీర్లో చాలా తక్కువ కాలం, విషాదాంతమైన జీవితం వంటి అంశాలలో మధుబాలకు మెర్లిన్ మన్రోకు పోలికలు ఉన్నాయని మధుబాల జీవిత చరిత్ర రాసిన ఖతీజా అక్బర్ అంటాడు. మధుబాల ఫోటోలు చుసిన హాలీవుడ్ నిర్మాత ఫ్రాంక్ కాప్రా బొంబాయి వచ్చినప్పుడు మధుబాలకు హాలీవుడ్ సినిమాలలో ఛాన్స్ ఇవ్వటానికి ముందుకు వచ్చాడు. కానీ మధుబాల తండ్రి మధుబాలను విదేశాలకు పంపటానికి ఒప్పుకోకపోవటంతో మధుబాలకు హాలీవుడ్ ఛాన్స్ మిస్ అయింది. మధుబాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన సినిమాల్లో 1949లో బాంబే టాకీస్ వారు నిర్మించిన ''మహల్''. ఈ సినిమా మధుబాలకు స్టార్డమ్ తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో మధుబాల చేసిన పాత్రకు మొదట సురయాను అనుకున్నారు. కానీ, ఆ పాత్ర మధుబాలకు దక్కింది. స్క్రీన్ టెస్ట్ చేసి మధుబాలను ఎంపిక చేసినది ప్రముఖ దర్శకుడు కమల్ అమ్రోహీ, ఆ తరువాత సినిమా ''దులారి'' లో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా మంచి వసూళ్లను చేసింది. ఈ సినిమాను ''శోభ'' పేరుతో తెలుగులో కూడా తీశారు. మధుబాల మొదటి బాక్స్ ఆఫీస్ హిట్ 1942 లో వచ్చిన 'బసంత్' ఈ సినిమాలో మధుబాల అప్పటి హీరోయిన్ ముంతాజ్కి కూతురుగా నటించింది. బసంతి సినిమా ఆ సంవత్సరం ఎక్కువ కలెక్షన్స్ ఉన్న సినిమాగా పేరు తెచ్చుకుంది. అదే టైంలో మధుబాలతో పాటు బాలనటిగా పరిచయం అయినా మరో నటి బేబీ మహజబీన్. ఈ బాలనటి తరువాతి రోజుల్లో ప్రముఖ హీరోయిన్ మీనాకుమారిగా ఎదిగింది. మీనాకుమారి, మధుబాల చిన్ననాటి స్నేహితులు అంతేకాదు మధుబాల, మీనాకుమారి అభిమాని. మీనాకుమారి స్వరాన్ని అభిమానించేది. అటువంటి హీరోయిన్లు మరెవ్వరు లేరు అనేది. మధుబాల 1950లో ప్రేమ్నాధ్తో కలసి నటించిన 'హస్తే అన్సూ' అనే సినిమా హిందీ సినీ పరిశ్రమలో మొట్ట మొదటి 'ఏ' సర్టిఫికేట్ సినిమా. 1953లో వచ్చిన 'రైల్ కా డిబ్బ' సినిమా షమ్మీ కపూర్తో కలిసి నటించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ఫెల్యూర్గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన 1955లో మిస్టర్డమిసెస్-55, 1958లో చల్తీకా నామ్ గాడి, 1960లో బర్సాత్కి రాత్, 1960లో మొఘల్ ఏ ఆజమ్, హిట్స్ సాదించాయి. మధుబాల నటించిన ''మొఘల్ ఏ ఆజమ్'' చిత్రం 1960 ఆగస్టు 5న విడుదలై అత్యధిక వసూళ్లను చేసిన చిత్రంగా రికార్డు సష్టించింది. మధుబాల సినీ చరిత్రలో ఒక పెద్ద మైలురాయిగా నిలిచిన మొఘల్ ఏ అజమ్ సినిమాలో దిలీప్ కుమార్తో కలిసి అనార్కలి రోల్లో నటించింది. అప్పటి వరకు వచ్చిన సినిమా రికార్డులను ఈ సినిమా బద్దలు కొట్టింది. ఈ సినిమా పూర్తి అవటానికి 9 ఏళ్ళు పట్టింది ఈ సినిమాలో మధుబాలను ఎంపిక చేసుకోవటంలో దిలీప్కుమార్ పాత్ర ఏంతో ఉంది. మధుబాల తన ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ దీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్స్లో పాల్గొని స్టూడియో లైట్లలో గంటల తరబడి పనిచేసి వత్తి పట్ల తన నిబద్ధతను చాటుకుంది. ఈ టైంలోనే దిలీప్కుమార్తో ప్రేమ వ్యవహారం కూడా చెడింది. సినిమా పాత్రలాగానే నిజ జీవితంలో కూడా ట్రాజెడీ సంభవించింది. ఈ సినిమా విడుదలై అనేక రికార్డులు నెలకొల్పింది. ఈ రికార్డు 1975లో 'షోలే' చిత్రం విడుదల అయ్యేవరకు కొనసాగింది. ''మొఘల్ ఏ ఆజమ్'' సినిమాలో మధుబాల నటనకు 'ఫిలిం ఫేర్ ఉత్తమ నటి' అవార్డు వచ్చింది. మొఘల్ ఏ అజమ్ సినిమాలోని ''ప్యార్ కి యతో డర్నా క్యా '' పాట ఆ పాటలో మధుబాల అభినయం నేటికీ ప్రజల మనస్సుల్లో స్థిరంగా ఉండిపోయింది. మధుబాల అశోక్ కుమార్, రాజ్ కపూర్, రెహ్మాన్, ప్రదీప్ కుమార్, షమ్మీ కపూర్, దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్, వంటి ప్రముఖ హీరోలతోను, కామిని కౌషల్, సురయా, గీత బాలి, వంటి హీరోయిన్లతో కలిసి నటించింది. అలాగే ప్రముఖ దర్శకులతోనూ కలిసి పనిచేసింది.
నిర్మాతగా..
మధుబాల సినీ నిర్మాతగా మారి 1955లో 'నాట', 1960లో 'మెహెలోన్ కి క్వాబ్', 'పతాన్' సినిమాలను నిర్మించింది.
సావిత్రితో కలిసి
జెమిని స్టూడియోస్ వారి 'బహుత్ దిన్ హువా' సినిమాలో ప్రముఖ తెలుగు నటి సావిత్రితో కలిసి నటించింది ఈ సినిమా షఉటింగ్ పూర్తిగా మద్రాస్ లో జరిగింది. ఈ సినిమా షూటింగ్ అప్పుడే మధుబాల అనారోగ్యం గురించి తెలిసింది. మధుబాల 'కంజినీయల్ హార్ట్ డిసీజ్' తో బాధపడుతున్నట్లు తెలిసింది. మధుబాల నటించిన ''దులారి'' సినిమాను ''శోభ'' పేరుతో తెలుగులో కూడా నిర్మించారు.
మధుబాల సోదరి చంచల్ సినిమాల్లో..
మధుబాల సోదరి 'చంచల్' సైతం సినిమాల్లో నటించి రాణించింది. మధుబాలతో 'చంచల్'కు ఎక్కువ పోలికలు ఉన్నాయి. ఆమె 1951లో నాజ్నీన్, 1955లో నాతా, 1960లో మహలోంకా ఖ్వాబ్, 1961లో ఝుమ్రూ చిత్రాలలో మధుబాలతో కలిసి నటించారు. 1957లో మెహబూబ్ఖాన్ 'మదర్ ఇండియా', 1960లో రాజ్కపూర్ 'జిస్ దేశ్ మే గంగా బెహతి హై' లలో ఆమె ప్రముఖపాత్ర పోషించారు.
కిషోర్ కుమార్ కాంబినేషన్తో వచ్చిన సినిమాలన్ని సక్సెస్
మధుబాల కిషోర్ కుమార్తో కలిసి నటించిన రొమాంటిక్ మ్యూజికల్ కామెడీ 'దాకే కి మాల్మల్' తొలి సినిమా ఫెయిల్ అయింది. కానీ ఆతరువాత వారి కాంబినేషన్తో వచ్చిన సినిమాలన్నీ సక్సెస్ సాధించాయి. మధుబాల ఆఖరు సినిమా జ్వాల ఈ సినిమాను 1950 లో తీసినప్పటికీ 1971లో అంటే చనిపోయిన రెండేళ్లకు విడుదల అయింది.
అభద్రతా భావంతో ప్రేమించిన వాళ్ళను కోల్పోయి..
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మోహన్దేప్ రాసిన మధుబాల జీవిత చరిత్రలో మధుబాల బాల్యం నుండి ఇష్టపడ్డ, ప్రేమించినవాళ్ల గురించి రాసాడు. మధుబాలను అభద్రతా భావం వెంటాడేదని, దానితో మగవాళ్ళను ప్రేమించేది, అలాగే వాళ్ళను కోల్పోయేదని, వాళ్లలో లతీఫ్, మోహన్ సిన్హా, కమల్ అమ్రోహీ, ప్రేమ్నాధ్, జుల్ఫీకర్ భుట్టో, దిలీప్కుమార్, బాల్యంలో మధుబాలకు లతీఫ్ అనే స్నేహితుడు ఉండేవాడు. బొంబాయి వెళ్లబోయే ముందు అతనికి తన ప్రేమ చిహ్నంగా ఎర్ర గులాబీ ఇచ్చింది. మధుబాల చనిపోయక ఆతను ఎర్ర గులాబీని మధుబాల సమాధి మీద ప్రతి సంవత్సరం ఉంచేవాడు. ఆ తరువాత కమల్ అమ్రోహీతో ప్రేమ వ్యవహారం తండ్రి పెళ్ళికి ఒప్పుకున్నా మధుబాల కమల్ అమ్రోహీకి రెండవ భార్యగా ఉండటానికి ఒప్పుకోలేదు. ఆ తరువాత దిలీప్కుమార్తో ప్రేమ వ్యవహారం సాగింది. తండ్రి ఈ వ్యవహారాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే కుటుంబానికి మధుబాలయే ఆధారం. బొంబాయి కాకుండా మరెక్కడైనా దిలీప్ కుమార్తో షూటింగ్ ఉంటే తండ్రి ఒప్పుకొనేవాడు కాదు. ధీంతో 'నయదౌర్' సినిమాలో మధుబాల ఛాన్స్ వదులుకోవలసి వచ్చింది. చివరకి 27ఏళ్ల వయస్సులో మధుబాల దిలీప్కుమార్తో తన పెళ్లి జరగదని తెలుసుకొని అతన్ని సైతం దూరం చేసుకుంది.
కిషోర్ కుమార్తో వివాహం
నటుడు, నేపథ్య గాయకుడు అయిన కిషోర్ కుమార్ను పెళ్లి చేసుకుంది. అప్పటికే మధుబాల గుండె జబ్బుతో భాధ పడుతుండేది. కిషోర్కుమార్ ముస్లింగా మారి పేరు మార్చు కోవడంతో కిషోర్కుమార్ కుటుంబసభ్యులు ఈ వివాహాన్ని అంగీకరించలేదు. కానీ, కిషోర్ కుమార్ ఫిల్మ్ ఫెయిర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తానూ, మధుబాల మతం మారలేదని ప్రకటించాడు. పెళ్లి అయ్యాక హనీమూన్ కోసం ఇంగ్లాండ్ వెళితే అక్కడ డాక్టర్లు మధుబాల ఇంకా రెండేళ్లు మించి బతకదని చెప్పారు. తన మరణం ఆసన్నమైందని తెలుసుకున్న మధుబాల, భారతదేశానికి తిరిగి వచ్చారు. కిషోర్ కుమార్ కుటుంబసభ్యులు వీరి వివాహాన్ని అంగీకరించక పోవడంతో మధుబాల ఎప్పుడూ అతని నిజమైన భార్య కాలేక పోయారు. కిషోర్కుమార్ ఇంట్లో కలతల కారణంగా వివాహమైన నెలరోజుల్లోనే ఆమె తన బాంద్రా భవంతికి తిరిగివచ్చారు. ఆ ఇంట్లో మధుబాల ఆలనాపాలనా చూడటానికి ఒక నర్స్ను, డ్రైవరును కిషోర్ కుమార్ నియమించాడు. అప్పుడప్పుడు వచ్చి మధుబాలను చూసి వెళుతూ ఉండేవాడు. అన్ని రకాల వైద్య ఖర్చులను కిషోర్ కుమారే భరించేవాడని, మధుబాల చెల్లెలు మాధుర్ భూషణ్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసింది. మధుబాల శేష జీవితమంతా వారి వైవాహిక జీవితం విపరీతమైన ఒత్తిడితోనే కొనసాగింది. కానీ మధుబాల మరొక 9 సంవత్సరాలు జీవించడం ద్వారా అంచనాలను అధిగమించారు. 1969 ఫిబ్రవరి 23న, తన 36వ పుట్టినరోజు జరిగిన కొద్దికాలా నికే మధుబాల మరణించారు.
మధుబాల జ్ఞాపకార్ధం తపాలా బిళ్ళ
మధుబాల మరణాంతరం 2008వ సంవత్సరంలో ఆమె జ్ఞాపకార్ధం భారతీయ తపాలా వారు తపాలా బిళ్ళ విడుదల చేశారు. దీనిపై ఆమె బొమ్మ ఉంటుంది. ఈ విధంగా గౌరవించబడిన మరొక ఏకైక భారతీయ నటి నర్గీస్ దత్.
(ఫిబ్రవరి 14వ తేదీ మధుబాల జయంతి సందర్భంగా...)
- పొన్నం రవిచంద్ర