Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవం
హైదరాబాదు స్టేట్ సాంస్కృతిక చరిత్రలో 'దక్కన్ రేడియో'ది ప్రత్యేక స్థానం. నిజాం రాజ్యంలో ఇదే తొలి రేడియో స్టేషన్. 1933లో ఒక ప్రైవేటు బ్రాడ్ కాస్టింగ్ స్టేషనుగా 20 వాట్స్ మీటింగ్ పవర్తో అబిడ్స్లోని చిరాగ్ అలీ లేన్లో ఉన్న 'ఆజాబ్ మంజిల్'లో ప్రారంభమైనదీ రేడియో. మహబూబ్ అలీ అనే ఒక పోస్టల్ ఉద్యోగి మొదట్లో దీనిని నిర్వహించాడు. అయితే 1935 ఫిబ్రవరి 23న నిజాం సర్కారు దీనిని తమ అధీనంలోకి తీసుకున్నది.
ఇదిలా ఉండగా అప్పటి మదరాసు స్టేటులో అప్పటివరకు రేడియో స్టేషన్ ప్రారంభం కానేలేదు. 1938 జూన్ 16న ఎగ్మోర్లో సి.రాజగోపాలా చారి, కూర్మా వెంకటరెడ్డి నాయుడు (మద్రాసు ప్రధాని)ల సమక్షంలో తొలుత రేడియో స్టేషన్ ప్రారంభమైంది. అంటే స్వతంత్ర రాజ్యంగా ఉన్న హైదరాబాదు మిగతా ఇండియాలోని నగరాలకన్నా కాస్త ముందుగానే సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్న దని మనం దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
రేడియో స్టేషన్ని తమ అధీనంలోకి తీసుకున్నపునడు 'నిజాం స్టేట్ బ్రాడ్ కాస్టింగ్ డిపార్ట్మెంట్' ద్వారా దీనిని నిర్వహించేవారు. 1939లో దీనికి కార్యదర్శిగా, వైర్లెస్ డిపార్ట్మెంట్, కంట్రోలర్గా 'నవాబ్ అలీ యావర్ జంగ్ బహదూర్'ను, ఇతర సభ్యులుగా మహమ్మద్ ఫజలుర్ రహెమాన్, మహబూబ్ అలీ తాహెర్, సయ్యద్ మొహమ్మద్ హుస్సేన్లను నియమించారు.
1935లో ఈ రేడియోను తమ అధీనంలోకి తీసుకున్నపుడు ఉర్దూలో వార్తా ప్రసారాలు, ఘజల్స్, ఖవ్వాలీ, దఖనీ దోల్క్కి గీత్వంటి కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. వీటితో పాటు ఉర్దూ కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. వీటితో పాటు ఉర్దూ ప్రసంగాలు, సంచికా కార్యక్రమాలు, నాటకాలు కూడా ప్రసారం చేసేవారు. రోజు మొత్తంలో ఈ రేడియో నాలుగున్నర గంటలపాటు పనిచేసేది. ఇందులో అరగంట చిన్న పిల్లల కార్యక్రమాలకు కేటాయించగా మిగతా నాలుగు గంటలు సాధారణ కార్యక్రమాలుండేవి. వార్తలు ఉర్దూ, ఇంగ్లీషులో ప్రసారం కాగా, ఏదైనా ప్రసంగం 15 నిమిషాల వ్యవధిలో సాగేది. వీటితో బాటు వాద్య,గాత్ర సంగీత కార్యక్రమాలు ముందుగా రికార్డు చేసి ప్రసారం చేసేవారు.
ఇక చిన్న పిల్లల కార్యక్రమాలను వారంలో రెండు సార్లు ప్రసారం చేసేవారు. మిగతా రోజులలో ఆసక్తికరమైన సూచనలచే ప్రసంగాలు, కథానికలు, చర్చా కార్యక్రమాలు, వాద్య, గాత్ర సంగీత కార్యక్రమాలు ప్రసారయ్యేవి. ఇలా 1939 జులై నాటికి దక్కన్ రేడియోగా పేరు మార్చుకున్న హైదరాబాదు రేడియో 'నిజాం రాష్ట్ర వైర్లెస్ శాఖ ఆధ్వర్యంలో నడిచింది. ఈ విషయమై 1938 జులై 23న వెలువరించిన ఒక ప్రకటన ఆంధ్రపత్రిక డైలీలో ప్రచురితమైంది. దీని ప్రకారం రేడియోలో అంతర్జాతీయ విషయాలు, బ్రిటీష్ ఇండియా పత్రికల వ్యాఖ్యలు, లండన్ నగరం నెలవారీ వార్తా లేఖలు, భారతదేశంలోని ఇతర ప్రాంతాల సమాచారం ఆంగ్లంలో ప్రసారం చేయడానికి నిర్ణయించారు. అట్లానే రేడియో ప్రసారాలలో నాణ్యత కోసం, నూతన సాంకేతిక విషయాలు అధ్యయనం కోసం ఒక ఉన్నతాధికారిని ఆరు నెలల పాటు విదేశాలలో శిక్షణ నిమిత్తం పంపడానికి నిర్ణయిం చారు. అంతేగాకుండా ప్రోగ్రామ్ కమిటీ లను ఏర్పాటు చేశారు. ఇందులో స్త్రీల కార్యక్రమాల నిర్వహణకు ఒక స్త్రీ సభ్యురాలిని కూడా అందులో నియమించారు.
ఇదిలా ఉండగా ఔరంగాబాద్లో ఒక మీడియం వేవ్ ట్రాన్స్మీటర్ని నెలకొల్పి 1941 ఏప్రిల్ 4న రేడియో ప్రసారాలను ప్రారంభించింది నిజాం సర్కారు. ప్రాంతీయ ప్రసార కేంద్రంగా ఇక్కడి నుండి ఉర్దూ, మరాఠీ భాషలలో కార్యక్రమాలను ప్రసారం చేసారు. ఇంతకుమునుపే చెప్పుకున్నట్లుగా హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్లో 1939లో మీడియం వేవ్ ప్రసారాలు మొదలైనవి. ఒక నివేదిక ప్రకారం 1939లో సమాచార, సాంకేతిక, ఆర్థిక, వైద్య, చారిత్రక, రాజకీయ, విద్య, సాంస్కృతిక, హాస్యపరమైన 177 రేడియో కార్యక్రమాలు ప్రసారమైనవి. వాటిలో ఉర్దూ కవుల మాషాయిరాలు, నాటకాలు, పిల్లల కార్యక్రమాలు కూడా ఉన్నవి. రోజూ 50 నిమిషాల పాటు ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో న్యూస్ బులిటిన్లు ప్రసారమయ్యేవి.
మరో వైపు హైదరాబాదులో రేడియో కేంద్రం ఏర్పడిన ఫలితంగా ఎందరో స్థానిక కవి పండితులకు తమ ఉర్దూ రచనలను ఆవిష్కరించుకునే అవకాశం ఏర్పడింది. ఇక శాస్త్రీయ సంగీత వాద్య, గాత్ర విద్యాంసుల సంగతి చెప్పనవసరమే లేదు. ఎందరో సంగీతజ్ఞులు ఖయాల్, గజళ్ళు, టుమ్రీలు, గీత్లు, దాద్రాలు యుగళ గీతాలు, జుగల్ బందీలు చేసి రేడియో కార్యక్రమాలలో పాల్గొనేవారు. తమ కార్యక్రమాలకు మంచి జనాధరణ లభించడంతో ఈ కళాకారులు ఎలాంటి పారితోషకాలు ఆశించకుండానే కచేరీలు చేసేవారు.
స్థానిక కవులు, కళాకారులే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రసిద్ధులైన ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ ఆ కాలంలో రెండుసార్లు హైదరాబాదు వచ్చి రేడియోలో సంగీత కచేరీ చేశారు. ఇంకా ఉస్తాద్ ఖయ్యూం హుస్సేన్ ఖాన్ (సారంగి), పండిట్ వెంకటరావు (హార్మోనియం), షేక్ దావూద్ (తబలా), జి.ఎన్.దంతాలే (జలతరంగ్, గాత్రం) అంబా ప్రసాద్ (హార్మోనియం), ఉస్తాద్ షేక్ దావూద్ (తబలా), శంకర్లాల్ మాస్టార్జీ, వసుమతీ దంతాలే, అంబాదాస్, ఆప్టే, విఠల్రావు (గజల్), ఎస్.బి. దేశ్పాండే వంటి ప్రఖ్యాత సంగీత కారులు హైదరాబాదు రేడియోలో కచేరీలు చేశారు. ఇంకా వీరు మాత్రమే కాకుండా ఉస్తాద్ ఫయాజ్ ఖాన్, ఉస్తాద్ బడే గులాం అలీఖాన్, హీరాబాద్, బరోడేకర్, ఆమె సోదరి సరస్వతీ రాణే వంటి బయటి విద్యాంసులు సంగీత కార్యక్రమాలు దక్కన్ రేడియోను సుసంపన్నం చేసినవి. ఇందుకు ప్రధాన కారణమేమిటంటే 1900 నాటికే హైదరాబాదు స్టేట్ ఒక సాంస్కృతిక కేంద్రంగా రూపుదిద్దుకున్నది. లక్నో, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ రాజస్థానులలోని ఎందరో కవి పండితులకు నిజాం ఆశ్రయమిచ్చి వారిని, వారి కళలను పోషించారు. ఇందుకు మహరాజా చందూలాల్, మహారాజా కిషన్ పెర్షాద్ల కళాపోషణ కూడా మరింత తోడైంది.
అప్పట్లో హైదరాబాదు నగరంలో పూర్తిస్థాయిలో విద్యుత్ సౌకర్యం లేదు. రేడియో సెట్టు కూడా చాలా ఖరీదు కావడంతో ధనవంతుల ఇండ్లలోనే ఉండేది. ఆసక్తి ఉన్నవారు రేడియో సెట్టు ఉన్నవారింటికి వెళ్ళి కార్యక్రమాలను వినేవారు. క్రమంగా సినిమా పాటలకు ఆదరణ పెరగడంతో రేడియోలో వాటిని కూడా ప్రసారం చేయడం మొదలుపెట్టారు. దీంతో రేడియోకు సామాన్యుల ఆదరణ పెరగడం మొదలైంది.
అప్పట్లో దక్కన్ రేడియోలో కార్యక్రమాలెట్లా ఉండేవో తెలుసుకొనడానికి మచ్చుకు ఒక రోజు కార్యక్రమాల షెడ్యూల్ని చూస్తే, 1941 డిసెంబర్ 31 నాటికి కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నవి. ఉదయం 5:30కు ఖయాల్, సుర్సారంగ్, 5:50లకు గజల్ (తేర్ ఖుషీ సె అగర్ గమ్ మే భీ ఖుషీీ నహుయే), 6:00లకు ఆమ్ పసంద్ మాసెకి, 6:20లకు మరాఠి పాద్ ఔర్ భజన్, 6:40లకు ఘజల్, 7:00లకు బచ్చోంకా ప్రోగ్రామ్, 7:30లకు ఖదమ్సాల్ తఖ్రీర్, 7:45 ని||లకు ఖయాల్ గానం మల్ఖోస్, 8:00లకు ఉర్దూ వార్తలు, 8:25ని||లకు ఇంగ్లీషు వార్తలు, 8:50లకు ఉర్దూ వార్తలు, ఆమ్ పసంద్ మౌసేకీ, 9:10ని||లకు కర్ణాటిక్ ఆనందభైరవి, 10:00 గం||లకు దువేసలామతి.
నిజాం స్టేట్లోని తనదైన ప్రాధాన్యతను సంతరించుకున్న దక్కన్ రేడియో సైనిక చర్య నేపథ్యంలో కీలక పాత్రనే పోషించింది. 1948 సెప్టెంబర్ 17న లాయక్ అలీ మంత్రి వర్గం రాజీనామా చేసింది. అదే రోజు సాయంత్రం 5 గం||లకు కాల్పుల విరమణకు ఆదేశిస్తున్నట్లుగా నిజాం నవాబు దక్కన్ రేడియోలో ప్రసంగం చేశారు. చివరికి 1950 ఏప్రిల్ 1న దక్కన్ రేడియోను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంగా తన కొత్త ప్రసారాలను ప్రారంభించింది. ఆ తరువాత ఇందులోనే వివిధ భారతి (జనరంజని) విభాగం, మరో వైపు హైదరాబాద్ బి అని యువవాణి విభాగం ఏర్పాటైనవి. ఆ తరువాత ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ నగరాలలో లోపవర్ ట్రాన్స్మీటర్లలో రేడియో కేంద్రాలు ఏర్పడినవి. టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో రేడియో మిర్చి, 98.3 ఎఫ్.ఎం. రేడియోలు వెలసి మనోరంజకమైన కార్యక్రమాలను నూతన పంథాలో ప్రసారం చేస్తూన్నవి. ఇక ఇవేమీ లేనపుడు బొంబాయి వివిధ భారతి, సిలోన్ రేడియో ప్రసారాలు కూడా హైదరాబాదు స్టేట్ ప్రజలకు అందుబాటులో ఉండినవి. ఇట్లా హైదరాబాదు స్టేట్లో రేడియో తన ప్రస్థానాన్ని సుమారు తొంభై ఏళ్ళుగా కొనసాగిస్తున్నది.
- హెచ్.రమేష్బాబు,
7780736386