Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆదిలాబాద్ అంటే గుర్తుకొచ్చేది ఆదివాసీలు.. భాష, వేషధారణ, సంస్కృతీ, సాంప్రదాయాల్లో విభిన్న శైలి.. ప్రత్యేక నృత్యరీతులు.. అటువంటి నృత్య రీతుల్లో ఒకటే.. ''గుస్సాడీ''. గోండ్ తెగకు చెందిన ఆదివాసీలు చేసే ఈ నృత్యంలో కాళ్ళకు గజ్జెలు.. ఓ చేతిలో జంతువులకు సంబంధించిన చిహ్నం.. మరో చేతిలో దుడ్డుకర్ర.. మెడలో రుద్రాక్ష మాలలు.. తలపై నెమలి ఫించాలతో చేసిన టోపీలాంటి దాన్ని పెట్టుకుని డప్పుదరువులకు లయబద్ధంగా నృత్యం చేస్తుంటారు. వారి సంస్కృతిలో భాగమైన ఈ నృత్యంపై మక్కువ పెంచుకుని.. తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు నృత్యానికి ప్రాచుర్యం కల్పించి దేశంలోనే గర్వించదగిన పద్మశ్రీ పురస్కారాన్ని సైతం అందుకున్న వ్యక్తి కనకరాజు. ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్న కనకరాజు గురించి ఈ వారం...
కనకరాజుకు బయట ప్రపంచం తెలియదు. పెద్ద బాలశిక్ష మాత్రం చదువుకున్నారు. చిన్నతనం నుండి అటవీ ప్రాంతంలోని జీవరాశులతోనే సహజీవనం చేసాడు. పూర్వపు ఆచారాలు బాగా ఒంటబట్టిన వ్యక్తి. ఎవరినీ నొప్పించని మదు స్వభావి.. తన వారికి ఏదైనా కష్టసుఖాలలో కూడా సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు అందించే వ్యక్తి.. చిన్నతనంలో పశువులు మేపుతూ స్నేహితులతో ప్రకతి సహజమైన ఆదివాసి ఆచారాలతో కూడిన దేవుళ్ల ఆటలు ఆడడం, వాయిద్యాలు వాయించడం, పాటలు పాడటంతో పాటు హాస్య నాటికలతో పండగలలో నవ్వించే వారు రాజు. ఆయన వ్యక్తిత్వం చూసి గ్రామ పెద్దలు మెచ్చుకునేవారు. అదార్ పెయిన్ దేవుని వద్ద నృత్యం చేసేవారు.
కుటుంబ నేపథ్యం
ఆదివాసీ గొండ్ తెగకు చెందిన కానకరాజు గుస్సాడీది వ్యవసాయాధారిత కుటుంబం. కనకరాజు రాము రాజు బాయి దంపతులకు జన్మించారు. వీరిది తెలంగాణలోని కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామం. ఆదివాసుల సంస్కతి, సంప్రదాయాలు అంటే ఎంతో అమితమైన ప్రేమ భక్తి. ఆచార వ్యవహారాలకు సంప్రదాయలను కట్టుబడి జీవించే వ్యక్తి.
రాజు తాత కనక మారుకు ముగ్గురు సంతానం. సొంబాయి, రాము, సోము. రాముకు సంతానం సోంబాయి, రాజు, సోములు. రాజు తల్లి దండ్రులు చిన్న తనంలోనే మరణించారు. వీరి ఆలనపాలన చిన్న నాయన సోము చూసే వాడు. చిన్నతనంలో చాలా పేదరికం అనుభవించారు. కట్టుబట్టలు లేక 8 సంవత్స రాల వయసు వచ్చే వరకు నగంగా తిరిగేవాడట. తనతో పాటు తన తోటి బాలమిత్రులకు కూడా ఇదే పరిస్థితి ఉండేది. తిండి దొరకని రోజుల్లో గడ్డుకాలంలోనూ తనని చిన్నాన్న జాగ్రత్తగా చూస్తు పెద్ద పనులకు పంపకుండ తనతోపాటు వ్యవసాయ పనులకు తీసుకోని పోయేవారు. అంబలి, గట్కా తినిపిస్తూ ఎడ్లు కాయడం, పంటచేలల్లో పిట్టల కావలి కాయడం వంటి చిన్న చిన్న పనులు చేయించేవారు. ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ పెరిగేకొద్ది చిన్నాన్న సోము గ్రామంలోనే ఆవుల మంద మేపడానికి (గాయికి) కాపరిగా చేర్పించాడు. పెద్దయ్యే వరకు మేపారు.
చదువు - వ్యక్తిగత జీవితం...
స్నేహితులందిరికీ పెండ్లిండ్లు అయిపోయాయి. రాజు పెద్దయ్యే నాటికి చిన్నాన్న మరణించాడు. తర్వాత మేనత్త కొడప సోంబాయి తన కూతురితో గోండి సంప్రదాయ ప్రకారం పెండ్లి చేసింది. పెండ్లి నాటికి పిల్లవాడే. మేనత్త కూతురు వయస్సులో పెద్దది కావడంతో కొన్ని రోజుల తరువాత వేరే వ్యక్తిని పెండ్లి చేసుకున్నది. ఆవులు మేపుతూ వ్యవసాయ పనులు చూసుకుంటూ.. ఇరవై సంవత్సరాలకు మళ్లీ రెండవ వివాహం చేసుకున్నాడు. భార్య పేరు పారు బాయి. రాజుకు ఒక కొడుకు, నలుగురు కూతుర్లు సంతానం. ఒక పక్కన గుస్సాడి దండారి, రెండవ పక్కన కుటుంబ భారం తన భుజాలతో మోస్తూనే వస్తున్నాడు. దండారి ఉత్సవాల్లో గుస్సాడీ నాట్యం, చిన్నచిన్న కథలు ప్రదర్శనలు, హాస్య నాటికలు, సాయంత్రం, రాత్రి పూట గ్రామ మధ్యలో దండారి ఇంటి ముందర కనకరాజు తన ప్రదర్శన నత్యాలు చేస్తున్న క్రమంలో భీంబాయి ఆకర్షితురాలయింది. ఒంటరి మహిళ అయిన భీంబాయిని ఆదివాసీ సాంప్రదాయాలతో పెద్దల సమక్షంలో మూడో వివాహం చేసుకున్నారు. భీంబాయికి ఇద్దరు కొడుకులు, నలుగురు ఆడపిల్లలు. ఇద్దరు భార్యల సంతానం 11 మంది పిల్లలు. ప్రస్తుతం రాజు జీవనాధారం మార్లవాయి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో దినసరి కూలీగా పని. ప్రస్తుతం ఆయన వయసు 80 ఏండ్లు. 11మంది పిల్లలందరికీ పెళ్లి చేశాడు మార్లవాయిలో తన కుటుంబ వారసత్వ సంతానం మొత్తం 50 మందికి పైగా ఉంటారు. మనుమల, మనవరాళ్ల, మునిమనిరాళ్లకు ఆదివాసీ సంస్కతి గుస్సాడీ, దండారి నాట్య కథలు చెబుతూనే ఉంటారు. ఊరిలో ఉన్న వారందరూ కూడా గుస్సాడి రాజు గానే పిలుస్తారు. తన ఇంటి పేరు బదులుగా గుస్సాడి అని అందరూ పలకరిస్తారు.
హైమన్ డార్ఫ్తో అనుబంధం..
1940 సంవత్సరం కుమ్రం భీం వీరమరణం తరువాత మానవ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతులు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పరిశోధన పర్యటనలో భాగంగా మార్లవాయి గ్రామానికి వచ్చారు.. ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ఆదివాసుల స్థితిగతులపై అధ్యయనం చేసారు. వారు ఏ విధంగా దోపిడీకి గురవుతున్నారో ప్రత్యక్షంగా చూసారు. 'ఆదివాసులకు జల్.. జంగల్.. జమీన్..తో పాటు ముఖ్యంగా విద్య చాలా అవసరం ఉంది' అని మార్లవాయిలోని మొదటి విద్యా కేంద్రం ప్రారంభించారు. విద్య వల్ల ఇతర ప్రాంత విషయాలతో పాటు దోడిపి, మోసం లాంటివి గ్రహించగలరని డార్ఫ్ చెప్పేవారని కనకరాజు గుర్తుచేసుకుంటూ వుంటారు. ఆదివాసీల మనుగడ ఉండాలంటే, భూమిని అడవి దొంగల బారి నుంచి కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉండాలని డార్ఫ్ చెప్తుండేవారట. ఎప్పుడు తన స్వార్థంగా మాట్లాడేవారు కాదని, ఏది ఆశించలేదని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో చలాకీగా ఉండే కనకరాజు డార్ఫ్ దంపతుల దష్టిలో పడ్డాడు.. వాళ్లకు చిన్న చిన్న పనులు చేసేవాడు. అడవిలో దొరికే పండ్లు, ఆదివాసులు తినే దుంపగడ్డలు.. ఏవి ఉన్నా కనక రాజు తెచ్చి ఇచ్చేవాడు.. మంచి అబ్బాయిగా డార్ఫ్ నుండి మన్ననలు పొందిన వ్యక్తి కనక రాజు.
ప్రోత్సాహం - ప్రదర్శన
ఆదివాసీల తొలి ఐఏఎస్ మడావి తుకారం ఆధ్వర్యంలో పిట్టగూడ గ్రామంలో గుస్సాడి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి 150 మందికి నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. అందులో 35 మందిని ఎంపిక చేసారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో గుస్సాడి నత్యానికి మన్ననలను పొందిన గొప్ప వ్యక్తి. 2014లో ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రెండొవసారి డిల్లీ రాజధానిలో గుస్సాడి కళను ప్రదర్శించారు.
దండారి గుస్సారి దేవుడు
8 ఏండ్ల వయస్సు నుంచే కనకరాజు గుస్సాడీ నృత్యంపై మక్కువ పెంచుకున్నారు. ఇందులో ఉన్న అన్ని మెళకువలు నేర్చుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు వెయ్యి మందికి పైగా శిక్షణ ఇచ్చారు. ఈ నృత్యంలో ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బహూకరించింది. దాదాపు 70 సంవత్సరాల సేవల అందించారు. పద్మల్ పూరి కాకో గోదావరి నది ఒడ్డున గుడిరేవు గ్రామ శివారులో దండేపల్లి మండలం జన్మస్థలం. ఇప్పటికీ దేశంలో ఏ ప్రాంతం వారైనా దండారి గుస్సాడీ దేవుడు ఉంటే తప్పకుండా గుడి రేవు శివారులో గోదావరి ఒడ్డుకు రావాల్సిందే. కనకరాజు తన సేవలు చేస్తూ ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒక్కసారైనా చెప్పులు లేకుండా ఇక్కడికి ఈ వయసులో కూడా కాలినడకతో వెళ్లి పూజలు చేసి వస్తారు.
కనకరాజు దండారి అంటే ముందుండి నడుపుతాడు. ఇప్పటికీ కూడాగుస్సాడి వేషధారులను నాట్య సమయంలో తన కనుసైగలతో చేతి కర్ర, వేళ్లతో నటనను సక్రమంగా చేసేలా చేస్తుంటాడు.
20 రోజుల ఉత్సవాలు
ఆదివాసి అతి పెద్ద పండుగ దండారి గుస్సాడీ పండుగ. దండారి గుస్సాడి ఆదివాసి ఏత్మసూర్ పెయిన్ (దండారి దేవత) ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇతర దండారిలతో (సోరిక్) గోత్రం వారితో సంబంధాలు పెట్టుకుంటారు. ఉత్సవాలకు ఒక సంవత్సరం వారు, మరొక సంవత్సరం వీరు వెళ్తూ ఉంటారు. ఈ పండుగ ఆషాఢ మాసం నుండి జూలై అశ్వయుజ అమావాస్య వరకు (అక్టోబర్) నాలుగు నెలల పాటు చచ్చోరు (కోలాటం) వంటివి నిర్వహిస్తారు. ప్రతిరోజు రాత్రి దండారి ఉన్న వారి ఇంటి గుమ్మంలో గ్రామస్తులందరూ కలసి ఆడుతారు. దీపావళికి పది రోజుల ముందు పది రోజుల తర్వాత దాదాపు ఇరవై రోజుల దండారి ఉత్సవాలు ప్రతి ఆదివాసి గూడెంలో చిన్నపెద్ద తేడా లేకుండా నిర్వహించుకుంటారు. ఇలా ఏత్మసూర్ దండారికి వేసే వేషాధారణనే గుస్సాడిలు అంటారు. గుస్సాడిలను దైవంతో సమానంగా భావించి మొక్కుతారు. శరీరమంతా మసి, బూడిద రాసుకుంటారు. కుడి జబ్బకు జోరి (జోలే), ఎడమ జబ్బకు జంతువుల తోలు చేతికి గంగారాం సోట (దుడ్డుకర్ర) ప్రకతి ఒడిలో దొరికే పూసలు, కాయలు, గింజలు మొదలయిన వాటితో తయారు చేసిన దండలను మెడనిండా వేసుకుంటారు. అందమైన నెమలీకలతో తయారైన టోపీకి ముందు భాగాన జంతువుల కొమ్ములు (పోటేలు, అడవి దున్న, జింక కొమ్ములు) అలంకరిస్తారు. నడుముకు పెద్ద గజ్జెలు, చేతి దండకు చిన్న గంటలు వంటి వాటితో అలంకరించుకుంటారు. ఇలా తయారై 20 రోజుల పాటు చివరి రోజు (కొలబడి) వరకు స్నానం, మొహం కడగకుండ ఉండడమే పవిత్రంగా భావిస్తారు. చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా ఇష్టంగా స్వీకరిస్తారు. ఇది దేవుని మహిమగా భావిస్తారు.
ఆదివాసీలకు గుర్తింపు
ఎన్నో ఏండ్ల నుండి గుస్సాడి నృత్యానికి చేస్తున్న కృషికి గుర్తింపు లభించినట్టు అనిపించింది. ఈ అవార్డు ఆదివాసులకు ఒక గుర్తింపు తీసుకువస్తుంది. ఈ అవార్డుతో దేశవ్యాప్తంగా ఆదివాసుల సంస్కృతీ, సాంప్రదాయాలు అందరికీ తెలుస్తున్నాయి. తన ఒక్కడికి అవార్డు రావడం ఒక్కటే గొప్ప కాదని, ఆదివాసీలందరికీ మంచి జరిగినపుడే ఈ అవార్డుకు అర్థం ఉంటుందని చెప్తూ ఆదర్శమూర్తిగా ఉంటాడు. భవిష్యత్తులో గుస్సాడీ అభివృద్ధికి కనక రాజు ఇంకా కృషి చేయాలని ఆశిద్దాం...
- కనక వెంకటేశ్వర్ రావ్,
9492949130