Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ భూమ్మీద జన్మించిన ప్రతి మనిషిలోనూ ప్రతిభ ఉంటుంది. అందరిలోనూ అద్భుతమైన శక్తి సామర్థ్యాలుంటాయి. మనలో కొందరు అసమర్థులు, మరి కొందరూ సమర్ధులంటూ లేరు. మనందరిలోనూ మనం ఏనాడూ ఊహించని ప్రతిభా విశేషాలున్నాయి. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటున్నామా? లేదా? అని సమీక్షించుకోవలసిన అవసరముంది. మనలో కొందరు వ్యక్తులు నిత్యజీవితంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూనే తమ పనులను చక్కగా నిర్వహిస్తారు. వాటిని పూర్తిచేస్తారు. మరికొందరు వ్యక్తులు ఒత్తిడిని భరించలేమని తమ పనులను వాయిదా వేస్తారు. సోమరితనాన్ని ప్రదర్శిస్తారు. అలాంటి వ్యక్తులు తమ జీవితంలో ఎలాంటి అభివృద్ధిని కనబర్చలేరు. మన శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోవాలంటే మనం తీవ్రంగా ప్రయత్నించాలి. నిరుత్సాహానికి గురైనపుడు వెంటనే దానిని అధిగమించే మానసిక శక్తిని అలవర్చుకోవాలి. ఏదైనా ఒక పని చేస్తున్నపుడు మనం అలసటకు లోనవుతాం. పూర్తి చేయాల్సిన పని ఇంకా చాలా ఉంటుంది. ఆ సమయంలో మనం తలపెట్టిన పనులను పూర్తి చేయలేమని భావిస్తాం. వాటిని వాయిదా వేస్తాం. మనం నిర్ణయించుకున్న పనులను పూర్తి చేయగలిగే సామర్థ్యం, ప్రతిభ మనలో ఉన్నాయని గుర్తించిన వెంటనే మనకు అదనపు బలం చేకూరుతుంది. దాంతో ఉల్లాసంగా ఆ పనిని పూర్తి చేస్తాం. ఇక్కడ మనకు కావలసింది మానసిక సంసిద్ధత, పట్టుదల. మన నిత్యజీవితంలో కొత్త కొత్త బాధ్యతలు నిర్వహించాల్సిన సమయంలో కూడా మన శక్తి సామర్థ్యాలు తెలిసి వస్తాయి. అవి మన అవసరానికి వెలికి వస్తాయి. ఉదాహరణకు కమల వివాహానికి ముందు ఇంటి వద్ద ఏ పని చేసేది కాదు. ఆమె తల్లి ఏదైనా పని చేయమని పురమాయిస్తే, ఆ పని తన వల్ల కాదని చెప్పేది. తాను ఆ పని చేయలేనని తేల్చి చెప్పేది. కానీ అత్తగారింటికి వెళ్లిన తరువాత ఆమెకు ఇంటి బాధ్యతలు పెరిగాయి. అత్తగారి మరణంతో 15మంది కుటుంబ సభ్యులున్న ఆ గృహంలో కమల కీలకపాత్ర నిర్వహించవలసి వచ్చింది. అప్పుడు తనకు తన బాధ్యతలు అర్థమయ్యాయి. అమ్మ చెప్పిన మాటలు బోధపడ్డాయి. కమల ఉదయం 5 గంటలకు నిద్రలేచేది. కుటుంబ సభ్యులకు కావలసిన పనులను వివిధ వ్యక్తులకు అప్పగించేది. తాను అలసట లేకుండా పని చేయడం అలవాటు చేసుకుంది. కమల తానీ పనులన్నీ చేయాల్సిన అవసరం వల్ల శ్రమనిపించే దశను అధిగమించి ఇప్పుడెంతో తేలిగ్గా, ఉత్సాహంగా ఇంటి పనులన్నీ పూర్తి చేయగలుగుతోంది. కేవలం క్రమశిక్షణ, దృఢ నిశ్చయం ద్వారా మనలో నిక్షిప్తమై ఉన్న శక్తిని వెలికి తెచ్చుకోవచ్చు. ఏదో అవసరం ఏర్పడినపుడు, అత్యవసర పరిస్థితి తలెత్తినపుడు మనలోని శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోగలమే గాని శాశ్వతంగా ఇలా యంత్రంలా శ్రమించగలమా? ఇంతటి శ్రమకు మన మనస్సు గాని, శరీరం గాని తట్టుకోగలదా? అని అనుమానం ఎవరికైనా రావచ్చు. ఇలా ఆలోచించడం సహజమైన విషయమే. మొదట్లో మనకు కొన్ని బరువు బాధ్యతలు నిర్వహిస్తున్నపుడు విపరీతమైన అలసట జనిస్తుంది. క్రమంగా మన శరీరం, మనస్సు ఆ పనులకు అలవాటు పడతాయి. ఆ సమయంలో మనకు అలసట అనిపించదు. పైగా మనలో ఉత్సాహం పెరుగుతుంది. ఉల్లాసం వెల్లివిరుస్తుంది. ఏ పనైనా మనం 21 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే ఆ పని మనకు తేలికవుతుంది.
మిత్రమా.. మనలో కొందరు 5 గంటల పనికే అలసి పోయేవారున్నారు. మరి కొందరు 16 గంటల పని చేసినా ఏమాత్రం అలసిపోరు. మన ఇండ్లలోని గృహిణులను ఒక సారి పరిశీలించండి. ముఖ్యంగా ఉద్యోగం నిర్వహించే మహిళలు ఆఫీసులో 8 గంటలు, ఇండ్లలో మరో 8 గంటలు పని చేస్తారు. వాస్తవానికి ఎక్కువ పని చేసే వారు ఎక్కువ నిద్రపోరు. వారికి 6 గంటల నుంచి 8 గంటల నిద్ర అవసరం ఉంటుంది. కొందరు సోమరి పోతులు మాత్రం 10 గంటలు నిద్రపోయినా తమకు విశ్రాంతి చాలడం లేదని ఫిర్యాదు చేస్తారు. మనలో చాలామంది దృఢ నిశ్చయం లేక పోవడం వల్ల తాము తలపెట్టిన పనులను పూర్తి చేయడం లేదు. తమకు ఎదురయ్యే అవరోధాలను అధిగమించడం లేదు. ఉదాహరణకు మనకు వెయ్యి గదులున్నా భవంతి ఉండగా, మనం నిత్య జీవితంలో 999 గదులను ఖాళీగా వినియోగించుకోకుండా వదిలి వేస్తున్నాం. మనం ఒక గదిలోనే నివసించడానికి అలవాటు పడి, విలువైన జీవితాన్ని కొన్ని పనులకే పరిమితం చేసుకుంటున్నాం. చరిత్రలో మానవ జాతి పురోగమనాన్ని ఒకసారి పరిశీలించండి. మన పూర్వీకులు ఎంతో కష్టపడి ఎన్నో కొత్త ఆవిష్కరణలను అమల్లోకి తెచ్చారు. వారు సోమరిపోతులుగా జీవించి ఉన్నట్లయితే ఈ ప్రపంచం ఇలా మారేది కాదు. మనం కష్టపడడం ద్వారా మన భవిష్యత్తు తరాలకు మేలు చేసిన వారమవుతాం. అందువల్ల మన సోమరి తనాన్ని విడనాడి మన శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించే పనులను చేపట్టడం మానవాళికి అత్యవసరం.
- జి.గంగాధర్ సిర్ప,
8919668843