Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కోట్ల'కొలది స్వప్నాల తడి
గుండెకింద తడిగల కవి 'హరిత స్వప్నా'న్ని కన్నాడు. పొడిపొడి ప్రపంచాన రాలిపోతున్న ఎండిన ఆకుల చప్పుళ్ళలో పారే నీరై ప్రవహిస్తూ, పచ్చని పత్రహరితాల్ని అక్షరాల్లో ముంచి మన మనస్సుపై బొమ్మలు పేరుస్తున్నాడు కోట్ల వెంకటేశ్వరరెడ్డి. ఇన్నినాళ్ళ కవితా ప్రవాహంలోనూ ఎక్కడా ఇంకిపోని సృజన జల కొత్త జల్లయి ఉబికి వస్తూనే ఉంది. చుట్టూ కలలన్ని ఎండుటాకులై రాలుతున్నా 'హరిత స్వప్పాన్ని' కనగలిగిన కవనాశయపధికుడు కోట్ల. ఎనభై ఎనిమిది కవితలతో 'హరిత స్వప్నం' సంపుటిని మనముందుంచాడు.
'స్వప్పాలు ఫలించాలంటే, మనిషి చెట్టయి పోవాలి / దుమ్మెత్తి పోసుకుంటున్న నేతలారా! ఎదలో ఒక చెట్టును నాటుకోండి' అని దుమ్ము పట్టిపోయిన నాయకుల హృదయాల్లో చెమ్మనియ్యగల చెట్టును నాటుకొమ్మని మేల్కొల్పుతున్నాడు. మట్టితో నీటిని జోడించి, పట్టెడన్నాన్ని సృష్టించే మంత్ర విద్య ఎవరికొస్తది చెప్పు? రైతుకు తప్ప అంటూ అతని శ్రమకు పట్టాభిషేకం చేయందే ఏ రాజ్యమూ సుభిక్షం కాదు' అని ఘంటాపథంగా చెబుతున్న కవి కోట్ల. ఇప్పటి రైతు పరిస్థితికే రైతు పట్ల పాలకుల వైఖరినీ తూర్పారపడతాడు. 'నెత్తుటి కూటికి అలవాటు పడ్డ రాజ్యానికి / కన్నీటి వేదన ఎన్నటికీ అర్థం కాదు!' అని రైతు పాదయాత్రల్ని మననం చేస్తారు. 'ఇప్పుడు. ఎవరి వివరణా అక్కరలేదు, అంతా ప్రత్యక్షమే!' అంటూ నేడు దేశంలో పాలకులు ప్రజాస్వామిక హక్కులపై చేస్తున్న దాడిని నిరసిస్తాడు. ''జైళ్ళు లేని దేశాన్ని కలగంటుంటే, దేశం జైలుగా మారిపోతున్నది'' అధికారపు నియంతృత్వ విధానాన్ని చూస్తూన్న కవి ప్రజల్ని మేల్కొల్పడానికి పూనుకున్నాడు.
'కోట్ల కవితల్లోని పదునైన వ్యక్తీకరణ ఆలోచింపజేస్తుంది. రాత్రి ఏకాంతంలో ఒకటికి రెండుసార్లు చదివితే ఆ కవిత్వంలోని సాంద్రత మన అనుభవాన్ని గాఢతరం చేస్తుంది. లోకం పచ్చదనంతో విలసిల్లాలనే కవి స్వప్పం మన లోలోపలి సతత హరిత జ్ఞాపకాల్ని మేల్కొల్పుతుంది' అని ముందు మాటలో గుడిపాటి గారన్న వాక్యాలు అక్షర సత్యాలు. ఏ విషయాన్ని చెప్పినా వైవిధ్యమైన అభివ్యక్తితో నిత్య నూతనమై పోయే కవిత్వాన్ని అందిస్తున్న కోట్ల 'హరితస్వప్నం' అందరూ చదవదగ్గ కవితా సంపుటి.
(హరిత స్వప్నం (కవిత్వం), రచయిత : కోట్ల వెంకటేశ్వరరెడ్డి, పేజీలు : 148, వెల : రూ.120, ప్రతులకు : కోట్ల వెంకటేశ్వరరెడ్డి, ఇ.నెం.4-31/1/2, భగీరథ కాలనీ, మహబూబ్ నగర్ - 509001, సెల్ : 9440233261)
- కె.ఆనందాచారి