Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజంలోని జీవితాలలోంచి స్పూర్తిదాయకమైన పాత్రల ఇతివృత్తంతో సినిమా వస్తే అది ఒక గొప్ప రికార్డుగా ఎందరికో ప్రేరణ కలిగించే విషయంగా నిలిచిపోతుంది.. ప్రస్తుతం ఇలాంటి సినిమాలను అదరించే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుంది. సినిమా అంటే కలల ప్రపంచంలో విహరింపజేసేది అన్న భావజాలం నేటి యువతరాన్ని కమ్ముకుని ఉంది. నిజ జీవితంలోని కష్టాలను, సమస్యలను అనుభవిస్తున్న వ్యక్తులను ఈ సినిమాలు ఎప్పటికీ ఉత్తేజితం చేస్తూ ఉంటాయి. అందుకే వీటిని చూసే ప్రేక్షకులు తక్కువయినా వీటిని భాద్యతగా తలచి సినిమాగా తీసేవారు కొందరు ఇంకా మిగిలి ఉన్నారు. ''ఎవరో ఒకరు ఎపుడొ అపుడు నడవరా ముందుగా అటొ ఇటో ఎటో వైపు'' అంటూ ఎదురు చూడడం తప్ప ప్రస్తుతం సినీ లోకంలో ఆవహించి ఉన్న భావ దారిద్య్రాన్ని గురించి చర్చించడం అవివేకమే. అలాంటి పరిస్థితులలో ఏ భాషలోనయినా ఒక సినిమా నిజ జీవితపు పోరాట కథతో వస్తే దాన్ని ఆదరించవలసిన భాద్యత ప్రతీ సినీ ప్రేమికునిదీ. మారాఠీ భాషలో తక్కువ బడ్జెట్టుతో గొప్ప కథలతో సినిమాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మేకప్పు టెక్నికల్ హంగులకు దూరంగా సహజమైన వాతావరణంలో సహజంగా ఉండే పాత్రలతో జీవితం పట్ల స్పష్టమైన అవగాహనతో ఆ భాషలో సినిమాలు వస్తాయి. చాలా లో బడ్జెట్తో తీసిన ఆ సినిమాల ద్వారా ప్రేక్షకులకు జరిగే మేలు మాత్రం అనంతం. కోర్ట్, శ్వాస్, ఎక్ హజార్చి నోట్, కాసవ్ ఇలా ఎన్నో గొప్ప ఆలోచింపజేసే సినిమాలు ఆ భాషలో ఈ మధ్య కాలంలోనే వచ్చాయి. అలాంటి సినిమాల కోవలో చేరుతుంది ''మీ సింధుతాయ్ సప్కాల్''
అనంత్ నారాయణ్ మహాదేవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సింధూతాయి అనే ఒక మరాఠి స్త్రీ జీవితం ఆధారంగా తీసిన సినిమా. 2016లో సాహిత్యంలో డాక్టరేట్, 2017లో నారీ శక్తి పురస్కార్, 2021లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన సింధుతాయి జీవితం గురించి ప్రస్తుతం యువతరం తెలుసుకోవాలి. 72 సంవర్సరాల ఈ స్త్రీమూర్తి జీవితంలో అనుభవించిన కష్టాలు, చూపించిన పోరాట పటిమ గురించి ప్రతి యువతీ యువకులకూ బోధించాలి. వాట్స్అప్లో రికార్డులు పెట్టి లైవ్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న యువతరానికి జీవితాన్ని ఎదుర్కొనే విధానాన్ని చూపించాలి. ఒక చదువురాని పేద దళిత స్త్రీ చేసిన పోరాటం, కన్నబిడ్డల నుండి దూరం చేసిన పరిస్థితులను ఎదుర్కొని పదిహేను వందల మంది పిల్లలను దత్తత తీసుకోగలిగిన శక్తిమంతురాలిగా ఆమె ఎదిగిన విధానాన్ని తెలుసుకుంటే సమస్యలను మన జీవితపు ఎదుగుదలకు సోపానాలుగా ఎలా మలచుకోవచ్చో తెలుసుకోగలం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూస్తూ, ఎవరూ రారని నిరాశపడి జీవితంలో ఒంటరయిపోయాం అని అల్లాడిపోయి అలసిపోయి జీవితాలను చిన్న వయసులో చాలిస్తున్న వారందరూ ఎంతటి తప్పు చేస్తున్నారో ఒక్క సింధూతాయి జీవితం చెప్పగలదు.
మహారాష్ట్రలో వార్ధ జిల్లాలో గొల్లకాపరుల కుటుంబంలో పుట్టింది సింధు. ఆడపిల్లగా అక్కరలేని సంతానంగా పుట్టిన ఆమెకు పేరు కూడా పెట్టలేదు తల్లి. ఛింది అని పిలిచేవారు ఆమెను. ఛింది అంటే చిరిగిన బట్ట అని అర్థం. ఎవరికీ అక్కరకు లేని ఆ బిడ్డపై కన్న తండ్రికి కొంత మమకారం ఉండేది. కాని తల్లి పెత్తనం, నోటి ముందు ఆయన ఏం అనలేని పరిస్థితి. వారి పేదరికం కూడా అంతే భయంకరంగా ఉండేది. తల్లికి ఇష్టం లేకపోయినా తండ్రి ఆ బిడ్డను చదివించాలనుకుంటాడు. ఊరి బడికి పంపుతాడు. గొడ్లను కాసుకుంటూ మధ్యలో స్కూలుకి వెళుతూ చిన్నగా అక్షరాలు మాత్రం నేర్చుకోగలుగుతుంది సింధు. పలక కూడా కొనే స్థోమత లేక చెట్ల ఆకులపై అక్షరాలు దిద్దుకునేది. అలాగే నాలుగో తరగతి దాటుతుంది. చదువు అంటే చాలా ఇష్టం. కాని తల్లి బలవంతంగా పన్నెండేళ్ళు కూడా నిండని సింధు పెళ్ళి చేసి తన భాద్యత తీరింది అని ఊపిరి పీల్చుకుంటుంది. సింధు భర్త ఆమెకన్నా ఇరవై సంవత్సరాలు పెద్ద. అతని అవసరాలు ఆ చిన్న వయసులో తీరుస్తూ అతనితో ఇద్దరు మగ బిడ్డలను కంటుంది. ఆమె ప్రపంచం అంతా ఆ ఇల్లు, ఆ భర్త, అతని చేతిలో దెబ్బలు తినడం, ఇంటి పని చేసుకుపోవడం. అయినా ఆమెలో ఒక అగ్ని రగులుతూనే ఉంటుంది. న్యాయ, అన్యాయాల పట్ల ఆలోచనలు ఆమెలో కలుగుతూ ఉంటాయి. ఇతర స్త్రీల వలే మౌనంగా ఉండకుండా ఆమె మనసు ఆలోచిస్తూ ఉంటుంది. తన చూట్టూ పరిసరాలను అవగాహన చేసుకోవడం, ఆలోచించడం, ప్రశ్నించడం అంత దుర్భర పరిస్థితులలో కూడా సింధూ చేయగలగడం ఆమెలోని శక్తికి నిదర్శనం.
ఆ ఉరిలో పేడ సేకరించే స్త్రీల పట్ల భూస్వాముల నియంతత్వాన్ని ఆమె మొదట ప్రశ్నిస్తుంది. అంతే కాకుండా ఫారెస్టు ఆఫీసర్ వచ్చినప్పుడు ధైర్యంగా తమకు జరిగిన అన్యాయాన్ని బైటపెడుతుంది. తమ కష్టాన్ని దోచుకుంటున్న భూస్వామి గురించి నిర్భయంగా చెబుతుంది. ఆమెపై పగ పెంచుకుంటాడు భూస్వామి. అప్పడు ఆమె నిండు గర్భిణీ. ఆమె గర్బంలో ఉన్న బిడ్డ ఆమె భర్తది కాదని భూస్వామి ఆమె భర్తలో అనుమాన బీజాన్నీ నాటుతాడు. అప్పడు సింధు వయసు ఇరవై సంవత్సరాలు. ఆమె భర్త ఆమెను అందరి ముందు భయంకరంగా కొట్టి ఇంటి నుండి గెంటేస్తాడు. గేదెలు ఆవులను కట్టేసిన కొష్టంలో ఆమె ఒక ఆడబిడ్డను ప్రసవిస్తుంది. తన పురుడు తనే పోసుకుంటుంది. బిడ్డను పెంచుకోవడానికి తల్లి సహాయపడుతుందేమో అని ఆమె పుట్టిన ఊరు అష్టకష్టాలు పడి వెలుతుంది. కాని ఆమె తల్లి ఆమెను ఇంట్లోకి రానివ్వదు. తండ్రి ఎప్పుడో చనిపోతాడు. అన్నల దగ్గర ఉండే తల్లి భర్త వదిలేసిన కూతురి భాద్యత తీసుకోవడానికి ఇష్టపడదు. ఆ కూతురుతో ఎటువంటి సంబంధం ఉన్నా తన ఊరిలో తనకు స్థానం ఉండదని చంటి బిడ్డతో ఇల్లు చేరిన కూతురిని గెంటేస్తుంది. ఇంకో దారి లేక సింధు వీధులలో అడుక్కుంటూ బిడ్డను పెంచుకుంటుంది. రాత్రి పూట మగవారి నుండి తప్పించుకోవడానికి శ్మశానంలో పడుకుంటుంది. శ్మశానంలో కాలుతున్న శవాల మధ్య తిరిగే ఆమెను దెయ్యం అని చూసి భయపడ్తారు ఆ ఊరి ప్రజలు.
ఊర్లు తిరుగుతూ అడుక్కుంటూ ప్రజల మధ్య బతుకుతూ అమరావతి జిల్లాలోని ఒక గిరిజన ఊరికి చేరుతుంది సింధు. పులిని సంరక్షించే ప్రభుత్వ ప్రాజెక్టులో భాగంగా ఆ ప్రాంతంలో సుమారు ఎనభై పైగా ఊర్లలోని గిరిజనులను బలవంతాగా ఇళ్ళు ఖాళీ చేయిస్తుంది ప్రభుత్వం. వారి ఆవులను కూడా అడవిలో మేతకు వెళ్ళనివ్వకుండా కట్టడి చేస్తుంది ప్రభుత్వం. అప్పుడు అక్కడ ఉన్న సింధూ వారి నివాసాల గురించి పోరాడుతుంది. ఆమె చొరవ కారణంగా అప్పటి ఫారెస్ట్ ఆఫీసర్ ఆ ఊరివారందరికీ పునరావాసం ఏర్పాటు చేయిస్తాడు. అడుక్కుంటూ కడుపు నింపుకుంటున్న క్రమంలో ఎందరో అనాధ పిల్లలను ఆమె చూస్తుంది. వారి కోసం కూడా తానే ఇంకొన్ని ఇళ్లల్లో అడుక్కుని తిండి తీసుకు రావడం మొదలెడుతుంది. అలా ఆమె వద్దకు అనాధలు చేరడం మొదలవుతుంది. అనాధ పిల్లలకు తాను తల్లి అవుతున్నప్పుడు తనకు పుట్టిన బిడ్డపై మమకారం స్వార్థానికి దారి తీయకుండా పూనాలో సమాజ సేవలో జీవితాలను గడుపుతున్న దంపతులకు తన బిడ్డను దత్తతకు ఇచ్చేస్తుంది సింధుతాయి. తన జీవితం అంతా అనాధ పిల్లలను సంరక్షించడంలో గడుపుతుంది. అలా సుమారు 1500 మంది పిల్లలకు ఆమె తల్లి అయి సింధూ తాయి అనిపించుకుంది. తాయి అంటే మరాఠీ లో అమ్మ అని అర్థం.
సింధూతాయి దగ్గర పెరిగిన పిల్లలు మంచి ఉద్యోగాలలో స్థిరపడిన వారూ ఉన్నారు. ఆమె చేస్తున్న పనిలో సహాయంగా మరి కొన్ని అనాధ శరణాలయానాలను ఆమె కూతురు, పెంపుడు పిల్లలు కొందరు ఇప్పుడు నిర్వహిస్తున్నారు. ఈ సినిమా సింధూతాయి అమెరికాలోని మరాఠీ సమాజంలో ప్రసంగించడానికి వెళ్ళడంతో మొదలవుతుంది. తన జీవిత కథను అక్కడి వారికి వినిపించడంతో ముగుస్తుంది. ఆమె భర్త ముసలితనంలో చూసే వారెవ్వరూ లేక చివరకు ఆమె వద్దకే వస్తే అతనికి కూడా తల్లిగా తన అనాధ శరణాలయంలో చోటిచ్చి తన తల్లి మనసును చూపించిన గొప్ప స్త్రీ సింధూతాయి. తేజస్వినీ పండిట్ సింధుతాయిగా చక్కగా నటించింది. సినిమా కొంత డాక్యుమెంటరీగా నడిచినట్లు అనిపిస్తుంది. కథ నిజ జీవితానికి సంబంధించినది కాబట్టి అంతే గౌరవంగా కాల్పనిక అవాస్తవిక సంఘటనలకు చోటివ్వకుండా తీసిన సినిమా కబట్టి కథనం చాలా గంభీరంగా నడుస్తుంది. ఈ సినిమాకు నాలుగు జాతీయ పురస్కారాలు లభించాయి. చాలా భాద్యతతో అనంత్ నారాయణ్ గారు ఈ సినిమా తీసారు అన్నది అర్ధం అవుతుంది. సింధూతాయి జీవితం గురించి నేర్చుకోవలసినవి ఎన్నో విషయాలున్నాయి. ఆమె వ్యక్తిత్వాన్ని చూపే ఈ సినిమా మహీళా శక్తికి గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది.
- పి.జ్యోతి,
9885384740