Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యార్థులు పఠనాసక్తి ద్వారా విజ్ఞానాన్ని, ఆలోచన శక్తిని, విజ్ఞతను, సహనాన్ని, ఓర్పును అలవర్చుకుంటారు. 1953 మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాలకు అనుగుణంగా సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్, డాక్టర్ లక్ష్మణ స్వామి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ప్రాథమిక, మరీ ముఖ్యంగా మాధ్యమిక పాఠశాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని అభిప్రాయపడింది. విద్యార్థులకు పుస్తకాలు చదివే అలవాటును పెంపొందించాలని, వారికి కావలసిన పుస్తకాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆర్థిక వనరులు కూడా ప్రభుత్వాలు అందించాలని సూచిస్తూ మాధ్యమిక పాఠశాలలో అర్హత కలిగిన గ్రంథ పాలకులను నియమించి విద్యార్థులకు కావలసిన నాణ్యమైన సమాచారాన్ని అందించవలసిన అవసరం ఉన్నదని సూచించారు.
మేధో శక్తి పెరుగుదల
పిల్లల మానసిక, మేధో వికాసాన్ని పెంచడంలో పుస్తకాలు మంచి పాత్ర పోషిస్తాయి. పిల్లలు తమలోని నైపుణ్యాలు, బలహీనతలు, మంచి విషయాలను గుర్తించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. తమను తాము ప్రోత్సహించుకుంటూ కొత్తగా ఆలోచిస్తుంటారు. పుస్తకం నుండి పొందిన జ్ఞానం ఫలితంగా సమాజంలో ఓ మంచి వ్యక్తిగా, గౌరవంగా బతికే శక్తిని కలిగి వుంటారు. అలాగే తమ మంచి ప్రవర్తన ద్వారా సమాజానికి ఉపయోగపడతారు. ఇవన్నీ పిల్లలకు అలవడాలంటే చదవడానికి మించిన జ్ఞానం మరొకటి లేదని తెలుసుకోవాలి.
ఎన్.సి.ఇ.ఆర్.టి 2017-18సర్వే ప్రకారం దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో 5,07,581 ప్రాథమిక పాఠశాలలుండగా వాటిలో 2,07,462 పాఠశాలల్లో గ్రంథాలయాలు ఉన్నవి. పట్టణ ప్రాంతాలలో 62,874 పాఠశాలలు ఉండగా 23,700 పాఠశాలలో మాత్రమే గ్రంథాలున్నాయి. ఇక ప్రాథమికోన్నత పాఠశాలలు గమనిస్తే గ్రామీణ ప్రాంతాలలో 1,29,246 పాఠశాలలు ఉండగా 72,752 పాఠశాలల్లో మాత్రమే గ్రంథాలయాలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాలలో 33,559 పాఠశాలలు ఉండగా 22,488 పాఠశాలల్లో గ్రంథాలయాలు ఉన్నాయి.ఇక సెకండరీ పాఠశాలలో గ్రామీణ ప్రాంతాలలో 47,870 పాఠశాలలు ఉండగా 37833 పాఠశాలలో గ్రంధాలయాలు ఉన్నాయి. ఇక పట్టణ ప్రాంతాల్లో పరిశీలిస్తే 17,694 పాఠశాలలు ఉండగా 15,047 పాఠశాలల్లో గ్రంథాలయాలు ఉన్నాయి.
ఇక హైయర్ సెకండరీ పాఠశాలలో గ్రామీణ ప్రాంతాలలో 11,600 పాఠశాలలు ఉండగా 10,366 పాఠశాలల్లో గ్రంథాలయాలు మాత్రం ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో పరిశీలిస్తే 12,062 పాఠశాలలు ఉండగా 10,980 పాఠశాలల్లో మాత్రమే గ్రంథాలయాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే 6,96,297 పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే వాటిలో 3,30,913 పాఠశాలల్లో మాత్రమే గ్రంథాలయాలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాలలో 1,26,189 పాఠశాలలు ఉండగా 72,215 పాఠశాలల్లో మాత్రమే గ్రంథాలయాలు ఉన్నాయి. అంటే 8 లక్షల 50 వేల పైచిలుకు పాఠశాలలు ఉండగా 4లక్షల పైచిలుకు గ్రంథాలయాలు పాఠశాలలో ఏర్పాటు చేశారు. అంటే దాదాపు 50 శాతం పాఠశాలల్లో గ్రంథాలయాలు లేవన్నమాట.
ఎన్.సి.ఇ.ఆర్.టి 2015-16 సర్వే ప్రకారం భారతదేశంలో అత్యధికంగా పాఠశాలలు ఉన్న రాష్ట్రాలను పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1,55,756 ప్రాథమిక పాఠశాలలు ఉండగా వాటిలో 6శాతం గ్రంథాలయాలు మాత్రమే ఉన్నాయి. ప్రాథమికోన్నత పాఠశాల 75 644 పాఠశాలలు ఉండగా వాటిలో 8శాతం గ్రంథాలయాలు మాత్రమే ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 88,593 ప్రాథమిక పాఠశాలలు ఉండగా వాటిలో 10 శాతం గ్రంథాలయాలు మాత్రమే ఉన్నాయి. 47,276 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉండగా వాటిలో 5 శాతం గ్రంథాలయాలు మాత్రమే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ 76,703 పాఠశాలలు ఉండగా 6 శాతం గ్రంథాలయాలు మాత్రమే ఉన్నాయి. రాజస్థాన్లో 37,656 పాఠశాలలు ఉండగా 6 శాతం గ్రంథాలయాలు మాత్రమే ఉన్నాయి.
ఇక సెకండరీ పాఠశాల మహారాష్ట్ర 16,287 పాఠశాలలు ఉండగా వాటిలో 17శాతం గ్రంథాలయాలు మాత్రమే ఉన్నాయి. కర్ణాటక 13627 పాఠశాలలు ఉండగా వాటిలో 31 శాతం గ్రంథాలయాలు మాత్రమే ఉన్నాయి. ఇక సీనియర్ సెకండరీ పాఠశాల రాజస్థాన్ రాష్ట్రంలో 16,958 పాఠశాలలు ఉండగా వాటిలో 11శాతం గ్రంథాలయాలు మాత్రమే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 15,937 పాఠశాలలు ఉండగా, 12 శాతం గ్రంథాలయాలు మాత్రమే ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూసినట్లయితే కేరళ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 70శాతం గ్రంథాలయాలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 51శాతం గ్రంథాలయాలు ఉన్నాయి. ఢిల్లీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 69శాతం గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు.
చదివే అలవాటు చిన్న వయసు నుండే రావాలి. సాధారణంగా వయసు పెరుగుతున్నకొద్దీ ఇష్టాలు మారుతూ వుంటాయి. అందువల్ల చిన్న వయసులోనే వారికి సామాజిక, విద్యా రంగం వైపు ఆసక్తి కలిగితే చదివే అలవాటును పెంచుకుంటారు. ఇటువంటి సమయంలోనే తల్లిదండ్రులకు పిల్లలకు సహకరించాలి. చదవడం వల్ల కగిలే ప్రయోజనాలను వారికి అర్థమయ్యేలా చెప్పాలంటున్నారు పిల్లల నిపుణులు.
పదాలు నేర్చుకుంటారు
కేరళ రాష్ట్ర ప్రభుత్వం 2019-2020 సంవత్సరానికి గాను ''సర్గ వాయన సంపూర్ణ వాయన'' ప్రతీ పాఠశాలలో గ్రంథాలయం అనే ప్రాజెక్టును ప్రారంభించారు. దానిలో భాగంగా 8 లక్షల పుస్తకాలను తిరువనంతపురం జిల్లా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు అందిస్తున్నది. దీని తరువాత మిగితా జిల్లాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు.
కేరళ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 70శాతం గ్రంథాలయాలు ఉన్నా శిశువు నుండి 12వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానిలోని భాగంలో మొట్టమొదటగా తిరువనంతపురం జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. 10,681 తరగతి గదులలో 988 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. ప్రపంచీకరణలో భాగంగా ప్రపంచ స్థాయి విద్యను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించాలంటే ప్రతి పాఠశాలలో గ్రంథాలయాలు నెలకొల్పుతున్నారు. అదేవిధంగా ప్రతి తరగతిలో ఆన్లైన్ రిసోర్సెస్ అంటే అంతర్జాల సేవల ద్వారా పుస్తకాలను అందిపుచ్చుకోవడం మరీ ముఖ్యంగా విద్యార్థులను చదివే అలవాటును పెంపొందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా ఆన్లైన్ రిసోర్స్ ద్వారా డిజిటల్ విద్యా విధానాన్ని రూపొందిస్తున్నారు.. డిజిటల్ క్లాస్ రూమ్ లో డిజిటల్ రిసోర్స్ ద్వారా అద్భుతమైన సమాచారాన్ని తరగతిగది నాలుగు గోడల మధ్యనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సమాచారాన్ని సేకరించడానికి విద్యార్థులు అందిపుచ్చుకోవడానికి ఆస్కారముందని అ దిశగా 2019-20 విద్యా సంవత్సరంలో ప్రయత్నం చేసారు.
రెండు తెలుగు రాష్ట్రాల వారిగా పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలు 20,980 ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలలు 7,688 ఉండగా, మాధ్యమిక పాఠశాలలు 12,932 పాఠశాలలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలు 38,793, ప్రాథమికోన్నత పాఠశాలలు 10,086, సెకండరీ పాఠశాలలు 11,234, హైయర్ సెకండరీ పాఠశాల 2,889 ఉండగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ ప్రాథమిక మాధ్యమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో గ్రంథాలయాలు నామమాత్రమే ఒకవేళ ఉన్నా వాటికి సంబంధించిన ఆర్థిక వనరులు పుస్తకాలు గ్రంథ పాలకులు పేరుకు మాత్రమే.
ప్రతి ఒక్కరికి ఉచితమైన, నాణ్యమైన, ప్రపంచ స్థాయి విద్యనూ ప్రతి మారుముల ప్రాంతంలో, ప్రతీ విద్యార్థికి అందించాలనే తపనతో తెలంగాణ రాష్ట్రం లోని నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో దాతల సహకారంతో 31మండలాలో 229 పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పాఠశాలను 200 పుస్తకాలు తక్కువ కాకుండా కొనుగోలు చేసి జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు అందిస్తున్నారు. ప్రతి పాఠశాలలో పుస్తక ప్రదర్శన నిర్వహిస్తూ, ఆ ప్రాంతంలో ఉన్న రచయితలు ద్వారా సభలు సమావేశాలు నిర్వహించి విద్యార్థులకు పుస్తకపఠనంపై, పుస్తక రచన పై అవగాహన కల్పిస్తూన్నారు. అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రతి పాఠశాలకు 13 నిఘంటువులు (తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలు) తక్కువ కాకుండా అందిస్తున్నారు. అదేవిధంగా ఆ ప్రాంత కలెక్టర్ చంద్రశేఖర్ సలహా, సూచన మేరకు అనేక మంది దాతలు పుస్తక, ఆర్థిక, వస్తు రూపేనా, పాటశాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడానికి సహాయ సహకారం అందిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రంలో కేంద్ర పాలిత ప్రాంతాలలో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. వాటిలో ప్రతీ విద్యాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసారు. దాదాపు అన్ని విద్యాలయాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేసారు. విద్యార్థికి కావలసిన పుస్తక సంపద వివిధ రూపాలలో (ప్రింట్ డ ఎలక్ట్రానిక్) లభ్యమవుతున్నాయి. అన్ని విద్యాలయాలలో గ్రంథపాలకులు విద్యార్థులకు సేవలందిస్తున్నారు.
ప్రపంచీకరణ నేపధ్యంలో విద్యావిధానంలో వచ్చిన మార్పులకనుగుణంగా ప్రతీ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయాలి. వాటిలో అంతర్జాల సేవల ద్వారా ప్రపంచంలో ఎక్కడ నుంచైనా సమాచారాన్ని, పుస్తకాలను వీడియో, ఆడియోల రూపంలో అందిపుచ్ఛుకొని ప్రపంచ స్థాయి విద్యనూ విద్యార్థులకు అందిచాలి. కొన్ని అంతర్జాతీయ, కార్పోరేట్ విద్యాలయాలో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తూ నాణ్యత కలిగిన విద్యనూ అందించే ప్రయత్నం చేస్తున్న అది అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండదు కదా అన్ని వర్గాల విద్యార్దులకు అలాంటి ప్రపంచ స్థాయి విద్యను అందించాలి అంటే గ్రంథాలయాలు నెలకొల్పాలి అర్హత కలిగిన గ్రంథపాలకుల నియమించాలి. నేటి తరం గ్రంథపాలకుడు విద్యార్దులకు కావలసిన సమాచారాన్ని (ప్రింట్, ఎలక్ట్రానిక్, ఆడియో, విడియో, పిడియఫ్) రూపంలో ప్రపంచ ఎక్కడ ఉన్నా అందిచగలుగుతారు.
మారుమూల గ్రామీణ ప్రాంతాలల్లో అత్యున్నత మైన విద్యనూ బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ గురుకులాలు, వెనుకబడిన కులాల గురుకులాలు, షెడ్యూల్ క్యాస్ట్ గురుకులాలు, షెడ్యూల్ టైబ్ గురుకులాలు ప్రతి నియోజకవర్గంలో ఈ గురుకులాల్లో ఏర్పాటు చేసింది వాటిలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గురుకులాల్లో 60 శాతం పైగా గ్రంథ పాలకులు విధులు నిర్వహిస్తూ నాణ్యమైన సమాచారాన్ని విద్యార్థులకు అందిస్తూ గురుకులాల పురోగమనంలో పయనిచడంలో అద్భుతమైన పాత్రను గ్రంథాలయాలు గ్రంథపాలకునిగా పోషిస్తున్నారు.
అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న 33 జిల్లా ప్రజాప్రతినిధులు వారి స్థానిక ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి విద్యార్థులకు అనుకూలమైన విజ్ఞానాన్ని అందించే పఠణాలయాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉండే రచయితలు, కవులు ముందుకు వచ్చి తమకు చేతనైనంత పుస్తకం సహాయాన్ని పాఠశాలలకు అందించి ప్రతిఒక్కరు ఇంకొకరికి విద్యను విజ్ఞానాన్ని అందించే దిశగా ప్రయత్నం చేయాలని అశిద్దాం.
ముఖ్యంగా కేరళ, ఢిల్లీ రాష్ట్రాల పాఠశాలల్లో గ్రంథాలయాలు అత్యద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆ దారిలోనే తెలంగాణ రాష్ట్రం పయనించే ప్రయత్నం చేస్తున్నది. రెండు తెలుగు రాష్ట్రాలు ప్రభుత్వ ఎయిడెడ్ ప్రాథమిక ప్రాథమికోన్నత మాధ్యమిక పాఠశాలలో గ్రంథాలయాలు నెలకొల్పాలి అర్హత కలిగిన గ్రంథ పాలకులు నియమించి నాణ్యమైన సమాచారాన్ని తెలుగు రాష్ట్ర విద్యార్థులకు అందించి విజ్ఞానవంతమైన మేధా సంపత్తి కలిగిన యువతను ఈ దేశానికి అందించాలని ఆశిద్దాం.
- డా.రవి కుమార్ చేగొని