Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాకు పెళ్ళి జరగబోతోందన్న వార్త నాకెంతో సంతోషాన్నిచ్చింది. మంగళ వాయిద్యాలు మోగుతాయి. ఆడవాళ్ళ కేరింతలతో, తుళ్ళింతలతో ఒక పండుగ వాతావరణం అలుముకుంటుంది- అని సంతోషపడుతున్నా. మనసులో ఏదో మూల బితుకు బితుకు ఉండనే ఉంది. స్నేహితులు, బంధువులతో ఇల్లు గిర్రున నిండిపోతూ ఉంది. అదంతా చూస్తూ ఉంటే నాకెందుకో చచ్చేంత భయమేసింది. ఎంతో మంది నన్ను ఓదార్చారు. ధైర్యం చెప్పారు. హాస్యాలాడారు. చిరు కోపాలు ప్రదర్శించారు. నేను కుదురుకోవడానికి ఎన్నో చేశారు.
బంగారు నగలు, పట్టు బట్టలు చూసి పొంగిపోయాను. నా వయసు అమ్మాయిలతో ఆడుతూ పాడుతూ జరుగుతున్న ఏర్పాట్లు చూశాను. నా సంతోషానికి అసలు అవధులే లేవు. పెళ్ళి కార్యక్రమమంతా అయిపోయాక, మరునాడు కొంతమంది ''ఈ రోజు వెళ్ళిపోతారా?'' అని అమ్మను అడగడం విన్నాను. బహుశా వాళ్ళు వచ్చిన బంధువుల గురించి మాట్లాడుతున్నారేమో అని అనుకు న్నాను. నన్ను తీసుకుని పెండ్లి కొడుకు వైపు వాళ్ళు వెళ్ళిపోతారన్న విషయం నాకు తెలియనే తెలియదు. మా ఇంటి వాళ్ళంతా ఒక చోట గుమిగూడి కళ్ళనీళ్ళు పెట్టు కోవడం ప్రారంభించారు. అందరూ నన్ను దగ్గరకు తీసుకుని ఎందుకో గానీ కుమిలి పోసాగారు. వాళ్ళను చూసి నాకూ ఏడుపొచ్చింది. భోరుమన్నాను. నన్ను మగ పెళ్ళివారికి అప్పగించబోతున్నారన్న విషయం అర్థం కాగానే 'అమ్మా నన్ను వాళ్ళకిచ్చేయకే' అని అమాయకంగా అర్థించాను. ఆ మాటలతో అందరూ మరింతగా కుంగిపోయారు. వెంటనే మళ్ళీ తేరుకుని నాకు ధైర్యం చెప్పారు.
మా అమ్మ నన్ను గుండెలకు హత్తుకుని 'తప్పదమ్మా! ఆడ జన్మమెత్తిన తర్వాత మెట్టింటికి వెళ్ళకుండా ఎలా ఉండగలవ్?' మంచమ్మాయివి కదూ! నీకు అన్నీ అర్థమవుతాయి. నువ్వేం బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు. మళ్ళీ వెంటనే నిన్నిక్కడికి తీసుకురామూ? అంతా ఆ భగవతుడి దయ. అంతా సవ్యంగా జరగాలి' అపి తన గొంతులో భయ సంతోషాల్ని మిళితం చేసింది చిరునవ్వుతో ఏడుస్తూ-
ఎవరో వచ్చి నన్ను అమ్మ నుంచి దూరంగా తీసుకువెళ్ళారు. నాలో భయం, అశాంతి, అభద్రత, అయోమయం ఎక్కువ కాసాగాయి. నా మనసు ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఏమిటో ఇదంతా? పుట్టి పెరిగిన ఊరూవాడ వదిలి కనిపెంచిన తల్లిదండ్రుల్ని వదిలి, ఎక్కడికో కొత్త వాతావరణంలో, కొత్త మనుషుల మధ్య జీవితం సాగించాలి. అమ్మ చెప్పినట్టు ఇదంతా సమాజ నిర్ణయమేనా? ఆలోచనలతో సతమతమై పోతూ... దగ్గరకు వచ్చిన వాళ్ళ మీద పడి భోరున ఏడవసాగాను. చివరకు నన్ను పల్లకీలో కూర్చోబెట్టారు. నా వాళ్ళూ, నాకు తెలిసిన వాళ్ళూ ఎవరూ వెంటలేకపోవడంతో నాలోని నిరాశలోనే నేను మునిగి, కుంగిపోతున్నట్టుగా చలించి పోయాను. ఆ భయంలో నాకేమి చేయాలో పాలుపోలేదు. ఈ దశలో నన్నెవరు రక్షిస్తారూ?
ఏడుస్తూనే నిద్రపోయాను. మరునాటి ఉదయం మేలుకునే సరికి నేనొక పడవలో ఉన్నాను. చుట్టూ మగ పెళ్ళి వారున్నారు. అన్నీ కొత్త ముఖాలు. కొత్త సంబంధాలు. నిన్నటి దాకా నాతో ఉన్న నా స్నేహితురాళ్ళు గానీ, నా ఇంటివాళ్ళు గానీ, ఎవరూ లేరు. వాళ్ళంతా ఎక్కడున్నారూ? నేనెక్కడున్నానూ? అని ఆలోచించే సరికి నాకు మళ్ళీ ఏడుపు ఆగలేదు. అయితే పడవలోని వాళ్ళంతా మంచివాళ్ళు. ప్రేమగా పలకరించి నన్ను తమలో కలుపుకున్నారు. పడవ ప్రయాణం నాకు కొత్త. అదొక భయం. ఎలాగో ఓపిక పట్టానంతే. పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళే ఆడ పిల్లలంతా ఎలాంటి అనుభూతికి లోనవుతారో తెలియదు గాని, నా మట్టుకు నేను విలవిలలాడాను.
జీవితాంతం ఆ కనబడని పంజరమే ఇక నాకు శరణ్యం. మరో పగలూ, రాత్రీ ప్రయాణించి, రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత వాళ్ళింటికి చేరుకున్నాం. ఎంతో మంది ఎదురొచ్చారు. ఘనంగా స్వాగతం పలికారు. వాళ్ళంతా నా వాళ్ళేనని, ఆ ఇల్లు నా ఇల్లేనని ఎంతో మంది చెప్పారు. 'ఇది నాదే' అనే భావం అంత తొందరగా ఎలా వస్తుందీ? నా వాళ్ళందరినీ దు:ఖ సముద్రంలో వదిలి వచ్చిన నేను, అంత సులభంగా వీళ్ళలో కలవగలనా?
నా దినచర్య ప్రాత:కాలంలో ప్రారంభమై, అర్ధరాత్రి దాకా కొనసాగేది. ఒక ఘడియ విరామం ఉండేది కాదు. అయినా నా ఆత్మ విశ్వాసం వల్ల నేనన్ని పనులు చేయగలిగేదాన్ని. అప్పుడు నా వయసు పద్నాలుగు. ఆ రోజుల్లోనే నాకు చదువుకోవాలన్న కోరిక కలిగింది. దురదృష్టవశాత్తూ అమ్మాయిల చదువు గురించి ఆ రోజుల్లో ఎవరూ ఆలోచించేవారు కాదు. పురుషులకు సేవలు చేయడం తప్ప ఆడవాళ్ళకు మరో పరమార్థంమ ఉండేది కాదు. చదువుకు సంబంధించిన నా ఆలోచనలన్నీ ఎవరికైనా చెప్పాలంటేనే భయంగా ఉండేది. రాసి పడేసిన కాగితం ఎక్కడైనా కనిపిస్తే తీసి చూడడానికి కూడా భయపడేదాన్ని. చదువుకోవాలన్న నా కోర్కె ఎవరికైనా తెలిసిపోతుందేమోనని అనుకునేదాన్ని. ఆ నాటి పరిస్థితులు అలాంటివి. ఆధ్యాత్మిక గ్రంథాలు, మత గ్రంథాలు చదవాలని, వాటి సారాన్ని గ్రహించాలని అనుకునేదాన్ని.
పన్నెండో యేట పుట్టినిల్లు విడిచి, మెట్టినింటికి వచ్చిన నన్ను అదృష్టవశాత్తూ నా భర్త, అతని పరివారమూ అందరూ బాగా చూసుకునేవారు. పెద్ద కుటుంబం. ఇంట్లో ఎనిమిది మంది పని వాళ్ళుండేవారు. అయినా గృహిణిగా నా పనులు నాకుండేవి. 18 - 41 ఏళ్ళ మధ్య ఇరవై మూడేళ్ళు పదకొండు మంది పిల్లల పెంపకంలో నేనెంత యాతన భరించానో అది నాకు మాత్రమే తెలుసు. అతిథుల్ని ఆదరించడంలో, బంధువుల్ని భరించడంలో నా సహనం ఎంత ఖర్చయ్యిందో నాకు మాత్రమే తెలుసు. ఇన్ని ఈతి బాధల్లో కూడా చదువుకోవాలన్న నా కోరిక అడుగున పడలేదు.
ఓ రోజు రాత్రి 'చైతన్య భాగవతం' చదువుతున్నట్లు కలగన్నాను. అసలు ఆ పుస్తక భాండాగారంలో అది తప్పకుండా ఉండే ఉంటుంది. కాని నాకు నేనై దాన్ని ఎలా గుర్తు పట్టగలనూ? అని సతమతమౌతున్నప్పుడు, మా వారు మా పెద్దబ్బాయిని కేకేశారు.
'ఒరేరు బిపిన్! నేనిక్కడ చైతన్య భాగవతం పెట్టి వెళుతున్నాను. తర్వాత నేను తెచ్చి ఇవ్వమన్నప్పుడు తీసుకురా!' అని.
ఆ మాట నాకు వంటింట్లోకి వినపడింది. ఆ రోజే మా వారు ఆ పుస్తకం అక్కడ పెట్టి వెళ్ళాలా? అది కేవలం దేవుడి కటాక్షమే తప్ప మరొకటి కాదనుకుంటాను. నేనే ముందు పరుగెత్తాను. ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని, తనివితీరా చూశాను. ఆ రోజుల్లో పుస్తకాలు వేరే విధంగా ఉండేవి. పుస్తకం పుటలు చెక్క ఫ్రేమ్ల మధ్య కట్టేసి ఉండేవి. పుస్తకం తెరిచి ఒక్క పుట నేను దాచిపెట్టుకున్నాను. మా పిల్లలు రాసుకునే తాళపత్రమొకటి దొంగిలించాను. అక్షరాలు పోల్చి చూచసుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేశాను.
అలా కాదని, చిన్న పిల్లలు అక్షరాలు దిద్దుతున్నప్పుడు వారి మధ్య కూర్చున్నాను. వారి ఉచ్ఛారణ వింటూ, వారు దిద్దుకునే అక్షరాలను గుర్తు పట్టడం ప్రారంభించాను. ఆ విధంగా చదవడం ఎలాగో నేర్చుకున్నాను. కానీ, రాయడానికి మాత్రం వీలయ్యేది కాదు. అదొక పవిత్ర కార్యంగా ఉండేది. వ్యాస పీఠం, ఘంటం, లేదా అప్పుడే వచ్చిన సిరా బుడ్డి, ముంచి రాసే కలం, కాగితం ఎన్నో కావాలిసి వచ్చేవి.
ఎవరూ చూడకుండా అవన్నీ సంపాదించడం, పనులన్నీ మాని రాస్తూ కూర్చోవడం ఒక స్త్రీకి ఆ రోజుల్లో సాధ్యపడేది కాదు. కనీసం చదవడం వచ్చింది గనుక, కొంచెం ధైర్యం పుంజుకుని పుస్తకాలు చదవడం ప్రారంభించాను.
రచయిత్రి గురించి...
రస సుందరీదేవి ప్రముఖ బెంగాలీ రచయిత్రి. ఈమె ఆత్మకథ 'అమర్ జిబాన్' ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఇది 1876లో వెలువడి బెంగాలీలో వెలువడ్డ తొలి ఆత్మకథగా వినుతికెక్కింది. విశ్వకవి రవీంద్రుడి తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ రాసుకున్న ఆత్మకథ 1898లో, అంటే 22 ఏళ్ళ తర్వాత వెలువడింది. 1818లో బెంగాల్లోని మారుమూల పల్లె పాటాజియాలో పుట్టిన ఈ రచయిత్రి, తల్లే సర్వస్వంగా పెరిగి, 1822లోనే గృహిణి అయ్యారు. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకోవడంతోనూ, బాల్య వివాహాల కారణంగానూ ఆమె ముద్దుముచ్చట్లు తీరకుండానే గృహిణిగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది.
ఒక స్త్రీ అక్షరాలు నేర్చుకోవడానికే వీలు లేని పరిస్థితుల్లో రస సుందరీ దేవి వంటింట్లో పొగబారిన మసి గోడల మీద అక్షరాలు దిద్దుకోవాల్సి వచ్చింది. అయినా కాల క్రమంలో సరళంగా సాగిపోయే గొప్ప వాక్య నిర్మాణాన్ని సాధించి బెంగాలీ సాహితీ ప్రముఖుల్లో ఒకరయ్యారు.
- బెంగాలీ మూలం : రస సుందరీదేవి
తెలుగు : డాక్టర్ దేవరాజు మహారాజు