Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొట్ట చేత్తో పట్టుకుని సముద్రాల అవతలున్న ప్రాంతానికి ఓడెక్కిన ఓ బక్క రైతు కూలీ, తన రక్తమాంసాలని... అక్కడి చెరుకు తోటలకి ఎరువుగాను... కన్నీటిని పంటకి నీరు గాను.... తమ చెమటను చెరుకుగడకి తీపిగాను ఎక్కించిన తీరు చదివితే కచ్చితంగా కదిలిపోతాం.
అణచివేత సాధారణమైనప్పుడు ఆత్మగౌరవం కోసం పోరాడటం అసాధారణంగానే కనిపిస్తుంది... వేట కుక్కలన్నీ ఏకమై దాడికి యత్నించినప్పుడు అడుగు వేయకుండా ఉండటమే తిరుగుబాటు అవుతుందన్నది అక్షర సత్యం. తెలుగు గడ్డపైనా 'ఏడుతరాల' కథలున్నాయి. నేను ఇటీవల చదివిన పుస్తకాల్లో ఎంతగానో ఆత్మసంతప్తిని కల్గించినది ఈ 'వీరయ్య' పుస్తకం. ఒక మంచి బుక్ చదివి ఆస్వాదిస్తే, అది ఇచ్చే ఆనందమెంటో అనుభవిస్తే గానీ చెప్పలేం. ఈ వీరయ్య పుస్తకం మాత్రం నన్ను ఏడుతరాలు (ఆంగ్లంలో రూట్స్), మా నాయన బాలయ్య తర్వాత ఇంత స్థాయిలో ఉద్వేగ, భావోద్వేగానికి గురి చేసిందని చెప్పగలను. పొట్ట చేత్తో పట్టుకుని సముద్రాల అవతలున్న ప్రాంతానికి ఓడెక్కిన ఓ బక్క రైతు కూలీ, తన రక్తమాంసాలని... అక్కడి చెరుకు తోటలకి ఎరువుగాను... కన్నీటిని పంటకి నీరుగాను....తమ చెమటను చెరుకుగడకి తీపిగాను ఎక్కించిన తీరు చదివితే కచ్చితంగా కదిలిపోతాం. కాదు... కాదు! మనల్ని కదిలించేలా చేశాడా పుస్తక రచయిత గుబిలి కృష్ణ. ఇటీవల మా తండ్రి(వనపర్తి రాజమౌళి, మాజీ సర్పంచ్, చిన్నబొంకూర్) గారు చనిపోయినప్పుడు ఆయనకి నిర్వహించే కర్మఖాండల్లో భాగంగా మా పురోహితుడు గోపన్న అయ్యగారు ఏదో మంత్రం చదువుతూ, మీ తాత పేరు ఏమిటి నాయనా? అని నన్ను ప్రశ్నించాడు. వెంటనే నేను మా గ్రాండ్ ఫాదర్ పేరు చెప్పాను. అటు తర్వాత మీ తాత వాళ్ళ నాయన పేరు ఏమిటీ? అని అడిగాడు. నాకు తెలియకపోవడంతో బిక్క మొఖం వేశాను. పక్కనే ఉన్న మా బాబారు కాస్త తటపటాయించిన మా తాత వాళ్ళ నాయన పేరయితే చెప్పేశారు. ఆ తర్వాత వాళ్ళ నాయన పేరు ఏమిటీ అంటే, అక్కడ ఉన్న వారిలో ఎవరికీ తెలయదని చెప్పారు. దీంతో ఆయన కర్మఖాండనయితే ఏదోలా కానించారు. నేను నా పూర్వీకులను కూడా గుర్తు పెట్టుకోలేకపోయాను. కానీ, ఈ పుస్తక రచయిత కృష్ణ మాత్రం తన తాత, తాత వాళ్ళ తండ్రి గురించిన అంశాలను తెలుసుకునేందుకు చేపట్టిన చర్యలు, తీసుకున్న శ్రమ నిజంగా ప్రశంసనీయం. రచయిత కష్ణ తన తాత ముత్తాల మూలాలన్ని వెతుక్కుంటూ దక్షిణాఫ్రికా చరిత్రపుటల్లోకి వెళ్ళిపోయి, అక్కడినించి ఘనీభవించిన...తమ కుటుంబ పాతతరాల కన్నీటి బిందువుల్ని అక్షరాలుగా పేర్చి 'వీరయ్య'గా మన ముందు పెట్టాడు. గ్రీక్ ఎపిక్ కథల్లో 'సిసిఫస్' అనే రాజు అనుభవించిన శిక్ష మాదిరి ఈ పుస్తక రచయిత తన పూర్వీకుల కోసం చేపట్టిన శోధన ఉంది. ఒక గట్టి నమ్మకంతో ప్రయతాన్ని ప్రారంభించడం, విఫలమై, నిస్పహకి గురి కావడం... మళ్ళీ ప్రయత్నాలను షురూ చేసేందుకు, ఇలా ఆయనకి సుమారు రెండు దశాబ్ధాలు పట్టిందంటే నమ్మకుండా ఉండలేము. కానీ, చివరికి ఆయన అనుకున్నది సాధించి తాను మాత్రం 'సిసిఫస్' కాదని నిరూపించాడు రచయిత గుబిలి కృష్ణ. ఆ కథంటో చూద్దాం!
చెఱకు తోటల్లో 'వీరయ్య' చేదు కష్టాలు!
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకి సమీపాన గల కొర్లపాడు 1882లో జన్మించిన వీరయ్య అనే యువకుడి కుటుంబంలో జరిగిన ఓ అనూహ్య గొడవ తన జీవిత స్థితిగతులనే పూర్తిగా మార్చి వేస్తుంది. తన తల్లిదండ్రులపై అలిగి ఆ ప్రాంతం నుంచి విజయవాడ పట్టణానికి వెళ్ళిపోతాడు. అక్కడ పని కోసం చూస్తుండగానే ఇండెంచరు పద్ధతిలో ఇతర దేశాలకి బ్రిటీషర్లు కూలీలను తీసుకెళుతున్నారని తెలుసుకుంటాడు. ముందుగా మంచి వేతనం, రేషన్ సదుపాయం కల్పిస్తామని చెప్పడంతో ఆయన అందులో చేరి, చైన్నై మీదుగా సుమారు రెండు నెలలు ఓడలో ప్రయాణించి దక్షిణాఫ్రికాలోని నటాల్ ప్రాంతానికి చేరతాడు. అక్కడికి చేరిన తర్వాత గానీ మన పుస్తక కథనాయకుడు వీరయ్యకి అసలు కష్టాలు తెలియదు. తన లాగే సుమారు 13 లక్షల మంది ఇక్కడికి వచ్చి మోసపోయారని, ఇక తిరిగి వెళ్ళే పరిస్థితి లేదని గ్రహిస్తాడు. పొద్దు ఉన్నంత సేపు పొలంలో చెఱకు తోటల్లో పని చేసి వారికొచ్చే అరకొర రేషన్తో బతుకు వెళ్ళదీయడమే అవుతుంది తన రోజువారీ వ్యవహారం. నాటి సాంప్రదాయ సమాజపు రథచక్రంలో మహిళలు కూడా వారితో కూలీలుగా వచ్చారని, వారి మధ్య అక్కడ ఉండే సంబంధాలను సైతం వీరయ్య ఆకళింపు చేసుకుంటాడు. అయితే, నటాల్లో చేరిన కొన్ని సంవత్సరాల తర్వాత వీరయ్య మరొక కంపెనీకి మారతాడు. ఇక అక్కడి నుంచి వీరయ్య ఉద్యోగంలో పదొన్నతి పొందడం, పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తాడు. అక్కడే తెలుగు అమ్మాయి రాజమ్మని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. నలుగురు కొడుకులు, ఒక అమ్మాయికి జన్మనిచ్చి మంచి జీవితాన్ని కొన సాగిస్తుం టాడు. బారిస్టర్ చేసి అక్కడి సమస్యలపై పోరాడుతున్న
మహాత్మాగాంధీని సైతం అక్కడే వీరయ్య కలుసుకుంటాడు. భారత్ నుంచి వచ్చిన లక్షలాది ఇండెంచరు కూలీలపై పోరాడాలని ఆయనకి విజ్ఞప్తి చేస్తాడు. ఆ దేశంలో వీరయ్య ఎంత ఉన్నతమైన జీవితాన్ని కొనసాగించినా తన సొంత ఊరులోని వారికి చెప్పకుండా వచ్చేశాన్న వెలితి మాత్రం ఆయన్ని ఎప్పుడూ వెంటాడేది. సుమారు 25 సంవత్సరాలకి పైగా అక్కడ ఉన్న తర్వాత 1932లో ఆయన ఇండియాకి వచ్చి తన కుటుంబీకులను కలుసుకోవాలని పెట్టాబేడాతో అందరినీ తీసుకొని బయలుదేరుతాడు. కానీ, ఇక్కడికి వచ్చాక ఆయనకి అన్నీ చేదు పరిస్థితులు ఎదురవుతాయి. తన నాన్న, అమ్మ, అక్క అందరూ చనిపోతారని తెలుసుకొని తీవ్ర మనోవేధనకి గురవుతాడు. కొంతమంది సాయంతో తన చిన్నక్క, చెల్లి బతికి ఉందని తెలుసుకొని వారిని కలుస్తాడు. ఈ క్రమంలో బంధువుల పేరుతో ఎంతోమంది వచ్చి తన దగ్గర డబ్బుని అవసరాల పేరుతో లాగే ప్రయత్నం చేస్తుంటారు. ఇదంతా గమనిస్తున్న వీరయ్య భార్య ఆయన్ని ఎప్పటికప్పుడూ వారిస్తుంటూనే ఉంటుంది. తన కూతురు చెంగళమ్మ ఇక్కడి పరిస్థితులకి విసిగి పోయి తన భర్తని తీసుకొని ఆంధ్ర నుంచి మళ్ళీ దక్షిణాఫ్రికాకి తిరిగి పయనం అవుతుంది. వీరయ్య మాత్రం తన భార్య మాటని వినిపించుకోకపోవడంతో ఆర్థికంగా చతికిల పడిపోయాక, నిజామాబాద్లోని బోధన్ షుగర్ కంపెనీలో పనికి కుదురుతాడు. ఈ క్రమంలోనే తన మూడో కుమారుడు అనారోగ్యంతో మృతి చెందడంతో కుప్పుకూలిపోయిన వీరయ్య నిత్యం దిగులుపడుతూ మంచానికి పరిమితం అవుతాడు. దక్షిణాఫ్రికాలో అష్ట ఐశ్వర్యాలను అనుభవించే తాను తల్లిదండ్రులు, కుటుంబీకుల కోసం వచ్చి ఇన్ని కష్టాలను ఎదుర్కొంటున్నానేంటీ? అంటూ కుమిలీపోతాడు. మళ్ళీ దక్షిణాఫ్రికా వెళదామని అనుకున్నా దేశాల మధ్య నెలకొన్న కొత్త రాజకీయ పరిస్థితులు ఆయనకి సహకరించవు. ఈ బాధలన్నింటీనీ దిగమింగుకుంటూనే వీరయ్య 1952లో కన్నుమూయడంతో కథ ముగుస్తుంది. అయితే, తన తాతలాగే ఇప్పటికీ గల్ఫ్ దేశాలకి వలస వెళుతున్న ఎంతోమంది కూలీల పరిస్థితులపై పోరాటం చేస్తూ వారికి అండగా నిలుస్తున్న బసంత్రెడ్డి గురించి పుస్తకంలో చెప్పి మనకి ప్రస్తుత విషయాలపై కూడా అవగాహన కల్పించారు గుబిలి కృష్ణ. చివరగా, ఇంతటి వేధనభరిత కథని అక్షరీకరించేందుకు తమ కుటుంబాన్ని మళ్ళీ కలిపేందుకు (గెట్-టూ-గెదర్) కౄష్ణ పడిన శ్రమ ఈ చిన్ని విశ్లేషణలో చెప్పడం సాధ్యం కాదు. మొత్తం విషయం తెలుసుకోవాలంటే, పుస్తకం ఆసాంతం చదవాల్సిందే డ్యూడ్.
- సాగర్ వనపర్తి,
9494041258