Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శత్రువుతో ప్రయాణం, మాడభూషి సంపత్ కుమార్, వెల : 60/-, ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు.
'జీవితం - కవిత్వం' అనే తొలి కవితా సంపుటి తర్వాత రెండేళ్ళకు డా||మాడభూషి సంపత్కుమార్ తాజాగా వెలువరించిన మలి సంపుటి 'శత్రువుతో ప్రయాణం'. 32 కవితలను పొందుపరిచిన ఈ పొత్తంలో మంచి కవితలు చాలానే ఉన్నాయి. 'అతడు కూడా మనిషే... మనసే అతనికి గుర్తింపుతెచ్చింది. మనిషి కోసం వెతుక్కుంటూ... తిరుగుతున్నాడు' అంటూ మనసున్న మనిషి తనలాంటి మనిషి కోసం, మనసుతో సంభాషించడం కోసం అన్వేషిస్తుంటాడు. ఎక్కడా అలాంటి వ్యక్తి సమాజంలో తారసపడకపోగా, తన మనస్సునే ముక్కలు చేసిన మామూలు మనుషులే ఎదురౌతారు. 'ఇప్పుడు అతను కూడా తనువుల్లో కలిసిపోయాడు... అతడు మనిషిని జయించాడు... మనిషిని వెతకడం మానేశాడు!' అంటూ ముక్తాయిస్తాడు కవి. సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు కొందరయితే... సమాజంలో ప్రభావితం అయ్యేవారు అనేకమంది.
తన కన్న తండ్రి స్మృతిపథంలో పలువరిస్తు 'కోడికన్న కోకిల కన్నా... ఆయననే ముందులేస్తాడు. రెక్కాడితే కాని డొక్కాడని... కుటుంబం కోసం పక్షులతో పాటు రెక్కలు విదుల్చుకుని బయలుదేరతాడు. ఆ రోజు రాత్రింకా... మాకు పెట్టడం తప్ప ఒక్క పిడికెడు మెతుకులు... ఆశించని ధన్యుడు' అంటూ జ్ఞాపకాల్ని తడుముకుంటాడు. 'కత్తి కింద పడకుండానే... మరణించిన వీరుడు' నిజమే! ఆఖరి శ్వాస వరకు కుటుంబ క్షేమమే ధ్యేయంగా శ్రమించే పితృదేవులు ఎందరో! స్త్రీ సమస్యల మీద అతి సున్నితంగా స్పందిస్తారు మాడభూషి. 'ఆమె', 'స్వర్గం', 'మగాడు', 'భయం' ఇంకా పలు కవితల్లో స్త్రీల సమస్యల్ని పలుకోణాల్లో దర్శిస్తాడు. బలంగా చర్చిస్తాడు. 'జెండా/ మీటరు గుడ్డ కాదు / లక్షల మంది / ప్రాణత్యాగం చేసిన కన్న బిడ్డ!' వంటి అభివ్యక్తులు. సంపుటి నిండా పరుచుకుని ఉన్నాయి.
- రమణ వెలమకన్ని, 9866015040