Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సోపతి' అనేక అద్భుతమైన కథనాలను, ఫీచర్స్ని పాఠకులకు అందిస్తూ పాఠకలోకం నుంచి మంచి ప్రశంసలు అందుకుంటూ వస్తున్నది. ముఖ్యంగా కళారంగంలో మరుగున పడిన అనేకమంది కళాకారులను పరిచయం చేస్తూ ఇస్తున్న చిన్న విమర్శావ్యాఖ్యలు ప్రముఖ కళాకారుల నుండి సాధారణ పౌరుల వరకు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా శ్రామిక జీవుల జీవనంపై వేసిన అనేక కళాఖండాలను, వాటిని సృష్టించిన కళాకారులను పరిచయం చేస్తూ మొదట్లో వ్యాఖ్యలు ఒక సిరీస్గా ప్రచురితమయ్యాయి. తరువాత కళావిమర్శకుల దృష్టికి అంతగా నోచుకోని భారతీయ స్త్రీ చిత్రకారిణుల (విమెన్ పెయింటర్స్) గురించి అనేక విమర్శనా వ్యాసాలు ప్రచురితమవుతున్నాయి. ముఖ్యంగా ఈ విమెన్ ఆర్టిస్టుల గురించి వస్తున్న వ్యాసాలు కేంద్రసాహిత్య అకాడమి, కేంద్ర లలితకళా అకాడమి వంటి ఫ్రఖ్యాత సంస్థల దృష్టినీ ఆకర్షించాయి. అందుకే ఈ వ్యాసాలను రాసిన ఆర్ట్ హిస్టోరియన్, కళావిమర్శకురాలు అయిన డా||బాలామణిని న్యూఢిల్లీలో తాము నిర్వహించిన సమావేశానికి ఆహ్వానించాయి. ఆ ఆర్ట్ కాన్క్లేవ్ విశేషాలను రచయిత్రి మాటల్లోనే చూద్దాం.
జులై 29, 30 తారీఖులలో రెండు రోజులపాటు ఢిల్లీలో దృశ్యకళా రచయితల సింపోజియం (సదస్సు) జరిగింది. దృశ్యకళల అభివృద్ధి కోసం పనిచేసే లలిత కళా అకాడమి, కవితా సాహిత్యాల అభివృద్ధి కోసం పనిచేసే సాహిత్య అకాడమి కలిసి దీన్ని ఏర్పాటు చేశాయి. 1964లో స్థాపించిన లలితకళా అకాడమి, దృశ్య కళాకారుల అభివృద్ధి కోసం ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, బహుమతులను ప్రకటించడం, విమర్శా ప్రక్రియను ప్రోత్సహించడం వంటి అనేక కార్యకలాపాల్లో నిమగమై ముందుకుపోతూ ఉన్నది. అనేక దృశ్య కళాకారుల కార్యక్రమాలు జరిగాయి కానీ, ఆ కళలపై విమర్శా వ్యాఖ్యలు రాసే రచయితలను ఒక చోట సమావేశపర్చడం ఇంతవరకు జరుగలేదు. చిత్రలేఖనం, సాహిత్యం రెంటికీ సంబంధం ఉన్నదనేమో సాహిత్య అకాడమి వారు కూడా ఈ సభానిర్వహణలో లలితకళా అకాడమితో చేతులు కలిపారు. మొత్తం మీద కళావిమర్శనారంగంలో ఈ సదస్సు ఒక కొత్త అధ్యాయానికి తెరలేపిందని చెప్పవచ్చు. సదస్సు జరగటానికి ముఖ్య కారకుడు రవి కుమార్ కాశీ. ఈయన బెంగళూరు వాస్తవ్యుడు, కళాకారుడు. దృశ్యకళలపై అనేక భారతీయ భాషల్లో రచనలు జరుగుతున్నవని అందరినీ ఒక వేదికపైకి రప్పించి సాధక బాధకాలు, అభివృద్ధిపై చర్చ అవసరమనే ఆలోచన చేసి, ఈ కార్యక్రమానికి రథసారథి అయ్యాడు.
'ఆర్ట్ కాన్క్లేవ్, విజువల్ ఆర్ట్ రైటర్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్' అని పేరు పెట్టిన ఈ సభకు 11 భాషల్లో రాసే 40 మంది దృశ్య కళా రచయితలని దేశం నలుమూలల నుంచి ఆహ్వానించారు.
గొప్ప కళాచరిత్రకారుడు ప్రొ||రతన్ పరిమూని సభాధ్యక్షుడిగా ఆహ్వానించారు. పరిమూ స్వయంగా చిత్రకారుడు. మన సంప్రదాయ భారతీయ కళలపై ఎన్నో రచనలు చేశారు. ఆయన రచనలు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు. బరోడా ఫైన్ ఆర్ట్స్ ఫాకల్టీలో వున్న ఆర్ట్ హిస్టరీ విభాగాన్ని, అందులోని ఆర్కీవ్స్కి పునాదులు వేసి అంత ఎత్తున నిలబెట్టిన ఘనత ఈయనదే. 1996లో పదవీ విరమణ తరువాత కూడా రచనలు ఆపలేదు. పరిమూ మాట్లాడుతూ ''భారతీయ కళాప్రపంచంలో మన అజంతా చిత్రాలకి సాటి మరోటి లేదన్నారు. బ్రిటిష్ వారు వచ్చి మనకు ఆధునికత నేర్పించామని చెప్తారు. ఆధునిక కళలే సృజనాత్మక కళలని, మన సంప్రదాయ, జానపద కళలు, వారు నేర్పిన ఆధునిక కళల కంటే తక్కువ అన్నట్లు మాట్లాడుతారు. ఒక్కసారి మన లఘుచిత్రాల వంక చూడండి. ఏ ఒక్క విషయం తీసుకున్నా.. ఉదాహరణకు రామాయణ చిత్రాలే తీసుకోండి... ప్రతి చిత్రకారుడూ ఒక్కోరకంగా ఊహించి చిత్ర రచన చేశాడు. మరి మన భారతీయ కళలకి సృజనాత్మకత లేకపోవటమేమిటి?'' అని ప్రశ్నించారు.
ఆయన ఉపన్యాసం తరువాత సభ అనేక విషయాలపై చర్చ కోసం ప్రారంభమైంది. ఇందులో అందరూ వక్తలే. అందరూ శ్రోతలే. పరస్పరం అభిప్రాయాలు పంచుకోవటానికీ, చర్చించటానికీ గుండ్రంగా సభికులు కూర్చునే ఏర్పాటు జరిగింది. ఇందు పాల్గొన్న 40 మంది ఆహ్వానితుల్లో కళాచరిత్రకారులు, కళ వివేచకులు, కళాకారులు అయ్యి రచనలు చేస్తున్నవారూ వున్నారు.
అనువాదంపై చర్చ
సభ చర్చనీయాంశాల్లో ఒక ముఖ్యమైన విషయం ట్రాన్స్లేషన్ (అనువాదం). ఈ విషయాన్ని ముఖ్య విషయంగానూ, ఇందులో ఎన్నో సమస్యలున్న విషయంగానూ సదస్యులందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. చర్చలో అంశంగా కొంత ఉపోద్ఘాతం అవసరం అయింది. మనదేశంలో అధికార, సంప్రదాయ భాషలతో పాటు ఆ భాషకు సంబంధించిన సరళి, మార్పు, మాట్లాడే తీరూ ఉన్నాయి. డయలెక్ట్, మాట్లాడే తీరు, సరళి వేరైనా అన్నింటికీ లిపి ఒక్కటే వుంటుంది. కొన్ని లిపి లేని ప్రాంతీయ భాషలూ వుంటాయి. ఉదాహరణకి ఆదివాసీలైన గోండులభాషనే తీసుకోండి. ఇందులో గ్రాంథిక భాష, వాడుక భాషా బేధాలుంటాయి. ఒక భాషను మాట్లాడే ప్రాంతీయుల ఆచార సంప్రదాయాలు వేరే భాష మాట్లాడేవారికి ఉండకపోవచ్చు. అటువంటప్పుడు అనువాదం చేసేవారేంచేయాలి? ఇంగ్లీష్ - భారతీయ భాషల మధ్య అనువాదం జరుగుతున్నప్పుడూ కొన్ని సమస్యలు ఎదురౌతాయి. అనువాదం అంటే ఒక భాషలోని పదాలకు సమానార్థకాలను వెదికి పట్టుకోవడం కాదు కదా! ఒక పదంలో ఇమిడి ఉన్న సాంస్కృతిక విషయాలు వేరు భాష వారికి తెలియకపోతే ఆ సంస్కృతిని కూడా వివరించవలసి వుంది. ఉదాహరణకు కాపు రాజయ్య చిత్రాలు. రాజయ్య ఎక్కువగా తెలంగాణ కార్మిక స్త్రీల బతుకమ్మ ఆట చిత్రాలను విరివిగా వేశారు.
వారి చిత్రాల గురించి తెలుగులో రాయడం వేరు, ఇంగ్లీషులోనో, మరో భాషలోనో రాయడం వేరు. ఇతర భాషల్లో రాయవలసి వచ్చినప్పుడు ముందుగా బతుకమ్మ పండుగ, విశేషాల గురించి వివరించాలి. ఎందుకంటే దసరా పండుగ అందరికీ సర్వ సామాన్యం అయినా, బతుకమ్మ పండుగ తెలంగాణ వారి ఆచారం మాత్రమే. రాజయ్య చిత్రం గూర్చి రాసినప్పుడు ఈ ఆచార వివరణ కూడా ఉండాలి. అంటే అనువాదం అంటే మక్కికి మక్కి అనువాదం కాదు. భావానువాదం కూడా అని అర్థం చేసుకోవాలి.
దృశ్య కళల అనువాదంలో మరికొన్ని చిక్కులున్నాయి. భారత ఆధునిక చిత్రకళలు పాశ్చాత్య కళా సంప్రదాయాలతో ముడిపడి వున్నాయి. ఇన్స్టాలేషన్ అనే చిత్ర, శిల్ప మధ్యంతర కళ ఒకటుంది. అలాంటి సాంకేతిక పదాలను అనువదించాలా లేదా అనేది ప్రశ్నే. మరాఠీ రచయితలు ఈ పదాన్ని 'మండళశిల్పం'గా అనువదించి రాశారట. అయితే ఇందులో నా సందేహం, మండళశిల్పం అని రాస్తే ముందు పాఠకులు ఈ పదానికి అర్థం వెతికినప్పుడు గురి తప్పే అవకాశం ఉంది. మరింత విషయం తెలుసుకోవాలన్న పాఠకులకు మరో చోట ఈ పదం దొరకదు. కొన్ని ఇంగ్లీష్ పదాలు మన భారతీయ భాషల్లోకి వాడుక పదాలుగా చేరినాయి. ట్రెయిన్ అనే పదం ఎంత సులభమో, దాని అనువాదం 'ధూమశకటం' అంతగా వాడుక తప్పిన కష్టమైన పదం. దృశ్య కళారచయితలు, భావ, ఆచార సంస్కృతులు వంటి విషయాలపై కేంద్రీకరించడం సమంజసం. పదాల అనువాదం వలన ఇక్కట్లు పెరిగే అవకాశం ఉన్నప్పుడు సాంకేతిక పదాలు అలాగే వాడటం అవసరం. సంస్కృత మూలం వున్న భారతీయ పదాలను ఇంగ్లీష్లో వ్యాసం రాస్తున్నప్పుడు అలాగే వుంచి రాస్తాం. ఆ పదాల అనువాద పదం వెతకం.
బరోడా ఫైన్ ఆర్ట్స్ ఫాకల్టీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఇంద్ర ప్రమీరారు మాట్లాడుతూ ఇంగ్లీష్లో ఫ్రెంచ్, జర్మన్ దృశ్య కథలకు సంబంధించిన పదాలను అలాగే చేర్చడం వలననే కదా ఇంగ్లీష్ భాషా సంపద అంతగా పెరిగింది అన్నారు.
రవికుమార్ కాశి మాట్లాడుతూ ప్రాంతీయత అనే పదానికి అభ్యంతరం వెలిబుచ్చారు. భారతీయ భాషలు అని పలకడం సమంజసం అని, ప్రాంతీయత అంటే కేంద్రం మరోటి అనే భావన వస్తుందనీ అభిప్రాయం వెలిబుచ్చారు.
దృశ్య కళా రచయితల బాధ్యతల్లో ఒక ముఖ్యమైన బాధ్యత మరుగునపడ్డ కొంతమంది, ముఖ్యమైన కళాకారుల చిత్ర విశిష్టతను, వారి జీవిత చరిత్రలను బయటకు తీసుకురావటం. నందలాల్ బోస్ అనే గొప్ప బెంగాలీ కళాకారుడు ఉండేవాడు. వారికి ఎంతో సాయం చేసిన మరో ఆర్టిస్ట్ వినాయక మాసోజీ. వినాయక గారి శ్రమ, కళా విశిష్టత గురించి ఎక్కడా వినపడదు. ఇలా మరుగున పడ్డ తెలుగు కళాకారులూ ఎంతోమంది వున్నారు. ఆ రోజుల్లో ముంబయి జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్కి వెళ్ళిన తెలుగువారు ముంబయిలో స్థిరపడి తమ కల(ళ)ను సాఫల్యం చేసుకున్నవారికి గుర్తింపు దొరకలేదు. మన హైదరాబాద్ ఫాతిమా అహ్మద్ పేరూ మనం మరుస్తాం. మరుగున పడ్డ పేర్లని చరిత్ర నిర్దాక్షిణ్యంగా మరుస్తుంది.
కపిలాస్ భుయాన్ అనే రచయిత భువనేశ్వర్ నుండి వచ్చారు. వ్యక్తిగతంగా తన అభిప్రాయం కపిల వ్యక్తం చేస్తూ ఈ భారతీయ భాషల రచయితల సమావేశం ఒక గొప్ప ప్రారంభం. ఇందులో భారతీయ భాషా రచనల ప్రాముఖ్యం ఎన్ని విధాల తీసుకురావాల అనే ఆలోచనలు గొప్పదే. కానీ కృష్ణశెట్టిగారు అన్న మాటలు కొంచెం ఆలోచించాలి అన్నారు. కృష్ణశెట్టి మాట్లాడుతూ భారతీయ భాషల రచయితలనే ఇందులో పిలిచాం. ఇంగ్లీష్ రచయితలని దూరం వుంచాం. లేకపోతే వారే పూర్తి అధికార ఆక్రమణ చేస్తారన్నారు. ఇంగ్లీష్ పాన్ఏషియన్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. దాని ప్రాముఖ్యాన్ని తగ్గించటం కంటే భారతీయ భాషల రచనా సంపత్తి పెంచటం ముఖ్యం.
మొత్తం మీద ఈ సమావేశం భారతీయ భాషల్లో ఎక్కడికక్కడ కళా సాహిత్య సృష్టి చేస్తున్న రచయితలకు ఎంతో ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. 'నవతెలంగాణ'లో నేను రాసిన వ్యాసాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందటం నాకెంతో ఆనందంగా ఉంది.
- డా||ఎం.బాలామణి, 81067 13356