Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదయం నుంచి రాత్రి వరకు వేగంగా సాగుతున్న జీవన యానంలో శరీర వ్యాయామానికి చాలా తక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. పని ఒత్తిడి ఎక్కువవుతోంది. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ప్రతి రోజు కనీసం పది వేల అడుగులు వేయాలని నిపుణులు సూచించారు. కానీ మనలో చాలా మంది నడకను మరచిపోయారు. చిన్న చిన్న పనులకు కూడా కార్లను, బైకులను వాడుతున్నారు. పూర్వం వాహనాలు లేని సమయంలో జనం నడక ద్వారానే అన్నీ పనులు చేసుకునే వారు. సహజంగానే శారీరక వ్యాయామం జరిగేది. ప్రజలు ఆరోగ్యంగా ఉండేవారు. శ్రమ లేకపోవడం వేళాపాళాలేని భోజనాలు, పొగతాగడం, మద్యపానం, ఒత్తిళ్లు హృద్రోగాలకు కారణమవుతున్నాయి. ఈ అలవాట్లు ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు మూత్రపిండాల సమస్యలకు దారి తీస్తున్నాయి. అంతిమంగా ఈ పరిణామాలు తమ ప్రతాపాన్ని గుండెపై చూపుతున్నాయి.
హైదరాబాద్ నగరంలోని ఒక కార్పోరేట్ ఆసుపత్రికి గత 20 సంవత్సరాలుగా చికిత్స కోసం వచ్చిన సుమారు 11వేల మంది హృద్రోగులను పరిశీలించారు. వీరిలో ఎక్కువ మంది వివిధ కారణాలతో గుండె జబ్బుల బారిన పడినట్లు గుర్తించారు. గతంతో పోలిస్తే, ప్రజలు వివిధ కారణాల వల్ల విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సరైన ప్రణాళిక లేని వృత్తి, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడితో సతమతమవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొన్ని రకాల ఉద్యోగాల్లో టార్గెట్లు నిర్ణయిస్తారు. వాటిని పూర్తి చేసేందుకు రెస్ట్లెస్గా పని చేయాల్సిందే. ఈ క్రమంలో చాలా మంది శారీరక శ్రమను నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాంటి వారు సమయానికి భోజనం తీసుకోవడంలేదు. కొంతమంది జంక్ఫుడ్కు అలవాటుపడుతున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇందువల్ల చిన్నతనంలోనే హృద్రోగ ముప్పు తలెత్తుతోంది. విపరీతమైన ఒత్తిడి కారణంగా ఎక్కువ మంది మధుమేహ బాధితులుగా మారుతున్నారు. కొన్ని రకాల వృత్తుల్లో ఒత్తిడితో పాటు రాత్రి పూట విధులు నిర్వహించాల్సి రావడం పలు అనారోగ్యాలకు కారణమవుతోంది.
భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే వంట చేసుకునేందుకు సమయం లభించక వారంలో నాలుగైదు రోజులు హోటల్ తిండికి అలవాటు పడుతున్నారు. రెస్టారెంట్లలో రుచికోసం అధిక మసాలలు, నూనెలు వాడుతుంటారు. తరచూ అలాంటి వాటిని భుజించడం వల్ల అధిక కేలరీలు శరీరంలోకి చేరతాయి. ఆ కేలరీలను కరిగించుకోలేక, దానికి తగినట్లుగా వ్యాయామం లేక అనేక మంది వ్యక్తులు ఊబకాయులుగా మారుతున్నారు.
గుండె జబ్బులు పెరుగుతున్న కారణంగా కష్టమైనా సరే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని వాటిని తూచ తప్పక పాటించాలి. ముఖ్యంగా జీవన శైలిని మార్చుకోవడం ద్వారా చాలా వరకు ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చునని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కనీసం వారంలో ఐదు రోజులైనా వేగంగా నడవాలి. అంతేకాకుండా ఈత, స్కిప్పింగ్, షటిల్ లాంటి వ్యాయామాలు చేయాలి. శరీరానికి చెమట పట్టేదాకా వ్యాయామం చేయడం అవసరం. వేల రూపాయలు చెల్లించి జిమ్లకు వెళ్లవల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం కొనసాగించాలి. వ్యాయామం చేయడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. తద్వారా ఒత్తిడి తగ్గడంతో పాటు మధుమేహం, అధిక రక్తపోటు మొదలగు సమస్యలు అదుపులో ఉంటాయి. ప్రధానంగా పీచుపదార్థాలు ఎక్కువ ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఉండాలి. తృణ ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మద్యపానం, ధూమపానం అలవాట్లకు దూరంగా ఉండాలి. మద్యం తీసుకునే సమయంలో మనకు తెలియకుండానే ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటాం. అది కచ్చితంగా ఊబకాయానికి దారితీస్తుంది. అంతే కాకుండా అది కాలేయంలో ఇతర శరీర భాగాల్లో కొవ్వుగా పేరుకుంటుంది.
ప్రతి ఒక్కరూ ఇంటి భోజనానికే ప్రథమ ప్రాధాన్యతనివ్వాలి. ఆహారంలో గుడ్లు, పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు, చేపలు, ఇతర పదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి. ప్రతిరోజూ 400 గ్రాములకు తక్కువ కాకుండా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తప్పకుండా తీసుకోవాలి. పిల్లలకు క్రీడలు అలవాటు చేయించాలి. మంచి ఆహారపు అలవాట్లు నేర్పించాలి. ప్రతి వ్యక్తి 30 ఏండ్లు దాటిన తరువాత సంవత్సరానికి రెండు పర్యాయాలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. రక్తపోటు, మధుమేహం లక్షణాలు త్వరగా బయటపడవని, అవి నిశబ్దంగా మనిషికి హాని చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అత్యుత్తమ జీవన శైలిని పాటించే నగరంగా డెన్మార్క్ రాజధాని కోపెన్హెగన్కు ప్రపంచంలోనే పేరుంది. ఆ నగరాన్ని పర్యావరణ అనుకూల సిటీగా పరిగణిస్తారు. ఆ నగరంలో 50 శాతం మంది ప్రజలు సైకిల్ ఉపయోగిస్తారు. ప్రజల్లో ఈ అలవాటును ప్రోత్సహించేందుకు ఆ దేశ ప్రభుత్వం సంవత్సరానికి 400 పర్యాయాలు సైకిల్ రేసులు నిర్వహిస్తుంది. మనపాలకులు ఆ నగరాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. మన ప్రభుత్వం కూడా సైకిల్సవారీని ప్రోత్సహించాలి. తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం కల్పించాలి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మాత్రమే మానసిక వికాసాన్ని పొందగలుగుతాడు. తద్వారా తనను తాను కాపాడుకుంటూనే సమాజానికి ఉపయోగపడతాడు.
- జి గంగాధర్ సిర్ప, 9010330529