Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుబ్బలక్ష్మి పిల్లల్ని స్కూలుకి పంపి, తను లంచ్బాక్స్ తీసుకుని బయల్దేరి వెళ్తోంది. అత్త తులసికి కోడలు సుబ్బలక్ష్మికి సయోధ్య లేదు. అయోధ్యే. మౌనంగా ఎవరి పని వారు చేసుకుంటూ పోతారు. ఇద్దరి మధ్య మాటలు తక్కువ. మాటకు మాట తెగులని ఇద్దర్నీ మాటలు తగ్గించమని వెంకటస్వామి తల్లిని, భార్యని హెచ్చరించాడు. సుబ్బలక్ష్మి కొంతకాలం జిన్నింగ్ మిల్లులో పని చేసింది. దుమ్ము, ధూళిలో దగ్గు మొదలైందని, ఆరోగ్యం బాగాలేదని మానేసింది. ఇప్పుడు మళ్ళీ ఏదైనా కొత్త ఉద్యోగం చేస్తున్నదేమోనని తులసికి సందేహం కలిగింది. లేకపోతే లంచ్బాక్స్ తీసుకుని పొద్దున్నే వెళ్లవలసిన పనేముంది? కోడలే చెప్తుందని నాలుగు రోజులు వూరుకుంది. సుబ్బలక్ష్మి పెదవి విప్పడం లేదు. తులసికి కడుపు వుబ్బిపోతోంది. ఇక ఆగలేక కోడల్ని అడిగింది.
''సుబ్బూ! లంచ్బాక్స్ తీసుకుని రోజూ ఎక్కడికే వెళ్తున్నావ్? ఏదైనా వుద్యోగం చేస్తున్నావా?''
''ఉద్యోగమా నా ముహమా? రోజూ కొత్త నోట్ల కోసం వెళ్తున్నాను. ఎక్కడ ఎ.టి.ఎం.లో డబ్బులున్నాయో తెలుసుకుని వెళ్ళి క్యూలో నిల్చోవాలి. కిలోమీటర్ల పొడవుంటుంది క్యూ. గంటల తరబడి, కాళ్ళు వాచిపోయేట్టు నిలబడితే ముష్టి రెండువేల నోట్లు రెండు వస్తున్నాయి. ఒక్కోసారి మధ్యలో మిషన్లో నోట్లు ఖాళీ అవుతాయి. అందులో మళ్ళీ నోట్లు పెట్టేవరకు పడిగాపులు కాయాలి'' చెప్పింది సుబ్బలక్ష్మి.
''అంత కష్టపడాల్సిన అవసరం ఏవుందే నీకు? అబ్బాయి ఇంటికి కావల్సిన ఉప్పు, పప్పులు, బియ్యం అన్నీ తెచ్చి పడేస్తున్నాడుగా? పొద్దుననగా పోయి క్యూలో నిలబడి, అక్కడే తింటూ ఈ పడిగాపులెందుకూ? ఇంకా నువ్వేదో ఉద్యోగం వెలగబెడుతున్నావనుకున్నాను'' నిష్టూరంగా అన్నది తులసి.
సుబ్బలక్ష్మికి కోపం వచ్చింది. 'నేను క్యూలో నిలబడితే, నీ కాళ్ళకి నొప్పులొస్తాయా?' అని అనాలనుకుంది. కానీ భర్త మాటలు గుర్తొచ్చాయి. మాటకు మాట తెగులు. తను రెండంటే, అత్త నాలుగంటుంది. ఎందుకొచ్చిన గొడవ అనుకుంది.
''డబ్బు అవసరం ఉందిలే!'' అన్నది సుబ్బలక్ష్మి.
ననన
వెంకటస్వామి వారం రోజులు తను పని చేస్తున్న ఇంజనీర్ వెంట కేంప్కి వెళ్ళి తిరిగి వచ్చాడు. అతను అటెండర్. ఇంజనీర్ గారు ఎక్కడికెళ్ళినా తనకు సహాయంగా వెంకటస్వామిని తీసుకెళ్తుంటాడు.
భర్త స్నానం చేసి సేద తీర్చుకుని రాగానే గులాబ్జామ్ స్వీట్ వున్న బౌల్ తెచ్చి అందించింది సుబ్బలక్ష్మి.
''ఏంటే స్వీట్ చేశావు? ఏంటి సంగతి?'' అని నవ్వుతూ ప్రశ్నించాడు వెంకటస్వామి.
''ఇదుగో ఇటు చూడు..!'' అని రెండు చేతులు ఎత్తి చూపించింది.
సుబ్బలక్ష్మి రెండు చేతులకు రెండేసి బంగారు గాజులు తళతళ మెరుస్తూ కనిపించాయి. వెంకటస్వామి ముఖం సీరియస్గా మారిపోయింది.
''ఎక్కడివే గాజులు?''
''కొన్నాను''
''డబ్బులు ఎక్కడివి?''
''నావే! బ్యాంకులో వున్నవి తీసుకున్నాను'' సంబరంగా చెప్పింది.
అంతే! వెంకటస్వామి ముఖం కోపంతో ఎర్రబడింది. ఆగ్రహంతో ఊగిపోయాడు.
''బ్యాంక్లో నీ ఖాతాలో వేసిన డబ్బు నీ సొంతం అనుకున్నావంటే? నీ తాత ముల్లె అనుకున్నావా?'' అంటూ సుబ్బలక్ష్మిని చితకబాదాడు.
''మీ అమ్మకు రోగం వచ్చినప్పుడు ఆసుపత్రిలో కట్టడానికి నా బంగారు గాజులు అమ్ముకున్నావు. ఇంత కాలానికి డబ్బు తెచ్చిస్తే బ్యాంకులో వెయ్యమంటే సంబరపడ్డాను. నా ఖాతాలో డబ్బు నాది కాదా?'' అంటూ ఏడుస్తూ, మొత్తుకుంటూ సుబ్బలక్ష్మి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది.
ననన
సుబ్బలక్ష్మి అన్న రాజన్న హెడ్కానిస్టేబుల్. అతనికి కోపం వచ్చి బావ మీద పోలీస్ కంప్లైంట్ యిచ్చాడు. ఎస్సై వెంకటస్వామిని పిలిపించి విచారణ చేశాడు.
''ఆ డబ్బు నాది కాదు సార్! మా ఇంజనీర్సార్ది! ఐదొందలు, వెయ్యి నోట్లు రెండు లక్షలు ఇచ్చి, నీ భార్య జన్ధన్ ఖాతాలో వేయించు. తర్వాత ఎప్పుడో తీసుకుంటాలే. అప్పుడొక పదివేలు నీకు ఇస్తాను అన్నాడు సార్! అందుకని...'' అని నీళ్ళు నమిలాడు.
బ్లాక్మనీ తన దగ్గర పని చేస్తున్న వుద్యోగుల భార్యల జన్ధన్ ఖాతాల్లో వేయించిన ఇంజనీర్ గారి గుట్టు రట్టయింది.
ఆ ఇంజనీర్ సస్పెండయ్యాడు. దొరికాడు కాబట్టి దొంగయ్యాడు. దొరకని దొంగలు ఎందరో?!
- సిహెచ్.శివరామ ప్రసాద్