Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళ ఎంత ప్రాంతీయ మయితే అంత అసలుదవుతుంది వ్యక్తీకరణ ఎంత అంతర్ముఖీనమయితే అంతగా స్వచ్ఛమవుతుంది (ముక్తకం) ఇది సరిగ్గా ఈశాన్య భారత రాష్ట్రాల సాహిత్యానికీ, సినిమాకూ, సంగీతానికీ అన్ని కళాత్మక రూపాలకూ వర్తిస్తుంది. అక్కడింకా ఇప్పటికీ సహజ సిద్ధమయిన అనుభవాలూ, వ్యక్తీకరణలూ మిగిలి వున్నాయి. అందుకే అక్కడి సాహిత్యం గొప్ప భావ స్పోరకంగా వుంటున్నది. సంగీతమూ సినిమా కూడా అంతే గొప్పగా కొనసాగుతున్నది. నదీనదాలూ, పర్వతాలతో స్వచ్ఛమయిన వాతావరణంతో తుల తూగే ఈశాన్య భారతంలో ప్రధాన రాష్ట్రం అస్సాం. అక్కడినుంచి వచ్చిన సాహిత్యం, సంగీతం, సినిమా వంటి అన్ని కళలూ అత్యంత ప్రాంతీయమై ఎలాంటి అనుకరణలు లేకుండా చాలా వరకు ఆసలయిన కళారూపాలుగా వుంటున్నాయి.
ఈశాన్య భారతం అత్యంత ప్రాచీనమయిన సంస్కృతికి పతిరూపం. 200కు పై చిలుకు జాతుల సమాహారమయి దాదాపు ప్రతి జాతీ తమదయిన విశిష్ట భాషా సంస్కృతుల్ని కలిగి వుంది. అందులోనూ ఉమ్మడి అస్సామ్ రాష్ట్రంగా వున్నప్పటినుండీ అస్సాం భాషా సాహిత్య, సినిమా రంగాల్లో జాతీయ అంతర్జాతీయ దృష్టినీ ఆకర్షించింది. భూపేన్ హజారికా, బబేంద్రనాథ్ సైకియా లాంటి అనేక మంది సంగీతకారులు, రచయితలూ తమ తమ సృజనాత్మక రంగాలతో పాటు, అస్సామీ సినిమా రంగంలో కూడా విశేషంగా కృషి చేసి అస్సామీ సినిమాను నిలబెట్టారు.
అస్సామీ సినిమా జాలీ వుడ్ (జీఉూూ్ఔఉఉణ) గా పిలవబడుతున్నది. ప్రగతిశీల భావాలు కలిగిన జ్యోతి ప్రసాద్ అగర్వాల్ 1926 లో యూరోప్ వెళ్ళి అక్కడి సాహిత్యాన్ని, సంస్కృతిని, సంగీతాన్ని, పెయింటింగ్ని అధ్యయనం చేయడంతో పాటు జర్మనీలో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాడు. ముఖ్యంగా ఇజెన్ స్టీన్, కులేసోవ్, పుడోవ్ కిన్ లాంటి మాస్టర్ ఫిల్మ్ మేకర్స్ తో సన్నిహితత్వం ఏర్పర్చుకుని వాస్తవిక ఆధునిక సినిమాల పోకడల్ని అందిపుచ్చుకున్నాడు. తిరిగి వచ్చింతర్వాత సామ్యవాద వాస్తవిక భావనలతో 'జోరు మతి' అనే అసామీ సినిమా నిర్మించాడు. అప్పటికి అస్సాం లో సినిమా నిర్మాణానికి సబంధించి మెళకువలు తెలిసిన వాళ్ళు లేకపోవడంతో తానే అన్నీ అయి 50-60 వేల రూపాయలతో జోరు మతి తీసాడు జ్యోతీ ప్రసాద్. కానీ అది ఆర్థికంగా తీవ్ర నష్టాల్ని కలిగించింది. అయినా ఆయన సినిమా రంగాన్ని వదలకుండా 1937-38 ల మధ్య తన రెండవ సినిమా ఇంద్రమతి తీశాడు అది కొంత ఆర్థికంగా ఆదుకుంది. సరిగ్గా అదే సనయంలో పరమతేష్ బారువా 'దేవదాస్' అస్సామీలో విడుదల చేశాడు.
జ్యోతి ప్రసాద్ అకస్మాత్తుగా తనువు చాలించడంతో అస్సామీ సినిమాకు కొన్ని సంవత్సరాలు విరామమొచ్చింది. 1941లో చరిత్రాత్మక ఇతివృత్తంతో పర్బతీ ప్రసాద్ బారువా తీసిన 'మనోమతీ' విడుల అయింది. తర్వాత అదే ఒరవడిలో 'రూపాహీ', 'బదన్ బరౌసే', 'సిరాజ్', బిప్లోబి లాంటి పలు సినిమాలు వచ్చాయి. 1950 లో ఫణి శర్మ రూపొందించిన ' పియాలి ఫుకన్' తో అస్సామీ సినిమా ఒక మలుపును తీసుకుంది. ఆ సినిమాకు భూపేన్ హజారికా సంగీత దర్శకత్వం వహించాడు. ఇది జాతీయ అవార్డును అందుకున్న మొదటి అసామీ సినిమాగా నిలిచింది.
తర్వాత అస్సాంలో దర్శకుడు నిప్ బారువాది ప్రముఖ స్థానం. 'స్మృతిర్ పరాష్', 'మాక్ అరు మోరోమ్', రొంగా పోలీస్ లాంటి సినిమాలు తీశాడు.
అప్పటికే సంగీతకారుడిగా విశేష ప్రతిభను, ప్రాచుర్యాన్ని పొందిన భూపేన్ హజారికా తన దృష్టిని సినిమాల వైపు మరల్చాడు. మొదటి సినిమాగా 'ఏరా బతోర్ సుర్' రూపొందించాడు. తర్వాత భూపేన్ 1961లో కొంత కలర్లో 'శకుంతల' నిర్మించాడు. విలక్షణమయిన సినిమా పేరుగడించిన ఆ సినిమా రాష్ట్రపతి సిల్వర్ మెడల్ అందుకుంది. ఆయన ప్రతిధ్వని, సిరాజ్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు, 'రుడాలి'తో సహా అనేక సినిమాలకు సంగీతం, నేపథ్యగానాన్ని కూడా సమకూర్చి కేంద్ర సంగీత నాటక అకాడెమీ, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మవిభూషణ్ లాంటి అనేక పురస్కారాలు అందుకున్నాడు. గానంలో సంగీతంలో ఆయన అంతర్జాతీయ కళాకారుడు. 1959లోనే ప్రభాత్ ముఖర్జీ తీసిన 'పుబెరున'్ 'బెర్లిన్' చిత్రోత్సవంలో పాల్గొంది.
'మోరోమ్ తృష్ణ', 'చమేలి మెంసాబ్' లాంటి సినిమాలు రూపొందించిన అబ్దుల్ మజీద్ అస్సామ్ నుంచి వచ్చిన మంచి దర్శకుల్లో ఒకడుగా చెప్పుకోవచ్చు. పడుం బారువా 'గంగా సిలోనిర్ పాఖి' లాంటి సినిమాలతో అస్సామ్లో సమాంతర సినిమాకు దారి ఏర్పరచాడు. అసామీ సినిమా రంగానికి భూపేన్ హజారికా తర్వాత జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెరునూ, గుర్తింపునూ తెచ్చిన వారు బబేంద్రనాథ్ సైకియా, జానూ బారువాలు. బబేంద్రనాథ్ సైకియా అస్సామ్ సాహితీ ప్రపంచంలో ప్రముఖుడయిన రచయిత. ఆయన సంధ్యారాగ్, అగ్నిస్నాన్, కోలాహల్, సరోతి, అబర్థ, ఇతిహాస్ మొదలయిన సినిమాలు తీయగా అవన్నీ జాతీయ స్థాయిలో రాష్ట్రపతి అవార్డులు అందుకున్నాయి. రచయితగా 3 నవలలు, 11కథాసంపుటాలు, 28 నాటకాలు, అనేక పిల్లల పుస్తకాలు రాశారు. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందిన జానుబారువా అపురూప, పాపోరి, హాలోదియా..., బోనాని, ఫిరింగోటి లాంటి 12 సినిమాలకు పైగా తీసి అస్సామీ సినిమాకు గొప్ప గుర్తింపును తీసుకొచ్చాడు. తర్వాత మంజు బోరా, సంత్వానా బొర్డోలోయి, బిద్యుత్ చక్రవర్తి, గౌతమ్ బొర లాంటి అనేక మంది అసామీ సినిమాను ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా మంజు బోరా భైభవ్ సినిమాతో తన ప్రస్థానాన్ని ఆరంభించింది. ఇంకా ఆమె 'ఆకాశీథోర్ కతారే' లాంటి అనేక సినిమాలతో పాటు బోడో భాషలో తీసిన ' కొ- యాద్' అత్యుత్తమ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇటీవల అస్సామీ దర్శకురాలు రీమాదాస్ రచించి, దర్శకత్వం వహించిన సినిమా '' విలేజ్ రాక్ స్టార్స్ '' ఇటీవల హైదరబాద్లో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ఆసియా విభాగంలో దర్శకత్వ అవార్డుతో పాటు మరో రెండు అవార్డులు కూడా గెలుచుకుంది. '' విలేజ్ రాక్ స్టార్స్ '' సహజంగానూ, గ్రామీణ వాతావరణ నేపథ్యంలోనూ చిత్రితమయింది. ఆసామ్ జనజీవన సజీవ దృశ్యంలా సాగుతుంది.
అయితే అస్సామీ సినిమా ప్రస్థానం అంతా సజావుగానూ, సానుకూలంగానూ ఏమి కొనసాగలేదు. తొలి నాళ్ళల్లో కనీసం షూటింగునకు అనువయిన స్టూడియోలు కూడా లేక పోవడంతో కలకత్తాను కేంద్రంగా చేసుకొని సినిమాలు తీశారు. ఇక ప్రదర్శన విషయానికి వస్తే హిందీ సినిమాల తాకిడి అధికంగా వుండి స్థానిక సినిమాకు స్థానం కష్టంగా దొరికేది. పర్యవసానంగా భాషా సంస్కృతులు కూడా ప్రభావితం అవసాగాయి. ఈ నేపధ్యంలో 1979 నుండి 1985 దాకా అస్సాం వుద్యమం, తర్వాత పెరిగిన ఉల్ఫా ఉద్యమాలు బాలీవుడ్ సినిమాలను ప్రదర్శించరాదని, వాటి పంపిణీ దారులకు ఆదేశాలివ్వడంతో వాళ్ళు నిలిపివేశారు. ఫలితంగా సినిమా హాళ్లు మూత బడ్డాయి. 15ఏళ్ల పాటు అస్సామీ సినిమాలు తీసే వాతావరణం ఆ రాష్ట్రంలో కొరవడింది. 1995లో అశోక్ కుమార్ భీష్మ తీసిన ' జౌబనీ ఆమోనీ కరే ' తో అక్కడ తిరిగి సినిమా నిలదొక్కుకుంది. తర్వాత కొత్త తరం క్రమంగా సినిమా రంగం లోకి రావడం ఆరంభించింది. అయినా డివిడి, ఇంటర్నెట్ లాంటి వాటి వల్ల అస్సామీ సినిమా తీవ్రమయిన ఆటు పోట్లను ఎదుర్కొంటూనే వుంది.
ఇక అసామీ సినిమాని ప్రోత్సహించేందుకు జాతీయ అవార్డులతో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా అస్సాం స్టేట్ అవార్డులు ఇస్తున్నారు. 2015 నుంచి ఫ్రాగ్ న్యూస్ సంస్థ ఏటా ఫ్రాగ్ సినీ అవార్డుల్ని ఇస్తున్నది. బ్రహ్మపుత్ర వాలీ ఫిల్మ్ ఫెస్టివల్ పేర ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఫిల్మ్ సొసైటీలు కూడా తమ వంతు పాత్రను పోషిస్తూనే వున్నాయి.
అదుÄ్భతమైన సాహితీ సాంస్కృతిక వాతావరణం వున్న అస్సాం లోని ఈశాన్య భారత్ లోని సినిమా రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే గొప్ప సినిమాలు వచ్చి భారతీయ సినిమా యవనిక పైన వెలుగొందుతాయి ప్రపంచ వ్యాప్తంగా వన్నె తెస్తాయి.
- వారాల ఆనంద్, 9440501281