Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిత్వప్రక్రియపై విపులంగా, విశ్లేషణాత్మకంగా వ్యాసాలు రాస్తున్న ఎం.నారాయణశర్మ పుస్తకం 'వ్యక్తీకరణ'. దీనిలో 19 వ్యాసాలున్నాయి. సమకాలీన కవిత్వంలోని అభివ్యక్తి ధోరణుల గురించిన ప్రారంభ వ్యాసం 'అభివ్యక్తి' అన్న భావనపై అవగాహన కల్పిస్తుంది. వస్తువు కన్నా కవితాభివ్యక్తి, నిర్మాణం, శైలీ, శిల్పపరమైన అంశాల గురించి విశ్లేషించడం నారాయణశర్మ ప్రత్యేకత. కవిత ఇతివృత్తం ఏమిటో చదివే పాఠకులు నిర్ణయించుకోగలరు. కానీ ఎంచుకున్న ఇతివృత్తాన్ని కళాత్మకంగా వ్యక్తం చేయడంలో కవి సాఫల్యవైఫల్యాల గురించి ఈ రచయిత విశ్లేషిస్తాడు. తెలుగునాట విమర్శకులంతా వస్తువు చుట్టూరానే తిరుగుతారు. కళాత్మక అంశాల్ని విశ్లేషించే సామర్థ్యం లేకనే వారు వస్తువుకు పరిమితమవుతారు. అయితే విమర్శనా పరికరాలపై అవగాహన ఉన్న శర్మ మాత్రం వస్తువు కవిత్వంగా రూపొందిన తీరులోని కళారీతుల్ని బాగా చెబుతారు. నిజానికి కవిత్వ పాఠకునికి కావలసింది ఇదే. గతంలో చేరాతల శీర్షికన చేరా ఈ పనిచేశారు. ఈ కాలంలో నారాయణశర్మ దీనిని మరింత విపులంగా, తులనాత్మకంగా చేయడం చెప్పుకోదగింది.
ఇందులో కొత్తపలక, గాజునది, లోపలిస్వరం, చూస్తుండగానే, మునుం, మట్టి నా ఆలాపన, దూప మొదలైన పుస్తకాల మీద చేసిన విశ్లేషణలు ఆ కవితా సంపుటాల విలక్షణతని చెబుతాయి. 'వర్తమాన స్పర్శతో నాలుగు దీర్ఘకవితలు' వ్యాసం దీర్ఘకవితలు రాసేవారు తప్పక చదవాలి. దీర్ఘకవిత రాసే వారికి వస్తు నిర్వహణ సామర్థ్యం ఉండడంతోపాటు, కవితాత్మక కొనసాగింపునకు అవసరమైన ఊహాశాలిత, మరింత అవసరమని చెబుతుంది. కవిత్వవిమర్శలోని గాఢతనీ, విస్తృతినీ ఆకళింపు చేసుకోడానికి అనువైన వ్యాసాల పరంపర ఇది. అలాగే కవిత్వం కళాత్మకతను సంతరించుకునే ప్రక్రియను తెలుసుకోడానికి సైతం ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.
- శశాంక
తరతరాలు నిలిచే కథలు
వాసికీ, రాశికీ సమన్యాయం చేకూర్చుతూ, కథా సాహిత్య కేదారాల్ని సస్యశ్యామలం చేస్తున్న సమకాలీన రచయిత్రుల్లో శ్రీమతి కన్నెగంటి అనసూయగారు ముందు వరుసలో వుంటారు.
ప్రస్తుత కథా సంపుటి 'ఆవిడెవరు?' లో 15 కథానికలున్నాయి. ప్రపంచీకరణ వల్ల మానవ సంబంధాలు ఎలా ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయో, వీటి వల్ల మానవత్వం, మనిషితనం ఎలా విధ్వంసమవుతున్నాయో ఈ కథానికల్లో వివరించారు. అలా వివరిస్తూ, మనిషిని మనిషిగా ప్రేమించాలని ఉద్భోదిస్తున్నారు. ఇవన్నీ తన అనుభవంలోకి వచ్చిన తనకెంతో నచ్చిన కథలుగా చెప్పారు.
కథల నిండా కరుణరసం, మానవత్వం, మంచితనం చిప్పిలుతాయి. కరుణ రసమే కాదు, హాస్యరసం కూడా ఒలికించగలనంటూ ఇచ్చిన 'రామరాజ భూషణమే...!' సాక్షి! సమాజంలో ఇంకా మిగిలి వున్న మంచితనాన్ని గుర్తించి చిత్రించిన ఈ రచయిత్రిని చదివాక అభినందించకుండా వుండలేం. తప్పక చదవాల్సిన కథానికల సంపుటి ఇది.
- కూర చిదంబరం, 8639338675