Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దక్కను భూభాగం విదేశీయులు, ఉత్తర భారతీయులు, చుట్టుపక్కల ఉన్న ఇతర భూభాగాలతో అసఫ్జాహీల కాలంలో గాఢమైన సంబంధాలను కలిగి ఉంది. దాదాపు ఆరువందల ఏండ్ల క్రితమే వ్యవసాయం చేయడానికి వేరే ప్రాంతాల వారు ప్రవేశించి ఇక్కడ పశుపాలన వృత్తిగా కలిగినవారితో కలిసిపోయారు. కొన్ని చోట్ల స్థానికులను తొలగించి వీరే వ్యవసాయ భూములను సాగులోకి తెచ్చారు. 15వ శతాబ్దం నాటికి పర్షియా (ఇరాన్)తో వాణిజ్య సంబంధాలు మెరుగు పరచుకోవడం ద్వారా ప్రపంచ వాణిజ్యంలో దక్కన్ కూడా భాగం పంచుకుంది. రెండువందల ఏండ్లు గడిచేటప్పటికి సైనిక బానిసత్వ వ్యవస్థ ఏర్పడి నిలదొక్కుకోవడానికి అరేబియా సముద్రం ద్వారా సాగించిన వ్యాపార వాణిజ్యాలు దోహదం చేశాయి. దక్కన్ సుల్తానుల రాజకీయ వ్యవస్థలో సైనిక బానిసత్వం బలపడటానికి ఆఫ్రికా నుంచి నల్లజాతి ప్రజల దిగుమతి ఒక ప్రధాన కారణం. ఈ సామాజిక ఆర్థిక పరిణామాలు ఆ తరువాత దక్కన్లో కొత్త సామాజిక స్వరూపానికి తెరలేపాయి. దక్కన్లో ఉన్న విభిన్న జాతులు, ప్రజలు, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం భారత దేశంలో మరెక్కడా కనిపించదు. అరబ్బులు, పఠాన్లు, బలూచీలు, ఇరానీలు, ఆఫ్ఘన్లు, రొహిల్లాలు, తార్ తార్లు, బెంగాలీలు, మద్రాసీలు, మార్వాడీలు, యూరోపియన్లు, ఆంగ్లో ఇండియన్లు, కోమట్లు, కాయస్థులు, బ్రాహ్మణులు, సింధీలు, పార్శీలు, భారతీయ క్రైస్తవులు, ఖోజాలు, మెమన్లు, సిద్ధీలు, మరాఠాలు, అగరాళ్లు... ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో భిన్నత్వం ఇక్కడ స్థిరపడినవారిలో కనిపిస్తుంది.
కుతుబ్షాహీల తరువాత మొగల్ పాలనలోకి వచ్చింది దక్కన్ ప్రాంతం. మీర్ కమ్రుద్దీన్ అనేవాడు అసఫ్జా అన్న బిరుదు ధరించి మొగలాయీ పాలనలో ఉన్న దక్కన్ సుబాకు సుబేదారయ్యాడు. తరువాత కొద్ది కాలం మొగల్ చక్రవర్తి ముహమ్మద్షాకి వజీరుగా పనిచేసి 1723లో స్వతంత్ర రాజ్యం స్థాపించే ఉద్దేశంతో దక్కన్ తిరిగి వచ్చాడు. ఆ మరుసటి ఏడాదే హైదరాబాదు రాజ్యాన్ని స్థాపించాడు. ఇతడ్నే మొదటి నిజాం ఉల్ముల్క్ అసఫ్జా అంటారు. ఇతడు ప్రాథమికంగా దక్కన్లోని ఖాండేశ్, ఔరంగాబాద్, బీరార్, బీదర్, బీజాపూర్, హైదరాబాద్ (గోల్కొండ) అనే ఆరు సుబాలకు సుబేదారు. మొగల్ చక్రవర్తి తరఫున అతడు ఆర్కాట్, కర్నూల్, చికాకోలు సహా అనేక సామంత రాజులపై అధికారం చెలాయించాడు. మైసూర్, తిరువాన్కూర్ రాజ్యాలపై కూడా ఒక విధమైన సార్వభౌమత్వాన్ని నెరపాడు. దీనికి అదనంగా ప్రాచీనమైన వనపర్తి, గద్వాల, షోరాపూర్, జటప్రోలు, ఆనెగొంది, అమరచింత వంటి సంస్థానాలు కూడా అసఫ్ జాహీ రాజ్యంలో భాగమయ్యాయి. 1724 నుంచి 1948 వరకు ఏడు తరాలు అసఫ్ జాహీ (నిజాం)లు అధికారాన్ని కొనసాగించారు.
బ్రిటీష్ ఇండియాలో ప్రాచీన సంస్థానంగా 21 తుపాకుల వందన గౌరవాన్ని పొందింది హైదరాబాద్ సంస్థానం. భాషా వైవిధ్యం, పరిమాణం, సంస్కృతీవైవిధ్యాలతోఅసఫ్జాహీల పాలనలో హైదరాబాదు దేశవ్యాప్త ప్రాధాన్యాన్ని సంతరించుకొంది. పర్షియా పద్ధతిని అనుసరించే రాచరిక వ్యవస్థ కాబట్టి రాజు సర్వాధికారి. అధికారం వంశపారంపర్యంగా లభిస్తుంది. నిజాం ముందు సిజ్జా (సాష్టాంగ నమస్కారం) ఆచరించాలి. అన్ని అధికారాలు రాజువే. మొదటి అసఫ్ జా దక్కన్లో మొగల్ సంస్కృతిని ప్రవేశపెట్టినా అది ఎక్కువ కాలం మనలేకపోయింది. మారుతున్న సమాజావసరాలను బట్టి అది మారుతూ వచ్చింది. మరాఠాల ప్రభావం దక్కన్ సంస్కృతిపై బాగా పడింది.
నిజాం రాజులు సిద్ధాంత రిత్యా షరియాకు బద్ధులు. కాని వాస్తవానికి వారు తమ నిరంకుశ అధికారానికి ఎటువంటి పరిమితులు ఇష్టపడలేదు. కాజీల పాత్ర ముస్లింల పౌర స్మృతి అమలుకే తప్ప మొత్తంగా ఇస్లామిక్ చట్టాల అమలుకు కాదు. హైదరాబాదు సంస్కృతి ముఖ్యంగా ఇండో ముస్లిం సంస్కృతి. తమ వ్యక్తిగత మత విశ్వాసాలు, మతాచారాలు ఎట్లా ఉన్నా అస్ జాహీ రాజ్యంలో నివసించే ప్రజలు.. ముఖ్యంగా హైదరాబాదు పౌరులు ఒక ఉమ్మడి సంస్కృతిని రూపొందించుకున్నారు. భిన్న మతాలు, భాషలు, ప్రాంతాలకు చెందిన వారు రోజువారీ జీవితంలోను, ప్రత్యేక సందర్భాల్లోను ఒక ప్రజా సంస్కృతిలో భాగమయ్యారు. హైదరాబాదు నివాసులు స్థానిక మూలాలు కలిగినవారు, తురుష్కులైనా, పర్షియన్లయినా, పఠాన్తు, అరబ్బులు, సిద్ధీలు, కాయస్థులు, ఖత్రీలు, మరాఠా బ్రాహ్మణులు, రెడ్లు, ముదలియార్లు... ఎవరైనా సరే రాజ్య ఆర్థిక కార్యకలాపాల్లో ముఖ్య పాత్ర పోషించారు.
ఉన్నత వర్గీయులు
మొగలులు, మరాఠాలు, మొదటి దక్కన్ ముస్లిం రాజ్యాలకు చెందిన ఉన్నతవర్గీయులను కులీనవర్గంగా చెప్పవచ్చు. నిజాంలు వీరికి సైనికపరమైన బాధ్యతలు అప్పగించారు. వీరికి మున్సబ్లు, జాగీర్లు, బిరుదులు ఇచ్చారు. జగీర్లు వ్యక్తులకు శాశ్వత ఆదాయాన్ని, హైదరాబాదులో నెలవును ఏర్పరచాయి. మున్సబ్లు ఇవ్వడంలో క్రమపద్ధతిని అనుసరించలేదు. కులీనుల హోదాను బట్టి మున్సబ్లు ఇవ్వడం ఉండేది. కులీనుణ్ణి గుర్తించడానికి అతడు చేసే పాలనాపరమైన లేక సైనికపరమైన సేవని ప్రాతిపదికగా తీసుకుంటారు. అట్లాగే అతడికి నిజాంతో ఉన్న అనుబంధం, దర్బారు ఉత్సవాల్లో పాల్గొనడం, నిజాం ఇచ్చే వ్యక్తిగత గౌరవాలు కూడా కులీన హోదా నిర్ణయంలో పరిగణన లోనికి వస్తాయి.' పైగా' కుటుంబం భారతీయ మూలాలు కలిగిన ముస్లిం కులీన కుటుంబం. నిజాం, అతడి కుటుంబం తరువాత హోదా వీళ్లదే. నిజాం కోసం పెద్ద సంఖ్యలో సైన్యాన్ని నిర్వహించడం వీరి బాధ్యత. మొదటి అసఫ్ జా కాలంలో ముస్లిం కులీనులు సైనిక మాన్యాలుగా జాగీర్లు పొందారు. వీరు నిజాం రాజకుటుంబంతో వైవాహిక సంబంధాలను కూడా పెట్టుకున్నారు. బేగంపేట, బషీర్బాగ్, జహానుమా, అస్మాన్ గడ్, ఫలక్నుమా భవన ప్రాంగణాలు వంటి నిర్మాణాలకు కారకులు పైగాలే. పైగాల్లో అస్మాన్ జా, ఖుర్షీద్ జా బహదూర్, సర్ వికారుల్ ఉమ్రా అనే మూడు వంశక్రమాలు ఉన్నాయి. పైగాల కోసం ప్రత్యేక స్మశానవాటికలూ నిర్మించారు.
పైగాల తరువాత హోదా పన్ను మినహాయింపు పొందిన రాజ్యాధీశులు, సంస్థానాధీశులది. సంస్థానాధీశులు అర్థ స్వయంప్రతిపత్తి కలిగిన స్థానిక పాలకులు. వంశపారంపర్యంగా వచ్చే భూభాగాలను పాలించుకుంటూ నిజాంకు కప్పం కట్టేవారు. హిందూ సంస్థానాధీశుల మూలాలు ప్రాచీన కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నాయి. వీరిలో అధికభాగం కాకతీయుల కాలంలో సైన్యం, సివిల్ పాలనలో ముఖ్య పదవుల్లో ఉండేవారు. రాజ్యపతనంతో తమకు అందుబాటులో ఉన్న భూభాగాలను ఆక్రమించి తమ అధికారాలను స్థాపించారు. వీరి భూభాగాలను 'పాళ్యాలు' అనీ, వీళ్లను 'పాలెగాళ'్లని పిలిచేవారు. వీరు రాజుల విజయయాత్రల్లో పాల్గొనేవారు. విజయనగర కాలంలో సేనానాయకులుగానూ వీరు ఉన్నారు. తరువాత బీజాపూర్, గోల్కొండ రాజ్యాల్లో ప్రాముఖ్యం వహించారు. వారి భూభాగాలు మాత్రం ఒక పెద్ద రాజ్యంలో అంతర్భాగమై పోయాయి. ఔరంగజేబు దక్కన్ భూభాగాన్ని జయించినప్పుడు ఇటువంటి పాలెగాళ్లు చాలామంది ఉన్నారు. వీరికి మొగల్ సైన్యంలో క్రమబద్ధమైన ఉద్యోగాలు లభించలేదు. ఫలితంగా పన్ను చెల్లించే జమిందార్లు, భూస్వాములుగా మిగిలిపోయారు. అసఫ్ జాహీ కాలంలో కూడా వీరు కప్పం చెల్లిస్తూ రాజుకు అవసరమైనప్పుడు సైనిక సాయం అందిస్తూ వచ్చారు. వీరిలో బలవంతులు రాజాలుగా కొనసాగారు. మిగిలినవారు దేశ్ముఖ్లు, సర్దేశ్ముఖ్ల స్థాయికి పడిపోయారు. మొదటి సాలార్జంగ్ పన్నుల విధానాన్ని పునర్వ్యవస్థీకరించడంతో ఇది జరిగింది. ఫలితంగా జమిందార్లలో ఎక్కువ మంది తమ సంస్థానాలపై అధికారాలను కోల్పోయారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి నిజాం రాజ్యంలో 16 చిన్న చిన్న సంస్థానాలు మిగిలి ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి వనపర్తి, గద్వాల, జటప్రోలు, అమరచింత, పాల్వంచ, గోపాలపేట, గురుగుంట, ఆనెగొంది. వీరు నిజాం సార్వభౌమాధికారం గుర్తించి ఆయన చేత కులీనులుగా గుర్తింపు పొంది; రాజా, మహారాజా బిరుదులు పొందారు. వీరిలో కొందరికి నాణేలు, స్టాంపులు స్వతంత్రంగా ముద్రించుకునే హక్కు ఉండేది.
- మౌక్తిక్