Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత సమాజంలో జరిగే అన్ని ఆర్థిక, సామాజిక లావాదేవీలను రకరకాల రూపాల్లో ఒప్పందాలు చేసుకొని ప్రభుత్వ గుర్తింపు, రక్షణపొందుతున్నాం. ఇన్ని చేసినా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. మీరున్న ఇంటిని, మీరు పండిస్తున్న భూమిని మీకు తెలియకుండానే ఎవరో తమ పేర రిజిస్టర్ చేయించుకుంటున్నారు. న్యాయం, చట్టం మోసగాళ్ళను ఆపలేక పోతున్నాయి. ఇంత పకడ్బందీ ప్రజా ప్రభుత్వాలు, సమాచార సాధనాలు ఉన్న ఆధునిక కాలంలోనే ఇన్ని మోసాలు జరుగుతున్నాయి కదా.. మరి పూర్వం పరిస్థితి ఎలా ఉండేది. వ్యక్తుల మధ్య, సంస్థల మధ్య, ప్రభుత్వం-పౌరులు లేక సంస్థల మధ్య జరిగే సమస్త ఒప్పందాలు, క్రయ విక్రయాలకు అధికార ముద్ర ఎలా పడేది? దీనికి సింపుల్గా 'తాంబూల స్రవం' రూపంలో అని సమాధానం చెప్పవచ్చు. ఆసక్తికరమైన మరెన్నో 'తాంబూల' విశేషాలు ఇవి.
పూర్వం పరస్పర నమ్మకం మీదే చాలా వ్యవహారాలు నడుస్తూ ఉండేవి. అప్పట్లో నూటికి తొంభరు శాతానికి పైగా ఉన్న గ్రామ జీవితం సాఫీగా, నియమబద్ధంగా సాగటానికి ఒక ఆచారాన్ని అనుసరించారు. పల్లెల్లో జరిగే ప్రతి వ్యవహారాన్ని ఆ గ్రామ నాయకుడు (ప్రభుత్వ అధికారి) సమక్షంలో ఆ వ్యవహారానికి సంబంధించిన వారి మధ్య ఒక ఒప్పందం జరిగేది. ఇది జరిగిన తరువాత వారు ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటారని తెలుపుతూ గ్రామాధికారికి తాంబూలంతో కట్నం ఇచ్చేవారు. ఈ కట్నం విలువను కొన్ని వరహాలు లేక మాడలు (ఆనాటి ద్రవ్యం ఏదయితే అది)గా నిర్ణయించి కట్నం ఇచ్చేవారు. ఈ వ్యవహారానికి సాక్ష్యంగా ఉన్నవారికి కూడా తాంబూలం ఇచ్చేవారు. ఇట్లా వ్యవహారం ఒప్పందం అవ్వడానికి 'తాంబూల స్రవం' (తంబుల స్రవం)గా అలనాటి శాసనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఎనిమిది, తొమ్మిది శతాబ్దాల నాటి శాసనాలు తాంబూల స్రవంతో నడిచిన వ్యవహారాలను చాలా స్పష్టంగా పేర్కొనడం కనిపిస్తుంది. ఒప్పందాన్ని అతిక్రమించేవారిని గ్రామాధికారి శిక్షిస్తాడు. రిజిస్ట్రేషన్లు, కోర్టులు లేని ఆ కాలంలో తాంబూల స్రవం ద్వారా ఊరి పెద్దగా ఉన్న గ్రామాధికారి గ్రామంలోని వ్యవహారాలన్నింటినీ నైతికబలంతో చక్కదిద్దేవాడు. తాంబూల స్రవం ద్వారా గ్రామాధికారికి లభించే కట్నాన్ని శాసనాలు 'అడపగటు'్ట అని పేర్కొన్నాయి.ఇట్లా వచ్చిన ఆదాయం సాధారణంగా గ్రామాధికారికి కాని, గ్రామ సభకు కాని వెళుతుంది. అంతేకాని రాజుకు చెందదు.
శాసనాధారాలు
కొన్ని వందల ఏళ్ళ క్రితం నుండి భారత దేశంలో మరీ ముఖ్యంగా తెలుగు నేలపై ముఖ్యమైన ఒప్పందాలన్నీ తాంబూలం మార్చుకోవడం ద్వారానే జరిగేవనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి.
వరంగల్ జిల్లా కొండపర్తి గ్రామంలో చెరువుకు దగ్గరలో కొక్కెర గుండు అని స్థానికులు పిలిచే ఒక కొండ రాయి ఉంది. దీనిపై సుమారు పదకొండు వందల ఏళ్ళ క్రితం నాటి వివరాలను తెలియ చేసే చిన్న శాసనం కనిపిస్తుంది. ఆనాటి ఒప్పందాల్లో తాంబూలం పాత్ర ఏమిటో ఇది తెలియచేస్తుంది.
రట్టోడి మంచికాళు కొండపకు తంబుల స్రవంబు చేసిన (తాంబూలం తీసుకున్న.. అంటే రిజిస్టరైన) స్రవణ భూమి (జైనులకు సంబంధించిన భూమి)ని ఫలసాయాన్ని సమంగా పంచుకొనే షరతుపై ఇవ్వడం జరిగింది. ఇతడితోపాటు స్రవణుడైన అర్మకొండ భీమయ్య కూడా సాగులో పాలుపంచుకోవాలి. దీన్ని గూన్తు కున్తుల (కూతురు కూతురు తరాల వరకు) అనుభవించే హక్కు ఉంది. ఇందుకు సాక్ష్యంగా ఉండి గల్ప నుండి (పట్టణం నుండి) తంబులంబు దిన్నవారు (తాంబూలం తిన్నవారు) వందామి గొరవలు (జైన గురువులు), దానమయ్య, కుమరమయ్య, గణపతి ఓజు (చెక్కే వృత్తిదారుడైన గణపతి). ఈ భూమిపై చెల్లించవలసిన శిస్తు నాలుగు ద్రమ్మలు. పండిన పంటలో ప్రభుత్వానికి ఇవ్వవలసిన ఆయం ( పండిన పంటలో ప్రభుత్వానికి రావలసిన భాగం) పుట్టెడు ధాన్యం. ఈ శిస్తును, ఆయాన్ని ధనుంజయుడనే ఫలధారుడు (రెవెన్యూ ఆఫీసర్) వసూలు చెయ్యాలి. ఈ భూమిలో పండే పంటను పట్టణంలో జరిగే సంతలో అమ్ముకోవాలంటే పన్ను చెల్లించవలసిన అవసరం లేదు.
తాంబూలం సిద్ధం చేసే ఉద్యోగులు
ఉమ్మడి వరంగల్లు జిల్లా గూడూరులో లభించిన ఓ శాసనంలో రాజాస్థానంలో తాంబూలాలు సిద్ధం చేసే ఉద్యోగుల ప్రస్థావన కనిపిస్తుంది. ఈ ఉద్యోగులను 'అడప' అనే పేరుతో పిలిచేవారు. అడపం అంటే తాంబూలం. అడపల పని రాజుగారి (ప్రభుత్వం) ఆర్డర్స్ను అమలుచేసే సందర్భంలో తాంబూలం ఇచ్చి ఒప్పందం కుదిరినట్లు రూఢిపర్చడం. అందుకే రాజుగారు పర్యటనలకు వెళితే అడపలు కూడా రాజుతో పాటే ఉండేవారు. ప్రసుత్తం మన ప్రభుత్వాధినేతలు విదేశాలకు వెళ్ళినప్పుడు ఎగ్రిమెంట్పై సంతంకం చేసి ఫైలు మార్చుకుంటున్నట్లే అప్పట్లో రాజుల మధ్య ఒప్పందాలు తాంబూలాల మార్పిడితోనే జరిగేవి.
పూర్వం గ్రామాల్లో రట్టోడి, గావుండు, గ్రామణి అని వివిధ రకాల పేర్లతో పిలిచే గ్రామాధికారుల్ని రాజులు, చక్రవర్తులు నియమించేవారు. వీరికి జీతానికి బదులు కొంత భూమిని మాన్యంగా ఇచ్చేవారు. అలాగే వ్యక్తుల మధ్య క్రయ విక్రయాలు, ఒప్పందాలు, పెళ్ళిళ్ళ సందర్భాల్లోనూ తాంబూలం మార్చుకున్నప్పుడు దానిపైనా ఆదాయం వచ్చే ఏర్పాటు చేసేవారు. కొన్ని శాసనాల్లో ''తాంబూలంబున కుంచెడు బియ్యంబు'' (తాంబూలం మార్చుకున్నప్పుడు కుంచెడు బియ్యం) గ్రామాధికారికి ఇవ్వాలని ఆదేశించడం చూడవచ్చు. గూడూరు శాసనంలో ''అడపగట్టు దేవరకు జను'' అని ఉంది. పైన పేర్కొన్నట్లు తాంబూలానికి కట్టే ఫీజు గ్రామాధికారికి చెందుతుంది అని ఈ శాసనం చెబుతున్నదన్నమాట.
యుద్ధానికి బయలుదేరే ముందు...
పూర్వం 'వీరతాంబూలం' ఆచారం ఉండేది. రాజులు యుద్ధానికి బయలుదేరే ముందు సైనికులకు ఇచ్చే తాంబూలమే వీరతాంబూలం. రాజు తరఫున విశ్వసనీయంగా ప్రాణాలొడ్డి పోరాడతామని చ్రెప్పడానికి ఈ తాంబూల స్వీకరణ ఓ ప్రతీక. నన్నె చోడుని కుమారసంభవం, పాల్కురికి సోమనాథుని బసవపురాణం వంటి మధ్యయుగ గ్రంథాల్లో ఈ వీర తాంబూలం ప్రస్థావన కనిపిస్తుంది. మహమ్మదీయ రాజుల్లో చాలామంది శత్రువులపై (హిందు రాజులపై) యుద్ధానికి వెళ్ళేటప్పుడు మతయుద్ధం (జిహాద్) ప్రకటించి ్సఐనికులను యుద్ధోన్ముఖులను చేసినట్లు హిందు రాజులు సైనికులకు వీరతాంబూలం ఇచ్చి యుద్ధానికి బయలుదేరేవారు.
వివాహ నిశ్ఛయ తాంబూలం
కొన్ని వందలు, వేల ఏళ్ళుగా క్రమం తప్పకుండా వస్తున్న తాంబూలాచారం ఏదన్నా ఉంటే అది 'వివాహ తాంబూలమే'. పూర్వం అన్ని వ్యవహారాలు లాగానే వివాహ ఒప్పందానికి తాంబూలాలు మార్చుకోవడం ఒక్కటే మార్గమని వేరే చెప్పవలసిన పనిలేదు కదా. అమ్మాయి, అబ్బాయిల తల్లి దండ్రులు ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చుకున్నారు అంటే వారిమధ్య ఒప్పందం కుదిరినట్లే. ఏదో మిన్ను విరిగి మీదపడితే తప్ప ఈ ఒప్పందం నుంచి వెనుతిరగరు. పెళ్ళినాడు కూడా తాంబూలం కీలక పాత్ర పోషిస్తుంది. పెళ్ళికొచ్చిన వారందరినీ సాక్షులుగానే పరిగణిస్తారు. పూర్వ ఆచారం ప్రకారం సాక్షులు కూడా తాంబూలాలు స్వీకరించాలి. అందుకే సంప్రదాయ హిందు వివాహాలన్నింటిలోనూ అతిథి (సాక్షు)లకు తాంబూలం (కిళ్ళీ) ఇవ్వడం ఇప్పటికీ కొనసాగుతోంది.
భారతీయ సంస్కృతిలో తాంబూలాన్ని ఒక శిలాశాసనంగా పరిగణించారు. భారతీయ నైతిక జీవన స్థాయికి ఇది నిలువెత్తు నిదర్శనం. పెద్ద పెద్ద సామ్రాజ్యాలు పరిఢవిల్లినా.. ఏ గ్రామానికి ఆ గ్రామంలో జరిగే అనేక వ్యవహారాలు అక్కడ ఉండే గ్రామాధికారి ఆధ్వర్యంలో తాంబూల స్రవం ద్వారా ఒప్పందాలుగా మారిపోవడం, ఆ తరువాత వాటికి కట్టుబడి ప్రజలు జీవించడంతో పరిపాలకులకు పాలన సులువయింది.
- శివ