Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూర్వం తమకు జన్మించిన సంతానమంతా తమ కండ్ల ముందే ఉండాలని, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములందరూ ఎల్లకాలం కలిసి మెలిసి ఉండాలని తల్లిదండ్రులు భావించేవారు. పరిణామ క్రమంలో చాలా మార్పులు సంభవించాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లోని నూతన ఆవిష్కరణలు ఉపాధికి బాట చూపాయి. ఉన్నత చదువులు చదివేందుకు అవకాశం కల్పించాయి. సరిహద్దులు చెరిపేసి, సప్త సముద్రాలు దాటి నేడు లక్షలాది మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటున్నారు. ఆచరణాత్మక విద్యతో వికాసం పొందుతున్నారు.
మన దేశంలో చదువుకుంటూ ఉపాధి పొందే అవకాశంలేదు. కానీ విదేశీ యూనివర్సిటీలు అలా కాకుండా చదువుకుంటున్న విద్యార్థులకు ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. అంతేకాకుండా మన విద్యకు, ఇక్కడి విద్యకు ఎంతో తేడా ఉంది. మన విద్యావిధానంలో థియరీ సబ్జెక్టు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అలా కాకుండా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యతనిస్తారు. మన దేశంలో మాదిరిగా ఇక్కడ ఎల్కేజీ, యూకేజీ విద్య లేదు. 5 ఏండ్ల వయస్సు తరువాతనే పిల్లలను పాఠశాలల్లో చేర్పిస్తారు. బట్టీపట్టి చదివే విధానం లేదు. విద్యార్థులను ఉపాధ్యాయులు ఆట పాటలతో అలరిస్తారు. పిల్లలు ఎంత అల్లరి చేసినా కొట్టరు. తిట్టరు. ఎంతో ఓపికతో విద్యను బోధిస్తారు. ఆచరణాత్మక విద్య ద్వారా ముఖ్యంగా పరికరాలను చూపిస్తూ, సందర్భానుసారంగా ఉదాహరణలు ఇస్తూ విద్యార్థులకు పాఠాలను అర్థం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఉపాధ్యాయులు విద్యార్థుల స్థాయిని అంచనా వేసి, ఆ స్థాయికి దిగి పాఠాలు చెబుతారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పిస్తారు. ప్రయివేటు పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్య విధానం ఒకే మాదిరిగా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇక్కడ నాణ్యమైన విద్య బోధన ఉంది. పైగా ఉచితంగా ఇది లభిస్తున్నందువల్ల తల్లిదండ్రులు ఇటు వైపే మొగ్గు చూపుతున్నారు. హైస్కూలు విద్య అనంతరం జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులు చదువుతారు. అనంతరం పీజీ విద్యార్థులు చదువుకుంటూనే ఉపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తారు. ఇక్కడ ఆన్ క్యాంపస్ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. అనగా క్యాంపస్ పరిధిలోనే ఉద్యోగాలు చేసుకోవచ్చు. హెచ్1బీ వర్క్ వీసా పొందే వరకు విద్యార్థులకు మరో 24 మాసాల పాటు ఉద్యోగ అర్హత కల్పిస్తారు. మన విద్యార్థులు చదువుకుంటూనే ఉపాధి పొందడం వల్ల విద్య కోసం చేసిన అప్పులు తీర్చేస్తారు. చదువుకునే సమయంలోనే విద్యార్థులకు వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దీంతో విద్యార్థులకు తాము మంచి పౌరులుగా ఎదగగలమనే ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. తల్లిదండ్రులకు పిల్లల భారం తప్పుతుంది. ఆయా విద్యార్థుల భవిష్యత్ జీవిత నిర్మాణానికి ఈ అనుభవం ఉపయోగపడుతుంది. విదేశాల్లో చదివినందువల్ల వివిధ దేశాల విద్యార్థులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆయా దేశాల ఆచార వ్యవహారాలు, భిన్న సంస్కృతులను అర్థం చేసుకునేందుకు ఆస్కారముంటుంది. నూతన విజ్ఞానాన్ని సంపాదించేందుకు వీలుంటుంది.
అమెరికాలో సుమారు 4 వేల యూనివర్సిటీలున్నాయి. భూభాగంలో అమెరికా చాలా పెద్ద దేశం. వీటిల్లో పబ్లిక్ యూనివర్సిటీలను రాష్ట్రాలు నిర్వహిస్తాయి. విద్యార్థులు ఈ యూనివర్సిటీల్లో చేరేముందు ఆ విశ్వవిద్యాలయాకు ప్రభుత్వం గుర్తింపు ఉందో లేదో చూసుకోవాలి. గుర్తింపు ఉన్న యూనివర్సిటీల్లో మాత్రమే చేరాలి. ప్రత్యేక విద్యార్హతలు ఉన్న విద్యార్థులకే విదేశాల్లో చదువుకునేందుకు అవకాశం ఉంటుందని కొంత మంది బావిస్తారు. మామూలు విద్యార్హతలు, ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం విదేశీ విద్యకు సరిపోతుంది. దీంతో అన్ని విషయాల్లోనూ నెగ్గుకు రావచ్చు. అయితే ప్రతి విద్యార్థి యూనివర్సిటీలో చేరేముందు తన గురించి, తన భవిష్యత్తు ప్రణాళికల గురించి తన మాటల్లో వ్యాసం రాసి సమర్పించాలి. దీనిని ఎంతో శ్రద్ధ వహించి విద్యార్థులు తమ సీనియర్ల సహకారంతో అందజేయవలసి ఉంటుంది. ఈ వ్యాసాన్ని పరిశీలించి, విద్యార్థి తెలివి తేటలను అంచనా వేసి దాని ప్రకారమే ప్రవేశం కల్పిస్తారు.
ప్రతి యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులకు అవగాహన కల్పించే ప్రత్యేక తరగతులను నిర్వహిస్తారు. ఈ తరగతులకు హాజరై విద్యార్థులు తమ అవగాహన పెంచుకోవాలి. తాము చదువుకుంటున్న యూనివర్సిటీ ఆ దేశ వాతావరణ పరిస్థితులు, పరిసరాలు, తాము ఎలా నడుచుకోవాలి అనే విషయాలను కూలంకషంగా అధ్యయనం చేయాలి. కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూయార్క్, బోస్టన్, న్యూజెర్సీ తదితర రాష్ట్రాల్లో తెలుగు విద్యార్థులు అధిక సంఖ్యలో చదువుకుంటున్నారు. భారత దేశంలో కంటే ఇక్కడ సులభంగా ఉపకార వేతనాలు పొందవచ్చు. అమెరికాలో విద్యాభ్యాసానికి కులాలు, మతాల ఆధారంగా రిజర్వేషన్లు లేవు. అందరు విద్యార్థులూ సమానమే. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నారు. ఆకాశమే హద్దుగా విద్యార్థులు ఎదిగేందుకు సహకరిస్తున్నారు.
- జి గంగాధర్ సిర్ప,
వాట్సాప్ నంబర్ 8919668843 (అమెరికా నుంచి)