Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలోని వ్యవస్థలు సున్నితత్వాన్నీ, అధికారులూ పాలకులూ సెన్సిబిలిటీని (రసికతనూ) కోల్పోయినప్పుడు కళలూ కళా సృజనలూ వివాదంలో పడిపోతాయి. కళాకారులు నిర్లక్షానికీ నిరాదరణకూ ఒక్కోసారి అవమానాలకూ కూడా గురవుతారు. అది ఏ వ్యవస్థకూ మంచిది కాదు. ఇక దేశంలో ప్రజాస్వామ్య వాతావరణం మబ్బులుపట్టి పోయి అధికారంలో వున్నవారు అన్ని వ్యవస్థల్నీ తమ అభీష్టాల మేరకు మలచుకోవాలనుకున్నప్పుడు పరిస్థితి మరింత అధ్వాన్నమవుతుంది. గత కొన్నేళ్ళుగా దేశంలో కళలూ, కళాసంస్థలూ ఇదే స్థితిని ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా పలు జాతీయ సంస్థలు వివాదాల సుడిగుండాల్లో పడిపోతున్నాయి. ముఖ్యంగా విస్తారమయిన ప్రజాక్షేత్రంలో ప్రాచుర్యంలో వున్న సినిమా రంగానికి చెందిన అనేక సంస్థలలో రాజకీయ జోక్యం, ఆధిపత్య స్థాపన కోసం జరుగుతున్న ప్రయత్నాల ఫలితంగా వివాదాలు ముప్పిరిగొంటున్నాయి. పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్, ఫిలిం సెన్సారింగ్ వ్యవస్థల్లో చెలరేగిన వివాదాలు ఇంకా మరుగున పడిపోకముందే తాజాగా జాతీయ ఫిలిం అవార్డుల వివాదం తెరమీదికి వచ్చింది.
65 వ జాతీయ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన పరిణామాలు అభిలషనీయమయినవి కావు. ఈ ఏటి 137 మంది అవార్డు విజేతల్లో 50 మంది విజేతలు తమ నిరసనను తెలుపుతూ అవార్డుల ప్రదానోత్సవానికి దూరంగా ఉండిపోవడం తాజా సంఘటన. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ ఫిలిం అవార్డుల్ని రాష్ట్రపతి చేతులమీదుగా ప్రదానం చేసే ఆనవాయితీ వుంది. ఈ అవార్డుల్ని మొట్టమొదటిసారిగా 1954లో అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ప్రదానం చేసారు. ఆ ఏడు ప్రహ్లావ్ కేశవ్ ఆత్రే రూపొందించిన మరాఠీ సినిమా 'శ్యాంచి అయి' సినిమాకు రాష్ట్రపతి బంగారు పథకం, బిమల్ రారు రూపొందించిన 'దో భిగా జామీన్' కు ఆల్ ఇండియా సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డు అందజేసారు. అప్పటినుండి కేవలం ఒకే ఒకసారి ఆనాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అస్వస్థత కారణంగా ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారి చేతులమీదుగా అవార్డుల ప్రదానం జరిగింది. అంతే తప్ప ఏ సంవత్సరమూ ఆనవాయితీ తప్పలేదు. అవార్డులను రాష్ట్రపతి చేతులమీదుగా స్వీకరించడం గౌరవంగానూ ప్రతిష్టగానూ సినిమా దర్శకులూ కళాకారులూ భావించారు. కాని దానికి భిన్నంగా ఈసారి అవార్డు విజేతల్లో కేవలం 11 మంది విజేతలకు మాత్రమే రాష్ట్రపతి ప్రదానం చేస్తారని మిగతావి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అందజేస్తారని తెలియజేయడంతో వివాదం రాజుకుంది. ఆ విషయం కూడా కేవలం ఒక రోజు ముందు డ్రెస్ రిహార్సల్ రోజున తెలిపారాని, అది అవమానకరమని భావిస్తూ 70 మంది విజేతలు తమ నిరసనను అసంతృప్తిని ప్రకటిస్తూ ప్రభుత్వానికి లేఖ రాసారు. తాము అవార్డుల్ని స్వీకరించబోమని ప్రకటించారు. అది తెలిసి ఈ సంవత్సరపు అవార్డు ఎంపిక కమిటీ చైర్మన్ సుప్రసిద్ధ దర్శకుడు శేఖర్ కపూర్ వారితో మాట్లాడి సామరస్యపూర్వక వాతావరణం కోసం కృషి చేసారు. ఫలితంగా 50 మంది కార్యక్రమానికి దూరంగా వుండిపోయారు. 20 మంది గాయకుడు జేసుదాస్ తోసహా అవార్డుల్ల్ని స్వీకరించారు. కేవలం 11 మందిని ఎంపిక చేసి వారికి మాత్రం రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం జరిపించి మిగతావి మంత్రి అందజేశారు. నిరసన తెలియ జేసిన వారి వాదన ప్రకారం 11 మంది ఎంపిక కూడా ఎట్లా చేసారని? ఉత్తమ గాయకుడికి రాష్త్రపతి చేతులమీదుగా అందజేసి గాయకురాలికి ఇవ్వలేదని అది సమంజసం కాదని అన్నారు. మొత్తంగా 65 ఏళ్ల ఆనవాయితీని తోసిరాజని కార్యక్రమాన్ని నిర్వహించడం వివక్ష చూపడం పట్ల తమ నిరసన అని వారంటున్నారు. అవార్డులు, విశ్వవిద్యాలయ కాన్వొకేషన్ లాంటి కార్యక్రమాలల్లో రాష్ట్రపతి ఒక గంటకు మించి సమయం ఇవ్వలేరనే ప్రొటోకాల్ కొన్ని వారాల ముందే సమాచార మంత్రిత్వ శాఖకు తెలిపామని రాష్ట్రపతి భవన్ వర్గాలు అంటుండగా విజేతలు తమకు ఆ విషయం చివరిక్షణం వరకు చెప్పలేదని వాదిస్తున్నారు. అట్లాంటప్పుడు బహుమతుల్ని పోస్టులో పంపితే సరిపోయేది కదా అని కూడా అంటున్నారు. ఇది కేవలం కళాకారులపట్ల ప్రభుత్వ నిర్లక్ష్యమేనని కళాకారుల వాదన.
నిజానికి అవార్డు ఒక గుర్తింపు. సాహితీ సాంస్కృతిక సామాజిక రంగాల్లో ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ చేసిన విశ్టిష్ట కృషికి గుర్తింపుగా ఇచ్చే ప్రశంస. అది హార్దికంగానూ లేదా ఆర్థిక ప్రోత్సాహకంగానూ వుండొచ్చు. లేదా బిరుదులాంటిది కూడా కావొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలూ, వ్యక్తులూ, ప్రభుత్వాలూ అనేక అవార్డులు ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. అవార్డులు స్వీకర్తల కృషికి గుర్తింపునూ, మునుముందు మరింత కృషి చేసేందుకు దోహదం చేస్తాయి.
కానీ ఈ అవార్డుల ఎంపిక, ప్రదానం పారదర్శకంగా లేనప్పుడు వివాదాలు తలెత్తుతాయి. ఫలితంగా ఆ అవార్డుల లక్ష్యము విఫలమౌవుతుంది. వాటి విలువా తగ్గిపోతుంది. స్వీకర్తలకు అవార్డు గెలుచుకున్నామన్న సంతృప్తీ మిగలదు.
ఈ సారేకాదు ఇటీవలి కాలంలో ఈ అవార్డులు వివాదాలకు వేదికగా నిలుస్తున్నాయి. నిజానికి జాతీయ చలనచిత్ర అవార్డులు ఇటీవలి సంవత్సరాలల్లో తమ మౌలిక లక్ష్యాన్నీ, లక్షణాన్నీ కోల్పోతున్నాయి, ఈ అవార్డుల్ని నెలకొల్పినప్పుడు సినిమాల్లో ఆవిష్కృతమయిన సున్నితత్వమూ, కళాత్మకత, మానవీయ లక్షణాల్ని పరిగణనలోకి తీసుకుని ఎంపిక జరగాలని నిర్ణయించారు. ఉత్తమ నటుల్ని ఎంపిక చేసేటప్పుడు డ్రామాకు కాకుండా వాస్తవిక దృక్పథంతో నటించిన నటుల్ని ఎంపిక చేసేవారు. ఆయా పాత్రల్లో నటులు కాకుండా ఆపాత్రలే కనిపించడాన్ని ప్రాతిపదికగా తీసుకునే వారు. ఫలితంగా సమాంతర సినిమాలకు ఈ అవార్డుల్లో పెద్దపీట లభించేది. కానీ కాల క్రమేణా మారిన రాజకీయ దృక్పథం, పెరిగిన వ్యాపారాత్మకతలు ఈ అవార్డుల్లోనూ చేయి చేసుకోవడం మొదలు పెట్టాయి. పర్యవసానంగా జాతీయ స్థాయిలో ఇచ్చే ఈ అవార్డుల్లో వినోదాత్మక సినిమాలకు, కుటుంబ కథా చిత్రాలకూ ప్రత్యేక అవార్డులు ప్రవేశ పెట్టారు. అలా ఏర్పాటయిన ప్రత్యేక విభాగాలతో సంతృప్తి చెందని వర్గాలు అవార్డుల ఎంపికను ప్రభావితం చేయడం ఆరంభించారు. అవార్డుల మూల లక్ష్యాల్ని తుంగలో తొక్కుతూ కేవలం వినోదమూ వ్యాపారమూ ప్రధానంగా వున్న చిత్రాలకూ నటులకూ అవార్డులు ఇవ్వడం మొదలు పెట్టారు. వాస్తవికతను పక్కన పెట్టడం మొదలు పెట్టారు. గత ఏడాది జాతీయ ఉత్తమ చిత్రంగా' బాహుబలి' ని ఎంపిక చేసినప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. (బాహుబలి చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ రచనలో ఆరెసెస్ సినిమా 186 కోట్లతో సినిమా నిర్మాణం కానున్నట్టు తాజా వార్త). సాంకేతికంగా స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ పరంగా గొప్పగా తీసినప్పటికీ బాహుబలి లో ఏ మానవీయ విలువల ఆవిష్కరణ జరిగిందని అదూర్ గోపాల కృష్ణన్, గిరీష్ కసరవెల్లి లాంటి దర్శకులు కూడా ప్రశ్నించారు. ఇది కచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో వచ్చిన రాజకీయ మార్పే కారణం అని కూడా పలువురు మాట్లాడారు. ఇలాంటి కమర్షియల్ సినిమాలకు అవార్డులు ఇవ్వడానికి ఫిల్మ్ఫేర్, ఐఫా, జీసినీమా, స్క్రీన్ అవార్డుల్లాంటివి వుండగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్ని కూడా వ్యాపారమయం, ఆశ్రిత పక్ష పాత మయం చేయడం అభిలశనీయం కాదు.
గతంలో కొంతకాలం జాతీయ అవార్డులకోసం మరో పద్ధతిని అవలంబించారు. ప్రాంతీయ స్థాయిలో ఎంపిక కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళు ప్రాంతీయ స్థాయిలో ఎంపిక చేసిన సినిమాల్ని తిరిగి జాతీయ స్థాయిలో ఎంపిక చేసేవారు. ఆ పద్ధతిలో మంచి సినిమాలు వేర్వేరు కారణాలతో ప్రాంతీయ స్థాయిలోనే నిలిచిపోతున్నాయని, రెండు స్థాయిల్లో ఎంపిక సరయింది కాదనే వాదన రావడంతో తిరిగి జాతీయ స్థాయి ఎంపిక ప్రారంబించారు.
ఈ స్థితికి రెండు కారణాలు తోస్తాయి. ఒకటి ప్రభుత్వమూ, పాలకుల రాజకీయ దృక్పథాలు ఈ అవార్డుల్లో ప్రతి ఫలిస్తున్నాయనుకోవాలి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఫిల్మ్ సెన్సార్లల్లో జరుగుతున్న వ్యవహారాలు కనిపిస్తూనే వున్నాయి. మరోకారణం అవార్డుల జ్యూరీ కోసం నియమించబడ్డ సభ్యుల వ్యక్తిత్వమూ, సాధికారికత.
జ్యూరీ ఎంపికలోనే వారి కళాత్మక దృక్పథమూ, సామాజిక అవగాహనను పరిగణనలోకి తీసుకుంటే ఫలితాలు మెరుగ్గా వుండి అవార్డులు వివాద రహిత మవుతాయి. వాటికి విలువా పెరుగుతుంది.
అయితే ఈ సారి అవార్డుల ఎంపిక విషయంలో వివాదాలు చెలరేగలేదు. జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును అస్సామీ సినిమా 'విలేజ్ రాక్స్టార్స్' కు ఇవ్వడం సర్వామోదం పొందింది. మిగతా అవార్డుల విషయంలో కూడా పెద్దగా చర్చలు జరగ లేదు కాని ప్రదానోత్సవం పెద్ద వివాదంగా మారింది.
ఇప్పటికయినా అవార్డుల ఎంపిక కళాత్మక సామాజిక విలువల ఆధారంగా నిస్పక్షపాతంగానూ, ఉత్సవాలూ ప్రదానాలు గౌరవంగానూ నిర్వహిస్తే అటు కళాకారులకూ, ఇటు ప్రభుత్వాలకూ మంచిది.
- వారాల ఆనంద్, 9440501281