Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నదైనా అర్ధవంతమైన జీవితం చాలనుకున్నాడేమో, 63 సంవత్సరాలకే ఆయువు తీరి వెళ్ళిపోయాడు కళాకారుడు సురేంద్రపాల్ జోషి. సంప్రదాయ కళా ప్రపంచంలో సామాన్యంగా వాడే పదార్థాలన్నీ తిరస్కరించాడు. అర్ధవంతమైన వస్తువుల ఉపయోగంతో కొత్తరకంగా కళాకృతులను సృష్టించేవాడు. ఉత్తరాఖండ్లో జన్మించి, జైపూర్కి వృత్తిరీత్యా వచ్చి అక్కడి ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఎప్పుడూ కులాసాగా కబుర్లు చెపుతూ మెత్తని సంభాషణలు చేసే ఈయన 12 జూన్ 2018 రాత్రి బ్రెయిన్ ట్యూమర్తో కారణంగా కన్నుమూశాడు జైపూర్లో.
జోషి చేసే కళాకృతులు ధనిక వర్గాన్ని ఆకట్టుకునేవి కావు. మధ్యతరగతి జీవితాల ఆలోచనా పరిథిలోవి ఇవి. ఉత్తర పర్వతశ్రేణి దిగువ భాగాన నివసించిన ఇతనిని బాల్యంలో అక్కడ ఉన్ని తీసి తాళ్ళు అల్లేవారి పని చాలా నచ్చేది. ఉన్నైనా ఏ వస్త్రమైనా ముట్టుకుని చూస్తే ఆ బట్ట మెత్తదనం, ఆ వస్త్ర స్వభావంగా చెపుతుంది. అలాగే కొండలమీది పైన్ చెట్లు ఎండుటాకుల ఆకారాలూ ఇతనిని ఆకర్షించేవి. ఇతను వేసే అబ్స్ట్రాక్ట్ చిత్రాలల్లో ఆ ఆకారాలన్నీ తీసుకురావటమే కాకుండా వస్త్రం, తాళ్ళు లాంటివి కాన్వాస్పై ఉపయోగించి వివిధ ప్రకృతులనూ, స్వభావాలనూ చూపించ యత్నించేవాడు.
చిత్రం, శిల్పం అంటూ సంప్రదాయ పద్ధతిలో అవే పదార్థాలను వాడుతూ పని చేయటానికి అసంతృప్తి వ్యక్తపరిచేవాడు. కొత్త పంథాలో ఆలోచించ మొదలుపెట్టాడు. రెండుగా విడిపోయిన వస్తువునైనా, వస్త్రాన్నైనా సేఫ్టీ పిన్నులు కలిపి వుంచుతాయి. ఆ సేఫ్టీ పిన్నులతో ఒక కర్టెన్ అల్లాడు. గత ఆరు సంవత్సరాల క్రితం మొదలు పెట్టిన ఈ ప్రయోగాత్మక కళలతో మరిన్ని వింత వస్తువులను తయారు చేశాడు. సేఫ్టీ పిన్స్తో ఒక హెల్మెట్ చేశాడు. రెండు చక్రాల బండి నడిపే మధ్య తరగతి కుటుంబీకుల భద్రతాభరణం ఇది. ఆ హెల్మెట్ మధ్య లెడ్ నీలం లైట్ పెట్టి ఒక ప్రత్యేకతను తెలియజేశాడు. ఆపై ఒక లక్ష సేఫ్టీ పిన్స్ వాడి 8 అడుగుల ఒక హెలికాఫ్టర్ని తయారు చేశాడు. వరదలూ, భూకంపాలూ, ఏ ప్రమాదాలొచ్చినా మనుషుల జాడ తెలిపి, సహాయ చర్యలు జరిపే ఆధార వాహకం ఇది. ఇది కులాసా విహార వాహనం కాదు, దానిని చూస్తే అసహాయ స్థితిలో వున్నవారికి ఒక ఆశాభావం, నడిపేవారి ధైర్య సాహసాలకు గుర్తు ఇది. తన స్టూడియోకి 'ఫ్యాక్టరీ ఆర్ట్' అని పేరు పెట్టి ఏదో ఒక కొత్త అర్థాన్ని వెతుక్కుని, కొత్త పద్ధతిలో నడిచిన ఈ కళాకారుడు డెహ్రాడన్లో ఒక మ్యూజియం నిర్మించి తన కళాకృతులను భద్రపరిచాడు. యునెస్కో వారి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న ఈయన జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనలెన్నో ఇచ్చాడు. లక్నో ఆర్ట్ కాలేజ్లో చదివి జైపూర్ కళాకారుడిగా అంతర్జాతీయంగా పేరు గడించాడు. మట్టి స్పర్శను మెచ్చిన జోషి అతి త్వరగా మట్టిలో కలిసిపోయాడు!
- డా||ఎం.బాలామణి, 81067 13356