Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వీయ నియంత్రణ లేని ఏ వ్యక్తి జీవితమైనా వ్యర్థం అనే విషయంతోపాటు
నాటి నుంచి నేటి వరకు సినిమాల్లో, నాటకాల్లో, సాంస్కృతిక కార్య్కక్రమాల్లో ముఖ్యంగా ఊరూరు తిరుగుతూ జానపద నృత్యాలు చేసే మహిళలను చిన్న చూపు చూడ్డం, వారంతా వేశ్యలే అంటూ ప్రచారం చేస్తూ మానసికంగా హింసించడం తగదని హితవు చెప్పిన చిత్రం 'తీస్రి కసమ్'.
1966లో రాజ్కపూర్, వహీదా రెహ్మాన్ జంటగా బసు భట్టాచార్య తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల అభినందనలు, విమర్శకుల ప్రశంసలను సొంతం చేసుకుని ఎవర్గ్రీన్ బాలీవుడ్ క్లాసిక్ చిత్రంగా నిలిచింది.
అలాగే 14వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డుని కైవసం చేసుకుంది.
ఫణీశ్వరనాథ్ రేణు రాసిన 'మారే గయే గుల్ఫామ్' షార్ట్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు బసు భట్టాచార్య తెరకెక్కించారు.
నేబెందు ఘోష్, ఫణీశ్వరనాథ్రేణు సంయుక్తంగా రాసిన సంభాషణలు ఆలోచింప జేసేలా ఉన్నాయి.కథానుగుణంగా శంకర్ - జైకిషన్ ద్వయం సమకూర్చిన సంగీతం ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. ఇందులో ఉన్న పది పాటల్లో ఏడు పాటలను నిర్మాత శైలేంద్ర రాయడం ఓ విశేషమైతే, లతా మంగేష్కర్, మన్నా డే, ఆశాభోంస్లే వంటి హేమాహేమీలు పాడటం మరో విశేషం. కథా నేపథ్యాన్ని అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించడంలో సుబ్రతా మిత్ర కెమెరా పనితనం ప్రధాన బలంగా నిలిచింది.
'తీస్రి కసమ్ కే శిల్ప్ కళాకార్ శైలేంద్ర' పేరుతో సిబీఎస్ఈ 10వ తరగతి హిందీ పుస్తకంలో పాఠ్యాంశంగా ప్రచురితమవ్వడం ఈ చిత్రానికి దక్కిన అరుదైన గౌరవం.
'తీస్రి కసమ్' కథ..
బీహార్లోని ఓ మారుమూల పల్లెటూరిలో హీరామాన్ (రాజ్కపూర్) ఎద్దుల బండి నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తుంటాడు. హీరామాన్ సంస్కృతి, సంప్రదాయలను గౌరవించడంతోపాటు దేవుడిపై అమిత భక్తి ఉన్న అమాయకుడు, కల్మషం లేని వ్యక్తి. మంచి గాయకుడు కూడా.
ఓ రోజు తన ఎడ్లబండిలో చట్ట వ్యతిరేక వస్తువులను రవాణా చేసేందుకు అంగీకరించి, సేట్ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. సేట్ చెప్పిన మేరకు హీరామాన్తోపాటు కొంత మంది వస్తువులను తరలిస్తున్న తరుణంలో పోలీసులు వ్యూహం పన్ని రైడ్ చేస్తారు. ఆ పోలీసుల రైడ్ నుంచి హీరామాన్ తన ఎడ్లతో తృటిలో తప్పించుకుంటాడు. బతుకు జీవుడా అంటూ ఇంటికి చేరుకుంటాడు. హీరామాన్ తీరు చూసి భయపడిన వదిన ఏం జరిగిందని అడిగితే, జరిగిన విషయం చెప్పి ఇకపై ఎప్పుడూ అక్రమంగా వస్తువులను రవాణా చేయనని హీరామాన్ ప్రమాణం చేస్తాడు. హీరామాన్ చేసిన తొలి ప్రమాణమిది.
కొన్ని రోజుల తర్వాత ఓ టింబర్ డిపో నుంచి వెదురు కట్టెలను బండి నిండా తీసుకుని వెళ్తున్న హీరామాన్ ఎదురుగా వస్తున్న మరో ఎద్దుల బండిని డీ కొట్టడంతో అందులో ఉన్న ఇద్దరు మనుషులు కింద పడిపోతారు. ఈ విషయంలో హీరామాన్ది తప్పు లేకపోయినా ఆ ఇద్దరు మనుషులు హీరామాన్ని చావగొడతారు. ఆ దెబ్బలకు హీరామాన్ తాళలేక ఇకపై ఎప్పుడూ తన ఎడ్లబండిలో వెదురు కట్టెలను తీసుకెళ్ళకూడదని ప్రమాణం చేస్తాడు. హీరామాన్ చేసిన మలి ప్రమాణమిది.
ఒక రోజు రాత్రి హీరామాన్ ప్రయాణీకుల కోసం రైల్వేస్టేషన్లో ఉంటాడు. పరదాల కారణంగా తన బండిలో ఎవరో ఎక్కుతున్నప్పుడు కాళ్ళు మాత్రమే చూస్తాడు. ఎక్కింది ఎవరా అని చూద్దామనుకులోపు ఓ వ్యక్తి వచ్చి ఫలానా ఊరిలో దిగబెట్టాలంటూ డబ్బులిచ్చి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి చెప్పిన ఊరికి వెళ్ళాలంటే కనీసం ముప్పై గంటలు పడుతుంది. రైల్వేస్టేషన్ నుంచి ప్రయాణం మొదలవుతుంది. అయితే తన బండిలో కూర్చున్నది మనిషా, దెయ్యమా అని మీమాంసతోనే హీరామాన్ బండి నడుపుతుంటాడు. సమయం గడుస్తున్న కొద్దీ తన బండిలో ఉన్నది దెయ్యమే అని మీరామాన్కు మరింత భయం పెరుగుతుంది.
ఆ భయంతోనే ఓ గుడి దగ్గర బండి ఆపి, ఆ దెయ్యం నుంచి కాపాడు స్వామి అంటూ దేవుడికి దణ్ణం పెట్టి మళ్ళీ ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ధైర్యం కోసం ఓ మంచి పాట పాడతాడు. పాట అయిపోయిన అనంతరం అనుకోకుండా వచ్చిన పెద్ద గాలికి ఆ పరదా పక్కకి తొలగి ఓ ఆందమైన యువతి కనిపించడంతో హీరామాన్ ఆశ్చర్యపోతాడు. హమ్మయ్య దెయ్యం కాదు అని ఊపిరి పీల్చుకుంటాడు. తన పేరు చెప్పి పరిచయం చేసుకుంటాడు. ఆమె కూడా తన పేరు హీరాబారు (వహీదా రెహ్మాన్) అని చెబుతుంది. రాత్రివేళ ప్రయాణం కావడంతో హీరాకి భయం కలుగకుండా హీరామాన్ చాలా జాగ్రత్తగా బండి తోలుతు పాటలు పాడుతుంటాడు. ఆ పాటలు విన్న హీరా కూడా పాట పాడుతుంది. అలా ఇద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది. ఈ ప్రయాణంలో జరిగిన కొన్ని సంఘటనలతో హీరామాన్ వ్యక్తిత్వం ఎలాంటిదో హీరా తెలుసుకుంటుంది. నోటంకి కంపెనీ దగ్గర హీరాని దిగబెట్టి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఓ బంధాన్ని వీడి వెళ్ళిపోతున్న బాధ హీరామాన్కి కలుగుతుంది. నోటంకి కంపెనీతోపాటు సర్కస్ కంపెనీ కూడా అక్కడే ఉండటంతో ఇక్కడే ఉంటే డబ్బులు సంపాదించు కోవచ్చని హీరామాన్కి స్నేహితులు చెబుతారు. దీంతో హీరామాన్ అక్కడే ఉంటాడు. అనుకోకుండా ఓ పెద్ద పోస్టర్లో హీరాని చూస్తాడు. ఆమె డాన్సర్ అని తెలుసుకుని, కలుస్తాడు. సాయంత్రం తన నృత్యప్రదర్శన ఉందని ఐదు ప్రత్యేక పాస్లను హీరామాన్కి ఇస్తుంది. స్నేహితులతో హీరామాన్ ప్రదర్శనకు వెళ్తాడు. ఆ ప్రదర్శన జరుగుతున్న తరుణంలో ఒక తాగబోతు హీరాని వేశ్య అంటూ అవమానకరంగా మాట్లాడతాడు. ఆ మాటలు విన్న హీరామాన్ తట్టుకోలేక ఆ తాగుబోతుతో పోట్లాడతాడు. ప్రదర్శన అనంతరం ఎందుకు గొడవ పెట్టుకున్నావంటూ హీరామాన్ని హీరా అడిగితే, అనకూడని మాటలన్నాడని చెబుతాడు. నా గురించి ఎవరో ఏదో అంటే నీకెందుకు కోపం?, నా గురించి గొడవ పెట్టుకోవడానికి నువ్వెవరు? అంటూ తీవ్రంగా మందలిస్తుంది. బాధతో హీరామాన్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పటివరకు నన్నొక ఆటబొమ్మలా అందరూ చూశారు. కానీ హీరామాన్ ఒక్కడే మనిషిగా చూశాడని హీరా ఆనంద పడుతుంది. హీరా నృత్య ప్రదర్శనలకు రోజూ వస్తున్న ఊరి సర్పంచ్ హీరాని ఎలాగైనా వశపర్చుకోవాలని చూస్తాడు. తనతో గడిపితే కోరినంత డబ్బు ఇస్తానని ఆశ చూపిస్తాడు. కానీ హీరా మాత్రం ససేమిరా ఒప్పుకోదు. ఆమె హీరామాన్ని ప్రేమిస్తుందని, అందుకే తన కోరిక తీర్చడం లేదని సర్పంచ్ తెలుసుకుంటాడు. తన కోరిక తీర్చక పోతే హీరామాన్ని చంపేస్తానని బెదిరిస్తాడు. ఆత్మ గౌరవాన్ని, మనసిచ్చిన మనిషిని చంపుకోవడం ఇష్టం లేక రాత్రికి రాత్రే ఎవరికీ చెప్పకుండా తన సొంత ఊరెళ్ళిపోవడానికి హీరా సిద్ధమవుతుంది. ఈ విషయం తెలుసుకున్న హీరామాన్ రైల్వేస్టేషన్కి వస్తాడు. తానొక ఆటబొమ్మనని, తన ఊరిలో ప్రదర్శనలు చేసే అవకాశం వచ్చిందని హీరామాన్కి చెప్పి హీరా వెళ్ళిపోతుంది. అమితంగా ప్రేమించిన మనిషి నిర్దయగా తనని విడిచి వెళ్ళిపోవడాన్ని తట్టుకోలేని హీరామాన్ ఇకపై తన బండిలో డాన్స్లు చేసేవారిని ఎక్కించుకోనని మూడవ ప్రమాణం చేయడంతో సినిమా ముగుస్తుంది.
- రెడ్డి హనుమంతరావు, 8332995426