Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశీ, విదేశీ యాత్రికులు దక్షిణ భారతంలో తప్పని సరిగా దర్శించవలసిన నగరాల్లో బెంగుళూరు ముఖ్యమైనది. ఇక్కడి చారిత్రక ప్రదేశాలతో పాటు ఆధునిక కట్టడాలు, ప్రదర్శనశాలలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. బెంగళూరు చూడ్డానికి వచ్చేవారు విశాలమైన మైదానంలో గంభీరంగా కనబడే బెంగళూరు ప్యాలెస్ను మిస్ చేయరు.
దర్శనీయ స్థలాల్లో రెండు రకాలుంటాయి. కొన్ని సంపూర్ణంగా ప్రభుత్వ శాఖల ఆధీనంలో వుండి, సందర్శకులను ఉచితంగానో, టికెట్పైనో వాటిలోకి అనుమతించి సదుపాయాలు కల్పించబడతాయి. మరికొన్ని పూర్తిగా కొందరి వ్యక్తిగత ఆస్తులు. వాటికి రక్షణ వలయాలుంటాయి. అవి భద్రతా సిబ్బంది సంరక్షణలో ఉంచబడతాయి. బెంగళూరులో చూడవలసిన ప్రదేశంగా బెంగళూరు ప్యాలెస్ను ఏ సమాచార దర్శిని అయినా పేర్కొంటుంది గాని అది రాజ వంశీయుల సొంత భవనం. దీనికి మరో ఉదాహరణగా ముంబైలోని పాత తాజ్ మహల్ హోటల్ను పేర్కొనవచ్చు. ఆ విశాల భవన సొగసులు బయటి నుండి సాధారణ వ్యక్తిగా చూడవచ్చు గాని, అది టికెట్ కొనుక్కొని లోపలంతా తిరిగే బాపతు దర్శనీయ స్థలం కాదు. అయినా అరేబియా సముద్రం అంచున కూచొని ఈ కట్టడాన్ని తిలకించడం ఓ అందమైన అనుభవం.
మైసూరు మహరాజ వంశమైన వడయార్ల అధీనంలో ఉన్న బెంగళూరు ప్యాలెస్ జాతీయ, అంతర్జాతీయ సమావేశాలకు, సంగీత సాంస్కృతిక కార్యక్రమాలకు అద్దెపై ఇస్తుంటారు. ఆ భవంతిని చూడాలనుకునే సందర్శకులు సెక్యూరిటీ సిబ్బంది అనుమతించినంత దగ్గరగా వెళ్ళేవారు. సినిమా షూటింగులు తరచుగా జరుగుతుండడంతో ఆ సమయాల్లో దరిదాపులకు కూడా రానిచ్చేవారు కాదు.
అయితే సందర్శకుల తాకిడికి, ఆ భవనానికి ప్రపంచంలో వున్న గుర్తింపును దృష్టిలో వుంచుకుని శ్రీ కంఠదత్త నరసింహ వడయార్ బెంగుళూరు ప్యాలెస్ను టూరిస్టు పాయింట్గా తీర్చి దిద్దారు. 2005 నుండి ప్యాలెస్ బయటి రూపాన్ని ఉచితంగా చూసేందుకు, లోపలి గదులను తిలకించేందుకు టికెట్టు విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మార్పు వల్ల సందర్శకులు ఇష్టారీతిలో భవంతిని చూసే అవకాశం దొరికింది.
బ్రిటీష్ పాలనలో ఈ మైదానంలో సెంట్రల్ హైస్కూల్ ఉండేది. దాని మొదటి ప్రిన్సిపల్ అయిన రెవరెండ్ జె.గారెట్ నివాసం కోసం ఆనాటి ప్రభుత్వం స్కూల్ పక్కన కొంత స్థలాన్ని అప్పగించింది. ఆ స్థలాన్ని అందులో ఆయన కట్టుకున్న ఇల్లును 1873లో 40 వేల రూపాయలు చెల్లించి మైసూరు మహరాజ వంశీయులు కొనుగోలు చేశారు. యువమహారాజైన పదవ చామరాజేంద్ర వడియార్ విద్యాభ్యాస నిమిత్తం బెంగళూరులో ఉండేందుకు ఈ ప్యాలెస్ నిర్మాణం జరిగింది. 1874లో మొదలై 1878కు పూర్తయింది. 456 ఎకరాల విశాలమైనంలో 45,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం ఉంది.
ప్యాలెస్ ముందు, చుట్టూరా వున్న మైదానాన్ని ఈవెంట్లకు, సినిమా షూటింగులకు ఇవ్వడంతో పాటు భవనం లోనికి సందర్శనకు అనుమతి ఆరంభించాక లోపలి గదులను అరుదైన కళాఖండాలతో అలంకరించడం జరిగింది.
వడియార్ వంశ పూర్వ రాజులు వివిధ దేశాల నుంచి సేకరించి కళాకృతులను ఈ భవనంలోని 35 విశాల గదులలో ఓ క్రమంలో ఏర్పాటు చేశారు. దర్బారు హాల్లో అలంకరించిన అద్దాలను ఇంగ్లాండు నుండి తెప్పించారు. వీటిపై వివిధ రూపాల్లో గోథిక్ చిత్రకళతో రంగురంగుల చిత్రాలు గీయబడ్డాయి. మానవ శ్రమతో కదిలే లిఫ్ట్, కర్రతో చేసిన పంఖాలు బోస్టన్ నుండి తెప్పించినారు. వీటిని ప్రఖ్యాత జి.ఈ. కంపెనీ ప్రత్యేకంగా తయారు చేసింది. మొదటి అంతస్తులో ఉన్న విశాలమైన దర్బారు హాలు చేరేందుకు దృఢమైన కర్రతో చేసిన మెట్లు వున్నాయి. చంద్రముఖి సినిమాలో పదేపదే చూయించే మెట్లు ఇవే. దర్బారు హాల్లో రాజవంశీయుల వినోదం కోసం సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. స్త్రీలు పరదా చాటు నుండి తిలకించేందుకు పై అంతస్తులో బాల్కనీలు ఏర్పాటు చేశారు. చంద్రముఖిలోని నృత్య సన్నివేశం ఈ హాలులోనే చిత్రీకరించారు. హాలు ప్రవేశద్వారం వద్ద నున్న తొండంతో కూడిన ఏనుగుతల లైఫ్ సైజులో వుండి ఆకర్షిస్తుంది.
ఒక గది పూర్తిగా రాజవంశీయుల దుస్తులు, పట్టుచీరలతో అలంకరించి వుంది. పడక గదుల్లో వారు వాడిన కర్ర సామాగ్రి, వాటిపైన నగిషీలు ఎంతో అందంగా వున్నాయి. రాజవంశీయులు తరాలుగా దిగిన ఫొటోల్లోంచి వేయి ఫొటోలను ఎంపిక చేసికొన్ని గదుల్లో వుంచారు.
వరండాల్లో ఫ్లోరింగ్ కోసం వాడిన మొజాయిక్, గ్రానైట్ రాళ్ళు రంగురంగుల రంగవల్లుల్లా కంటికింపుగా వుంటాయి. సిరామిక్ పదార్థంతో చేసిన రంగుల డిజైన్లుగల బెంచీలు, కుర్చీలు చూడడమే కాక కాసేపు కూర్చోవచ్చు కూడా.
ఏ గది దర్వాజ, కిటికీలు చూసినా వైవిధ్యం కనబడుతుంది. చాలా గదుల్లో ఫ్లోరింగ్ను కర్ర పలకలతో నిర్మించారు. కర్ర పరచిన నేల చల్లదనంతో పాటు నడిచే పాదాలకు పట్టునిస్తుంది. గదుల్లో ఉన్న గోడలకు వేసిన రకరకాల ఆకృతులు, వాటి వరుసలు చిత్రకారులు తమ చేతులతో వేసినవేటనట. అంటే వీటి ముద్రణ కోసం ఎలాంటి అచ్చులనూ వాడలేదు. కుంచెతో ఒక్కొక్క గీతను, ఆకృతిని గీశారట. ఒకే రూపంలో, పరిమాణంలో వుండే వందలాది చిత్రాలు గోడలపై చూడవచ్చు. ప్రకృతి రంగులతో వేసిన ఈ చిత్రాలు రంగులోను, రూపంలోనూ ఇప్పటికీ మెరుపులీనుతున్నాయి.
చాలామంది సందర్శకులు భవనాన్ని బయటి నుంచి చూసి మరో సందర్శన స్థలానికి వెళ్ళిపోతుంటారు. భవనం బయటి అందాన్ని మించిన సరుకు లోపలేముంటుందన్న భావన ప్యాలెస్ను ఆ కొస నుంచి ఈ కొసదాకా, దాని ముందున్న ఉద్యానవనంలో తిరిగాక కలుగుతుంది. పలు సినిమాల్లో రాజ కుటుంబీకుల ధనవంతుల నివాసంగా చూయించే ఈ భవన బాహ్యరూపం కనువిందుతోనే మనసు తృప్తిపడుతుంది.
అయితే లోపలి గదుల్లో వున్న ప్రదర్శిత వస్తువులు, కళాకృతులు కూడా మరవకుండా చూడవలసినవే. లోపలికి ప్రవేశించడానికి భారతీయులు 240 రూపాయలు, విదేశీయులయితే 450 రూపాయల టికెట్టుతో పాటు ఓ ఆడియో డివైజ్ను కూడా ఇస్తారు. సందర్శకులు ప్రవేశించిన గది నెంబరు రిమోట్లా వున్న పరికరంపై ఒత్తగానే చెవులకు పెట్టుకున్న స్పీకర్లలో ఆ నదిలోని విశేషాలు ఇంగ్లీషు లేదా హిందీ భాషలో వినిపిస్తాయి. టికెట్ ధర పెంచి ఈ మధ్య ఆరంభించిన ఈ శ్రవణ సదుపాయం గైడ్ అవసరాన్ని తీరుస్తుంది. స్టిల్ కెమెరాకు 675 రూపాయలు, ఫొటోలకోసం మొబైల్ వాడితే 255 రూపాయలు, వీడియో తీయాలనుకుంటే కెమెరాకు 1485 రూపాయలు చెల్లించాలి. అయితే ఈ చార్జీలు అధికంగా ఉన్నాయని సందర్శకులు అనుకోవడం సహజమే. 'అబ్బో' అనిపించే ఈ ధరలు కూడా లోపలికి వెళ్ళడానికి కొంత నిరోధిస్తున్నాయి కూడా. లోపలి వస్తువుల భద్రత కోసం, రద్దీని తగ్గించేందుకే ఈ ధరలు ఏర్పాటు చేశారని నిర్వాహకుల మాట.
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల దాకా సందర్శకులను అనుమతిస్తారు. లోపలికి వెళ్ళాలనుకునే వాళ్ళు కనీసం రెండు గంటలు గడిపేలా ప్లాన్ చేసుకోవాలి.
ఇంగ్లాండ్లో బ్రిటీష్ పాలకులు నివసించిన భవనాల రూపం కావాలని లండన్లో వున్న విండర్స్ కాజిల్ను నమూనాగా ఎంపిక చేసుకున్నాడు. అందుకే ఓసారి బెంగళూరు ప్యాలెస్ చూస్తే లండన్లోని రాజభవనాల్ని చూసినట్లే.
- బి.నర్సన్, 9440128169