Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శత్రు దేశాల నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలనే తపనతో సైన్యంలో చేరిన సైనికుడు అలాగే జాతీయ అథ్లెట్గా మన దేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన పాన్ సింగ్ తోమర్ జీవితం ఆధారంగా ఆయన పేరుతోనే రూపొందిన హిందీ చిత్రం 'పాన్సింగ్ తోమర్'. శత్రువుల నుంచి దేశాన్ని రక్షించుకోవాలన్న ఆయనకు తన వాళ్ళను, తన వ్యవసాయ భూమిని గూండాల నుంచి కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిన వైనం, ఓ సైనికుడిగానే కాకుండా ఓ క్రీడాకారుడిగా దేశానికి అందించిన తన సేవల్ని విస్మరించి, అవమాన పరిచిన సమాజంపై తిరగబడుతూ బందిపోటుగా మారిన తీరు ప్రేక్షకులను ఆద్యంతం ఆలోచించేలా చేస్తుంది. ప్రేక్షకుల అభినందనలు, విమర్శకుల ప్రశంసలతోపాటు 60వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది.
'పాన్ సింగ్ తోమర్' కథ..
పాన్సింగ్ తోమర్ (ఇర్ఫాన్ఖాన్) మధ్య ప్రదేశ్లోని మొరీనా గ్రామానికి చెందినవాడు. దేశానికి సేవ చేయాలన్న తపనతో సైన్యంలో చేరతాడు. శిక్షణ సమయంలో ఎక్కువ ఆహారం తినకూడదనే నియమం పాన్సింగ్కి ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే మిగిలిన సైనికులతో పోలిస్తే పాన్సింగ్ ఎక్కువగా తింటుంటాడు. ఈ విషయమై పై అధికారులు పాన్సింగ్ను పలుసార్లు మందలిస్తారు. ఆర్మీలోని స్టోర్ట్స్ విభాగంలో చేరితే తిండి విషయంలో ఎటువంటి షరతులుండవనే ఓ సీనియర్ అధికారి ఇచ్చిన సలహా మేరకు, తనకు ఇష్టం లేకపోయినా పాన్సింగ్ స్పోర్ట్స్లో జాయిన్ అవ్వాలనుకుంటాడు. స్వతహాగా పాన్సింగ్ అతి వేగంగా పరిగెత్తుతాడు. దీంతో పరుగు పందెంలో సునాయాసంగా గెలిచి స్టోర్ట్స్ విభాగంలో చేరటానికి అర్హత సాధిస్తాడు. రోజూ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ తనకు నచ్చిన ఆహారాన్ని తింటుంటాడు. అతివేగంగా పరిగెత్తుతున్న పాన్సింగ్లో మంచి అథ్లెట్ లక్షణాలున్నాయని కోచ్ గమనించి ప్రోత్సహిస్తాడు. అందులో భాగంగా స్టీఫుల్ఛేజ్ విభాగంలో శిక్షణ ఇస్తాడు. ఇండియన్ నేషనల్ గేమ్స్లో 3000 మీటర్ల స్టీఫుల్ ఛేజ్లో పాన్సింగ్ మొదటిస్థానంలో నిలవడంతో స్వర్ణపతకం వస్తుంది. ఇలా దాదాపు ఏడేండ్లు వరుసగా పాన్సింగ్ గోల్డ్మెడల్స్ సాధిస్తాడు. అయితే ఈ ఏడేండ్ల కాలంలో మన సైనికులు యుద్ధానికి వెళ్ళినప్పుడు పాన్సింగ్ని తీసుకెళ్ళరు. స్టోర్స్ విభాగంలో ఉన్న సైనికులు యుద్ధం చేయకూడదనే నిబంధన పాన్సింగ్ని ఆవేదనకు గురి చేస్తుంది. ఓ సైనికుడిగా తాను ఏదైతే చేయాలనుకున్నాడో అది చేయలేకపోతున్నానని మథనపడతాడు. ఒకానొక దశలో స్టోర్ట్స్ని వదిలేద్దామనే నిర్ణయానికి కూడా వస్తాడు. ఈ విషయాన్ని పై అధికారులకు చెబితే, వాళ్ళు అంగీకరించకపోగా త్వరలో జరిగే ఆసియన్ గేమ్స్లో నువ్వూ పాల్గొంటావని చెబుతారు. ఆ గేమ్స్లో పాన్సింగ్ పాల్గొనేందుకు అవసరమైన శిక్షణ కూడా ఇప్పిస్తారు. ఆసియన్ గేమ్స్లో పాల్గొన్న పాన్సింగ్ ఆధునిక స్పైక్ బూట్లకు అడ్జెస్ట్ అవ్వలేక ఓడిపోతాడు. ఓ పక్క రేస్లో ఓడిపోయాననే బాధతోపాటు, ఆ తరుణంలో బోర్డర్లో జరుగుతున్న యుద్ధానికి తనని పంపించలేదనే ఫ్రస్టేషన్లో ఉంటాడు.
ఆ తర్వాత జరిగిన ఇంటర్నేషనల్ మిలటరీ గేమ్స్లో మన దేశం తరఫున స్టీపిల్ ఛేజ్ ఈవెంట్లో పాల్గొని స్వర్ణపతకం సాధిస్తాడు. కొన్ని రోజుల తర్వాత రిటైర్ అయి గ్రామానికి తిరిగి వస్తాడు. పాన్సింగ్ మావయ్య భన్వర్సింగ్ (జహంగీర్ ఖాన్) కొంతమంది గూండాలతో దౌర్జన్యం చేస్తూ జనాన్ని భయపెడుతుంటాడు.
ఆ ఊరితోపాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు సైతం భన్వర్సింగ్ అంటే హడల్. ఓ రోజు పాన్సింగ్ వ్యవసాయ భూమిని భన్వర్సింగ్ ఆక్రమించుకుంటాడు. తమ వ్యవసాయ భూమిని ఆక్రమించుకోవడంతో పాటు చెరకు పంటని కూడా నాశనం చేశావంటూ పాన్సింగ్ కొడుకు అడిగితే, భన్వర్లాల్ తన మనుషులతో పాన్సింగ్ కొడుకును చచ్చేలా కొడతారు. ఈ విషయం తెలుసుకున్న పాన్సింగ్ ఆర్మీ అధికారుల సాయం తీసుకుని కలెక్టర్ను కలుస్తాడు. కొంత మంది పోలీసులతో కలెక్టర్ ఆ ఊరికి వచ్చి సమస్యని పరిష్కరించాలని ప్రయత్నిస్తాడు. అయితే భన్వర్లాల్, అతని మనుషులు చేసిన హంగామాకు, బెదిరింపులకు కలెక్టర్, పోలీసులు సైతం భయపడి వెళ్ళిపోతారు. గాయాల నుంచి కోలుకున్న కొడుకును ఆర్మీలో చేరమని పాన్సింగ్ చెప్పి పంపిస్తాడు. కొడుకు ఆర్మీలో చేరతాడు.
రోజు రోజుకి భన్వర్లాల్ ఆగడాలు శ్రుతిమించడంతో పోలీసులను సాయం కోరదామని పాన్సింగ్ పోలీస్స్టేషన్కి వెళ్తే, అక్కడ ఉన్న పోలీస్ అధికారి పాన్సింగ్ను ఘోరంగా అవమానిస్తాడు. ఓ సైనికుడిగానే కాదు దేశానికి గుర్తింపు తీసుకొచ్చిన క్రీడాకారుడికి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా బూతులు తిడుతూ పాన్సింగ్ సాధించిన గోల్డ్మెడల్స్ను బయటికి విసిరేస్తాడు. పాన్సింగ్ తనపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడని తెలుసుకున్న భన్వర్లాల్, తన మనుషులతో పాన్సింగ్ ఇంటిపై దాడి చేసి, పాన్సింగ్ 70 ఏండ్ల తల్లిని అత్యంత పాశవికంగా చంపేస్తాడు. 70 ఏండ్ల తన తల్లిని దారుణంగా చంపేసిన భన్వర్లాల్ని, అతని మనుషుల్ని ఎలాగైనా మట్టుపెట్టాలని కొంతమంది మద్దతుదారులతో కలిసి పాన్సింగ్ బందిపోటుగా మారతాడు.
తన గ్రామంలోనే కాకుండా చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న ధనవంతులను కిడ్నాప్ చేసి, డిమాండ్ చేసిన డబ్బుతో పాన్సింగ్ తన గ్యాంగ్ని విస్తృతం చేసుకోవడంతోపాటు వారి అవసరాలు తీరుస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు పక్కా వ్యూహం పన్ని భన్వర్లాల్ని, అతని తమ్ముడిని, వాళ్ళ మనుషులను పాన్సింగ్ గ్యాంగ్ హతమారుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది ఆర్మీ అధికారులు, పాన్సింగ్ భార్య, కొడుకు, స్నేహితులు పాన్సింగ్ను పోలీసులకు లొంగిపొమ్మని చెబుతారు. లొంగిపోవడం తన సిద్ధాంతానికి వ్యతిరేకమని, తన మనస్సాక్షి చెప్పినట్టుగానే ఉంటానంటాడు. పోలీసులకు దొరక్కుండా తన గ్యాంగ్తో పాన్సింగ్ ఛంబల్ లోయలో దాక్కుంటాడు. అంతేకాకుండా గ్యాంగ్ని సైతం భాగాలుగా విభజించి దూరంగా పంపిస్తాడు. ఈ క్రమంలో పాన్సింగ్ని పట్టిస్తే నగదు బహుమతి ఇస్తామంటూ పోలీసులు పేపర్లలో ప్రకటనలు కూడా ఇస్తారు. తన గురించి పోలీసులు చేసిన ప్రకటనలు చూసిన పాన్సింగ్ ఓ విలేకరికి తానెందుకు బందిపోటుగా మారాననే విషయాన్ని కూలంకషంగా ఇంటర్వ్యూ రూపంలో ఇస్తాడు. ఆ ఇంటర్వ్యూ మరుసటి రోజు పేపర్లో ప్రచురితమై సంచనలం సృష్టిస్తుంది. దీంతో పోలీసులు పాన్సింగ్ను పట్టుకునేందుకు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తారు. ఈ క్రమంలో పాన్సింగ్ గ్యాంగ్లోని ఓ వ్యక్తికి (నవాజుద్దీన్ సిద్ధిఖీ) పోలీసులు డబ్బు ఆశ పాన్సింగ్ గ్యాంగ్ మొత్తం ఎప్పుడు కలుస్తారనే సమాచారాన్ని ఇవ్వమని అడుగుతారు.
నెల రోజుల తర్వాత ఓ గ్రామంలో పాన్సింగ్ తన అనుచరులందరూ కలుసుకోనున్నారనే విషయాన్ని నవాజుద్దీన్ సిద్ధిఖీ పోలీసులకు చేరవేయడంతో 500 మంది పోలీసులు పాన్సింగ్ గ్యాంగ్పై తూటాల వర్షం కురిపిస్తుంది. ఈ దాడిలో పాన్సింగ్తోపాటు గ్యాంగ్ సభ్యులందరినీ పోలీసులు విచక్షణా రహితంగా కాల్చి చంపేస్తారు. సైనికుడు, జాతీయ అథ్లెట్గా పేరొందిన పాన్సింగ్ తోమర్ ఓ బందిపోటుగా పోలీసుల చేతిలో దారుణంగా చనిపోయాడనే ఫీల్తో సినిమా ముగుస్తుంది.
భారత సైన్యంలో సైనికుడు, జాతీయ అథ్లెట్ అయిన పాన్ సింగ్ తోమర్ జీవితం ఆధారంగా ఆయన పేరుతోనే రూపొందిన ఈ బయోగ్రాఫికల్ చిత్రాన్ని తిగ్మాన్సు దులియా దర్శకత్వం వహించారు.
2010లో రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ చిత్రంలో ఇర్ఫాన్ఖాన్, మహీగిల్, నవాజుద్దీన్ సిద్దిఖీ, విపిన్ శర్మ వంటి హేమాహేమీలు నటించారు. కథానుసారం అభిషేక్ రారు సమకూర్చిన నేపథ్య సంగీతం, ఆసీమ్ మిశ్రా కెమెరా పనితనం, ఆర్తి బజాజ్ ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్స్గా నిలిచాయి.
విశేష ప్రేక్షకాదరణతోపాటు విమర్శకుల ప్రశంసల్నీ సొంతం చేసుకున్న ఈ చిత్రం 60వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అలాగే జాతీయ ఉత్తమ నటుడిగా ఇర్ఫాన్ఖాన్ ఎంపికవ్వడం విశేషం.
వాస్తవిక పాత్రలకు చిరునామా..
అత్యద్భుతమైన విలక్షణ నటనకు కేరాఫ్ భిన్న పాత్రలకు ముఖ్యంగా వాస్తవిక పాత్రలకు కేరాఫ్గా నిలిచిన బాలీవుడ్ విలక్షణ నటుల్లో ఇర్ఫాన్ ఖాన్ ఒకరు. 'సలామ్ బాంబే'తో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం దాదాపు మూడు దశాబ్దాలుగా అప్రతిహతంగా కొనసాగుతోంది.
'ది లంచ్ బాక్స్', 'హైదర్', 'డీ డే', 'గూండే', 'సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్స్టర్ రిటర్న్స్', 'పీకూ', 'తల్వార్', 'జజ్బా', 'మదారీ', 'లైఫ్ ఇన్ ఏ మెట్రో', 'హిందీ మీడియం', 'పాన్ సింగ్ తోమర్', '7 ఖూన్ మాఫ్', 'మక్భూల్', 'ముంబై మేరీ జాన్', 'బ్లాక్మెయిల్' వంటి తదితర ఎన్నో చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ఒకదానితో మరొకటి భిన్నంగా ఉండి ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి.
పలు టెలివిజన్ సిరీస్లతోపాటు వివిధ షోల రూపంలో వెండితెర ప్రేక్షకుల్నే కాకుండా బుల్లితెర ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకున్నారు.
'ది వారియర్', 'ద నేమ్సేక్', 'ద డార్జిలింగ్ లిమిటెడ్', 'స్లమ్డాగ్ మిలీనియర్', 'లైఫ్ ఆఫ్ ఫై', 'న్యూయార్క్ ఐ లవ్యు', 'ద అమేజింగ్ స్పైడర్ మాన్', 'జురాసిక్ వరల్డ్', 'ఇన్ఫెర్నో' వంటి తదితర చిత్రాలతో బాలీవుడ్లోనే కాకుండా హాలీవుడ్, బ్రిటన్ చిత్రాల్లోనూ నటించి అంతర్జాతీయంగానూ సత్తా చాటారు. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్న ఇర్ఫాన్ఖాన్ను కేంద్రప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం వరించింది. తెలుగులో మహేష్బాబు హీరోగా నటించిన 'సైనికుడు' చిత్రంలోనూ నటించారు.
- రెడ్డి హనుమంతరావు, 8332995426