Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగులో వచ్చిన యాత్రా సాహిత్యాన్ని పరిశీలిస్తే యాత్రారచనలు పత్రికలలో వ్యాసాలుగా, బ్లాగులలో పోస్టులుగా చాలానే వచ్చాయి. అనేక ట్రావెలాగ్స్ వచ్చాయి. రచయితలే యాత్రికులై చేసిన ప్రయాణాల గురించి వెలువడ్డ పుస్తకాలు పాఠకులను ఆకట్టుకున్నాయి. ఒక యాత్రారచన పాఠకులను ఎందుకు ఆకట్టుకోగలగుతుంది అని ప్రశ్నించుకుంటే - ఆయా ప్రాంతాలు, అక్కడి మనుషులు, వారి జీవితాలు, సంస్కృతి తదితర అంశాలను ఒడిసిపట్టుకుని పాఠకులకు అందించగలిగితే.. ఆ యాత్రారచన గొప్ప అనుభూతినిస్తుంది. ఇటీవలి కాలంలో తెలుగులో యాత్రా సాహిత్యం బాగా ఊపందుకుంది. ప్రయాణాల్లో ప్రకృతీ, ప్రాంతాలే కాదు... ప్రజలూ ముఖ్యమేనంటున్నారు యాత్రారచయితలు. వారి దృష్టి అందమైన దర్శనీయ స్థలాల సందర్శనం నుంచి ఆయా ప్రాంతాలలోని అద్భుతమైన మనుషులపై మళ్ళింది. సాధారణ మనుషులే అయినప్పటికీ వారిలో ఉండే అసామాన్యమైన విశిష్టతలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి రచనల్లోంచి కొందరు వ్యక్తులని, ప్రకృతిని, మానవీయ సంవేదనలని సంక్షిప్తంగా పరిచయం చేస్తాను.
యాత్రా రచనల్లో మనుషులు
ఓసారి నైజిరీయాలో లాగోస్లోని లెక్కి ఏరియాలో బస చేశారు యం.ఆదినారాయణగారు. ఆ కాలనీలో ఉద్యోగాలు చేసే వాచ్మెన్లను పరిచయం చేసుకుని వారి జీవితాల గురించి తెలుసుకుని, పాఠకులకీ తెలియజేస్తారు 'భూభ్రమణకాంక్ష'లో. ఓ వాచ్మెన్ తమ ఊర్లో దెయ్యాలు తిరుగుతుంటాయనీ, అవి పైకి ఎక్కకూడదని ఇళ్ళల్లో మెట్లు అడ్డదిడ్డంగా కట్టుకుంటారని చెబితే ''మా దేశంలో దెయ్యాలు గాల్లో తేలిపోతూ వస్తాయి. మీ దేశం దెయ్యాలకి నడక అంటే ఇష్టం కాబోలు'' అంటూ చమత్కరిస్తారు రచయిత. మెక్సికోలో డౌన్స్ట్రీట్ లో ఉండే క్రైమ్ రేట్ గురించి చెబుతూ ''మనం ఒక మంచి కారు కొనుక్కుంటే మాఫియా వాళ్ళు ఇంటికి వచ్చి, 'మనం కార్లు మార్చుకుందామా' అంటూ ఎంతో మర్యాదగా మన చేతికి వాడి పాత కారు తాళాలు ఇచ్చి, మన కొత్త కారు తాళాలని తుపాకీ మొనతో తీసుకుని వెళ్ళేవాళ్ళు'' అంటారు మైగూల్ అనే వ్యక్తి రచయితతో. హాస్యంగా అన్నా, ఆ మాటల వెనుక ఎంతో బాధ ఉంది. వివిధ దేశాలలో ఉన్న ఇలాంటి వ్యక్తులు ఈ పుస్తకం ద్వారా మనకి పరిచయం అవుతారు. ఇదే పుస్తకంలో ఓ చోట- ఓస్లోలో రూజ్ అనే వ్యక్తితో. ''మనం ధైర్యంగా ముందుకి పోతూ ఉంటే మనకి సహాయం చేసే వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు అని పూర్తి నమ్మకం కలిగింది నాకు'' అంటారు. మంచి మనుషులుంటేనే ఇది సాధ్యమవుతుంది.
గోడలు లేని ఇల్లెక్కడైనా చూశారా? దాపరికం లేని జీవనానికి అది ప్రతీక కదూ? అంతా ఓపెన్నెస్ అయితే, ఇక మరుగు ఎందుకు? తనకంటూ ఒక ఉనికి లేకపోవడమే మంచిదని భావించే ఓ మహిళ తన ఇంటిని గదుల విభజన లేకుండా, గోడల అడ్డు లేకుండా తీర్చిదిద్దుకుంటుంది. వీళ్ళే నావాళ్ళు అనుకోకుండా ఎవరైనా నా మనుషులే అనుకునే ఆవిడ పట్ల గౌరవభావం కలుగుతుంది. తన జీవితాన్ని ఆమె తీర్చిదిద్దుకున్న వైనం పాఠకులకి ఉత్తేజాన్ని కలిగిస్తుంది.
పిల్లలు ఎదిగి గొప్పవాళ్ళవడం తల్లిదండ్రులకు సంతోషం కలిగించే అంశమే.. అయినా తన జీవనాధారాన్ని వదులుకుని వాళ్ళ దగ్గర బ్రతకడం ఇష్టంలేని ఓ వ ద్ధురాలు ఎంతో మానసిక దృఢత్వంతో చిన్న దుకాణాన్ని నడుపుతుంది. కొడుకు డాక్టరూ, కూతురు ఐటి ప్రొఫెషనల్. అయితేనేం? ఎవరి జీవితం వాళ్ళదే.. వాళ్ళ స్థాయిలో వాళ్ళు గొప్పగా బ్రతుకుతుంటే నా స్థాయిలో నేను గొప్పగా ఉంటున్నాననుకుంటారావిడ.
తాగుడికి బానిసై భర్త చనిపోతే, నలుగురు పిల్లలతో జీవనం సాగిస్తూ చిన్నపాటి హోటల్ నడుపుతూ ఉన్నంతలో గొప్పగా బ్రతుకుతున్న ఓ మహిళది స్ఫూర్తిదాయక గాథ. ప్రపంచం మీద భరోసా ఉన్న వ్యక్తి. బతుకు భయం లేని మనిషావిడ. వీరంతా దాసరి అమరేంద్రగారి 'అండమాన్ డైరీ'లో తారసపడతారు.
''ఇరవై దాటేశాయి. చదువుకు పనికిరాననిపించింది. ఏమన్న ఉద్యోగం దొరుకుతుందా అని ప్రయత్నించాను. గవర్నమెంటన్న మాట ఎత్తే అర్హత లేదుగదా- ప్రైవేటుగా చిన్నచిన్న ఉద్యోగాలు... ఏదీ స్థిరమైనదిగాదు. నిలకడ ఉన్నది కాదు. అయినా ఎంతో కొంత సంపాదన. చివరికో సినిమా సీడీలు
అద్దెకిచ్చే షాపులో నిలదొక్కుకున్నాను అంటాడో ఆటో డ్రైవరు మనసు విప్పి తన కథను వివరిస్తూ.
''ఒప్పుకోవడమా?! ఆరునెలలపాటు అతిరహస్యంగా చేశానీపని. నా వయసులో ఇలాంటి పని రహస్యంగా చెయ్యడం ఎంత కష్టమో తెలుసుకదా! చివరికి విషయం బయటపడింది. ఇంట్లో ప్రపంచ యుద్ధం! పరువు ప్రతిష్ట'ల గురించే కాకుండా నా ఆరోగ్యమూ, ప్రమాదాలు జరిగే ప్రమాదం గురించి కూడా పిల్లలు ఆందోళనపడ్డారు. చాలా గట్టిగా మానేయమని చెప్పారు. బతిమాలారు. బెదిరించారు. నేను లొంగలేదు. చివరికి వాళ్లకీ అర్థమయినట్టుంది, నేను మాననని- ఊరుకొన్నారు.'' అంటూ అమెరికాలోని ఓ మహిళా క్యాబ్ డ్రైవర్ వివరిస్తుంది. వీరిద్దరూ అమరేంద్రగారి 'మణిమహేష్ - మరి తొమ్మిది' పుస్తకంలో కనబడతారు.
పోలాండ్లోని క్రాకో అనే ఊర్లో ఓ పర్వతాన్ని అధిరోహించడం కోసం క్యూలో నిలుచున్న సందర్భంగా అక్కడ రాగితో చేసిన చిత్రమైన ఆకారాలను చేసి అమ్మజూపుతున్న ఓ వృద్ధుడిని పరిచయం చేస్తారు వేమూరి రాజేష్ 'నా ఐరోపా యాత్ర'లో. ఇదే పుస్తకంలో - నెదర్లాండ్స్లోని ఎగ్మొండ్ అనే ప్రాంతంలో విడిది చేసి, ఓ హోటల్లో పని చేస్తున్న కుర్రాడితో సంభాషించి అతని జీవనశైలిని మనకి పరిచయం చేస్తారు. ఈ అబ్బాయిని గురించి తెలుసుకోడం ప్రేరణనిస్తుంది.
''యాత్రికులకు దారిలో ఎంతోమంది కలుస్తుంటారు. కొంత దూరం కలిసి నడిచాక మళ్ళీ విడిపోతారు. వారు జీవితంలో మళ్ళీ ఎప్పుడూ కనబడకపోవచ్చు, కాని మనసు మూలల్లో ఎక్కడో అక్కడ శాశ్వతంగా దాక్కుంటారు'' అంటారు లోకేశ్వర్ 'అవుకు' రిజర్వాయర్ వద్ద తమతో ఉన్న మోహనరాజు అనే కానిస్టేబుల్ గురించి. ఈయన ఓ గొప్ప భావుకుడు, ప్రకృతివాది, కవి! ఖాకీ డ్రెస్సు లోపల కవి హృదయాన్ని పాఠకులకు పరిచయం చేస్తారు నల్లమల ఎర్రమల దారులలో... యాత్ర' పుస్తకంలో.
ఆత్మకూరులోని డా||గౌరీనాథ్ అనే విలక్షణ వైద్యుడిని పరిచయం చేసి - ఎటువంటి దర్పమూ, భేషజమూ లేకుండా, ఏ హడావిడీ చేయకుండా లుంగీ బనీయన్తో రోగులను పరీక్షించే ఆయన మానవ హక్కుల కోసం పోరాడి జైలుకు కూడా వెళ్ళొచ్చారని చెబుతారు లోకేశ్వర్ ఈ పుస్తకంలో.
కిర్గిజ్స్థాన్లో వైద్యం అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులలో వాసు లాంటి కష్టపడే విద్యార్ధుల గురించి చదువుతుంటే ఆనందం కలిగితే, అజిత్, వికాస్ల గురించి తెలుసుకున్నాక, మనసు భారమైపోతుంది. దేశం కాని దేశంలో, హైదరాబాద్ అనే పదం వినబడగానే ప్రాణం లేచొచ్చి, ఆప్యాయంగా పలకరించిన ఇద్దరు తెలుగమ్మాయిల ఆనందాన్ని పాఠకులతో పంచుకుంటారు పరవస్తు లోకేశ్వర్ 'సిల్క్రూట్'లో సాహసయాత్ర'లో..
ప్యారిస్లో ఓ భారతీయ భోజనశాలలో భోజనం చేస్తుంటే ఒక సర్వర్ తెలుగులో మాట్లాడి 'నాది వనస్థలిపురం సార్' అంటే దేశభాషలందు తెలుగు లెస్స అని మురిసిపోతారు లోకేశ్వర్. అక్కడి సంగీతా హోటల్లో సర్వ్ చేసిన గుజరాత్ అమ్మాయి హౌటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతూ, పార్ట్టైం జాబ్ చేస్తోందని చెబుతారు. ఇట్లా దేశం కాని దేశంలో మనుషులను పరిశీలిస్తుంటే 'ఎల్ల లోకములు ఒక్క ఇల్లై'
అన్న గురజాడ కవిత జ్ఞాపకం వచ్చింది, శ్రీశ్రీ 'మానవుడా, మానవుడా' గేయమూ గుర్తొచ్చిందంటారు లోకేశ్వర్ 'కలల దారులలో యూరప్ యాత్ర'లో.
''తమ చుట్టూ ఉండే మనుషుల గురించి ఆలోచించే మనుషులు భారతదేశానికి ఎక్కువ అవసరం'' అంటారు వాడ్రేవు చినవీరభద్రుడు గారు 'నేను తిరిగిన దారులు' పుస్తకంలో. కాదనగలమా? ఇదే పుస్తకంలోని ఆదిమానవుడూ, పూర్ణ మానవుడూ' అనే వ్యాసం తాత్వికతతో కూడినది.
''వారి గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత నాలో, మా గురించి తెలుసుకోవటానికి ఏముందన్న ప్రశ్న వారిలో'' అంటారు రెహాన 'ఎడారి ఒడిలో నిఖార్సైన జీవితాలు' వ్యాసంలో. ఇంకా ఇలాంటి చక్కని వ్యాసాలున్న పుస్తకం 'సరిహద్దుల్లో'. ''ఇండో-పాక్ బోర్డర్స్లో అక్కడి ప్రజలతో మాట్లాడాను. సిపాయిలతో మాట్లాడాను. వారి ఉద్విగతలు, ధైర్యసాహసాలు, భయాందోళనలు, ఇప్పటికీ నాలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఎన్నో గాథలు, మరెన్నో వ్యథలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి'' అంటారు రెహాన. ఇలా ఎందరెందరో ఈ పుస్తకాలలో కలుస్తారు, మనలోపలి మనిషిని కదిలిస్తారు.
యాత్రారచనల్లో ప్రక తి - భావుకత
''దూరంగా ఉన్న పర్వతాల చాటున పైకి లేచిన ఒక మంచు శిఖరానికి సూర్యకిరణాలు అల్లుకుపోయాయి.''. ''ఆకులన్నీ రాల్చేసుకున్న ఎర్రని పూలచెట్లు కొండంత ధీమాగా నిలబడ్డాయి'' లాంటి వాక్యాలు పాఠకులనూ మానసికంగా ఆ పర్వత ప్రాంతాలలో తిప్పుతాయి. నేపాల్ల పర్యటిస్తున్న సందర్భంగా యం.ఆదినారాయణగారు తన అనుభూతిని అక్షరాల ద్వారా పాఠకులకు అందించారు ''భూభ్రమణ కాంక్ష''లో. ఇరాన్లోని ఓ ఎడారి గ్రామంలో బస చేసినప్పుడు ఓ రోజు వేకువ జామునే మెలకువ వచ్చిందట ఆదినారాయణగారికి. ''సగం కరిగిన చందమామ దానిమ్మ పూలకొమ్మల చాటున, దోరగా కాలిన రొట్టెముక్కలాగా ఊగి పోతున్నాడు'' అంటారు చంద్రుడిని చూసి - ఇదే పుస్తకంలో.
''పాలు పంచదార లేని తేనీరునే నీరుగా భావించి సేవించి తరించి వణికించే ఆ రాత్రి చలి చెలితో కలిసి కాళ్లీడుస్తూ నడుస్తూ గదికి చేరుకుంటే అలసిసొలసిన శరీరానికి ఇక హాయిగా మత్తుగా మొద్దు నిద్ర ఎందుకు పట్టదు?'' అని పాఠకులని ప్రశ్నించడంలోనూ, ''రోడ్డుకు రెండువైపులా పచ్చని చెట్లమీద అల్లరల్లరిగా నవ్వుతున్న పువ్వులు. ఆ చెట్లక్రిందనే అరచేయంత పెద్దసైజు రోజాపూవులు పూజకు పనికిరాని పువ్వుల్లా వాడి వడలి రాలి నేలమీద దొర్లిపడి ఏడుస్తున్నాయి. అది ఇంకోరకమైన పుష్పవిలాపం'' అని బాధపడడంలోనూ, రచయిత భావుకత్వం వ్యక్తం అవుతుంది పరవస్తు లోకేశ్వర్ 'సిల్క్ రూట్లో సాహసయాత్ర'లో.
''పచ్చల ద్వీపాలూ.. పగడాల సంద్రాలూ..'' అని ఉపశీర్షిక కలిగిన 'అండమాన్ డైరీ'లో రాస్ ద్వీపం గురించి, సీతానగర్ బీచ్ గురించి దాసరి అమరేంద్ర చేసిన వర్ణన పాఠకుల మనస్సుల్లో కూడా అండమాన్స్ వెళ్ళిరావాలనే కోరికని నాటుతుంది.
చూసే కన్నుంటే రాళ్ళు కూడా మనుషుల్లా కనిపిస్తాయి. తిరుపతి నుంచి అరక్కోణం వెళ్తుండగా ఓ చోట అదుÄ్భత శిలావిన్యాసం కనిపించింది అమరేంద్రగారికి. ఏదో ఒక కుటుంబ సభ్యులో, క్రికెట్ ఆటగాళ్ళో - నిలబడి, తలా తలా దగ్గరకు చేర్చి అతి ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్న ధోరణిలో నాలుగయిదు నిట్టనిలువు బృహత్ శిలలు. ఆయన ప్రమేయం లేకుండానే స్కూటర్ ఆగింది, కెమెరా తన పని తాను చేసుకుపోయింది. ఈ దృశ్యం 'కొన్ని కలలు ఒక స్వప్నం' పుస్తకంలో దర్శనమిస్తుంది. ఆ ఫొటో చూసిన పాఠకులు అబ్బురపడతారు..
రోళ్ళపాడు అభయారణ్యంలో ప్రకృతినీ, పక్షులనీ చూస్తూ తాను తన్మయులవడమే కాక, పాఠకులను పరవశింపజేస్తారు లోకేశ్వర్ 'నల్లమల ఎర్రమల దారులలో... యాత్ర' పుస్తకంలో.
ప్రపంచీకరణ మొదలయ్యాక కొన్ని ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళినా ఒకే రకంగా అన్పిస్తాయని చెబుతారు. షాపింగ్ మాల్ ఫార్మాట్ అంతా అన్ని దేశాల్లోనూ ఒకేలా ఉంటుందంటారు వేమూరి రాజేష్ గారి 'నా ఐరోపా యాత్ర'లో..
యాత్రారచనల్లో సంవేదనాశీలత
కేవలం ప్రదేశాలనో, ప్రకృతినో పలకరించి వస్తే నిజమైన యాత్ర అవదు. ప్రాంతాలతో పాటు అక్కడి మనుషులను చూసి, కలసి, వారి కతలను విని, వారితో ముచ్చటిస్తేనే ఆ యాత్ర సంపూర్ణమవుతుందని విశ్వసిస్తారు యం. ఆదినారాయణ, పరవస్తు లోకేశ్వర్, దాసరి అమరేంద్ర, వేమూరి రాజేష్ వంటి యాత్రికులు.
అలగనూరు రిజర్వాయర్ని చూస్తూ, శ్రీశైలం బ్యాక్ వాటర్స్ని ప్రస్తావిస్తూ 'అభివృద్ధి వెనుక వెలుగునీడల ఆట' అని అంటారు లోకేశ్వర్ 'నల్లమల ఎర్రమల దారులలో... యాత్ర' పుస్తకంలో.
ఎటువంటి శత్రుత్వం లేకుండా సాటి మనిషిని అత్యంత క్రూరంగా చంపగల మనస్తత్వాలని నాజీలకి హిట్లర్ ఎలా నూరిపోయగాలిగాడో అర్థం కాని విషయమని అంటారు వేమూరి రాజేష్ 'నా ఐరోపా యాత్ర'లో.
''ఆకలికి అవమానం లేదు/ కడుపు నిండిన విశ్వమానవుడు/ నాకు అమెరికాలోనూ కనబడలేదు'' అంటారు ఎండ్లూరి సుధాకర్ '' 'ఆటా' జనికాంచె'' లో. అమెరికా నుంచి ఏం నేర్చుకోవాలో, దేన్ని ద్వేషించాలో, ఏం ఆశించాలో కవితాత్మకంగా చెబుతారు.
''పది రోజులపాటు కాశ్మీర్ అందాల్ని గుండెల్లో వొంపుకుంటూ పరవశించిపోయినా నాలోపలెక్కడో ఓ ముల్లు గుచ్చుకుంటూనే వుంది. శ్రీనగర్ సందుగొందుల్లో పేలుతున్న గ్రెనేడ్లు, భద్రతా దాళాల మోహరింపులు, పనుల్లేక ఉద్యోగాల్లేక గుంపులు గుంపులుగా రోడ్ల మీద తారసపడే కాశ్మీరీ ముస్లిమ్ యువకుల నిరాశామయమైన చూపులు ఇంకా నన్ను వెంటాడుతూనే వున్నాయి'' అంటారు కొండవీటి సత్యవతి 'తుపాకీ మొనపై వెన్నెల'లో.
భారతదేశానికి విషాదం మిగిల్చిన చోటు, తరువాత పాకిస్తాన్కి సంతోషాల కూడలి అయ్యిందని పాకిస్తాన్ లోని ఓ కూడలి గురించి చెబుతారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ 'పాకిస్తాన్లో పది రోజులు'లో.
మానవ జీవన సరళిలోని బహుళ కోణాల్ని వెల్లడించడం దేవులపల్లి కృష్ణమూర్తి గారి 'యాత్ర' లోని విశిష్టత. యాత్రా కోణంతో పాటు మానవీయ కోణం కూడా అమరడం ఈ పుస్తకం విశేషం. మిత్రులు, వారి కుటుంబ సభ్యులతో వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు ఉద్దేశించిన ఓ సాధారణ బస్సు ప్రయాణాన్ని అపురూపమైన యాత్ర స్థాయికి తీసుకెళ్ళారు దేవులపల్లి కృష్ణమూర్తిగారు.
యాత్రాసాహిత్యం ప్రయోజనం
యాత్రాసాహిత్యం పాఠకులకేమిస్తుంది అని ప్రశ్నించుకుంటే... కొత్త ప్రదేశాలను పరిచయం చేస్తుంది, అపరిచితులను మిత్రులుగా చేస్తుంది, పరిచయస్థులను సన్నిహితులుగా మారుస్తుంది. ప్రపంచం గురించి, ప్రకృతి గురించి, తోటి మనుషుల గురించి తెలుపుతుంది. కొన్ని మార్మిక అనుభూతులతో మమేకం చేస్తుంది. ముఖ్యంగా మనల్ని మనకి కొత్తగా పరిచయం చేస్తుంది. మనలో మరుగున పడుతున్న భావుకత్వాన్ని తట్టిలేపి జీవనానందాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నించమని పురిగొల్పుతుంది. ఇవి చాలవా?
- కొల్లూరి సోమ శంకర్