Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక అడవిలో నాలుగు అమాయక కుందేళ్ళు, ఒక సోమరి కోతి వుండేవి. ఆ కోతికి కుందేళ్ళ అమాయకత్వం చూసేటప్పటికి ఎలాగైనా వాటిని భయపెట్టి, వాటి ఆహారాన్ని తాను తినాలనుకుంది.
ఒకరోజు ఆ కుందేళ్ళు పండ్లు తెచ్చుకుని తింటావుంటే వురుక్కుంటా వచ్చి ''అళ్ళుళ్ళూ... వాటిని తినొద్దు. అవి తింటే చచ్చిపోతారు. అడవిలో పళ్ళన్నీ బాగా విషపూరితమై పోయాయి. దేనిలో విషముందో దేనిలో లేదో తెలీదు. పోయిన నెలలో మా బంధువులు పదిమంది చచ్చిపోయారు. అయితే ఓ ముని నాకు ఈ ఔషధాలున్న మొక్క ఇచ్చాడు. పొరపాటున విషం తిన్నా... వెంటనే ఈ మొక్క ఆకు ఒకటి తింటే చాలు... ఏమీ కాదు'' అంది.
కోతి మాటలకు కుందేళ్ళు భయపడ్డాయి. ఒక పక్క ఆకలి, మరోపక్క భయం.
మళ్ళీ కోతి ''సరే... మీరంతా చాలా మంచివాళ్ళు. మీకోసం ఒక సహాయం చేస్తా. మీరు ఏం తెచ్చినా ముందు నాకు పెట్టండి. నేను తిన్నాక, నాకు ఏమీ కాకపోతే అప్పుడు మీరు తినండి. నాకేమన్నా అయినా ఈ మొక్క నన్ను కాపాడుతుంది'' అంది.
కుందేళ్ళు చానా సంబరపడ్డాయి. ఆరోజు నుంచీ తాము తెచ్చుకున్న ఆహారంలో కొంత ముందుగా కోతికి పెటేవి. కుందేళ్ళు పెట్టే ఆహారాన్ని తినేది. అప్పుడప్పుడు విషం తిన్నట్టు కింద పడి గిలగిలా కొట్టుకున్నాట్టు నటించేది కోతి. వెంటనే తన దగ్గరున్న ఆకుల్లో ఒకటి నలిపి నోటిలో వేసుకొని కాసేపటికి పైకి లేచేది. ఇది చూసిన కుందేళ్ళు బాగా భయపడేవి.
ఒకరోజు చెట్టు మీది చిలుక ఇదంతా చూసింది. కోతి వెళ్ళిపోయిన తరువాత కుందేళ్ళను విషయమేంటని అడిగింది. కుందేళ్ళు చెప్పింది విని పడీపడీ నవ్వి... ''మీరు మరీ ఇంత అమాయకంగా వుంటే ఎలా బతుకుతారు'' అని, తర్వాత ఏం చేయాలో చెప్పింది.
తర్వాతి రోజు కుందేళ్ళు ఆహారంగా అరటిపళ్ళు తెచ్చాయి. అవి తిన్న కాసేపటికే కోతికి విపరీతమైన కడుపునొప్పి వచ్చేసింది. అమ్మా అబ్బా అంటూ కిందామీదా పడతా నొప్పితో విలవిలలాడసాగింది. అప్పుడా కుందేళ్ళు ''కోతి మామా... మేమే కావాలని వాటిలో కొంచెం విషం కలిపి తెచ్చాం. నీ దగ్గర ఔషధాల మొక్క వుంది గదా... ఒక ఆకు తిను. వెంటనే తగ్గిపోతుంది. ఈ చిలుకకు నీ దగ్గరున్న మొక్క ఔషధ గుణాలున్న ఆకుల గురించి చెప్తే నమ్మలేదు. అందుకే దీనికి బుద్ధి రావడం కోసం ఇలా చేశాం'' అన్నాయి.
కోతి అదిరిపడింది. ''అయ్యో... ఎంత పని చేశారు. అబద్ధం చెప్పి ఇన్ని రోజులు మిమ్మల్ని మోసం చేశాను. నా దగ్గర షౌషధాల మొక్కా లేదు. అంతా వుత్తుత్తిదే'' అనింది.
అప్పుడు కుందేళ్ళు మరో పండు ఇచ్చి ''నీ కడుపు నొప్పికి విరుగుడు మందు ఇందులో వుంది తిను. నువ్వు మా నలుగురినీ మోసం చేసినా మేం నీకు హాని చేయం'' అన్నాయి. కోతి ఆ పండు తిన్న కాసేపటికి మామూలుగా అయిపోయింది.
''అళ్ళుళ్ళూ... మీరు ఎంత మంచివాళ్ళు. నన్ను కాపాడారు. ఇకపై ఎవరినీ మోసం చేయను'' అంటూ అడవిలోకి పోయింది. మంచి మంచి తీయతీయని పళ్ళు తీసుకువచ్చి వద్దువద్దంటున్నా వినకుండా కుందేళ్ళకు పెట్టింది. అప్పటినుంచీ అవన్నీ కలసిమెలసి హాయిగా బతకసాగాయి.
- డా.ఎం.హరి కిషన్, 9441032212