Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలోనే అతి పెద్ద 600 అడుగుల సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహం నర్మదానది మధ్యలో నెలకొల్పి ''సర్దార్ వల్లభారు పటేల్ రాజరిక సంస్థానాలు అన్నీ భారతదేశంలో విలీనం చేసి భారతదేశ భౌగోళిక ఐక్యత సాధించాడు. మేం జి.ఎస్.టి తీసుకుని వచ్చి దేశాన్ని ఆర్ధికంగా ఐక్యం చేసాం'' అన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం విన్నాక నాకో సందేహం వచ్చింది. దేశం భౌగోళికంగా ఐక్యం అయితే సరిపోతుందా? మానసికంగా ఐక్యం కావలసిన పని లేదా? పటేల్ సగం చేసి వదిలేసిన పనిని పటేల్ అనంతరం మన నాయకులు ఎంత వరకు పూర్తి చేశారు అని ప్రశ్నించుకుంటే వచ్చే జవాబు శూన్యం. ప్రజల మధ్య మానసికంగా ఐక్యత రావాలి అంటే సాంస్కృతిక బదలాయింపు జరగాలి. ఆచార, వ్యవహారాలలో సారళ్యం ఉండాలి. సంప్రదాయాన్ని, ఆధునికతనూ కలగలుపుకుని పోయే సర్వ, సమగ్ర, సమన్వయ దృక్పథం ఉండాలి. విభిన్న భాషలు, విభిన్న మతాలూ, విభిన్న కులాలు ఉన్న ఇంత పెద్ద దేశంలో ఐక్యత సాధించడం అనేది ఒక రాలెగావ్సిద్ది అనే గ్రామంలో అన్నా హజారే నియంతలా ప్రవర్తించి ఐక్యత సాధించినంత తేలిక కాదు. అది ఒక టైం బౌండ్ ప్రోగ్రాం కాదు. నిరంతరం జరుగుతూ ఉండవలసిన ఒక హృదయ స్పందన.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో భారతదేశ ఐక్యతకి తొలి దెబ్బ పడింది. ఒక భాష మాట్లాడే వాళ్లంతా ఒకే చోట ఉండాలి అనే తత్వచింతన భాషా వైవిధ్యానికి తిలోదకాలు ఇచ్చి భాషా పరమైన ఆధిక్యతకి దారి తీసింది. హిందీ ఆధిపత్యానికి తిరుగుబాటుగా ద్రావిడ ఉద్యమాలు గట్టిగా నిలబడ్డాయి. త్రిభాషా సూత్రం ముందుకు వచ్చినా ఉత్తరాది రాష్ట్రాలలో ఒక దక్షిణాది భాష నేర్చుకున్న ఒక్క ఉత్తర భారతీయుడూ కనిపించడు. తరువాత, తరువాత భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో కూడా వేర్పాటు ఉద్యమాలు తలెత్తాక భాష ఒక్కటే మనుషులను కలిపి వుంచలేదని తేలి పోయింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన ఇన్నాళ్ల తరువాత భాషా వైవిధ్యం పట్ల ప్రజలలో సానుకూల దృక్పథం లేకపోవడం ఎలాంటి విపరిణామాలకు దారి తీసిందో రెండు నెలల క్రితం విడుదల అయిన ఒక కన్నడ సినిమా బలంగా దృశ్యమానం చేసింది.
'సర్కారీ హిరియాలీ ప్రాథమిక శాలే కాసరగోడు : కుడగు రామన్న రారు' ఆ సినిమా పేరు. బహుశా కన్నడ చిత్ర సీమలో ఇంత పెద్ద పేరున్న సినిమా రావడం ఇదే మొదటి సారెమో. ఇంతకు ముందు 'కిరాక్ పార్టీ' అనే సినిమా తీసి ప్రశంసలు పొందిన రిషబ్ శెట్టి ఈ సినిమా దర్శకుడు. కేరళలోని కాసరగోడు కేంద్రంగా నడిచే ఈ సినిమా కళ్ళకి ఒక వేడుక. మనసుకుకి ఒక సాంత్వన. బుద్ధికి ఒక ఆలోచన ఇస్తుంది.
భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడకముందు కాసరగోడు కన్నడ భాషా మండలంలోనే ఉండేది. కన్నడ భాష కోసం జరిగిన పోరాటంలో దానిది ప్రధాన పాత్ర. కానీ దురదృష్ట వశాత్తు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో అది కర్ణాటకలో కాక కేరళకి వెళ్లిపోయింది. అప్పటినుండీ అది సరిహద్దు సంక్షోభంలో కూరుకుపోయింది. అలాంటి ప్రాంతాలు మనదేశంలో చాలా వున్నాయి. సరిహద్దులలో వుండే ఆ ప్రాంతాలు ప్రధాన భాషా స్రవంతిలో కలవలేవు. తమ భాషను, సంస్కృతినీ కాపాడుకోలేవు. ఉదాహరణకి కాసరగోడును తీసుకుంటే అది కేరళలో భాగం. మలయాళ భాషా సంప్రదాయాన్ని స్వీకరించలేదు. కన్నడ భాషా పరంగా అది మైనారిటీ. కన్నడ భాషా సంప్రదాయాలను మళయాళ ఆధిపత్యాన్ని ఎదిరించి కాపాడుకోనూ లేదు. అదొక అస్తిత్వ సమస్య. వాళ్ళ నేల కర్ణాటక ఆకాశం కేరళ.
ఈ అస్తిత్వ సమస్యను బలంగా చెప్పిన సినిమా ూనూూఖ. ఇది కావడానికి పిల్లల సినిమా అయినా పెద్ద సమస్య గురించే మాట్లాడింది.
కాసరగోడులో ఉన్న ఒక కన్నడ మీడియం పాఠశాలలో 53 మంది పిల్లలు చదువుతూ వుంటారు. విద్యార్థుల సంఖ్య సరిపోయినంత లేని కారణంగా ఆ స్కూల్ మూసి వేయాలని కేరళ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని ఆ పిల్లల తల్లితండ్రులందరూ వ్యతిరేకిస్తారు.
స్కూల్ను కాపాడుకోవాలని ఆ పిల్లల తల్లితండ్రుల పోరాటం. దాన్ని ఎలాగైనా మూసి వేయాలని కేరళ ప్రభుత్వ ఆరాటం. సమస్య పీటముడి పడి ఉన్న సమయంలోనే ఆ పాఠశాలకు గణితశాస్త్ర ఉపాధ్యాయుడిగా ఒక మళయాళీ టీచర్ను కేరళ ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది. పిల్లలకి మలయాళం రాదు. టీచర్కి కన్నడ రాదు. అప్పుడు టీచర్ విధిగా పిల్లలు అందరూ మలయాళం నేర్చుకోవాలని ఆంక్షలు పెడతాడు. కేరళలో వుంటున్నారు కనుక మలయాళం నేర్చుకోవలసిందే. లేకపోతే స్కూల్ మూసి వేత తప్పదు అని బలంగా చెపుతాడు. దాన్ని పిల్లలు, వాళ్ళ తల్లితండ్రులు ఇద్దరూ వ్యతిరేకిస్తారు. కన్నడ భాషాభిమాని అయిన ఒక తండ్రి టీచర్ను చంపేస్తానని వీరంగం వేస్తాడు. మిగతా గ్రామస్తులంతా కలసి అతడిని సాంత్వన పరుస్తారు. ఇందులో టీచర్ తప్పేమీ లేదు. అతడు ప్రభుత్వ ఉత్తర్వులనే కదా అమలు చేయాలంటున్నది అని ఒక కొత్త బాష నేర్చుకుంటే తప్పేమిటి అన్నది కొంతమంది వాదన. తప్పేమీ లేదు కానీ పక్క భాష కోసం తన సొంత భాషను ఎందుకు బలి పెట్టాలి అన్నది మరి కొందరి వాదన.
చివరకు అది పెద్ద ఉద్యమంగా మారుతుంది. అనంత పద్మనాభను ఆశ్రయిస్తారు. అతడు ముందు ఉండి ఉద్యమాన్ని నడిపిస్తాడు. ఈ పాత్రను ప్రముఖ కన్నడ నటుడు అనంత నాగ్ పోషించారు. కోర్టులో అనంతనాగ్ వాదిస్తూ ఒక మాట అంటారు...
''భాషంటే కేవలం కొన్ని పదాలు, కొన్ని వాక్యాలు వాటి మధ్య వుండే సింటాక్స్ మాత్రమే కాదు. పిల్లలు తమ కలలను, కోరికలను, బలంగా రాసుకునే ఒక మాధ్యమం. పిల్లలు లేరు అనే కారణంతో స్కూల్ మోసి వేస్తాం అంటున్నారు. అతి తక్కువ మంది ఎం.పి లు హాజరు అవుతున్నా పార్లమెంట్ను మాత్రం ఎందుకు తెరచి వుంచుతున్నారు. వాటిని కూడా మూసివేస్తారా? ఒక్క స్టూడెంట్ వున్నా కన్నడ భాషలో విద్యను బోధించాలి. అది ప్రభుత్వ బాధ్యత'' అని గర్జిస్తాడు.
నిజానికి భాషా వైవిధ్యం సరిహద్దు ప్రాంతాలలో వున్నట్టుగా మరెక్కడా కనిపించదు. ఆ వైవిధ్యాన్ని చంపేస్తే ఈ దేశం లో సాంస్కృతిక ఐక్యత, మానసిక ఐక్యత ఎప్పటికీ రాదు. 2011లో జరిగిన ఒక సర్వే మింట్ అనే పత్రికలో ప్రచురించిన దాని ప్రకారం... కేరళ లో 97 శాతం ప్రజలు మలయాళం తమ మాతృభాషగా పేర్కొన్నారు. ఇది ఒక రకమైన ూ×చీ+ఖూ×ు×జ ఖీఖచీణAవీజుచీుAూ×ూAవీ కి దారి తీస్తుంది. ఇప్పటికే అది తన విశ్వరూపం చూపించడం మొదలు పెట్టింది. జాతీయస్థాయిలో జరిగే చీజుజుు పరీక్ష గురించి ఎంత రాద్ధాంతం, ఎంత ఉద్యమం జరిగిందో మనందరికీ తెలుసు. కేవలం బహుళత్వం లేకపోవడం కారణంగానే కావేరీ నదీ జలాలు పదే పదే కర్ణాటక, తమిళనాడుల మధ్య గొడవలకు ఒక పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అవుతున్నాయి అంటే అతిశయోక్తి లేదేమో. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కారణంగా ముఖ్యంగా తుళు, కొడవ, కురుంబ, బాడగ లాంటి భాషలు మరణశయ్య మీద ఉండి ఇవాళో రేపో అనేట్టు వున్నాయి.
చదవడానికి ఇది చాలా డ్రై గా అనిపించినా సినిమా మాత్రం కను వేడుక ఇటీవలే వచ్చిన విలేజ్ రాక్ స్టార్స్ సినిమా తరువాత పిల్లలు ఆ స్థాయిలో అలరించిన సినిమా ఇది. వాళ్ళ ఆటలు, పాటలు, అందులోనూ ఏడవతరగతి గండం గట్టెక్కని పిల్లాడి ఫస్ట్ క్రష్ ఎంత హృదయంగమంగా చిత్రించాడో మాటలలో వివరించలేం. పిల్లల పేర్లు ఏవీ నాకు తెలియదు. కానీ జాగ్రత్తగా చూస్తే మీ పక్కింటిలో ఒకళ్ళో యిద్దరో కనిపించకపోరు.
... అరెరే అవలా నగువా పాట చిత్రీకరణ చూస్తుంటే ఒక సన్నటి పరిమళం ఏదో హృదయం ఉప్పొంగేలా చేస్తుంది. మన చిన్నప్పటి స్కూల్ రోజులు గుర్తుకువస్తాయి. గొప్ప నోస్టాల్జియా ఈ సినిమా. తెలుగులో కూడా ఇలాంటిదే ఒక సినిమా 'గోల్కొండ హై స్కూల్' వచ్చింది. ఆ సినిమాలో పిల్లలు క్రికెట్ ఆడి గెలుస్తారు. ఇందులో పిల్లలు ఒక ఉద్యమం చేసి మరీ గెలుస్తారు. మంచి సినిమా. మీ ఆదివారం సద్వినియోగం కావాలి అంటే ఇలాంటి సినిమా ఒకటి చూడండి.
- వంశీకృష్ణ, 9573427422