Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడవి జంతువుల నుండి, జంతువుల్లాంటి మనుషుల నుండి తమని తాము రక్షించుకోవడానికి గిరిజనులు చేసే పోరాటమే 'మృగయ' హిందీ చిత్రం. భూస్వాముల క్రూరత్వాన్ని, జమీందారి వ్యవస్థ నియంతృత్వ ధోరణిని కళ్ళకు కట్టినట్టు ఈ చిత్రంలో చూపించిన వైనం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటూనే ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. మంచికి, చెడుకీ జరిగిన పోరాటంలో మానవత్వానికి ఎలా ఉరిశిక్ష పడిందో దర్శకుడు మృణాల్సేన్ వెండితెరపై ఆవిష్కరించిన తీరు విమర్శకులనూ మెప్పించింది. అంతేకాదు 24వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డునీ కైవసం చేసుకుంది.
భాగమతి చరణ్ పాణిగ్రాహి రాసిన 'షికార్' లఘు కథ ఆధారంగా ఈ చిత్రాన్ని ఇండియన్ పీరియడ్ డ్రామాగా మృణాల్సేన్ దర్శకత్వంలో నిర్మాత కె.రాజేశ్వరరావు 1976లో నిర్మించారు. మిథున్ చక్రవర్తి, మమతాశంకర్, రాబర్ట్ వైట్, సాధుమోహర్ వంటి తదితరులు ముఖ్యపాత్రధారులుగా నటించారు. ఈచిత్రంతోనే మిథున్ చక్రవర్తి, మమతాశంకర్ వెండితెరకు నటీనటులుగా పరిచయం కావడం ఓ విశేషమైతే, నటించిన తొలి చిత్రంతోనే జాతీయ ఉత్తమ నటుడిగా మిథున్ చక్రవర్తి జాతీయ పురస్కారాన్ని దక్కించుకోవడం మరో విశేషం.
కె.కె.మహాజన్ కెమెరా పనితనం, సలీల్ చౌదరి సమకూర్చిన సంగీతం, గంగాధర్ నస్కర్, రాజు నాయక్, దినకర్ షెట్టే త్రయం చేసిన ఎడిటింగ్ ఈచిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. మహ్మద్రఫీ, పంకజ్ మిత్ర పాడిన పాటలు శ్రోతల్ని విశేషంగా అలరించాయి.
24వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ చిత్రంగానే కాకుండా జాతీయ ఉత్తమ నటుడు అవార్డుని సైతం ఈ చిత్రం దక్కించుకుంది. అలాగే 10వ మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలతోపాటు గోల్డెన్ ప్రైజ్కి నామినేట్ అయ్యింది.
చిత్రకథ..
పంటల్ని దొంగిలించే మనుషులు, మనుషుల్ని, గేదెల్ని, ఆవుల్ని, మేకల్ని, కోళ్ళని ఎత్తుకెళ్ళి చంపే అడవి జంతువులు, అప్పులు, వడ్డీలు, భూమిశిస్తు అంటూ హింసించే జమీందారు నియంతృత్వ ధోరణి వంటి తదితర సమస్యలు ఒడిస్సాలోని దట్టమైన అడవులకు దగ్గరగా ఉన్న ఓ గిరిజన గ్రామంలోని ప్రజలను వేధిస్తుంటాయి. ఇదే గ్రామంలో నివస్తున్న యువకుడు ఘిను (మిధున్ చక్రవర్తి) జంతువులను వేటాడంలో దిట్ట. జంతువులను చంపకుండా వాటిని పట్టుకోవడంలోనూ నేర్పరి. ప్రతి రోజూ రాత్రి మగవాళ్ళంతా గ్రామంలో కాపల కాస్తుంటారు. ఏ మాత్రం జంతువుల అలికిడి వినిపించినా వెంటనే డప్పుల మోత మెగిస్తూ రకరకాల వింత శబ్దాలు చేసి వాటిని తరిమి కొడతారు. ఈ ఊరి మగవాళ్ళకు ఇదొక దినచర్య కూడా. ఈ ఏరియాకి కొత్తగా వచ్చిన బ్రిటీష్ అడ్మినిస్ట్రేటర్ (రాబర్ట్ రైట్) కూడా వేటాడంలో నేర్పరి. అందరితో చాలా స్నేహ పూర్వకంగా ఉంటాడు. ఆయనంటే గిరిజన గ్రామ ప్రజలకు గౌరవం. గ్రామ ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుంటాడు. ఓ రోజు ఘిను వేటాడే ప్రతిభ గురించి ఈయనకు తెలిసి తన బంగ్లాకు రమ్మని చెబుతాడు. ఆయన్ని కలవడానికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకుండా బహుమతిగా ఏదో ఒకటి తీసుకెళ్ళాలని ఘిను అనుకుంటాడు. దీని కోసమై ఓ జింకను వేటాడి దాన్ని చంపకుండా అలాగే తన భుజాలపై మోసుకుంటూ అడ్మినిస్ట్రేటర్ బంగ్లాకు వెళ్తాడు. బతికి ఉన్న జింకను చూసి అడ్మినిస్ట్రేటర్ చాలా సంతోషపడతాడు. ఘినుని బంగ్లాలోకి తీసుకెళ్ళి తాను వేటాడిన జంతువుల ఫొటోలను చూపిస్తాడు. తనకి వేటాడ్డమంటే ఇష్టమని చెబుతాడు. జింకను తెచ్చినందుకు ఎంత డబ్బు కావాలని అడిగితే, నేను మీకు బహుమతిగా దీన్ని తీసుకొచ్చానే తప్ప డబ్బు కోసం కాదని ఘిను సమాధానమిచ్చి వెళ్ళిపోతాడు. అలా వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడుతుంది. ఓ రోజు జమీందార్ (సజల్ రారు చౌదరి), అతని మనుషులు గ్రామంలోకి వచ్చి తమకు రావాల్సిన డబ్బుల కోసం జనాన్ని ఇబ్బంది పెడతారు. పంటని దొంగలు దోచుకున్న కారణంగా డబ్బు కట్టలేనని ఒకతను చెబితే, ఆ డబ్బుకి బదులుగా నీ కూతురిని తీసుక్కెళ్తామని బలవంతం చేస్తారు. దీనికి ఘిను అడ్డుపడి, ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఆ డబ్బు కట్టే బాధ్యత తనదని జమీందార్కి భరోసా ఇస్తాడు. అంతేకాదు ఆ అమ్మాయి దుంగ్రి (మమతాశంకర్)ని పెళ్ళి కూడా చేసుకుంటాడు. ఓ భర్తగా తన భార్యను జాగ్రత్తగా చూసుకుంటానని దుంగ్రి వాళ్ళ నాన్నకూ మాట ఇస్తాడు. తన భార్యను అడ్మినిస్ట్రేటర్కు పరిచయం చేయడం కోసం ఘిను బంగ్లాకి వెళ్తాడు. నూతన దంపతులను చూసి బ్రిటీష్ ఆఫీసర్, ఆయన భార్య చాలా సంతోషపడతారు. బ్రిటీష్ ఆఫీసర్ భార్య వీళ్ళిద్దరి బొమ్మను గీసి వీళ్ళకు బహుమతిగా ఇస్తుంది. ఈ గ్రామంలోనే నివసిస్తున్న షొల్పు (సమిత్ భాంజా) నక్సలైట్ల సభ్యుడనే అనుమానాలు పోలీసుల్లో ఉంటుంది. దీని కోసమై షొల్పును గాలిస్తుంటారు. ప్రజలకు అండగా నిలబడుతున్న షొల్పు అంటే ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరికీ గౌరవం. అందుకే ఎన్ని సార్లు షొల్పు కోసం పోలీసులు వచ్చినా పట్టుకోలేకపోతారు. అయితే ఓ రోజు తన తల్లిని చూసేందుకు షొల్పు గ్రామానికి వచ్చాడనే విషయం తెలిసి జమీందార్ మనిషి దోరా (సాధూ మెహర్) పోలీసులకు సమాచారం అందిస్తాడు. పోలీసులొచ్చి వెతికితే షొల్పు కనిపించడు. షొల్పు తల్లితోపాటు ఊరి జనాన్ని పోలీసులు ప్రశ్నిస్తే షొల్పు రాలేదని, దోరా కావాలనే మీకు అబద్ధం చెప్పాడని సమాధానమిస్తారు. దీంతో జనం కొడతారనే భయంతో దోరా అక్కడ్నుంచి పారిపోతాడు. ఘిను, దుంగ్రి సంతోషంగా గడపటాన్ని జమీందారు, అతని మనుషులు జీర్ణించుకోలేకపోతారు. ఎలాగైనా దుంగ్రిని అనుభవించాల్సిందేనని జమీందార్ అనుకుంటాడు. ఓ రోజు రాత్రి వీధి నాటకం జరుగుతుండగా పెద్ద సంఖ్యలో పోలీసులు గ్రామంలోకి వచ్చి ప్రతి ఇంటిని వెతుకుతుంటారు. ప్రభుత్వ ఖజానాలో దొంగతనానికి కారకుడైన షొల్పుని ఎలాగైనా పట్టుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలయత్నం అవుతారు. చేసేది లేక షొల్పుని పట్టించినా గానీ లేక అతని శవాన్ని అయినా సరే పోలీసులకు అప్పగిస్తే 500 రూపాయలు బహుమతిగా ఇస్తామని పోలీసులు ప్రచారం చేస్తారు. ఈ ప్రయత్నంలో దొరికిన షొల్పుని పోలీసులతోపాటు వాళ్ళ ఇన్ఫార్మర్ దోరా కూడా కాల్చి చంపేస్తాడు. అయితే ప్రభుత్వ ఖజానాలో ఎవరో దొంగతనం చేస్తే, ఆ ఆరోపణను కావాలనే షొల్పు మీద దోరా వేశాడనే విషయం గ్రామస్తులు తెలుసుకుని బాధపడతారు. కొన్ని రోజుల తర్వాత ఘిను వేటకు వెళ్ళాడని తెలిసి జమీందార్ మనుషులు దుంగ్రిని ఎత్తుకెళ్తారు. ఆ విషయం తెలుసుకున్న ఘిను గొడ్డలి తీసుకుని జమీందార్ మీద దాడి చేసి చంపేస్తాడు. అంతేకాదు జరిగిన అన్యాయం గురించి అడ్మినిస్ట్రేటర్కు చెప్పి పోలీసులకు లొంగిపోతాడు. కోర్టులో వాదోపవాదాలు జరిగిన అనంతరం జమీందార్ను ఉద్దేశపూర్వకంగా ఘిను చంపినందుకు ఉరిశిక్ష విధిస్తున్నట్టు న్యాయమూర్తి తీర్పు ఇస్తాడు. ఆ తీర్పు విని మంచి కోసం పోరాడిన షొల్పుని చంపిన వాళ్ళకు ఇనామ్ ఇచ్చారు. మమ్మల్ని అన్ని రకాలుగా హింసించిన చెడ్డవాడ్ని చంపినందుకు నాకు ఉరిశిక్ష వేయడం ఎంత వరకు న్యాయం అని జడ్జ్ని ఘిను ప్రశ్నించినప్పటికీ లాభం ఉండదు. ఘినుకి ఉరిశిక్ష పడిందని తెలిసి గ్రామస్తులందరూ బాధ పడుతుంటే, భార్య దుంగ్రి మాత్రం ధైర్యంగా ఉంటుంది. తన భర్తలాగానే చెడుపై పోరాటాన్ని కొనసాగిస్తానని చెబుతుంది. కొన్ని రోజుల తర్వాత ఉరిశిక్ష వేయడం కోసం ఘినుని పోలీసులు సిద్ధం చేస్తుంటారు. ఆ సమయంలోనూ నీతిగా, నిజాయితీగా మంచి కోసం పోరాడితే ఇలాంటి శిక్ష వేస్తారా అని ఆవేదన వ్యక్తం చేస్తాడు. నిబంధనలకు అనుగుణంగా ఘినుకి పోలీసులు ఉరిశిక్ష వేయడంతో సినిమా ముగుస్తుంది.
- రెడ్డి హనుమంతరావు, 8332995426