Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల చైనాలో జరిగిన కవిత్వోత్సవాలకు ఆ దేశపు ఆహ్వానం మేరకు ఇండియా నుండి ఏకైక ప్రతినిధిగా వెళ్లివచ్చిన ప్రముఖ కవి డా||.ఎన్ గోపి సాహిత్యానుభవాల సారం 'సోపతి' పాఠకులకు ప్రత్యేకం.
సమకాలీన చైనీస్ కవిత్వం ఎలా వుంది? అని అడిగాను బెంజిమన్ను. అక్కడ కూడా 1980 నుంచే ఆధునిక ధోరణులు తలెత్తాయన్నాడు. ముఖ్యంగా అస్తిత్వవాద ధోరణులు, ఆధిపత్య వాతావరణమున్నప్పుడే ఇలాంటి వాటికి ఆస్కారముంటుంది. అట్లాగని Memorisation కు తావులేక పోలేదు అన్నాడు బెంజిమన్. మెమొరైజేషన్ అంటే గత స్మతి (Nostalsia) అన్నమాట. చిన్న కవితలు (Minimal Forms)ని లేకపోలేదు గాని ఇప్పుడు దీర్ఘకవితలు (Long Poems) రాయడం ఒక ట్రెండ్గా మారిందన్నాడు. ప్రాచీనకాలంలో ముక్తకాల్లాంటి చిన్న కవితలుండేవి. ముఖ్యంగా 7వ శతాబ్దంలో జపనీస్ హైకూలకు అవే ఇన్స్పిరేషన్ అంటారు. వారు బౌద్ధానికి జెన్ను జోడించి ఆ ప్రక్రియను సుసంపన్నం చేశారంటారు. 5+7+5 అనే అక్షర నియమం చిత్రలిపికి సంబంధించింది. బయట భాషల వాళ్లకు భావమే తప్ప ఆ లక్షణాలను తూచా తప్పకుండా పాటించడం సాధ్యం కాదు. ప్రకతి కవిత్వం (Land Scape Poetry) ప్రచలితంగా వెలువడుతున్నది. స్త్రీ వాద కవిత్వం సజీవంగావుంది. రాజకీయ కవిత్వం లేదని కాదు గానీ చాలా తక్కువ. విప్లవానంతరం కవిత్వంలో (Post Communist period) కార్మిక సమస్యలు ఉండవని కాదు గాని కొట్టొచ్చినట్టుగా కాదు.చైనాలో 55 ప్రాక్తన సమాజాలు (Ethnik Groups) ఉన్నాయన్నారు కదా! వాటన్నిటి నుంచీ అస్తిత్వవాద గొంతుకలు వినపడుతున్నాయి. ఈ సమూహాల్లో హ్యాన్ (Han) తెగ పెద్దది. ప్రేమ కవిత్వం సంగతి ఏమిటి? వస్తుంది గాని పెద్ద కవుల నుంచి మాత్రం రావడం లేదన్నారు బెన్.
పాడే (Performing) కవులున్నారా? ఉన్నారు గాని వారి సంఖ్య చాలా తక్కువ. వాటికోసం ఎగబడేవారిక్కడ లేరు. ఎందుకంటే వాటిలో పాట గుణమెంత? వస్త్వావేశమెంత అని బేరీజు వేసుకొని వింటారు. చప్పట్లు కొడతారు గాని అది మననానికి పనికిరాదని వీరి భావం. ఈ నాడు చైనా యువకులు టిబెటన్ పాప్ సంగీతం వైపు ఆకర్షితులౌతుున్నారు. అయితే కవితా పఠనాల సభల్లో యువత 50శాతం కనిపిస్తారు. ఇది మన దగ్గర తగ్గిపోతుందని నా కనిపించింది. 50 సంవత్సరాలు దాటిన వాళ్లే ఎక్కువగా హాజరౌతున్నారు.
అంతర్జాల కవిత్వం వస్తుందా ? చాలా ఇప్పుడిదొక ఫ్యాషన్. భారీగా వస్తున్నది అంతర్జాల కవిత్వమే. మరి నాణ్యత (Quality) సంగతి? ఇది చర్చనీయాంశమే. 'అయితే నా దష్టిలో పత్రికల్లో వచ్చే కవిత్వానికి ఒక ఎంపిక ప్రక్రియ (Selection process), ఒక విచక్షణ వుంటుంది? అన్నాడు బెంజిమన్. ఇప్పుడు చైనాలో పైచేయి పత్రికా సాహిత్యానిదా? అంతర్జాల సాహిత్యాన్నిదా అంటే పత్రికలదే. ఎందుకు? ఎందుకంటే చైనాలో కాగితం పరిశ్రమ ((Paper Industry) చాలా విలువైంది, విస్తృతమైంది కూడా. బెంజిమన్ విశ్లేషణను మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.
ఇంతలో లంచ్ అన్నారు. ఓ మాంచి రెస్టారెంట్లో అన్నార్థులు తమ తమ స్థానాలను అలంకరించారు. కాలినడకన దూరాలు తిరగటం వల్ల పొద్దున తిన్నది ఎప్పుడో భస్మమైపోయి వుంటుంది. ఇట్లాంటి వాటికి డైసీయే బాస్. ధనదాత కూడా. సున్నితంగా కనిపిస్తుంది కానీ అవసరమైనప్పుడు శాసిస్తుంది. నేను యోగర్టు కోసం బెంజ్మన్తో పైరవీ చేయించాను. అది ఆ రెస్టారెంట్లో లేకున్నా ఎక్కడి నుంచో తెప్పించారు.
మళ్లీ బస్సులోకొచ్చి బెంజిమన్తో సంభాషణ కొనసాగించాను. కవిత్వానికి ఎంత ఆకర్షణ ఉన్నా నవలా రచన విస్తతంగా జరుగుతుందన్నాడు. నోబెల్ ప్రైజ్ విజేత మోయాన్ (MoYan) ఇప్పటికీ చురుగ్గా ఉన్నాడు. ఆప్రైజ్ ఆయన నవలకే వచ్చింది. అలాగే కొందరు సమకాలిన అగ్రశ్రేణి సాహితీవేత్తల పేర్లు చెప్పాడు బెన్.Zhu Yongming, Quyang Jianghe,Huang Fan, Jidi Majia(తెలుగులో రాస్తే స్పెలింగ్ సమస్య వల్ల ఇంగ్లీషులోనే ఇస్తున్నాను. అంతే కాదు చైనీస్ ఉచ్చారణకూ ఇంగ్లీష్ ఉచ్చారణకూ కూడా తేడా వుంటుంది. బెన్కు రెండూ తెలుసు కాబట్టి అతని స్పెల్లింగ్లే ఇస్తున్నాను.)
నవలల్లో కూడా సైన్స్ ఫిక్షన్ ఎక్కువగా వస్తుందని బెన్ చెప్పాడు. సాయంత్రానికి Narada Boutique Hotel Dianshanlu కి చేరుకున్నాం. చైనీస్లో ఈ హోటల్ పేరు జిన్చింగ్ (Jinting). పెద్దమనుషుల విశ్రాంతి గహం (Gentle Men Rest House) అని అర్థం. మరి నారద అనే పదానికి అర్థమేమిటో ఎవరూ చెప్పలేకపోయారు. ఇది చైనీస్ పదం మాత్రం కాదు.
కవిత్వ బోధనకు దిక్సూచి చైనా లూషన్ లిటరరీ ఇన్ట్సిట్యూట్ (ూLuXun Literary Institute)
24, అక్టోబర్; ఇవాళ లూషన్ సాహిత్య కార్యాలయంలో మూడు కార్యక్రమాలున్నాయి. 3 గంటలకు సెమినార్, 5.30కు డిన్నర్, 7 గంటల నుంచి కవితా పఠనం. మధ్యాహ్నం 1.50 హోటల్ లాబీలో సిద్ధంగా ఉండమన్నారు. నేను 5 నిమిషాల ముందే చేరుకున్నాను. సమయపాలనలో సినారె నాకు ఆదర్శం. మహానుభావుడు ఇవాళ పొద్దటి నుంచి గుర్తుకొస్తున్నాడు. హోటల్ బయటికొచ్చి చుట్టూ చూస్తున్నాను. హోటల్ ఇంద్రభవనంలా కనిపిస్తుంది. పోర్టికోలో కార్లలోంచి దిగే వ్యక్తుల్ని చూస్తే చైనాలోని ధనవంతులంతా ఇక్కడికే వచ్చి పోతున్నారా అనిపిస్తుంది. రాత్రిపూట చూస్తే చుట్టుపక్కల భవనాలు భయపెట్టేవిగా కనిపించాయి. పొద్దున పొగమంచులో బేలగా ముఖాలు పెట్టాయి. ఇవాళ ఎందుకో లంచ్ లేదు. రూముకే హాంకాంగ్ ఫలహారం పంపించారు. అంటే ఏమీ లేదు రొయ్యల పేస్ట్తో చేసిన నూడుల్స్. వాటిలో కలుపుకోవడానికి నిమ్మరసం కలిపిన నీళ్లు. నూడుల్స్ నూనెతో తళ తళ లాడుతున్నాయి. టిష్యూ పేపర్తో తుడుచుకోక పోతే తినలేం.
కార్లు బయద్దేరాయి. దక్షిణాఫ్రికా నల్లమ్మాయి ఇవాళ రెండు చెవులకు వేలాడే దండలేసుకుంది. బాగుంది. పెద్ద కళ్ళు, చర్చ కవిత్వం మీదకి మళ్లింది. Rose performer Poetకదా! దానిలో రాగమెక్కువా భావమెక్కువా అని షెర్విన్ అడిగాడు. రెండూ అందామె. వీటికైతేనే ఎక్కువ మంది హాజరౌతారు అంది. ఈమధ్య నోబెల్ ప్రైజ్ వచ్చిన అమెరికా వాగ్గేయకారుని గురించి కొంత చర్చ జరిగింది. నోబెల్ప్రైజ్ ప్రతిభ కంటే ఎక్కువగా రాజకీయ కారణాలతోనే వస్తుందంది. రోజ్ అమెరికాలో ఇప్పుడు కవిత్వం ఎక్కువగా Gender, Class, Raceలను ఆధారం చేసుకున్న వస్తువులతో వస్తుందన్నాడు షర్విన్. కవిత్వానికి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ తగ్గిపోయిందంది డేనిష్ కవి క్యాండీ. డెన్మార్క్ చిన్నదేశం. ఐదు కోట్ల జనాభా. డెన్మార్క్లోనే కాదు జర్మనీలో, అమెరికాలో కూడా కాల్పనిక సాహిత్యమే రాశిలో ఎక్కువగా వస్తుందన్నాడు షర్విన్. అయితే అందరూ ఏకగ్రీవంగా అన్నదేమిటంటే కవిత్వానికుండే ఆకర్షణ మరే పక్రియకూ ఉండదని. ఇలా మాట్లాడుతుండగానే కార్లు లూషన్ ఇన్స్టిట్యూట్ ఆవరణలో ప్రవేశించాయి. ఎత్తైన భవనాలతో దట్టమైన వక్షాలతో ఆహ్లాదకరంగా వుంది. మా అందరి పేర్లతో ఫ్లెక్సీలు పెట్టారు.
లూషన్ ఇనిస్టిట్యూట్ ఒక గొప్ప సాహిత్య సంస్థ. యావత్ చైనాలో జాతీయ స్థాయిలో సాహిత్య విద్య (Literature Education) ను బోధించే సంస్థ. సాహిత్య పరిశోధన కోసం కేంద్ర స్థాయిలో 1950లో ఏర్పడి పార్టీ జోక్యం వల్ల 1957లో మూతపడ్డది. 1980 దాకా మళ్ళీ తెరుచుకోలేదు. ఆ తర్వాత చైనాలో గొప్ప సాహితీ వేత్త లూషన్ పేరిట పునర్వికసనం పొందింది. ఒకప్పుడు ప్రభుత్వ సాంస్క తిక శాఖ ఆధ్వర్యంలో నడిచేది. ఆ తర్వాత చైనా రచయితల ఆజమాయిషీలోకి వెళ్ళింది. ప్రస్తుతం బి.ఎన్.యు, Central China విశ్వవిద్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ విస్తత కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
లూషన్ పేరు పెట్టారు కాబట్టి ఆయన గురించి కొంత. లూషన్ (LuXun) అనేది కలం పేరు. ఆ మహా సాహితీ మేరువు అసలు పేరు డ్సౌడ్సాసురేన్ (Zhon Shuren).1881లో జన్మించిన లూషన్ 1936లో 55వ యేట చనిపోయాడు. ఆయన కవీ, కథకుడు, విమర్శకుడు, సంపాదకుడు, అనువాదకుడు - ఇలా పలు ప్రక్రియల్లో అందె వేసిన చెయ్యి. స్వభావత్ణ వామపక్ష భావాలు కలవాడు. కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు కాకున్నా మావో లూషన్ను జీవితాంతం అభిమానించాడు 'Saint of Modern China' అని కీర్తించాడు. చైనాలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రసిద్ధి పొందాడు లూషన్, జపాన్లో మరీ ఎక్కువ. ప్రజల రచయితగా గౌరవించబడ్డ ఈ మహానుభావుని పేరిట ఈ సాహిత్య సంస్థ నడుస్తుందన్నమాట.
కవిత్వ సదస్సు
సెమినార్ హాలు ఐదో అంతస్థులో వుంది. పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం. వేదిక మీద ' వర్డ్ క్యాచర్' అనే సాహిత్య పత్రిక సంపాదకుడు గావ్ జింగ్ (GaoXing), పోయెం' అనే కవిత్వ పత్రిక సంపాదకుడు ఝూవ్సీ (Zhao Si), IWC ఇన్స్టిట్యూటివ్ డైరెక్టర్ ఝూంగ్ కింగ్వా (Zhang Qingua) జామీ ఫ్రాక్టర్ ఉన్నారు.
ఈ సెమినార్కు ప్రధాన విషయం 'How Writing Becomes Personalised Through Metaphor'.... అని గతంలో చెప్పాను. నేను ఇంగ్లీషులో ఒక ప్రసంగ పత్రం తయారుచేశాను. దానిని మెల్లగా చదివే ముందు హావభావాల్తో ఒక్క మాటన్నాను.
''కనిపించే బయటి ప్రపంచం కవి లోపలికి ప్రవేశించి మళ్లీ కవితనంతో బయటికొస్తుంది'' అని. మెల్లగా అర్థం కాగానే సున్నితంగా చప్పట్లు మోగాయి. 'ఆ కవితనంలోంచే ఈ Metaphor Narrative Speech Dialogues గాని పుడతాయి' అని వివరణ చెప్పాను. అందరి చూపులూ నా మీదే కేంద్రీకతమైనాయి. ఈ తర్వాత నేను రాసుకున్న వ్యాసికను చదవడం మొదలు పెట్టాను.
ప్రతి రెండు వాక్యాలను ఓ అమ్మాయి చైనీస్లోకి అనువదిస్తూ పోయింది. ఇంత బరువైన విషయాన్ని అవలీలగా తర్జుమా చేస్తూ పోయిన ఆ అమ్మాయిని అభినందించకుండా వుండలేము. ఆమె పేరు Zhang Yiఅనుకుంటాను. పక్కామె నడిగాను. ఆ పక్కామె ఎవరో కాదు అక్కడి ప్రొఫెసర్SunXiaya L.D.. ఆమె నా పత్రాన్ని మెచ్చుకుంటూ మీతో చాలా విషయాల్లో ఏకీభవిస్తున్నానంది. నా తర్వాతి పేపర్ ప్రజెంటర్ ఆమే. పక్కన గ్రీన్ టీ ఖాళీ అయినకొద్దీ పోస్తూనేవున్నారు. సరిగ్గా 5.30 గంటలకు సెమినార్ ముగిసింది. భోజనానికి లేచారు. కింద పెద్ద డైనింగ్ హాలుంది. చాలామంది ఉన్నారు కాబట్టి ఎక్కడికక్కడ మినీ చక్రాల టేబుళ్లు. నాఉపన్యాసానికి impress అయిన వాళ్లు 'మా దగ్గరికి రండి మా దగ్గరికి రండి అని పిలిచారు. అందరూ పరిచయమైన వాళ్లే. బఫే వంటకాలకు దగ్గరగా ఓ చోట కూర్చున్నాను. అన్నం. యోగార్డ్ సంపాదించాను. ఇక నా భోజనం హాయిగా ముగిసినట్టే.
కవితా పఠనం
7 గంటలకు కవితాపఠనం ప్రారంభమైంది. జామి ఉభయ భాషల్లో దానిని చక్కగా నిర్వహించింది. చైనీస్ భాషా సన్నివేశంలో ఆమె ఎంతో విలువైన వ్యక్తి. వేదిక వెనుక పెద్ద టీవీ తెర. కవిత చదువుతుంటే మన కవితాక్షరాలు దానిపై వస్తుంటాయి. కవి చదవడం శ్రోతలు చదువుకోవడం ఒకేసారి జరుగుతాయి. కవులకు ఇదెంత సంతోషం కలిగిస్తుందో ఆలోచించండి! నేను 'రొట్టె' కవితని చదివాను. అంతకు ముందే దానిని వాళ్ల పుస్తకంలో అచ్చు వేశారు. మంచి స్పందనవచ్చినట్టే అనిపించింది. రొట్టే, ఎక్కడైనా రొట్టె కాకపోతే బ్రెడ్, కేక్ అని పేర్లు మారొచ్చు. అందరికీ అందింది. రొట్టె ఒకప్పుడు పేదల ఆహారం. చైనా కూడా పేదగా ఉండి పైకొస్తున్న దేశమే కదా! అమ్మ కూడా అందరికీ ఒకటే. అసలు 'అమ్మ' అనే మాటే ఒక పెద్ద కావ్యం లాంటిది. టీవీ పైన కవిత రావడం వల్ల పాఠకులు తర్వాత చదువుతున్నప్పుడు కవుల ఉచ్చారణా సౌష్టవం, హావభావాలు గుర్తుకొస్తాయి. తద్వారా ఎక్కువ అనుభూతికి ఆస్కారమేర్పడుతుంది. జామీ మొదట్లో ప్రతి కవి పరిచయం మొదట్లో, కవితపై లఘువాక్య చివరిలో చేసేది. కవితా పఠనమంటే ఇట్లా ఉండాలి అనిపించింది. మనం కూడా దీని నుంచి నేర్చుకోవాలి.
మన దగ్గర ఈ మధ్య బహత్ కవి సమ్మేళనాలు చేస్తున్నాం. పరవాలేదు. కానీ వినే వారు శ్రద్ధగా వినాలి. తమ కవిత కాంగానే వెళ్లిపోగూడదు. చప్పట్లు ఎక్కడకొట్టాలో తెలియాలి. శ్రద్ధగా వింటేనే సాధ్యమౌతుంది. ఒక కవి సమ్మేళనం అయిపోగానే ఆ ఉత్తేజంతో మనలో ఓ కొత్త కవిత పుట్టాలి. నిర్వాహకులు కూడా క్వాలిటీ కవితల పైన దష్టి పెట్టాలి. కవులు తమ వెంట కవితలు తెచ్చుకోవాలి. ఆధునిక టెక్నాలజీని వాడుకోవడం వల్ల కవిత మరింత సూటిగా పాఠకులకు మరింత లోతుగా హత్తుకునే వీలుకలుగుతుంది. మన తెలంగాణా సాంస్కతిక శాఖను దాని డైరెక్టర్ మామిడి హరికష్ణ ఎంతో ఆధునీకరిస్తున్నాడు. ఇక్కడ అతడు గుర్తుకు రావడం యాదచ్ఛికం కాదు. ఇక్కడ కూడా లూషన్ ఇన్స్టిట్యూట్ వారు ఓ కవరిచ్చారు. హోటల్కు వెళ్లి చూస్తే మీరు 2000 యువాన్లున్నాయి. వారు కవులను గౌరవించే పద్ధతి ఇదన్నమాట.
మరోసారి జీది మాజియాతో భేటీ
కవి సమ్మేళనం ముగియగానే నేను మెట్ల ద్వారా కిందికొచ్చాను. లిఫ్ట్టు దగ్గర చాలా జనం గుమిగూడారు. కిందికొచ్చి లూషన్ క్యాంపస్ కలయ జూస్తున్నాను, అనుకోకుండా మహాకవి జీది మాజియా తన బృందంతో వెళ్తూ నన్ను చూశాడు ' గాబీ' అంటూ దగ్గరకు కొచ్చి పలకరించాడు. మొన్న డిన్నర్లో కలిశాం కదా! 'మీరు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్కు ఇండియా వస్తున్నారట గదా! స్వాగతం' అన్నాను. 'మొన్ననే ఇండియా వెళ్లొచ్చాను చూడాలి' అన్నాడు. 18 కోట్ల మంది మాట్లాడే తెలుగువాణ్నని ఆయనకు తెలిసి పోయింది. పైగా ముందే అచ్చువేసిన పుస్తకాల్లో నా కవితలు చదివాడు. నా పట్ల మెచ్చుకోలుగానే వున్నాడు. వెంటనే తన అసిస్టెంట్లను పురమాయించి తన 3 అనువాద గ్రంథాలను ఒక అట్టపెట్టెలో పెట్టినవి నాకు బహుమతిగా ఇచ్చాడు. ఇదంతా ఓ చెట్టు కిందనే. 'నీకు విమానం లగేజీ బరువౌతుందేమో' అన్నాడు. 'ఆ గ్రంథాలు 7,8 కిలోల బరువుంటాయి. 'మిగిలిన సామానిక్కడ పారేసయినా వీటిని తీసుకపోతానన్నాను. ఆయన ఆ ఒక్క ప్రసన్న హాసంచాలు ఆ రాబోయే బరువును తేలికపరచడానికి. నేను తప్పకుండా ఆయన కవితలను అనువాదం చేస్తానన్నాను. చైనా నుంచి నాకిదొక మంచి కానుక.