Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పఠాభి, పఠాభి రామిరెడ్డి ఈ పేరు వినగానే కవిత్వ ప్రియులకు ఫిడేల్ రాగాల డజను గుర్తుకు వస్తుంది. కైత నా దైత గుర్తుకు వస్తుంది. వచన పద్యాలనే దుడ్డుకర్రలతో పద్యాల నడుము విరగకొడతాను అనే అహంభావి గుర్తుకు వస్తాడు. రాజకీయ జీవులకు సోషలిస్ట్ పార్టీ, రామ్ మనోహర్ లోహియా భావజాలం, ఆత్యయిక స్థితిలోని వేదన, స్నేహలతారెడ్డి విషాదం గుర్తుకువస్తాయి. ప్రజాసంఘాలవారికి పి.యు.సి.ఎల్. గుర్తుకు వస్తుంది. గణిత శాస్త్రాన్ని అమితంగా ప్రేమించిన వారికీ ఒక లెక్కల మాస్టారు గుర్తుకువస్తారు. సినిమా ప్రియులు ఆంధ్రదేశం దాటకపోతే పెళ్లి నాటి ప్రమాణాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం, భాగ్యచక్రం గుర్తుకువస్తాయి. ప్రేక్షకుడి అభిరుచి సరిహద్దులు దాటితే 'సంస్కార' గుర్తుకువస్తుంది. దేవరకాడు, చండామారుత, శృంగారమాస గుర్తుకువస్తాయి. ఇంతకూ పఠాభిని ఎక్కడ పిన్ పాయింట్ చేయగలం? ఎక్కడా చేయలేం. బహుళ వ్యక్తిత్వం తనది.
ఒక్క మనిషే. దేశానికి ప్రయోజనకరమైన ఎన్నో ముక్కలు. ఒక్కొక్క ముక్కా దానికి అదే సంపూర్ణంగా ఉండటమూ, ఒక అఖండతలో కలిసిపోవడమూ పఠాభిలో కనిపించినంతగా మరెవరిలోనూ కనిపించదు. తను కవి కావడం వలన ఇర్రేషనల్గా ఉండటం తన లక్షణం. గణిత శాస్త్ర అభిమాని కావడం వలన రేషనల్గా ఉండటం తన లక్ష్యం. ఈ లక్షణాలు అన్నీ తన సినిమాలలో కనిపిస్తాయి. పఠాభి నిర్మాతగా తెలుగులో జయంతి పిక్చర్స్ తరఫున దర్శక బ్రహ్మ కె.వి.రెడ్డి గారితో కలసి మూడు సినిమాలు నిర్మించారు. ఒకటి 'పెళ్లి నాటి ప్రమాణాలు', రెండు 'శ్రీకృష్ణార్జున యుద్ధం', మూడు 'భాగ్యచక్రం'. మొదటి రెండు చిత్రాలు విజయవంతం అయినాయి. 'భాగ్యచక్ర' మాత్రం పఠాభి పాలిట అభాగ్య చక్రం అయింది. 'పెళ్ళినాటి ప్రమాణాలు' సినిమాకు 'సెవెన్ ఇయర్స్ ఇచ్' అనే ఆంగ్ల సినిమా ఆధారం. మన నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి నిర్మించారు. అక్కినేని పరిణీత అభినయము, దర్శకుడి దర్శకత్వ చాతుర్యము, కథలోని బలమూ కలసి సినిమాను విజయ తీరాలకు చేర్చాయి. 'శ్రీ కృష్ణార్జున యుద్ధం' సినిమాకు తెలుగునాట విపరీతంగా ప్రచారంలో వున్న గయోపాఖ్యానం ఆధారం. ఆ తరువాత సొంతంగా బి.ఎస్.నారాయణ దర్శకత్వంలో 'నిమజ్జనం' అనే సినిమా నిర్మించారు. ఈ సినిమాలలో పఠాభి గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ ఉండదు. కానీ పఠాభి తన విశ్వరూపం చూపింది మాత్రం కన్నడ సినిమా రంగంలోనే.
కన్నడచిత్ర సీమకు మొట్టమొదటి జాతీయ అవార్డు అందించింది పఠాభి. యు.ఆర్.అనంత మూర్తి 'సంస్కార' నవలను అదే పేరుతో సినిమా నిర్మించి, దర్శకత్వం వహించి జాతీయ అవార్డును సాధించారు. సినిమా నిర్మాణానికి మొత్తంగా లక్షా ఇరవైవేల రూపాయలు ఖర్చు చేస్తే, మొత్తం 29 రోజులలో సినిమా పూర్తి అయింది. విడుదలకి చాలా ఇబ్బందులు పడింది. అయినా చరిత్ర సృష్టించింది.
భారతీయ నవ్య సినిమా రంగంలో బెంగాల్ తరువాత ప్రముఖ స్థానం పొందింది కన్నడ సినిమానే. సత్యజిత్రే పథేర్ పంచాలి నవ్య సినిమాకు ఒక ఉద్యమ రూపం ఇస్తే దానిని శిఖర స్థాయికి తీసుకెళ్లింది కన్నడ సినిమానే. పఠాభి 'సంస్కార'తో మొదలు అయి బి.వి.కారంత్, గిరీష్ కర్నాడ్, నాగాభరణ, ప్రేమకాంత్, గిరీష్ కాసరవల్లి లాంటి దర్శకుల కృషితో ప్రధాన స్రవంతి సినిమాను సవాల్ చేసే స్థాయికి కన్నడ సినిమా ఎదిగింది.
నిజానికి సినిమా, సాహిత్యం పరస్పర ఆశ్రితలుగా కనపడినా రెండూ భిన్న మాధ్యమాలు. వాటి భావ ప్రసార రీతి, లక్షణాలు వేరు వేరు. సాహిత్యం వైయక్తికమైన కృషి అయితే, సినిమా సామూహిక కృషి ఫలితం. ప్రధానమైన ఈ తేడాను పక్కన పెడితే, రెండు మాధ్యమాలకి సామాజిక నిబద్ధతని ఆవిష్కరించడంలో, వ్యాఖ్యానించడంలో వున్న స్వేచ్ఛను ఎవరూ కాదనలేరు. రెండు మాధ్యమాల మధ్య సాధారణంగా కనిపించే భిన్నత్వమూ, అసాధారణంగా కనిపించే ఏకత్వమూ రెండు ప్రక్రియలనూ సజీవంగా ఉంచుతాయి.
ఒక సాహిత్య రూపాన్ని సినిమాగా రూపొందించడం అనేది 1902లో మొదలు అయింది. ఎమిలీ జోలా రచించిన 'ఆసోమోర్'ను ఐదు నిమిషాల చలన చిత్రంగా ఒక ఫ్రెంచ్ దర్శకుడు నిర్మించాడు. ఆ తరువాత ఎన్నో క్లాసిక్స్ సినిమాలుగా రూపాంతరం చెందినాయి. ఇలా రూపాంతీకరణ చెందినపుడు మూల రచయతకు పారితోషికం చెల్లించడం అనేది 1907లో మొదలు అయింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సినిమాగా వచ్చిన తరువాత సాహిత్య రచనలుగా ప్రసిద్ధి పొందిన రచనలు చాలా వున్నాయి. 'RAINMAN' అనే సినిమా విడుదల అయిన తరువాత సినిమా నవలగా వచ్చి 12 భాషలలో 15 సార్లు ముద్రణలకి నోచుకుంది. 'పథేర్ పంచాలి' కూడా అలా సినిమా నవలగా సంచలనం సృష్టించింది. తెలుగులో 'మల్లీశ్వరి, మాయాబజార్'లను రావికొండలరావు సినిమా నవలలుగా తీర్చి దిద్దారు
యు.ఆర్.అనంత మూర్తి సంస్కార నవల చదవడం ఒక అనుభవం అయితే, పఠాభి 'సంస్కార' సినిమా చూడటం మరొక అనుభవం. ఈ రెండు అనుభవాల మధ్య ఉన్న పోలికలను, తేడాలను విశ్లేషించుకోవడం కూడా ఒక ఆసక్తికరమైన యాత్రే. నవల చదివేటప్పుడు పాఠకుడి ఊహాశక్తికి అంతం ఉండదు. చదువుతూ చదువుతూ తనకు తానే ఒక దృశ్య ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. సినిమా చూసేటప్పుడు ప్రేక్షకుడి ఊహాశక్తికి పరిమితులు వుంటాయి. అది దర్శకుడి ఊహను దాటి, ఛాయాచిత్ర గ్రాహకుడి చూపును దాటి ముందుకు వెళ్ళదు. రచనలో ప్రతి పదమూ దానికి అదే ఒక స్పష్టమైన భావాన్ని ఆవిష్కరింపచేసి పాఠకుడి ఊహకి పదును పెడితే, సినిమా మొత్తం ఒక యూనిట్గా ఒక భావాన్ని ఆవిష్కరిస్తుంది. అయితే వాణిజ్య సినిమా దర్శకుల సంగతి తెలియదు కానీ, ప్యారలల్ సినిమా దర్శకులు ఏకకాలంలో దృష్టికీ, సృష్టికీ పదును పెట్టారు. సినిమాగా తెర మీద తాము చూపించవలసింది చూపిస్తూనే, ప్రేక్షకుడిని ఆలోచనకి గురి చెయ్యడానికి మరిన్ని సంకేతాలను ఉద్దేశ్య పూర్వకంగా వదులుతారు. ఈ నేపథ్యం నుండి పఠాభి 'సంస్కార'ను కానీ ఇతర సినిమాలనుకానీ మనం చూడాలి.
ప్రముఖ సినిమా విమర్శకుడు చిదానంద్ దాస్ గుప్తా మాటలలో చెప్పాలి అంటే ''సాహిత్య రచనలోని కథ సినీ దర్శకుడి ఆలోచనతో సంయోగం చెందుతుంది. సినిమాగా రూపాంతరం చెందినపుడు అందులోని అణువులు, పరమాణువులు, నిర్మాణ రీతి, రూపు రేఖలు మారిపోతాయి''
ఈ రూపాంతీకరణ రెండు రకాలుగా జరుగుతుంది. మొదటి తరహాలో దర్శకుడు మూల రచనకి, రచయతకి నిబద్ధుడై ఉండి, సాహిత్య రచనని వున్నది ఉన్నట్టుగా దృశ్యబద్దం చేయడం. రెండవ తరహాలో దర్శకుడు మూల రచనకి నిబద్ధుడై ఉంటూనే దృశ్య లయనీ, కళాత్మక రూపాన్ని సాధించేందుకు తనదైన ఆలోచనని, వూహాత్మకతని జోడించి చిత్రం దృశ్యీకరించడం. చలన చిత్ర రచనలో ఈ రెండు పద్ధతులు కనిపిస్తాయి. కానీ మూల రచనకి దూరంగా జరిగినప్పుడు రూపాంతీకరణ అపహాస్యం పాలవుతుంది.
ఉదాహరణకి ఒక తెలుగు సినిమాను, ఒక హిందీ సినిమాను చెప్పుకోవచ్చు. ఆర్.కె.నారాయణ్ ది గైడ్ను దేవానంద్ స్టార్డమ్కి అనుగుణంగా పలు రకాల మార్పులు, చేర్పులు చేయడంతో ది గైడ్ సినిమాలో తన ఆత్మను కోల్పోయింది. తెలుగు కన్యాశుల్కంలో కూడా గిరీశం, మధురవాణిలను ఏకం చేయడం ద్వారా గురజాడ మౌలిక ఆలోచన అపహాస్యం పాలు అయింది.
సంస్కార విషయంలో పఠాభి ఆ తప్పులు చేయలేదు ఇంతకూ ఏమిటి 'సంస్కార'?
అప్పటి మధ్వ బ్రాహ్మణ సంప్రదాయంలో ఉన్న అమానవీయ అంశాలను ఎత్తిచూపుతూ, ఛాందసం మీద పలికిన తిరుగుబాటు గీతం 'సంస్కార'. కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో వొదిగివున్న దూర్వాసపురం అనే వూళ్ళో జరుగుతుంది ఈ కథ. ఆ వూరులో ఎక్కువ శాతం బ్రాహ్మణ కుటుంబాలే. అందరూ మధ్వ సంప్రదాయాన్ని పాటించేవారు. మతాచారమే అక్కడ సుప్రీం. మరో మాటకి తావే ఉండదు. అలంటి గ్రామానికి ప్రాణేశాచార్య పెద్ద. ఆ గ్రామవాసి అయిన నారాయణప్ప జన్మత్ణ బ్రాహ్మణుడే అయినప్పటికీ బ్రాహ్మణ సంప్రదాయాలన్నింటినీ తూలనాడి తన ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. భోగ లాలసుడు. మద్యం, మాంసాహారం, మగువ అతడి నిత్య జీవన అవసరాలు. ఒకసారి దేవాలయ ప్రాంగణంలో ఉన్న కోనేటిలో తన స్నేహితులతో కలసి చేపలను పట్టి కూర వండుకుని తిని అల్లరల్లరి చేస్తాడు. ఊళ్లోని బ్రాహ్మణులందరికీ కోపం వచ్చి అతడిని గ్రామ బహిష్కారం చేయవలసిందిగా ప్రాణేశాచార్యకి సిఫారసు చేస్తారు. గ్రామ బహిష్కారం కంటే అతడిని సంస్కరించడమే మేలు అనుకుంటాడు ప్రాణేశాచార్యా. ఇదిలా ఉండగా ఒకనాడు నారాయణప్ప షిమోగా వెళ్లి తీవ్రమైన జ్వరంలోనే దూర్వాసపురం తిరిగి వస్తాడు. ఆ జ్వరం మరింత తీవ్రమై చివరకు అతడు ప్రాణాలు వదులుతాడు.
అప్పుడు దూర్వాసపురానికి ఒక ధర్మ సందేహం కలుగుతుంది. నారాయణప్పకి పెళ్ళీ పెటాకులు లేవు. చంద్రి అనే స్త్రీతో సంబంధం తప్ప. బ్రాహ్మణ సంప్రదాయాలు పాటించలేదు కనుక అతడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడు? అనేది ఒక ప్రశ్న. పుట్టుకతోనే అతడు బ్రాహ్మణుడు కనుక సంప్రదాయాలను పాటించనంత మాత్రాన అతడు బ్రాహ్మణుడు కాకుండా ఎలాపోతాడు? అనేది మరొక ప్రశ్న. ఇంతకూ అతడికి అంతిమ సంస్కారం ఎవరు చేయాలి? బ్రాహ్మణ సంప్రదాయాల ప్రకారం అబ్రాహ్మణులు ఎవరూ బ్రాహ్మణుడికి అంతిమ సంస్కారం చేయకూడదు. అబ్రాహ్మణుడికి అంతిమ సంస్కారం చేస్తే బ్రాహ్మణులు ఎవరైనా మైల పడిపోతారు? అంతిమ సంస్కారం ఎవడు చేయాలి? శవం ఊళ్ళో ఉండగా ఎవరూ అన్న పునాదులు స్వీకరించరాదు. ఈ సమస్యను దాటేది ఎలా?
ప్రాణేశాచార్య గ్రామ పెద్ద కనుక ఈ సమస్య పరిష్కరించే బాధ్యత అతడి మీద పడుతుంది. అతడు ధర్మ శాస్త్రాలు అన్నీ తిరగవేస్తాడు. కానీ దారి ఏదీ దొరకదు. చనిపోయిన నారాయణప్ప కొంత బంగారం, డబ్బు దాచాడని అతడికి ఎవరూ వారసులు లేరు కనుక అంతిమ సంస్కారం ఎవరు చేస్తే వారికే ఆ డబ్బు, బంగారం లభిస్తుందని తెలిసి కొంతమంది అంతిమ సంస్కారం తామే చేస్తే బావుండును అనుకుంటారు. అయితే బయటకు చెప్పడానికి ఎవరికీ ధైర్యం లేదు.
ప్రాణేశాచార్యకి ఏ పరిష్కారమూ దొరకక దారి చూపమని అమ్మవారినే అడుగుతాను అని ఊరును ఆనుకుని ప్రవహిస్తున్న నదిని దాటుకుని దేవాలయానికి వెళ్లి ఒక రోజంతా అమ్మవారి సన్నిధిలో గడుపుతాడు. అమ్మవారి నుండి ఏ సూచనా రాక నిరాశగా వెనుదిరుగుతాడు. మార్గమధ్యంలో అతడికి చంద్రి ఎదురవుతుంది. ఆమె అందానికి అతడు విచలితుడు అవుతాడు. తను బ్రాహ్మణుడు, ఆమె నిమ్న జాతి స్త్రీ. తను సాంప్రదాయవాది. పరమ నిష్టాగరిష్టుడు. గ్రామ పెద్ద. ఇలాంటి విషయాలు అన్నీ మరచిపోతాడు. ఆమె స్త్రీ, అతడు పురుషుడు. కేవలం ఆ రెండు విషయాలు మాత్రమే గుర్తు ఉంటాయి. ఆమెతో అతడు సంగమిస్తాడు. తరువాత అపరాధ భావంతో గ్రామానికి వెళ్ళడానికి భయపడతాడు. అతడిలో అంతర్మథనం మొదలవుతుంది.
చంద్రి గ్రామానికి తిరిగి వస్తుంది. అప్పటికే గ్రామంలో ప్లేగు వ్యాధి అంకురిస్తుంది. నారాయణప్ప శరీరం వాసనవేస్తూ ఉంటుంది. వూరు వూరంతా ఈ శవాన్ని ఎప్పుడు, ఎలా తీసెయ్యాలా అని ఆలోచిస్తూ వుంటారు. నవలలో అయితే నారాయణప్ప ముస్లిం స్నేహితుడు ఒకడు అంతిమ సంస్కారం చేసినట్టు ఉంటుంది కానీ పఠాభి, గిరీష్ కర్నాడ్ దానిని కొంచెం మార్చి ప్రాణేశాచార్య తిరిగి వచ్చి సంస్కారం చేసినట్టే చూపుతారు.
అప్పటి సమాచార ప్రసార శాఖామంత్రి ఐ.కె.గుజ్రాల్ జోక్యంతో సెన్సార్ ఇబ్బందుల నుండి సినిమా బయటపడింది. దర్శకుడిగా పఠాభికి ఇది మొదటి సినిమా. ఆస్ట్రేలియన్ కెమెరామెన్ టామ్ కావెన్ అద్భుతంగా దూర్వాసపురం చీకటి వెలుగులను తన కెమెరా కన్నుతో పట్టుకోగలిగారు.
పఠాభి మరో సినిమా 'చండామారుత'. దేశంలో అత్యయిక స్థితిని విధించి, భావ ప్రకటన స్వేచ్ఛను హరించిన క్రమంలో స్వేచ్ఛకోసం నిర్మించిన సినిమా 'చండామారుత'. లంకేశ్ నాటిక క్రాంతి బంటు క్రాంతి ఆధారంగా ఈ సినిమా పఠాభి నిర్మించి దర్శకత్వం చేసాడు
16 ఎమ్ ఎమ్ లో సినిమా తీసి 35 ఎమ్ ఎమ్ లోకి ఎక్సపోజ్ చేసారు. ఈ సినిమా కూడా సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొన్నది.సెన్సార్ నిషేధించిన ఈ సినిమా దేశంలో ఆత్యయిక స్థితిని ఎత్తేసిన తరువాత ప్రజల ముందుకు వచ్చింది. అదీ చాలా కత్తిరింపులతో. ఆ తరువాత పర్యావరణ పరిరక్షణ నేపథ్యంగా పఠాభి 'దేవరకాడు' నిర్మించి దర్శకత్వం వహించాడు.
తను చిన్నతనంలో విన్న సావిత్రీ సత్యవంతుల కథను పఠాభి పెద్దైనా మరచిపోలేదు. సావిత్రి యమధర్మ రాజును ఒక చిన్న చమత్కారంతో ఓడించడం అతడికి ఎంతమాత్రమూ నచ్చలేదు. తరువాత పెద్దయ్యాక అరబిందో సావిత్రి చదివాడు. ఈ రెండింటి ప్రేరణతో In the Hour of God నాటకంగా మలిచాడు ''I was disappointed by the way the mythological Savitri wins Satyavan back through trickery. But in Aurobindod’s epic, life defeats death by pure argument. I liked that'' అని ఒక ఇంటర్వ్యూలో పఠాభి చెప్పారు. అరవిందుడి సావిత్రి కేవలం పాతివ్రత్యం గురించి చెప్పే ఒక మామూలు సాదాసీదా పుక్కిట పురాణం కాదు. దివ్య మానవుడు అవతరించే క్రమంలో అదొక మజిలీ. మృత్యువు మీద విజయకేతనం. నిజానికి గాయత్రీ మాతే మళ్ళీ సావిత్రిగా జన్మించింది కనుక సాధారణ మానవుడిలో ఉన్న దివ్య తేజస్సుగా సావిత్రిని గుర్తించాలి. సావిత్రి తండ్రి అశ్వపతి. అశ్వమనే మాటకు వేదాల ప్రకారం జీవిత శక్తి అనే అర్ధం వుంది. అశ్వపతి జీవితశక్తికి అధిపతి. సత్యవతి అంటే సత్యాన్ని కల్గిన అని అర్ధం. ఇలా పాత్రలను సింబలైజ్ చేసి ఒక ఆధునిక కావ్యాన్ని అరవిందుడు సృష్టించాడు.
''It was the hour before the gods awake
Across the path of the Divine event''
అని సావిత్రి మొదలు అవుతుంది. ఇక్కడ నుండి ప్రభావితుడు అయిన పఠాభి IN THE HOUR OF GOD అంటూ ఒక నాటకంగా మలిచారు.
నిజానికి ఈ నాటకాన్ని సినిమా తీయాలన్నది ఆయన కోరిక. అయితే ఆ కోరిక నెరవేరలేదు.
పఠాభి నిర్మించినవి, దర్శకత్వం వహించినవీ కొన్ని సినిమాలే. కానీ సమాజంలో వాటి ప్రభావం వెల కట్టలేనిది. ఛాందసవాదం మీద తిరుగుబాటు, రాజ్యహింస మీద తిరుగుబాటు, మానవ హక్కులకోసం పరితపించడం, ప్రకృతి కోసం తాపత్రయపడటం ఇలాంటి ఎన్నో మానవీవ అంశాలు పఠాభి సినిమాలకు వస్తువులయ్యాయి. సావిత్రి లాంటి మైథలాజికల్ క్యారెక్టర్, యముడు లాంటి సకల విద్యా పారంగతుడిని మేధతో కాక కేవలం ఒక చిన్న ట్రిక్ ద్వారా గెలవడంలో ఉన్న అసంబద్దతని కూడా తను విడిచిపెట్టలేదు. కవిగా తను ఇర్రేషనల్ కానీ సావిత్రి పాత్రను విమర్శకుడిగా చూసినప్పుడు తను చాలా రేషనల్. అలా రేషనల్గా ఉండటం వలననే అతడికి చిన్నప్పుడు చూసిన సావిత్రి నచ్చలేదు. అందుకే మళ్ళీ సావిత్రిని పున్ణసృష్టి చేయాలి అనుకున్నాడు. ఒక దర్శకుడికి ఉండవలసిన సత్యాసత్య శోధన ఆసక్తి అది.
పఠాభి గొప్ప దర్శకుడు అనడం వసంతంలో కోయిల కూస్తుంది అనడమంత కృతకంగా ఉంటుంది. ఆయన సినిమాలు చూడటం ఒక గొప్ప అనుభవం. ఆ అనుభవం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఆయన దర్శకుడుగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అందుకున్న అవార్డులు ఎన్నో.పఠాభి సినిమా ప్రపంచంలో విహరించడం ఒక అందమైన అనుభవం.
- వంశీకృష్ణ,
957342742