Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక పదానికి సరిసమానమైన అర్థం గల ఇతర పదాలను ఒక దగ్గర కూర్చి ఇవ్వడాన్ని పర్యాయపదాలుగా చెప్పుకోవచ్చు. సేకరించిన అంశాలను అకారాది క్రమంలో కూర్చి పర్యాయపద నిఘంటువులను తయారు చేస్తారు. 17వ శతాబ్దికి చెందిన పైడిపాటి లక్ష్మణకవి మొదలుకొని, ఇటీవల వెలువడిన ఆచార్య జి.యన్.రెడ్డి వరకు ఎన్నో పర్యాయపద నిఘంటువులు వెలువడినాయి. ఇవి తొలుత పద్య నిఘంటువులుగా వెలువడినా, ప్రస్తుతం గద్య నిఘంటువులుగా వస్తున్నాయి. పర్యాయ పద నిఘంటువులు భాషాభివృద్ధికి తోడ్పడతాయి.
ఈ సంకలనకర్త పి.రాజేశ్వరరావుగారు పది పుస్తకాల నుండి పదకొండో పుస్తకాన్ని తయారు చేశాడా లేక నిఘంటు నిర్మాణ ప్రణాళికతో రూపొందించారా అన్న విషయం ఖచ్చితంగా తెలియకున్నది. ఇలాంటి నిఘంటువులకు తప్పనిసరిగా పరిచయ వ్యాసాలు ఉండవలసిన అవసరాన్ని సంకలనకర్త ఎందుకు గుర్తించలేదో అర్థం కాదు. ఇందులో ఒక పదానికి ఒక పర్యాయపదం మొదలుకుని అనేక పర్యాయ పదాలు కల్గిన పదాలు కూడా వున్నాయి. శివుడికే దాదాపు 550 పర్యాయ పదాలున్నాయి. ఇంద్రుడు, చంద్రుడు, మన్మథుడు, స్త్రీ మొదలైన పదాలకు వందలాది పర్యాయ పదాలు కనిపించడం విశేషం. ఇందులో 'పీతాంబరుడు' అనే పదానికి 'నటుడు' పర్యాయపదంగా ఇవ్వడం సరికాదు. పచ్చని వస్త్రాన్ని ధరించిన వాడు, విష్ణువు అని అర్థం. ఈ రెండు పదాలను పర్యాయ పదాలుగా ఇస్తే సరిపోయేది. 'పునర్వసు' పదానికి ఎవరికీ తెలియని ఐదు పర్యాయ పదాలను ఇచ్చారు. అందరికీ తెలిసిన 'పునాస' పదాన్ని వదిలేశారు. అలాగే 'పైడికంటి' పదానికి 'గుడ్లగూబ' అనే అసలైన అర్థాన్ని - పదాన్ని వదిలేసి, ఇతర మూడు పర్యాయ పదాలను ఇచ్చారు. ఇది పేరుకు 'తెలుగు పర్యాయ పద నిఘంటువు'. ఇందులో 'బావ' అనే తెలుగు పదానికి ఎవరికీ తెలియని పది సంస్కృత పదాలను పర్యాయ పదాలుగా ఇవ్వడం విచిత్రం. ఎక్కువగా సంస్కృత పదాలనే పర్యాయ పదాలుగా ఇవ్వడం కంటే, తెలుగు పదాలను ఇస్తే బాగుండేదని పాఠకుడు భావిస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
- కె.పి.
సంగ్రహ తెలుగు పర్యాయ
పద నిఘంటువు,
కూర్పు : పి.రాజేశ్వరరావు,
పేజీలు : 242, వెల : 225/-, ప్రతులకు:నవచేతన, నవతెలంగాణ, ప్రజాశక్తి పుస్తక కేంద్రాలు. ప్రముఖ పుస్తక కేంద్రాలు.
ఆరోగ్యమే మహాభాగ్యం
ఎక్కువగా మనం తీసుకునే ఆహారం వల్లనే తెలిసో, తెలియకో అనారోగ్యాల బారిన పడుతున్నాం. ప్రతి విషయానికి వైద్యులను సంప్రదించడం కంటే, తాము తినే ఆహారపు అలవాట్లను సవరించుకుని తక్కువ ఖర్చుతో ఆరోగ్యంగా ఎలా వుండాలో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే.
చిరుధాన్యాలు పేదవాళ్ళు తింటారనే అపోహతో చాలామంది చిన్నచూపు చూస్తారు. రోగాల బారిన పడి వైద్యుల సలహా మేరకు చాలామంది ఇప్పుడు చిరుధాన్యాల వైపు చూస్తున్నారు. పప్పుదినుసుల నుండి మాంసకృతులు లభిస్తాయి. మాంసకృతులు మన శరీర భాగాల నిర్మాణానికి, పెరుగుదలకు ఎంతో అవసరం. చిరుధాన్యాలు, పప్పుదినుసులలో వుండే పోషక విలువల గురించి చెబుతూ, వాటిని ఒక్కొక్క దాన్ని పరిచయం చేశారు. ప్రాచీన కాలం నుండి మన దేశం సుగంధ ద్రవ్యాలకు పెట్టింది పేరు. వీటిని వంటలలో వాడటం వల్ల సువాసనలను వెదజల్లడమే కాకుండా, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయని తెలియజేస్తారు. అలాగే ఆకుకూరలు, దుంపకూరలు, పండ్లు, ద్రవపదార్థాల విశిష్టతను తెలియజేయడంతో పాటు మనిషికి మేలు చేసే పూల గురించి వివరించారు.
- అశోక్కుమార్,
9700000948
ఆహారంతో ఆరోగ్యం, గృహవైద్యం
రచన : పి.రాజేశ్వరరావు
పేజీలు : 142, వెల : 140/-
ప్రతులకు : నవచేతన, నవతెలంగాణ, ప్రజాశక్తి పుస్తక కేంద్రాలు.
తెలంగాణ ప్రాచీన కవిత్వం
ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో
డా||ద్వా.నా.శాస్త్రి
పేజీలు : 112, వెల : 100/-
ప్రతులకు : నవచేతన, నవతెలంగాణ పుస్తక కేంద్రాలు
ఇదీ సుపరిపాలన
51 నెలల కె.సి.ఆర్.ప్రభుత్వం
వనం జ్వాలా నరసింహారావు
పేజీలు : 386
వెల : 500/-
ప్రతులకు : జ్యోతి వలబోజు
ఫోన్ : 8096310140