Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆధునీకరణ పేరుతో కాంక్రీట్ జంగిల్స్గా మారుతున్న పట్టణాల తీరు, హోదాలకు తప్ప మనుషులకు విలువ ఇవ్వని వైనంతోపాటు అందమైన పట్టణాల అసలుసిసలైన రూపాన్ని అత్యద్భుతంగా, అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించిన హిందీ చిత్రం 'షెహర్ ఔర్ సప్నా' (1963). బతుకుతెరువు కోసం ఊరిని విడిచి పట్టణానికి వచ్చిన ఓ యువకుడి జీవితంలో ఎదురైన సంఘటనల సమాహారంగా తెరకెక్కిన ఈ చిత్రం 11వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారాన్ని కైవసం చేసుకుంది.
చిత్ర కథ..
బోలారామ్ (దిలీప్రాజ్) హర్యానాలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు. తండ్రి చనిపోయిన తర్వాత తల్లే బోలారామ్ బాధ్యతలను చూసింది. ఉన్నంతలో చదివించింది. ఆర్థిక పరిస్థితి కారణంగా ఉన్నత చదువులను చదివించలేకపోతుంది. అలాగే తల్లి ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగా ఉండటంతో బోలారామ్ డబ్బులొచ్చే పని ఏదైనా చేయాలనుకుంటాడు. ఊరిలో సరైన పని దొరక్కపోవడంతో ముంబాయి వెళ్ళాలనుకుంటాడు. ముంబాయిలో ఉన్న బాబాయ్ ద్వారా ఏదో ఒక పని వెతుక్కుందామని ముంబాయికి రైల్లో బయలు దేరతాడు. రైలు ముంబాయి పరిసర ప్రాంతాల్లోకి వస్తున్న తరుణంలో పెద్ద పెద్ద భవంతులు, కార్లు, బస్సులు, ఆధునిక వాతావరణాన్ని చూసి బోలారామ్ చాలా ఆనందపడతాడు. సరికొత్త ప్రపంచంగా కనిపిస్తున్న ముంబాయిని చూసి మురిసిపోతాడు. అంతేకాదు తన కుటుంబ సమస్యలను తీర్చే ఓ పెద్ద పరిష్కారంగా కనిపిస్తున్న ముంబాయిని చూసి ధైర్యంగా గుండె నిండా గాలి పీల్చుకుంటాడు.
రైలు దిగిన తర్వాత ఓ టాంగా మాట్లాడుకుని బాబాయ్ ఉన్న అడ్రస్కి వెళ్తే బాబారు కనిపించడు. అక్కడి వాళ్ళను విచారిస్తే బాబాయ్ షోలాపూర్కి మకాం మార్చాడని తెలుస్తుంది. బాబాయ్ ని నమ్ముకుని ముంబాయి వచ్చిన బోలారామ్కి నిరాశే ఎదురవుతుంది. ముంబాయిలాంటి మహానగరంలో ఎక్కడ ఉండాలో? ఎలా ఉండాలో తెలియని అయోమయ స్థితిలో పడతాడు. తన వస్తువులతో ఓ చోట కూర్చుని ఆలోచించడాన్ని ఓ దొంగ చూస్తాడు. రోడ్డు మీద కొంత చిల్లర వేసి, వాటిని చూపిస్తూ ఈ డబ్బు మీదేనా అని బోలారామ్ని అడగడంతో, బోలారామ్ ఆ చిల్లర దగ్గరికి వెళ్ళి చూసేలోపు దొంగ బోలారామ్ వస్తువులను ఎత్తికెళ్ళిపోతాడు. ఆ దొంగని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నంలో బోలారామ్ విఫలం అవుతాడు. ఈ ఘటనతో బోలారామ్ ఊహల్లోని ముంబాయి మొత్తం అంద విహీనంగా కనిపిస్తుంది.
ఎక్కడ ఉండాలో తెలీక రోడ్ల మీద తిరుగుతున్న తరుణంలో అరవై ఏండ్ల ఓ స్ట్రీట్ మ్యూజిషియన్(నానా పల్సీకర్)ని షెల్టర్ కోసం బోలారామ్ అడిగితే, బోలారామ్ అమాయకత్వాన్ని చూసి ఆ మ్యూజిషియన్ తనతోపాటు తీసుకెళ్తాడు. రోడ్డు పక్కన ఓ పొడవాటి ఫ్లాట్ఫాం మీద పడుకుని ఉన్న కొంతమందిలో కవి (మన్మోహన్ కృష్ణ), మల్లయోధుడు (డేవిడ్ అబ్రహం), స్టేజ్ ఆర్టిస్ట్ (అన్వర్ హుస్సేన్)లకు బోలారామ్ని ఆ మ్యూజిషియన్ పరిచయం చేస్తాడు. దాదాపు అరవై ఏండ్ల వయసు ఉన్న వీరంతా కనీస వసతులు లేని ఫ్లాట్ఫాం మీద ఉండటాన్ని చూసి బోలారామ్ బాధపడతాడు. అయితే ఓ అనామకుడికి ఇంతమంది స్నేహితులవ్వడాన్ని మాత్రం సంతోషపడతాడు. రాత్రి కావడంతో చాలీచాలని దుప్పట్లతో చలిలో అలాగే అందరూ పడుకుంటాడు. కొంత సేపటి తర్వాత ఆ ఏరియా దాదా తన మనుషులతో వచ్చి అక్కడ పడుకున్న అందరి దగ్గర్నుంచి డబ్బులు వసూలు చేస్తాడు. ఫ్లాట్ఫాం మీద పడుకుంటే నీకెందుకు డబ్బులు ఇవ్వాలని అడిగిన బోలారామ్ని ఆ దాదా చెంపచెళ్ళుమనిపిస్తాడు. ఈ ఘటనతో ఇంత పెద్ద మహానగరంలో కనీసం స్వేచ్ఛగా బతికే అవకాశమే లేదని బోలారామ్కి అర్థమవుతుంది. ఆ దాదా వెళ్లిపోయిన తర్వాత అందరూ గాఢంగా నిద్రిస్తున్న సమయంలో ఉన్నట్టుండి జోరున పెద్ద వర్షం కురవడంతో షెల్టర్ కోసం ఎటోళ్ళు అటు పరుగులు తీస్తారు.
ఓ వైపుకి పరిగెత్తిన బోలారామ్కి ఖాళీగా ఉన్న ఓ పెద్ద వాటర్ పైపు కనిపించడంతో అందులోకి వెళ్తాడు. అదే వాటర్ పైపులో షెల్టర్ పొందుతున్న ఓ యువతి రాధా (సురేఖా పరాకర్) బోలారామ్ రావడాన్ని చూసి భయపడి కత్తితో లోపలికి రావద్దని అరుస్తుంది. పెద్ద వర్షం పడుతోందని, వర్షం తగ్గగానే వెళ్లిపోతానని బోలారామ్ చెప్పిన తీరుకి మనసు కరిగిన ఆ యువతి వర్షం తగ్గగానే వెళ్ళిపోవాలని చెబుతుంది. కొంత సేపటికి ఇద్దరి మధ్య కొంచెం పరిచయం పెరిగి మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలో ఎందుకు ఈ పైపులో తలదాచుకుంటున్నావని బోలారామ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ యువతి తన గతాన్ని చెబుతుంది.
ఉన్నంతలో అమ్మానాన్నలతో రాధ చాలా సంతోషంగా ఉంటుంది. పెళ్లీడు వచ్చిందని వాళ్ళ నాన్న సంబంధాలు చూడటం ప్రారంభిస్తాడు. ఈ ప్రయత్నంలో భాగంగా ఓ సంబంధం కుదురుతుంది. కట్నం కింద పిల్లాడి తండ్రికి ఐదువేల రూపాయలు ఇస్తానని రాధ తండ్రి మాట ఇస్తాడు. అంతేకాదు పెళ్ళికి ముందే రెండు వేల రూపాయల్ని కూడా ఇస్తాడు. పెళ్లి రోజు రానే వచ్చింది. కాబోయే భర్తతో సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాననే సంతోషం రాధకి కనీసం కొన్ని క్షణాలు కూడా నిలవలేదు. ఎందుకంటే ఇస్తానన్నంత కట్నం ఇవ్వాలని లేకపోతే ఉంటున్న ఇల్లుని అల్లుడి పేర రాయాలని పెళ్ళికొడుకు తండ్రి గొడవ చేస్తాడు. నలుగురిలో కూతురి జీవితం అల్లరిపాలు కాకూడదని రాధ తండ్రి తమ ఇంటిని అల్లుడి పేర రాసేందుకు అంగీకరిస్తాడు. అయితే దీన్ని రాధ నిరాకరించి, తన మెడలో ఉన్న పూలదండని పెళ్ళి కొడుకు తండ్రి ముఖమ్మీదకి విసిరివేస్తుంది. నా కోసం ఈ ఇల్లు వాళ్ళకి ఇస్తే మీరెక్కడుంటారు నాన్న.. పైగా డబ్బే ముఖ్యమనుకునే ఇలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదని చెబుతుంది. జరిగిన ఘటనతో ఊర్లో వాళ్ళందరూ తలా ఓ మాట అనుకోవడాన్ని రాధ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతారు. తన వల్ల తల్లిదండ్రుల గౌరవం, పరువు పోకూడదని రాధ ఇల్లు విడిచి ముంబాయి వస్తుంది. ముంబాయి వచ్చిన తర్వాత దాదా బెదిరించడంతో వేశ్యగా మారుతుంది. అతన్ని నుంచి తప్పించుకోవడం కోసం ఎవరికీ కనిపించకుండా ఈ పైపులో తలదాచుకుంటుంది.
రాధ గతం విని బోలారామ్ చలించిపోతాడు. కష్టాల్లో ఉన్న యువతిని ఆదుకోవాలనుకుంటాడు. ఒకరిగతం గురించి మరొకరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత రాధ, బోలారామ్ల మధ్య అనుబంధం మరింతగా పెరుగుతుంది. రాధ ఇళ్ళలో పని చేసేందుకు కుదిరితే, బోలారామ్ ఓ ఫ్యాక్టరీలో వర్కర్గా చేరతాడు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. వీరి అన్యోన్నత ఫలితంగా రాధ గర్భవతి అవుతుంది. ఇటువంటి తరుణంలో కూడా రాధని ఆ వాటర్ పైపులో ఉంచడం ఇష్టం లేక రాధని తీసుకుని బస్తీలో ఉన్న తన స్నేహితుల దగ్గరికి వెళ్తాడు బోలారామ్.
ఆ బస్తీలోని ఓ పూరి గుడిసెలో మ్యూజిషియన్తోపాటు పెహిల్వాన్ (డేవిడ్ అబ్రహం), స్టేజ్ ఆర్టిస్ట్ (అన్వర్ హుస్సేన్) ఉంటారు. రాధ గర్భవతి అని బోలారామ్ చెప్పడంతో వీళ్ళతోపాటే ఉండేందుకు అంగీకరిస్తారు. ఈ ముగ్గురూ రాధని సొంత కూతురిగా ఎంతో అప్యాయంగా చూసుకుంటారు. అలాగే రాధ కూడా వీరిని ఎంతో అభిమానిస్తుంది. వీళ్ళంతా అనామకులైనప్పటికీ వీళ్ళ మధ్య ఏర్పడిన బంధం మాత్రం చాలా గొప్పది. ఆ బంధాన్ని దర్శకుడు వెండితెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతం. త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న రాధని వీళ్ళంతా ఒక్క పని కూడా చేయనియ్యరు. అలాగే రాధ ఆరోగ్యానికి కావాల్సిన మందులు, పండ్ల కోసం వీళ్ళంతా ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తారు.
అలాగే బోలారామ్కి పెహిల్వాన్ డేవిడ్ అబ్రహం కుస్తీలో శిక్షణ ఇస్తాడు. ఆ శిక్షణతో బోలారామ్ శారీరకంగా చాలా ధృడంగా తయారవుతాడు.
ఓ రోజు ఓ పదేండ్ల పిల్లాడు బస్తీలోని ఓ ప్రదేశంలో కూర్చుని ఏడుస్తూ ఉండటాన్ని రాధ గమనిస్తుంది. అనాథైన ఆ పిల్లాడిని దాదా మనుషులు వేధిస్తున్నారనే విషయాన్ని రాధ తెలుసుకుని, ఆ పిల్లాడికి ఆశ్రయం కల్పిస్తుంది. ఆ పిల్లాడిని వెతుక్కుంటూ వచ్చిన దాదాకి రాధ కనిపిస్తుంది. రాధని చూడగానే ఇన్నాళ్ళు తప్పించుకున్నావ్, ఇక తప్పించుకోలేవ్.. అని బెదిరించి వెళ్ళిపోతాడు.
ఇంటికి వచ్చిన బోలారామ్కి జరిగిన విషయం తెలిసి ఆవేశంగా దాదా ఉన్న ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ దాదా, అతని మనుషుల్ని కొడతాడు. జరిగిన విషయాన్ని రాధా ద్వారా తెలుసుకున్న బోలారామ్ స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాదాని పోలీసులు అరెస్ట్ చేస్తారు. పరిస్థితులన్ని సర్దుమణిగి అందరూ సంతోషంగా ఉన్న తరుణంలో అపార్ట్మెంట్లు కడుతున్నారనే కారణంతో బస్తీని పది రోజుల్లోగా ఖాళీ చేయాలని సదరు స్థలం కొన్న యజమాని బస్తీ వాసులను హెచ్చరిస్తాడు. పది రోజుల తర్వాత రాధకు ప్రసవ నొప్పులు రావడంతో బోలారామ్ ఓ డాక్టర్ని ఇంటికి తీసుకొస్తాడు. గడువు ముగిసినప్పటికీ బస్తీ వాసులు ఖాళీ చేయకపోవడంతో ఆగ్రహించిన స్థల యాజమాని బుల్డోజర్తో గుడిసెలను కూల్చి వేస్తుంటాడు. ఈ క్రమంలో బోలారామ్ గుడిసెను కూడా కూల్చబోతే బోలారామ్తోపాటు అతని స్నేహితులందరూ రాధ పరిస్థితి చెప్పి కనీసం నాలుగు రోజుల గడువు ఇవ్వమని ప్రాధేయపడతారు. అక్కడి పరిస్థితి గమనించిన యజమాని సరే అనటం, రాధ ఓ పిల్లాడికి జన్మనివ్వడం ఒకేసారి జరగటంతో వీరందరి ఆనందానికి ఆకాశమే హద్దవుతుంది. నాలుగు రోజుల తర్వాత వీరి గుడిసెను బుల్డోజర్ కూల్చడంతో అందరూ ఎవరి సామాను వాళ్ళు తీసుకుని గూడు చెదిరిన పక్షుల్లా మరో షెల్టర్ కోసం తలోదారి వెళ్తారు. రాధని, పుట్టిన పిల్లాడిని తీసుకుని బోలారామ్ తాము గతంలో ఉన్న వాటర్ పైపు దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు వస్తున్న సమయంలోనే మున్సిపాలిటీ వర్కర్లు ఆ పైపుని నీళ్ళ కోసం భూమిలో భూడ్చి పెడుతుంటాన్ని చూసి బాధపడతారు. దొరుకుతుందనుకున్న షెల్టర్ పోవడంతోపాటు అప్పటివరకు ఉన్న స్నేహితుల్ని కూడా దూరం చేసిన హృదయం లేని ముంబాయి నగరాన్ని వీడి ఆవేదనాభరిత మనసులతో బోలారామ్ కుటుంబం ఊరి వైపు నడుచుకుంటూ వెళ్తుండటంతో సినిమా ముగుస్తుంది.
- రెడ్డి హనుమంతరావు,
8332995426
వాస్తవిక చిత్రాలకు చిరునామా
అత్యంత వాస్తవిక చిత్రాలకు దర్శకుడు కె.ఎ.అబ్బాస్ కేరాఫ్ అని వేరే చెప్పక్కర్లేదు. భారతీయ సినీ చరిత్రలో అబ్బాస్ చిత్రాలకు, ఆయన ఆలోచన తీరుకి సముచిత గౌరవం, ప్రత్యేకత ఉన్నాయి. 'ధర్తీ కే లాల్', 'పరదేశీ', 'షెహర్ ఔర్ సప్నా', 'సాథ్ హిందుస్తానీ', 'దో బూంద్ పానీ' వంటి తదితర అద్భుత చిత్రాలకు దర్శకత్వం వహించడంతోపాటు 'నీచానగర్', 'నయా సంసార్', 'జాగ్తే రహౌ', 'ఆవారా', 'శ్రీ420', 'మేరా నామ్ జోకర్', 'బాబీ', 'హెన్నా' వంటి తదితర అపూర్వ చిత్రాలకు రచయితగా పనిచేశారు. దర్శకుడిగా, నవలా రచయితగా, నిర్మాతగా, జర్నలిస్ట్గా కె.ఎ.అబ్బాస్ సినీ పరిశ్రమకు చేసిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం 1969లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.